breaking news
Promoter Funds
-
కంపెనీలు, దలాల్ స్ట్రీట్కు సెబీ దన్ను
కోవిడ్-19 కారణంగా నీరసిస్తున్న స్టాక్ మార్కెట్లు, కార్పొరేట్లకు దన్నుగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ నిబంధనలు సవరించింది. తద్వారా ప్రమోటర్లు తమ వాటాను పెంచుకునేందుకు వీలు కల్పించడంతోపాటు.. కంపెనీలకు అదనపు నిధులు సమకూరేందుకు దారి ఏర్పాటుకానుంది. సెబీ నిర్ణయాలు మార్కెట్లకు దన్నునిచ్చే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. వచ్చే మార్చివరకూ వచ్చే ఏడాది(2021) మార్చివరకూ అమలులో ఉండే విధంగా సెబీ ప్రిఫరెన్షియల్ కేటాయింపుల నిబంధనలను సరళీకరించింది. దీంతో కంపెనీల ప్రమోటర్లు ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా 10 శాతం వరకూ వాటాను పెంచుకునేందుకు వీలుంటుంది. ఇప్పటివరకూ 5 శాతం వాటా పెంపునకు మాత్రమే నిబంధనలు అనుమతిస్తున్నాయి. కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డవున్ కారణంగా పలు కంపెనీలకు నిధుల ఆవశ్యకత ఏర్పడింది. దాదాపు మూడు నెలలుగా అమ్మకాలు క్షీణించడంతో కార్యకలాపాల నిర్వహణకు అదనపు నిధుల అవసరం ఏర్పడుతున్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. ఓపెన్ ఆఫర్కు నో సవరించిన నిబంధనల ప్రకారం లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్లు ఈ ఆర్థిక సంవత్సరంలో 10 శాతం వరకూ ఈక్విటీ వాటాను ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా పొందవచ్చు. అయినప్పటికీ పబ్లిక్ వాటాదారులకు ఓపెన్ ఆఫర్ ప్రకటించవలసిన అవసరం ఉండదు. ఇప్పటివరకూ 5 శాతంవరకే ఈ పరిమితి అమలవుతోంది. ఫలితంగా అటు ప్రమోటర్లు తమ వాటాను పెంచుకునేందుకు వీలు చిక్కడంతోపాటు.. కంపెనీలకు అదనపు నిధులు లభించనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఎఫ్వో శాలిభద్ర షా పేర్కొన్నారు. ప్రమోటర్లకు ఈక్విటీగా మార్పిడికి వీలయ్యే సెక్యూరిటీల జారీ ద్వారా కంపెనీలు వేగంగా నిధులు సమకూర్చుకునేందుకు వీలుంటుందని తెలియజేశారు. సెబీ తాజా నిర్ణయం ద్వారా ప్రమోటర్లు బోర్డులో మరింత మంది వ్యూహాత్మక ఇన్వెస్టర్లకు అవకాశం కల్పించేందుకు మార్గమేర్పడుతుందని జిరోధా సీఐవో నిఖిల్ కామత్ పేర్కొన్నారు. మార్కెట్లకు ప్లస్ విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు), దేశీ ఫండ్స్(డీఐఐలు)తో పోలిస్తే ప్రమోటర్లు దీర్ఘకాలిక ఇన్వెస్టర్లుగా నిలుస్తారు గనుక లిస్టెడ్ కంపెనీలకు మరింత బలమొస్తుందని విశ్లేషకులు వివరించారు. ఇది అంతిమంగా స్టాక్ మార్కెట్లకు జోష్నిస్తుందని క్యాపిటల్వయా గ్లోబల్ రీసెర్చ్ హెడ్ గౌరవ్ గార్గ్ తెలియజేశారు. ప్రమోటర్ నిధుల ద్వారా కంపెనీలకు నిలకడ లభిస్తుందని, ఇది ఇన్వెస్టర్లలోనూ విశ్వాసాన్ని పెంచుతుందని శామ్కో సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ ఉమేష్ మెహతా విశ్లేషించారు. -
ఏడాదైనా.. ఏదీ నజరానా?
- ఏకగ్రీవ పంచాయతీలకు ‘ప్రోత్సాహం’ కరువు - సంవత్సరం కావస్తున్న జాడలేని నిధులు - ఎన్నికల తర్వాత పట్టించుకోని ప్రభుత్వం - జిల్లాలో 74 ఏకగ్రీవ పంచాయతీలు - రూ.11కోట్ల 10లక్షల కోసం ఎదురు చూపులు ఇందూరు: ఎన్నికల ప్రక్రియ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామపంచాయతీలకు రూ. 15లక్షలు ప్రోత్సాహకంగా అందిస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లాలో 74 గ్రామాలు ఏకగ్రీవంగా తమ పంచాయతీ పాలకవర్గాలను ఎన్నుకున్నాయి. ప్రభుత్వం నుంచి నజరానా అందితే.. గ్రామాభివృద్ధికి తోడ్పడుతుందని ఆశించారు. ఎన్నికలు ముగిసి ఏడాది దగ్గర పడుతున్నా ప్రోత్సాహక నిధులు మాత్రం జాడలేవు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త సర్కారు సైతం ‘ప్రోత్సాహం’ మాటే ఎత్తడం లేదు. వచ్చే నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసుకోవచ్చని కలలు గన్న గ్రామపంచాయతీలకు ఏడాదిగా ఎదురు చూపులు తప్పడం లేదు. నయాపైసా అందలేదు జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు ఎన్నికలకు పోకుండా తమ గ్రామంలో ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్రంలో పలు మార్పులు చోటుచేసుకోవడంతో కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వం నజరానాల ముచ్చటే మరిచిపోయింది. దీంతో ఏకగ్రీవ పంచాయతీలకు నయాపైసా అందలేదు. అనంతరం కిరణ్ ప్రభుత్వం పోయి.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఏర్పడింది. అప్పుడు కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కొత్త రాష్ట్రంలోనైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మున్సిపల్, స్థానిక, సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఇలా ఏడాది కాలం గడిచిపోయింది. గత ప్రభుత్వాలు ఎలాగు పట్టించుకోలేదు. ఇప్పుడు కొత్త రాష్ట్రంలో కొత్త సర్కారైనా ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నిధులు అందించాలని ఆయా గ్రామాల సర్పంచులు కోరుతున్నారు. ఈ నిధులు వస్తే గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చని వారు ఎదురు చూస్తున్నారు. జిల్లాకు రావాల్సినవి రూ.11కోట్ల 10లక్షలు జిల్లాలో 718 గ్రామ పంచాయతీలకు గాను 74 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. 2006లో ఏకగ్రీవ పంచాయతీలకు ఒక్కో దానికి రూ. ఏడున్నర లక్షలు చొప్పున చెల్లించారు. అయితే 2013 జూలైలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రోత్సాహక నిధులను పెంచారు. 10వేల జనాభా కన్నా తక్కువ ఉన్న పంచాయతీలకు రూ.15లక్షలు, అంతకన్న ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీలకు రూ.20లక్షలు నజరానాగా అందజేయనున్నట్లు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని బట్టి జిల్లాలో 74 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా.. ఇందులో అన్ని 10వేల కన్న తక్కువగా జనాభా ఉన్నవే. ఈ లెక్కన ప్రతీ పంచాయతీకి రూ.15లక్షల చొప్పున జిల్లాకు మొత్తం రూ.11కోట్ల 10లక్షలు రావాల్సి ఉంది. ఈ నిధులు వస్తే ఎవరి సాయం అక్కర లేకుండానే గ్రామాలను అభివృద్ధి చే సుకోవచ్చని ఆయా గ్రామాలు ఎదురు చూస్తున్నాయి. ప్రకటించి.. పట్టించుకోలేదు ఎన్నికల ఖర్చులను వీలైనంత తక్కువగా చేసుకోవాలని అప్పటి కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వం భావించిం ది. ఒక్కో పంచాయతీలో ఎన్నిక నిర్వహించాలంటే దాదాపు రూ.7నుంచి 8లక్షల వరకు ఖర్చు అవుతుందని లెక్కలు వేశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి, సిబ్బందితో పాటు వారి చెల్లించాల్సిన భత్యాలు, తదితరాలను కలుపుకుని చూస్తే ఖర్చు తడిసి మోపెడు కావస్తుండటంతో ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈ ప్రకటనకు ఆకర్షితులైన జిల్లాలోని 74 గ్రామాల ప్రజలు తమ ఊరికి ఒకే వ్యక్తిని సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రకటనలు చేసిన ప్రభుత్వం వెంటనే నిధులు ఇవ్వలేదు. ఆ ప్రభుత్వమే పోవడంతో నిధులకు బ్రేక్ పడింది. కొత్త ప్రభుత్వం ఈ నిధులు అందించాలని వారు కోరుతున్నారు.