వాట్సాప్ కేసులో ఫేస్బుక్ కు మరోషాక్
రియోడిజనిరో: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్కు బ్రెజిల్ లో మరోసారి ఎదురుదెబ్బ తప్పలేదు. నిందితుల సమాచారాన్ని అందించే విషయంలో బ్రెజిల్ పోలీసులు, ఫేస్బుక్ మధ్య నెలకొన్న వివాదం మరింత ముదురుతోంది. తాజాగా బ్రెజిల్ కోర్టు సంస్థకు చెందిన భారీ నిధులను సీజ్ చేసింది. అమెజాన్ ఫెడరల్ కోర్టు దాదాపు 11.7 మిలియన్ డాలర్లను(38 మిలియన్ రియాస్) ఫ్రీజ్ చేసింది . కోర్టులు, పోలీసులు ఆదేశాలను ధిక్కరించిన ఆరోపించిన ఫెడరల్ ప్రాసిక్యూటర్ అలెగ్జాండర్ జాబర్ ఈ ఆదేశాలు జారీ చేశారు. డేటాని సరఫరా చేసే విషయంలో కోర్టు నియమాన్ని పాటించని ఫేస్ బుక్ ఇంక్ పై అగ్రహం వ్యక్తం చేసిన కోర్టు దాని ఖాతా లోని నిధులను స్తంభింప చేసింది. క్రిమినల్ కేసు విచారణలో నిందితుల సంబంధించిన వివరాలు ఇచ్చేందుకు ఈ సంస్థ అనుబంధ సంస్థ వాట్సాప్ నిరాకరించడంతో ఈ మేరకు నిధులను ఫ్రీజ్ చేశారు. అయితే ఈ పరిణామంపై ఫేస్ బుక్ ఇంకా స్పందించలేదు.
అంతర్జాతీయ డ్రగ్స్ రవాణా కేసుకు సంబంధించిన నేరస్తులు వాట్సాప్ ద్వారానే సంప్రదింపులు జరిపారని, ఆ వివరాలు తమకు తెలపాలని గతంలో వాట్సాప్ ను బ్రెజిల్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ రవాణా ముఠా వాట్సాప్ ద్వారా కమ్యూనికేషన్ కొనసాగించారని, ఆ సమాచారం తమకు ఇవ్వాలని వాట్సాప్ పేరెంటింగ్ సంస్థ ఫేస్ బుక్ను బ్రెజిల్ పోలీసులు కోరారు. అయితే, వ్యక్తిగత సమాచారం ఇవ్వబోమని ఫేస్ బుక్, వాట్సాప్ స్పష్టం చేశాయి. నోటీసులు పంపించినా అందుకు వాట్సాప్ అంగీకరించలేదు. దీంతో వివాదం నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో మే నెలలో మూడుసార్లు వాట్సాప్ను పూర్తిగా నిలిపివేశారు కూడా. అయితే వాట్సాప్పై నిషేధం విధించడాన్ని తప్పుబట్టిన బ్రెజిల్ సుప్రీంకోర్టు వెంటనే నిషేధం ఎత్తివేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.