breaking news
race walk championship
-
ఒలింపిక్స్ నడక
‘‘ఒలింపిక్స్ అన్న మాటే నా ఆలోచనల్లో ఉండేది కాదు. ఇప్పుడు ఏకంగా ఒలింపిక్స్లోనే ఆడబోతున్నాను’’. ఫిబ్రవరి 13 న రాంచీలో జరిగిన రేస్ వాకింగ్ జాతీయ స్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి, ఒలింపిక్స్కి అర్హత పొందిన ప్రియాంక గోస్వామి (24) అన్న మాట ఇది!! నిజమే, ఆమె కుటుంబ పరిస్థితులు కూడా అటువంటివే! చదువే భారమైనప్పుడు ఆటలు, ఆటల పోటీలు, ఒలింపిక్స్.. ఇవన్నీ ఊహకైనా సాధ్యమయేవేనా! అయ్యాయి. అందుకు ముగ్గురు వ్యక్తులు కారణం. తల్లి, తండ్రి, కోచ్. ‘‘ఈ ముగ్గురూ స్పోర్ట్స్లో నాకొక అందమైన భవిష్యత్తును ప్రసాదించారు. వారు చూస్తుండగా ఒలింపిక్స్లో ఆడబోతున్నాను’’ అని సంబరంగా అంటున్న ప్రియాంక ప్రస్తుతం టోక్యోలో జూలైలో జరిగే ఒలింపిక్స్కి సాధన చేస్తోంది. ప్రియాంక ఈ ఫిబ్రవరిలో 1:28:45 నిముషాలలో 20 కి.మీ. రేస్ వాక్లో లక్ష్యాన్ని సాధించి, విజేతగా నిలిచినప్పటి నుంచీ రానున్న టోక్యో ఒలింపిక్స్ లో భారత్కు ఆమె ఒక పసిడి ఆశ అయింది. ప్రియాంక ఉత్తర ప్రదేశ్ క్రీడాకారిణి. ఆమె తండ్రి మదన్ పాల్ ప్రభుత్వ రవాణా శాఖలో బస్ కండక్టర్. వాళ్లుండే ముజఫర్నగర్ బుధాన ప్రాంతంలోని సాగడి గ్రామం నుంచి ఉద్యోగం కోసం భార్యాబిడ్డలతో మీరట్ వచ్చేశారు ఆయన. ప్రియాంక పెద్దమ్మాయి. ఆమె తమ్ముడు కపిల్. తల్లి అనిత గృహిణి. డ్యూటీలో ఉండగా ఒక రోడ్డు ప్రమాదం కేసులో బస్ డ్రైవర్ తో పాటు, ప్రియాంక తండ్రి ఉద్యోగం కూడా పోయింది. ఆర్థికంగా అసలే అంతంత మాత్రం అయిన ఆ కుటుంబం ఒక్కసారిగా కుదేలైపోయింది. అయితే బిడ్డల చదువు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆగకూడదని తీర్మానించుకున్నారా భార్యాభర్తలు. మదన్పాల్ టాక్సీ అద్దెకు తీసుకుని నడిపాడు. భార్య చేత చిన్న కిరాణా దుకాణం పెట్టించాడు. పిండి మర ఆడించాడు. స్కూలు లేనప్పుడు పిల్లలిద్దరూ తల్లిదండ్రుల కష్టాన్ని పంచుకునేవారు. ప్రియాంక మీరట్లోని కనోహర్లాల్ గర్ల్స్ స్కూల్లో చదివింది. పాటియాలలో బి.ఎ. పూర్తి చేసింది. బి.ఎ. చదువుతున్నప్పుడే ఆమె రేస్ వాక్ను తనకు ఇష్టమైన క్రీడాంశం గా ఎంచుకుని ప్రాక్టీస్ చేసింది. ఆ సమయంలో తండ్రి పంపించిన డబ్బుతోనే సర్దుకునేది. నెలకు ఐదు నుంచి ఆరు వేల రూపాయల వరకు పంపేవారు ఆయన. వాటిల్లోనే కొంత మిగుల్చుకుని మిగతా ఖర్చులకు వాడుకునేది. అందుకోసం తరచు ఆమె ఒక పూట మాత్రమే భోజనం చేసింది. 2011లో రేస్ వాక్లో రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించాక ఆ ఈవెంట్పై మరింత శ్రద్ధ పెట్టింది ప్రియాంక. ఆమె తమ్ముడు కూడా స్పోర్ట్స్మనే. స్టేట్ లెవల్ బాక్సింగ్ ప్లేయర్. మీరట్లో ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 2014–15లో ప్రియాంక డిగ్రీ అయ్యాక ఆమెకు బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉచితంగా శిక్షణ లభించడానికి ఆమె కోచ్ గౌరవ్ త్యాగి చేసిన ప్రయత్నాలే కారణం. 2018లో ప్రియాంకకు స్పోర్ట్స్ కోటాలో రైల్వేలో ఉద్యోగం వచ్చాక ఆ కుటుంబ పరిస్థితి కాస్త మెరుగైంది. ‘‘స్కూల్లో ఉన్నప్పుడే నాన్న నాకు అప్పు చేసి స్కూటీ కొనిచ్చాడు. దానిపై స్కూలుకూ, స్టేడియంలో ప్రాక్టీస్కీ వెళ్లేదాన్ని. పరీక్షలు, స్పోర్ట్ ఈవెంట్లు ఉన్నప్పుడు ఆమ్మ నిద్ర మానుకుని మరీ నాకోసం అన్నీ అమర్చిపెట్టే పనిలో ఉండేది. ఇక నా కోచ్ త్యాగి సర్ అయితే నా శిక్షణ కోసం చాలా కష్టపడ్డారు. వారందరి వల్లే నేను ఈ రోజు ఒలింపిక్స్కి అర్హత సాధించాను’’ అని ప్రియాంక చెబుతోంది. స్కూల్లో ఉండగా ప్రియాంకకు క్రీడల్లో అసక్తికరమైన అంశం జిమ్నాస్టిక్స్. కొంతకాలం తర్వాత అథ్లెటిక్స్ వైపు వచ్చింది. డిగ్రీ అయ్యాక రేస్ వాకింగ్పై ఇష్టం పెంచుకుంది. ఫ్యాషన్ మోడలింగ్ కూడా ఇష్టం. -
అంతర్జాతీయ టోర్నీలకు కోవిడ్–19 దెబ్బ
కౌలాలంపూర్: మనషుల ప్రాణాల్ని హరిస్తున్న కోవిడ్–19 వైరస్తో పెద్ద ముప్పే వచ్చిపడింది. ప్రపంచ వర్తకం, వాణిజ్యం, ఔషధ, పర్యాటక, ఉత్పాదక రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న ఈ ‘కోవిడ్–19’ క్రీడలతోనూ ఓ ఆటాడుకుంటోంది. దీని వల్ల ఆసియా చాంపియన్స్ లీగ్ (ఫుట్బాల్) నాకౌట్ మ్యాచ్లు వాయిదా పడ్డాయి. లీగ్లు సవ్యంగా సాగకపోవడంతో సుదీర్ఘ షెడ్యూల్ అవసరమైంది. మే దాకా కొన్ని లీగ్ మ్యాచ్లు జరగాల్సి ఉన్నాయి. అవి పూర్తయ్యాకే మే నుంచి ఆగస్టు నెలలో నాకౌట్ మ్యాచ్లు జరుగుతాయని ఆసియా ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ (ఏఎఫ్సీ) జనరల్ విండ్సర్ జాన్ తెలిపారు. *స్క్వాష్ : కొవిడ్–19 దెబ్బకు రెండు స్క్వాష్ ఈవెంట్లు వాయిదా పడ్డాయి. ఈ నెల 25 నుంచి 29 వరకు కౌలాలంపూర్లో జరగాల్సిన ఆసియా టీమ్ చాంపియన్షిప్, చైనాలో జూన్ 29 నుంచి జూలై 3 వరకు జరగాల్సిన ఆసియా జూనియర్ పోటీలు ఎప్పుడు జరిగేది తర్వాత వెల్లడిస్తారు. *అజ్లాన్ షా హాకీ: మలేసియాలోని ఐపోలో వచ్చే నెల 11 నుంచి 18 దాకా జరగాల్సిన అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీని సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3 వరకు నిర్వహిస్తారు. *రేస్ వాక్: ఈ నెల 15 నుంచి జపాన్లో జరగాల్సిన ఆసియా 20 కిలోమీటర్ల రేస్ వాక్ వాయిదా పడింది. ఇందులో 13 మంది భారత అథ్లెట్లు అర్హత సాధించారు. -
ఇర్ఫాన్కు కాంస్య పతకం
న్యూఢిల్లీ: ఆసియా రేస్ వాక్ చాంపియన్షిప్లో భారత వాకర్ కె.టి.ఇర్ఫాన్ కాంస్య పతకాన్ని సాధించాడు. ఆదివారం జపాన్లో జరిగిన ఈ ఈవెంట్లో ఇర్ఫాన్ పురుషుల 20 కిలోమీటర్ల నడక విభాగంలో మూడో స్థానాన్ని సంపాదించాడు. కేరళకు చెందిన ఇర్ఫాన్ గంటా 20 నిమిషాల 59 సెకన్లలో గమ్యానికి చేరుకున్నాడు. కిమ్ హున్ సబ్ (కొరియా–1గం: 19ని: 50 సెకన్లు) స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకోగా... జార్జీ షీకో (కజకిస్తాన్–1గం: 20ని: 47 సెకన్లు) రజత పతకాన్ని దక్కించుకున్నాడు. మహిళల 20 కిలోమీటర్ల విభాగంలో భారత్కు చెందిన ప్రియాంక గంటా 37 నిమిషాల 42 సెకన్లలో గమ్యానికి చేరి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.