breaking news
Praveen Sood
-
సీబీఐ చీఫ్ ప్రవీణ్ సూద్కు ఏడాది పొడిగింపు
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించారు. ఈ మేరకు కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకుంది. సీబీఐ డైరెక్టర్ నియామక కమిటీలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రవీణ్ సూద్ పదవీకాలాన్ని పొడిగించారు. ప్రవీణ్ 2023 మేలో సీబీఐ డైరెక్టర్గా నియమితులయ్యారు. సుబోధ్ జైస్వాల్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యాక్ట్–2003 ప్రకారం సీబీఐ డైరెక్టర్ పదవీకాలం రెండేళ్లు. ప్రవీణ్ సూద్ రెండేళ్ల పదవీకాలం మే 24తో ముగియనుంది. దీంతో సీబీఐ చీఫ్ను ఎన్నుకోవడానికి ప్రధాని మోదీ ఎంపిక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా కూడా హాజరయ్యారు. అయితే ఈ భేటీలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రవీణ్ను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రవీణ్ సూద్ 1986 బ్యాచ్, కర్ణాటక కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారి. 1989లో మైసూరులో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా తన కెరీర్ను ప్రారంభించారు. బళ్లారి, రాయచూర్ ఎస్పీగా పనిచేసి బెంగళూరులో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ)గా నియమితులయ్యారు. డిప్యూటేషన్పై మూడేళ్ల పాటు మారిషస్లో పనిచేశారు. 2004 నుంచి 2007 వరకు మైసూరు నగర పోలీసు కమిషనర్గా కూడా పనిచేశారు. ఆ తర్వాత 2011 వరకు బెంగళూరు ట్రాఫిక్ పోలీస్లో అడిషనల్ పోలీస్ కమిషర్, 2013–14 వరకు కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా, ఆ తరువాత రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, కర్ణాటక స్టేట్ రిజర్వ్ పోలీస్ ఏడీజీపీగా, అడ్మినిస్ట్రేషన్ ఏడీజీపీగా, కర్ణాటక డీజీపీగా పనిచేశారు. -
సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ కు ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ
-
Viveka Case: వివేకా హత్య కుటుంబ ఆస్తి కోసమే!
సాక్షి, అమరావతి: మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కుటుంబ ఆస్తి వివాదాలే ప్రధాన కారణమని కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి సీబీఐకి తెలిపారు. కుటుంబ వారసత్వ ఆస్తి కోసమే వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఈ హత్య చేయించారని ఆధారాలతో సహా వివరించారు. వివేకా తన రెండో భార్య షమీమ్, ఆమె కుమారుడి పేరిట రాసిన నోటరీ వీలునామాను నిందితులు నర్రెడ్డి కుటుంబానికి అందచేశారని తెలిపారు. షమీమ్కు వాటా ఇవ్వకుండా వివేకా ఆస్తి మొత్తాన్ని సునీత తన పేరిట మ్యుటేషన్ చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. గతంలో దర్యాప్తు అధికారిగా ఉన్న రాంసింగ్ దురుద్దేశపూరితంగా ఈ అంశాలపై దర్యాప్తు చేయకుండా పక్కదారి పట్టించారన్నారు. అధికారికంగా బాధ్యతలు స్వీకరించటానికి మూడున్నర నెలల ముందు నుంచే రాంసింగ్ దర్యాప్తు చేపట్టడం, సాక్షులు చెప్పినదానికి భిన్నంగా వాంగ్మూలాలను నమోదు చేయడాన్ని ప్రస్తావించారు. ఈమేరకు ఎంపీ అవినాశ్రెడ్డి సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్కు సవివరంగా రాసిన లేఖ తాజాగా వెలుగులోకి వచ్చింది. వివేకా రెండో వివాహంతో ఆ కుటుంబంలో తలెత్తిన ఆస్తి వివాదాలు, అనంతర పరిణామాలను లేఖలో వివరించారు. హత్యలో పాల్గొన్న దస్తగిరిని అప్రూవర్గా మార్చి ఇప్పించిన వాంగ్మూలం పూర్తిగా అసత్యాల పుట్ట అని స్పష్టం చేశారు. వివేకా బాత్రూమ్లో లభ్యమైన గుర్తు తెలియని వేలి ముద్రలు ఎవరివి? అనే విషయాన్ని సీబీఐ పట్టించుకోకపోవడాన్ని ఎంపీ అవినాశ్ లేఖలో ప్రస్తావించారు. కడప ఎంపీ టికెట్పై ఎలాంటి సందిగ్దత లేదని స్పష్టం చేస్తూ హత్యకు ముందు రోజు వరకు ఎంపీగా తన గెలుపు కోసం వివేకా ప్రచారం చేశారని గుర్తు చేశారు. రాంసింగ్ ఉద్దేశపూర్వకంగా విస్మరించిన అంశాలను పునఃసమీక్షించి ఐపీసీ 457, 460, 394, 398, 302 సెక్షన్ల కింద సమగ్రంగా దర్యాప్తు చేయాలని కోరారు. వివేకా హత్య కేసు దర్యాప్తును జూన్ 30 లోగా పూర్తి చేయాలని న్యాయస్థానం సీబీఐకి గడువు నిర్దేశించింది. అంటే అప్పటిలోగా సీబీఐ తుది చార్జీషీట్ దాఖలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జూన్ 19న సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్కు ఎంపీ అవినాశ్రెడ్డి ఈ లేఖను రాశారు. సీబీఐ నమోదు చేసి న్యాయస్థానానికి సమర్పించిన సాక్షుల వాంగ్మూలాలు, అంతకు ముందు ఛార్జ్షీట్లలో పేర్కొన్న అంశాలను విశ్లేషించిన అనంతరం తాను సహేతుకంగా ఈ సందేహాలు, అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. సీబీఐ గత గత ఛార్జ్ షీట్ల లో విస్మరించిన కీలక అంశాలను పునసమీక్షించి సమగ్రంగా దర్యాప్తు చేసి న్యాయం చేయలని కోరారు. ఎంపీ అవినాశ్రెడ్డి లేఖలో ప్రస్తావించిన ప్రధానాంశాలు సంక్షిప్తంగా... పక్కదారి పట్టించిన రాంసింగ్ రాంసింగ్ దర్యాప్తు అధికారిగా 2021 నవంబరు 9న అధికారికంగా బాధ్యతలు స్వీకరించగా అప్పటికి మూడున్నర నెలల ముందే సీఆర్పీసీ నిబంధనలకు విరుద్ధంగా దర్యాప్తు చేపట్టారు. సెప్టెంబరు 2నే వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి వద్ద వాంగ్మూలం తీసుకున్నారు. నాతోపాటు నా తండ్రి వైఎస్ భాస్కర్రెడ్డి, డి.శివశంకర్రెడ్డికి వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగానే సాక్షుల పేరిట వాంగ్మూలాలు నమోదు చేశారు. సాక్షులు చెప్పని విషయాలను కూడా చెప్పినట్టుగా వాంగ్మూలాలు నమోదు చేసి తన కింది అధికారులతో వాటిపై సంతకాలు చేయించారు. సీఐ శంకరయ్య, అభిషేక్రెడ్డి చెప్పని విషయాలను చెప్పినట్లుగా రాంసింగ్ ఏకపక్షంగా వాంగ్మూలాలను నమోదు చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ శంకరయ్య కడప ఎస్పీకి ఫిర్యాదు కూడా చేశారు. తాను చెప్పినట్లు అబద్ధాలు చెప్పాలని ఉదయకుమార్రెడ్డిని రాంసింగ్ చిత్రహింసలకు గురి చేయడంతో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 2021 నవంబర్ 9వరకు రాంసింగ్ దర్యాప్తు కొనసాగించి రెండు చార్జ్షీట్లు దాఖలు చేశారు. వివేకా రెండో వివాహం అంశాన్ని ఉద్దేశపూర్వకంగానే విస్మరించారు. బెంగళూరు భూవివాదం కట్టుకథే దస్తగిరిని అప్రూవర్గా మార్చి రాంసింగ్ ఇప్పించిన వాంగ్మూలంలోని అంశాలు పూర్తి అవాస్తవమని సీబీఐ దర్యాప్తులోనే వెల్లడైంది. బెంగళూరులోని ఓ భూవివాదానికి సంబంధించి డబ్బుల కోసం వివేకాను హత్య చేయమని, తనకు వైఎస్ భాస్కర్రెడ్డి సహకారం ఉందని ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్టు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. బెంగళూరు భూవివాదానికి సంబంధించి 10 మందిని సీబీఐ విచారించింది. ఆ భూమికి సంబంధించిన పత్రాలు నకిలీవని తేలడంతో వాటిని బెంగళూరుకు చెందిన వై.వెంకట ప్రసాద్కు అప్పటికే అప్పగించేసినట్టు వెల్లడైంది. అంటే వివేకా హత్యకు చాలా నెలల ముందే బెంగళూరు భూవివాదం సమసిపోయింది. దస్తగిరి వాంగ్మూలం పూర్తిగా అవాస్తవమని స్పష్టమైంది. ఆ వాంగ్మూలం ఆధారంగా రాంసింగ్ దర్యాప్తు చేయడం దురుద్దేశపూరితమే. చెక్ పవర్ రద్దుతో ఆర్థిక ఇబ్బందులు.. కుటుంబ సభ్యులు తన చెక్ పవర్ రద్దు చేయడంతో వివేకా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విపరీతంగా మద్యానికి బానిసయ్యారు. మోసగాడైన సునీల్ యాదవ్ చెప్పిన వజ్రాల కథను విశ్వసించారు. వాటిని విక్రయించి డబ్బులు ఇప్పించాలని సునీల్ యాదవ్ కోరడంతో తన వాహనాన్ని ఇవ్వడంతోపాటు అతడితో కలసి పలు ప్రాంతాలు తిరిగారు. తరువాత సునీల్ యాదవ్ చెప్పినదంతా కట్టుకథేనని ఎర్ర గంగిరెడ్డి గ్రహించాడు. అప్పటి నుంచి సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్రెడ్డి వివేకా ఇంటికి రావడం మానేశారు. వారిద్దరి కుటుంబాల్లో మహిళలతో వివేకాకు వివాహేతర సంబంధాలు కూడా ఉన్నాయి. దీంతో వారిద్దరూ ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వివేకాపై దాడి చేసిన తరువాత ఆయన మర్మాంగంపై సునీల్ యాదవ్ కాలితో తన్ని తీవ్రంగా దూషించారు. నర్రెడ్డి కుటుంబానిదే ఆ కుట్ర కుటుంబ వారసత్వ ఆస్తి కోసమే వివేకానందరెడ్డిని హత్య చేశారు. ఆ హత్య వెనుక వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, ఇతర నర్రెడ్డి కుటుంబ సభ్యులున్నారు. ఎందుకంటే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వివేకా తన రెండో భార్య షమీమ్, ఆమె కుమారుడు షెహన్షాకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చలేకపోయారు. తన కుమారుడి విద్యాభ్యాసం, భవిష్యత్ కోసం తన ఆస్తిలో కొంత వాటా రాసివ్వాలనుకున్నారు. కుటుంబ ఉమ్మడి ఆస్తిలో తన పేరిట ఉన్న 25 శాతం వాటాను షమీమ్, ఆమె కుమారుడి పేరిట ఆయన నోటరైజ్డ్ వీలునామా రాసినట్లు తెలిసింది. దీన్ని ఆయన మొదటి భార్య, కుమార్తె, అల్లుడు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో వివేకా హత్య జరిగింది. వివేకా కుమార్తె సునీత, అల్లుడు–చిన్న బావమరిది నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్రెడ్డిలతో ఎర్ర గంగిరెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన ద్వారానే వారు వివేకా హత్యకు పన్నాగం పన్ని ఉంటారు. తమ కుటుంబ సభ్యులతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని వివేకాపై ఆగ్రహంతో ఉన్న సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్రెడ్డిల సహకారంతో ఎర్ర గంగిరెడ్డి ఈ హత్యకు పథకం వేశాడు. డబ్బు ఆశ చూపించి దస్తగిరిని కూడా పాత్రధారిని చేశారు. వివేకా హత్య తరువాత ఆ ఇంట్లో కొన్ని పత్రాల కోసం ఎర్ర గంగిరెడ్డి, ఇతర నిందితులు గాలించారు. హత్యలో పాలు పంచుకున్న దస్తగిరితోపాటు వాచ్మెన్ రంగయ్య కూడా తన వాంగ్మూలంలో ఇదే విషయాన్ని చెప్పారు. బెంగళూరు భూవివాదం లేదని ఎర్ర గంగిరెడ్డికి తెలుసు కాబట్టి వారు వెతికింది వివేకా రాసిన నోటరీ వీలునామా గురించే అని స్పష్టమవుతోంది. నోటరీ వీలునామాను ఎర్ర గంగిరెడ్డి వివేకా కుమార్తె, అల్లుడికి ఇచ్చి ఉంటారు. అంటే కుటుంబ ఆస్తి కోసమే వివేకాను హత్య చేశారు. వివేకా హత్య తరువాత ఆ కుటుంబ ఆస్తి మొత్తాన్ని సునీత తన పేరిట మ్యుటేషన్ ద్వారా మార్పించుకోవడం గమనార్హం. షమీమ్కు ఎలాంటి ఆస్తి దక్కలేదు. ఆస్తి కోసమే వివేకాను ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి హత్య చేయించారని ఈ కేసులో నిందితుడు సునీల్ యాదవ్ సమీప బంధువైన భరత్ యాదవ్ తన వాంగ్మూలంలో చెప్పాడు. తాము చెప్పినట్లు సీబీఐకి అవాస్తవాలు చెప్పకుంటే ఈ కేసులో ఇరికిస్తామని వివేకా పీఏ కృష్ణారెడ్డిని సునీత బెదిరించారు. ఈ వాస్తవాలన్నీ వివేకా హత్య వెనుక నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులే ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయి. సీబీఐ ఈ కోణంలో అసలు దర్యాప్తు చేయలేదు. ఆ వేలిముద్రలు ఎవరివి? వివేకా హత్య జరిగిన ప్రదేశాన్ని కడప పోలీసుల క్లూస్ టీమ్ పరిశీలించి బాత్రూమ్ గోడలు, తలుపు వెనుక ఉన్న వేలిముద్రలను సేకరించింది. ఆ వేలిముద్రల్లో కొన్ని నలుగురు నిందితుల వేలిముద్రలతో సరిపోలేదు. అంటే హత్య జరిగిన రోజు రాత్రి ఆ నలుగురు నిందితులే కాకుండా ఆ ఇంట్లో మరెవరో ఉన్నట్లు స్పష్టమవుతోంది. సీబీఐ అప్రూవర్గా మార్చిన దస్తగిరి ఆ వ్యక్తి పేరును వెల్లడించలేదు. ఆ వేలి ముద్రలు ఎవరివి? అనే కోణంలో సీబీఐ దర్యాప్తు చేయలేదు. ఎవరినో రక్షించేందుకే ఆ వేలి ముద్రలను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తోందని స్పష్టమవుతోంది. ఆ వేలి ముద్రలు ఎవరివన్న కోణంలో దర్యాప్తు చేస్తే ఈ హత్య వెనుక అసలు కుట్ర బయటపడుతుంది. ఆ తరువాత మాట మార్చిన సునీత కడప ఎంపీ టికెట్ కోసమే వివేకాను హత్య చేశారని రాంసింగ్ చార్జ్షీట్లో పేర్కొన్న అంశాలు పూర్తిగా అవాస్తవం. అప్పటికే సిట్టింగ్ ఎంపీగా ఉన్న నన్నే (అవినాష్రెడ్డి) 2019 ఎన్నికల్లోనూ అభ్యర్థిగా పార్టీ ఖరారు చేసింది. నా గెలుపు కోసం పార్టీ ఎన్నికల ఇన్చార్జ్గా వివేకానందరెడ్డి ఉన్నారు. ఆయన చనిపోయే ముందు రోజు వరకూ నా గెలుపు కోసం కృషి చేశారు. మైదుకూరు నియోజకవర్గంలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామిరెడ్డితో కలసి ప్రచారం కూడా చేశారు. సీబీఐ ఈ విషయాలపై ఏమాత్రం దృష్టి సారించలేదు. కనీసం రఘురామిరెడ్డినిగానీ పార్టీ నేతలను గానీ సంప్రదించలేదు. వివేకా హత్య తరువాత తొలుత సునీత కూడా మీడియాకు ఇదే విషయాలను చెప్పారు. తన తండ్రి చివరి వరకు అవినాశ్రెడ్డి గెలుపు కోసం పని చేశారని వెల్లడించారు. 2019 అక్టోబరు తరువాత ఆమె మాట మార్చి నాపై, మా పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇదీ చదవండి: వివేకా కేసులో పుకార్లేంటీ? నిజాలేంటీ? -
సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్కు ఎంపీ అవినాష్రెడ్డి లేఖ
సాక్షి, అమరావతి: సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్కు ఎంపీ అవినాష్రెడ్డి లేఖ రాశారు. వివేకా హత్య కేసు విచారణకు సంబంధించి రాంసింగ్ పక్షపాతంగా వ్యవహరించారంటూ.. గతంలో సీబీఐ దాఖలు చేసిన చార్జ్షీట్లను విశ్లేషిస్తూ ఆయన లేఖ రాశారు. సీబీఐ విచారణను పున:సమీక్షించుకోవాలని అవినాష్రెడ్డి కోరారు. ‘‘విచారణ అధికారిగా బాధ్యతలు తీసుకోకముందే రాంసింగ్ నిబంధనలకు వ్యతిరేకంగా విచారణ జరిపారు. నాతో పాటు మా తండ్రి భాస్కర్రెడ్డి, శివశంకర్రెడ్డిని ఇరికించేందుకు సాక్ష్యులను రాంసింగ్ బెదిరించారు. నా పేరు చెప్పమని పీఏ కృష్ణారెడ్డిని థర్డ్ డిగ్రీతో రాంసింగ్ టార్చర్ చేశారు. రాంసింగ్ వేధింపులు భరించలేక పీఏ కృష్ణారెడ్డి, కడప ఎస్పీ పులివెందుల కోర్టులో ఫిర్యాదు చేశారు. పలువురు సాక్ష్యుల స్టేట్మెంట్లను రాసింగ్ పూర్తిగా మార్చేశారు.’’ అని అవినాష్రెడ్డి లేఖలో పేర్కొన్నారు. చదవండి: నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి చెబుతున్నది తప్పు: వివేకా పీఏ కృష్ణారెడ్డి ‘‘వరుసగా అబద్ధాలు చెప్పిన ఏ4 దస్తగిరి మాటల ఆధారంగా సీబీఐ విచారణ చేసింది. హత్య చేశానని ఒప్పుకున్న దస్తగిరిని అరెస్ట్ చేయకుండా సీబీఐ ఆలస్యం చేసింది. వివేకాను హత్య చేసిన దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్ను సీబీఐ కానీ, సునీత కానీ వ్యతిరేకించలేదు’’ అని అవినాష్ లేఖలో తెలిపారు. ‘‘సీఐ శంకరయ్య చెప్పని మాటలను రాంసింగ్ సాక్ష్యాలుగా చూపారు. సీఐ శంకరయ్య దీనిపై కడప జిల్లా ఎస్పీ, కడప కోర్టులో ఫిర్యాదు చేశారు. సీబీఐ ఎస్పీ రాంసింగ్ తనను చిత్రహింసలకు గురి చేశారని ఉదయ్ కుమార్రెడ్డి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో రాంసింగ్పై క్రిమినల్ కేసు నమోదైంది. వివేకా హత్య కేసులో తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని రాంసింగ్ వక్రీకరించారని డాక్టర్ అభిషేక్రెడ్డి మీడియా ముందు చెప్పారు. హత్య జరిగిన రోజు మా నాన్న భాస్కర్రెడ్డి ఇంటికి ఏ2 సునీల్ యాదవ్ వచ్చారని సీబీఐ చెప్పింది అబద్ధం’’ అని అవినాష్రెడ్డి స్పష్టం చేశారు. చదవండి: దారి తప్పిన 'సీబీఐ దర్యాప్తు' ‘‘గూగుల్ టేక్ అవుట్కు సంబంధించి తొలి చార్జిషీట్లో ఎలాంటి ప్రస్తావన లేదు. రాంసింగ్ వచ్చిన తర్వాతనే కావాలనే ఈ అబద్ధాన్ని సృష్టించారు. వివేకా హత్య కేసులో కీలకమైన రెండో వివాహం అంశాన్ని సీబీఐ కావాలనే పక్కనపెట్టింది. తన భర్త హత్యకు ఆయన మొదటి భార్య కుటుంబ సభ్యులే కారణమని వివేకా రెండో భార్య షమీమ్ అనుమానం వ్యక్తం చేశారు. అయినా సీబీఐ ఈ విషయంలో ఎటువంటి విచారణ జరపలేదు. వివేకా హత్య కేసులో గత విచారణ అధికారి రాంసింగ్ చేసిన తప్పులను సవరించాలి’’ అని ఎంపీ అవినాష్రెడ్డి కోరారు. -
సీబీఐ డైరెక్టర్గా ప్రవీణ్ సూద్.. తెరమీదకు మయాంక్ అగర్వాల్ పేరు! కారణం?
Mayank Agarwal- CBI director Praveen Sood: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నూతన డైరెక్టర్గా ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ సూద్ బాధ్యతలు చేపట్టిన వేళ టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్ పేరు తెరమీదకు తీసుకువచ్చారు అభిమానులు. ఇందుకు ఓ కారణం ఉంది.. అదేంటంటే.. టీమిండియా ఓపెనర్గా కర్ణాటకకు చెందిన మయాంక్.. 2018లో ఆస్ట్రేలియాతో టెస్టు సందర్భంగా టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. 2020లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. టీమిండియా ఓపెనర్గా మంచి గుర్తింపు సంపాదించిన ఈ రైట్హ్యాండ్ బ్యాటర్ ఇప్పటి వరకు కెరీర్లో మొత్తంగా 21 టెస్టులు ఆడాడు. 36 ఇన్నింగ్స్లలో కలిపి 1488 పరుగులు సాధించాడు. ఇందులో 4 సెంచరీలు, రెండు ద్విశతకాలు ఉండటం విశేషం. ఇక కేవలం 5 వన్డేలు మాత్రమే ఆడే అవకాశం దక్కించుకున్న మయాంక్.. 86 పరుగులకే పరిమితమయ్యాడు. మయాంక్- ఆషితా ప్రేమకథ అలా మొదలైంది ఇక మయాంక్ అగర్వాల్ కెరీర్ సంగతులు ఇలా ఉంటే.. అతడి వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. మయాంక్ అగర్వాల్ది ప్రేమ వివాహం. అతడి భార్య పేరు ఆషితా సూద్. కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన వీరిద్దరు తొలుత స్నేహితులుగా దగ్గరయ్యారు. కాలక్రమంలో స్నేహం ప్రేమగా మారింది. ఆషితాకు తన మనసులో మాట చెప్పేందుకు సిద్దమైన మయాంక్.. లండన్లో రొమాంటిక్ స్టైల్లో ఆమె ముందు పెళ్లి ప్రపోజల్ ఉంచాడు. ఇందుకు ఆషితా సానుకూలంగా స్పందించడంతో 2018 జనవరిలో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. మయాంక్కు స్వయానా మామగారు అదే ఏడాది జూన్ 4న మయాంక్- ఆషితాల పెళ్లి జరిగింది. సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వివాహ వేడుకకు మయాంక్ బెస్ట్ ఫ్రెండ్ కేఎల్ రాహుల్ సహా పలువురు క్రికెటర్లు హాజరయ్యారు. మయాంక్ ప్రేమించి పెళ్లాడిన ఆషితా మరెవరో కాదు.. ప్రస్తుతం సీబీఐ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ప్రవీణ్ సూద్ కుమార్తె. కర్ణాటక మాజీ డీజీపీ ప్రవీణ్ సూద్ కూతురైన ఆషితా.. వృత్తి రిత్యా లాయర్. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లాలో ఆమె మాస్టర్స్ చేశారు. అదీ విషయం.. టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్.. ప్రవీణ్ సూద్కు స్వయానా అల్లుడు. మామగారు ఉన్నత పదవి చేపట్టడంతో అభిమానులు ఇలా మయాంక్ పేరును వార్తల్లోకి తెచ్చారు. ఇక మయాంక్- ఆషితాలకు ఓ కుమార్తె ఉంది. ఇదిలా ఉంటే.. 2011లో ఆర్సీబీ తరఫున ఐపీఎల్లో అడుగుపెట్టిన మయాంక్ ప్రస్తుత సీజన్ ఐపీఎల్-2023లో సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహించాడు. మినీ వేలంలో 8.25 కోట్ల రూపాయల భారీ ధరకు రైజర్స్ అతడిని కొనుగోలు చేసింది. అయితే, ఈ ఎడిషన్లో ఈ కర్ణాటక బ్యాటర్ అంచనాలు అందుకోలేకపోయాడు. 10 మ్యాచ్లు ఆడి కేవలం 270 పరుగులే చేశాడు. చదవండి: BCCI: అవసరమా?.. ఐపీఎల్ యాజమాన్యానికి సజ్జనార్ రిక్వెస్ట్.. ట్వీట్తో.. ఆర్సీబీలో నెట్బౌలర్గా ఉన్నా... ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు! కానీ ఇప్పుడు.. -
సీబీఐ నూతన డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ప్రవీణ్ సూద్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నూతన డైరెక్టర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఆయన ఇంతకుముందు కర్ణాటక డీజీపీగా పనిచేశారు. సీబీఐ డైరెక్టర్ గురించి మరిన్ని విషయాలు ► 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్, నిన్నటివరకు కర్ణాటక డీజీపీగా సేవలందించారు. ► సీబీఐ కొత్త డైరెక్టర్ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు. ► ప్రవీణ్ సూద్ ఐఐటీ ఢిల్లీలో ఇంజినీరింగ్ చదివారు. ఆ తర్వాత UPSC ద్వారా IPS సర్వీసులోకి వచ్చారు. ► కర్ణాటక పోలీస్ శాఖలో పలు ఉన్నత పదవులు నిర్వహించారు. ► 1989లో మైసూరు ఏఎస్పీగా బాధ్యతలు, అనంతరం బళ్లారి, రాయచూరు ఎస్పీగా, ఆ తర్వాత బెంగళూరు డీసీపీగా పని చేశారు. ► 1999లో డిప్యుటేషన్ మీద మారిషస్ లో మూడేళ్ల పాటు పనిచేశారు. ► 2004-2007 మధ్య మైసూరు కమిషనర్ గా పని చేశారు. ► ఆ తర్వాత కర్ణాటక హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా, అడిషనల్ డీజీపీగా, రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ గానూ వ్యవహరించారు. ► ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 కింద CBI (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) ఏర్పాటు అయింది కాబట్టి ఆ చట్టం 4A కింద డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించారు. ► ప్రవీణ్ సూద్కు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సూద్ అల్లుడే టీం ఇండియా క్రికెట్ బ్యాట్స్మన్ మయాంక్ అగర్వాల్. ► ప్రవీణ్ సూద్ పలు విశిష్ట పురస్కారాలు, అవార్డులు అందుకున్నారు. సంవత్సరం పురస్కారం 1996 చీఫ్ మినిస్టర్ గోల్డ్ మెడల్ 2002 పోలీస్ మెడల్ 2006 ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ 2011 ప్రిన్స్ మైఖైల్ ఇంటర్నేషనల్ రోడ్ సేఫ్టీ అవార్డు 2011 నేషనల్ e-గవర్నెన్స్ గోల్డ్ మెడల్