breaking news
Private dealers
-
అక్రమాలకు ఎరువు!
► ఈ–పోస్ మిషన్ల ద్వారా ఎరువుల పంపిణీ ఒట్దిదే ►ఏప్రిల్ నుంచి ఇదిగో అదుగో అంటూ హడావుడి ► జిల్లాకు అవసరమైన మిషన్లు 819.. వచ్చింది 60 ► డీబీటీకి కంపెనీల మొకాలడ్డు ► ఖరీఫ్ మొదలయినా అతీగతీ లేని నూతన విధానం కర్నూలు(అగ్రికల్చర్): రసాయన ఎరువుల పంపిణీలో ప్రయివేట్ డీలర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఉద్దేశించిన డైరెక్టు బెనిఫిట్ ట్రాన్స్ఫర్(డీబీటీ) విధానం అభాసు పాలవుతోంది. ఎరువుల కంపెనీలే ఈ విధానానికి మోకాలడ్డుతున్నట్లు తెలుస్తోంది. ఎరువుల పంపిణీలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు కంపెనీలకు మింగుపడటం లేదు. ఈ నేపథ్యంలోనే డీబీటీ విధానంపై ఆసక్తి చూపని పరిస్థితి కనిపిస్తోంది. మొదట్లో ఫర్టిలైజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆ తర్వాత మొబైల్ ఫర్టిలైజర్ మానిటరింగ్ సిస్టమ్ అమలులోకి వచ్చింది. అయితే ఈ విధానాలు అక్రమాలను అరికట్టలేకపోయాయి. హోల్సేల్ డీలర్లు ఆడింటే ఆట.. పాడిందే పాటగా వ్యాపారం సాగింది. డిమాండ్ను బట్టి అడ్డూఅదుపు లేకుండా బ్లాక్లో విక్రయించడం, ఇక్కడ డిమాండ్ లేకపోతే ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు తరలించడం జరుగుతోంది. కేవలం 2 గదుల ఇంటిని అద్దెకు తీసుకొని ఒక్క బస్తా ఎరువును దించకుండానే కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్న హోల్సేల్ డీలర్లు జిల్లాలో చాలా మంది ఉన్నారు. ర్యాక్ పాయింట్ నుంచే ఎరువులను అక్రమంగా తరలిస్తుండటం గమనార్హం. జిల్లాకు ఇస్తున్న ఎరువులు ఇక్కడే వినియోగిస్తున్నారా.. ఏఏ రైతు ఎన్ని బస్తాలు కొన్నారనే వివరాలు అధికారుల వద్ద అందుబాటులో లేకపోవడం అక్రమాలకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డీబీటీ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. జిల్లాకు 819 ఈ–పోస్ మిషన్లు అవసరం.. వచ్చింది 60 మాత్రమే.. మొదటి దశ కింద జిల్లాలో హోల్సేల్ డీలర్లకు ఈ–పోస్ మిషన్ల ద్వారా ఎరువులు మే నుంచి పంపిణీ చేయతలపెట్టారు. జిల్లాకు 819 ఈ–పోస్ మిషన్లు అవసరం అవుతాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎరువుల కంపెనీలే వీటిని సరఫరా చేయాల్సి ఉంది. జిల్లాకు క్రిబ్కో కంపెనీ 598, ఎంసీఎఫ్ఓల్ కంపెనీ 136, పీపీఎల్ 22, జువారి కంపెనీ 28, ఎంఎఫ్ఎల్ 11, ఆర్సీఎఫ్ 24 ప్రకారం ఈ–పోస్ మిషన్లను సరఫరా చేయాల్సి ఉంది. సరఫరా అయిన ఎరువులను రైతులు కొనుగోలు చేస్తేనే కంపెనీలకు సబ్సిడీ జమ అవుతుంది. కొనకపోతే సబ్సిడీ వచ్చే అవకాశం లేదు. దీంతో డీబీటీ అమలుకు కంపెనీలే సహకరించడం లేదనే విమర్శలు వ్యక్తమతున్నాయి. ఖరీఫ్ మొదలయినా ఇప్పటి వరకు కేవలం 60 ఈ–పోస్ మిషన్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఎరువుల పంపిణీలో అక్రమాలు యథావిధిగా కొనసాగే అవకాశం ఏర్పడింది. ఖరీఫ్ సీజన్కు 3,38,077 టన్నుల ఎరువులు అవసరం ఖరీఫ్ సీజన్లో దాదాపు 6.50 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యే అవకాశం ఉంది. ఇందుకు యూరియా 1,13,312 టన్నులు, డీఏపీ 65,600, ఎంఓపీ 16432, కాంప్లెక్స్ ఎరువులు 1,42,733 టన్నులు మొత్తంగా 3,38,077 టన్నుల ఎరువులు అవసరం అవుతాయి. ప్రతి ఏటా 25 శాతం ఎరువులు ఇతర జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలుతున్నాయి. డీబీటీ విధానం వల్ల అక్రమాలకు తావుండదు. ఈ–పోస్ మిషన్లలో అందరి ఆధార్ డేటా, వెబ్ల్యాండ్ డేటాను లోడ్ చేస్తారు. రైతు ఈ మిషన్పై వేలిముద్ర వేయడంతో ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఏ పంటలకు ఎన్ని బస్తాల ఎరువుల అవసరం అనేది వస్తుంది. రైతు ఎరువులు కొనుగోలు చేసిన వెంటనే ఏ కంపెనీ ఎరువులు ఎన్ని బస్తాలు తీసుకున్న వివరాలు ఆన్లైన్లో వెంటనే కేంద్రానికి వెళ్తాయి. దీన్ని బట్టి కేంద్రం సబ్సిడీ విడుదల చేస్తుంది. డీబీటీ విధానం వల్ల కంపెనీలకు గండి పడే ప్రమాదం ఉండటంతో జిల్లాకు ఈ–పోస్ మిషన్లను సరఫరా చేయడంలో జాప్యం జరుగుతోంది. ఈ పరిస్థితి ఒక్క కర్నూలు జిల్లాలోనే కాదు.. ఇతర జిల్లాల్లోనూ ఉంది. జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుంటే తప్ప ఈ–పోస్ మిషన్లు జిల్లాకు వచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది. -
డీలర్ల గుప్పిట్లో యూరియా
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : యూరియా కేటాయింపుల్లో జిల్లా అధికార యంత్రాంగం జిమ్మిక్కులు చేస్తోంది. నిబంధనలు తుంగలో తొక్కి ప్రైవేటు డీలర్లకు అధికారులు వంత పాడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం జిల్లాకు వచ్చిన యూరియాలో 50 శాతం నిల్వలను సహకార సంఘాలకు కేటాయించి వాటి ద్వారా విక్రయాలు చేపట్టాలి. అలా చేస్తేనే ప్రైవేటు డీలర్లు కృత్రిమ కొరత సృష్టించకుండా చాలా మట్టుకు అడ్డుకట్ట వేయవచ్చు. కానీ ప్రైవేటు డీలర్లతో వ్యవసాయ, మార్క్ఫెడ్ అధికారులకు ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా యూరియా నిల్వలను ప్రైవేటు డీలర్లకే కట్టబెడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. అధిక ధరలకు విక్రయించి రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 60 సహకార సంఘాలున్నాయి. కానీ పాత బకాయిల పేరుతో 20 సహకార సంఘాలకు అధికారులు ఒక్క బస్తా కేటాయించలేదు. పైగా రైతుల నుంచి ఎక్కువ డిమాండ్ ఉన్న బ్రాండ్ యూరియాను ప్రైవేటు డీలర్లకు కేటాయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మార్క్ఫెడ్కు కేటాయించిన నిల్వల నుంచి కూడా అధికారులు కొందరు ప్రైవేటు డీలర్లకే కేటాయింపులు జరిపినట్లు తెలుస్తోంది. తీవ్రమవుతున్న యూరియా కష్టాలు ఈ ఖరీఫ్ సీజన్లో 89,513 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు కేటాయింపులు జరపాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కానీ.. ప్రభుత్వం కేవలం 62,068 మెట్రిక్ టన్నులు మాత్రమే కేటాయించింది. ఆగస్టుకు సంబంధించి 35,112 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు అవసరమని గుర్తించగా.. ఇప్పటివరకు 9,470 మెట్రిక్ టన్నులు మాత్రమే యూరియా వచ్చింది. ఈ యూరియా నిల్వల్లో అధిక భాగం డీలర్ల గుప్పిట్లోకి చేరడంతో అన్నదాతల ఎరువు కష్టాలు తీవ్ర రూపం దాల్చుతోంది. అదనపు దోపిడీ ఒక్కో బస్తా రూ.284 చొప్పున విక్రయించాల్సి ఉండగా.. అదనంగా రూ.50 నుంచి రూ.వంద వరకు వసూలు చేస్తున్నారు. ఇదేంటని రైతులు ప్రశ్నిస్తే స్టాకు లేదని సాకు చెబుతున్నారు. ఇటీవల బేల మండల కేంద్రంలో ఓ డీలరు రూ.350కు తక్కువ విక్రయించేది లేదని తేల్చిచెప్పడంతో రైతులు వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తెచ్చారు. విచారణ చేపట్టిన అధికారులు సదరు డీలరుకు నోటీసులతో సరిపెట్టడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. డిమాండున్నా వేధిస్తున్న కొరత.. జిల్లాలో యూరియా కొరత తీవ్ర రూపం దాల్చుతోంది. రెండు మూడురోజులు పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. పత్తి, వరి, కంది, మొక్కజొన్న, జొన్న తదితర పంటలకు రైతులు యూరియా వేస్తున్నారు. దీంతో పెరిగిన డిమాండ్ మేరకు జిల్లాలో యూరియా అందుబాటులో లేక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు యూరియా కష్టాలపై అధికారులను నిలదీశారు. ఇకనైనా జిల్లా ఉన్నతాధికార యంత్రాంగం ఈ యూరియా కేటాయింపులపై విచారణ జరిపితే అక్రమాలు వెలుగుచూసే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.