breaking news
Pratyussinha Committee
-
ఐఏఎస్ కేటాయింపుల్లో మార్పులు
ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లో మారనున్న రోస్టర్ ఈనెల 18 లోపు ప్రత్యూష్ సిన్హా తుది సమావేశం నెలాఖరులోగా పంపిణీ పూర్తి హైదరాబాద్: అఖిల భారత సర్వీసు అధికారుల పంపకాలు ఈ నెలాఖరులోగా పూర్తి కానున్నాయి. ప్రత్యూష్సిన్హా కమిటీ ఈనెల 18 లోపు సమావేశమై ఇదివరకు జరిపిన తాత్కాలిక కేటాయింపుల్లో జరిగిన లోపాలను సవరించి, తుది జాబితాను కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు(డీవోపీటీ) పంపించనుంది. ఐఎఫ్ఎస్ కేడర్ అధికారుల జాబితాను అడవులు, పర్యావరణ మంత్రిత్వ శాఖ.. ఐపీఎస్లది హోం శాఖ, ఐఏఎస్ల జాబితాను డీవోపీటీపరిశీలించనుంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుత తాత్కాలిక కేటాయింపుల్లో ఐఏఎస్లు జేఆర్ ఆనంద్, రాణి కుముదినిలను ఇన్సైడర్ (రాష్ట్రానికి చెందినవాళ్లు) కేటగిరీలో చేర్చారు. వాస్తవంగా రాణి కుముదినీని జమ్ము-కాశ్మీర్ కేడర్కు కేటాయించారు. ఆమె ఆనారోగ్య కారణాలతో బదిలీపై ఆంధ్రప్రదేశ్ కేడర్కు వచ్చారు. దీంతో ముందు కేటాయించిన కేడర్నే ఆమెకు వర్తింపచేయనున్నారు. దీనితో ఇన్సైడర్గా ఉన్న రాణికుముదిని ఔట్సైడర్(రాష్ట్రేతరులు)గా పరిగణించడంతో... ఎస్సీ ఐఏఎస్ కేడర్లో రోస్టర్ బాండ్ విధానం మారిపోతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు కేటాయించిన డాక్టర్ పీవీ రమేశ్ ఆంధ్రాకు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే జేఆర్ ఆనంద్ను ఇన్సైడర్గా గుర్తించారు. వాస్తవంగా ఆయన ఒడిశాకు చెందిన వ్యక్తి. కానీ ఆయన్ను ఆంధ్రా ఇన్సైడర్గా భావించి కేటాయించారు. ఇప్పుడు వీరిద్దరినీ రాష్ట్రేతరులుగా పరిగణించాల్సి రావడం వల్ల.. ఎస్సీ, ఎస్టీ కేడర్ అధికారుల రోస్టర్లో మార్పులు చేర్పులు ఉంటాయని ఉన్నతాధికార వర్గాలు వివరించాయి. అలాగే ఆంధ్రాకు కేటాయించిన బీఆర్ మీనా తెలంగాణకు వచ్చే అవకాశముంది. అలాగే ఓబీసీ కేటగిరీలో శ్యామలరావును ముందు ఒడిశా రాష్ట్రానికి కేటాయించారు. ఆయన అంత ర్రాష్ట బదిలీతో రాష్ట్రానికి వ చ్చారని ఐఏఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆయన కేడర్ కేటాయింపులోనే తప్పు జరిగిందని, కోర్టు నుంచి శ్యామలరావు ఉత్తర్వులు తెచ్చుకున్నం దున ఆయనను ఆంధ్రా కేడర్ ఇన్సైడర్గానే గుర్తిం చనున్నారు. కాగా ఆంధ్రా నుంచి డెరైక్టర్ రిక్రూటీలు ఎక్కువగా ఉన్నందున.. తెలంగాణకు కొందరు పనిచేయక తప్పదని ఓ అధికారి తెలిపారు. భార్యాభర్తల విషయంలో..: భార్యాభర్తల విషయంలో పాత నిబంధనలు ఇక్కడ వర్తిస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇద్దరు ఒకేచోట పనిచేయడానికి అవకాశం ఉందని ఆ వర్గాలు వివరించాయి. డీవోపీటీ కేటాయింపులు చేసే సమయంలో వీటిని సరిచేసే అవకాశం ఉందని అంటున్నారు. భార్యాభర్తలైన అధికారులు కలసి పనిచేయాలని కోరినా.. వేర్వేరు రాష్ట్రాల్లో పనిచేయాలని కోరినా అందుకు అంగీకరిస్తారని ఓ ఉన్నతాధికారి వివరించారు -
వేగంగా విభజన ప్రక్రియ
ఢిల్లీలో ప్రత్యూష్సిన్హా కమిటీ ముందు హాజరైన సీఎస్ మహంతి అఖిల భారత సర్వీసు అధికారుల విభజన మార్గదర్శకాలపై చర్చ ఏపీ భవన్ విభజనపై ఉన్నతాధికారుల కీలక సమావేశం న్యూఢిల్లీ: రాష్ట్ర విభ జనకు సంబంధించిన ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఈ నెల 30 నాటికి అన్ని విభాగాల్లో విభజన ప్రక్రియను పూర్తి చేయాలన్న కేంద్రం ఆదేశాల మేరకు అధికారులు వేగంగా పనులు చేస్తున్నారు. ఇందులో భాగంగా విభజనకు సంబంధించి మంగళవారం సైతం ఢిల్లీలో కీలక భేటీలు జరిగాయి. అఖిల భారత సర్వీసు అధికారుల విభజనపై ఏర్పాటుచేసిన ప్రత్యూష్సిన్హా కమిటీ ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి హాజరై కీలక చర్చలు జరిపారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూనేవారి విభజనకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందించే దిశగా వీరి సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై కూడా ఉన్నతాధికారులు మరో ముఖ్య సమావేశం నిర్వహించారు. ఏపీ భవన్ విభజనకు సంబంధించి వారు దాదాపు ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. మరోపక్క బుధవారం రాష్ట్ర స్థాయి ఉద్యోగుల విభజనకు సంబంధించి ఏర్పాటైన కమల్నాథన్ కమిటీ కేంద్ర హోంశాఖ ముందు హాజరై తన కసరత్తును వారికి వివరించనుంది. ఇదిలా ఉండగా నార్త్బ్లాక్లోని హోంశాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రత్యూష్ సిన్హాతో పాటు కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి రాజీవ్ శర్మ, పర్యావరణ శాఖ, హోంశాఖ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి పాల్గొన్నారు. ఈ కమిటీ సుమారు నాలుగు గంటల పాటు రెండు విడతలుగా సమావేశమై అఖిలభారత సర్వీసు అధికారుల విభజన మార్గదర్శకాల తయారీపై కసరత్తు చేసింది. విభజన అనంతరం ఏ రాష్ట్రానికి వెళ్లాలనే విషయంలో తమకు ఆప్షన్లు ఉండాల్సిందేనని అఖిలభారత సర్వీసు అధికారులు ఇప్పటికే స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులకు ఆప్షన్లు ఇవ్వాలా? రోస్టర్ విధానాన్ని అవలంబించాలా? లేక స్థానికత ఆధారంగా నిర్ణయం చేయాలా? అన్న దానిపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుందన్న అంశంపై వివరాలు తెలియరాలేదు. అధికారుల విభజన మార్గదర్శకాల తయారీ పూర్తి కాలేదని, దీనికి మరో మూడు, నాలుగు రోజులు పట్టే అవకాశం ఉందని హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. ఏపీ భవన్ విభజన కొలిక్కి!: ఇక ఏపీభవన్లో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు, సిబ్బంది, భవనాలు, తదితరాల విభజనకు సంబంధించి ఆర్అండ్బీ శాఖ ప్రధాన కార్యదర్శి శ్యాంబాబు, జీఏడీ ప్రోటోకాల్ ముఖ్య కార్యదర్శి రమణారెడ్డి, జీఏడీ కార్యదర్శి శివశంకర్, రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్ మంగళవారం ఇక్కడ భేటీ అయ్యారు. సుమారు రెండు గంటల పాటు వీరి సమావేశం జరిగింది. ప్రస్తుతం ఉన్న సీఎం కాటేజ్ను ఆంధ్రప్రదేశ్కు, శబరి బ్లాక్లో తెలంగాణ ముఖ్యమంత్రికి కాటేజ్ను కేటాయించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఏపీభవన్లో 30 వాహనాలు ఉండగా వాటిని ఆంధ్రకు 15, తెలంగాణకు 14 చొప్పున పంచారు. అలాగే ముఖ్యమంత్రి కాన్వాయ్లో వాడే రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ఇరువైపులా ఒక్కోటి చొప్పున, ఇక మిగిలిన మరో వాహనాన్ని ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు. ఏపీభవన్లో ప్రస్తుతం ఉన్న క్యాంటీన్, వీఐపీ డైనింగ్ హాల్, అంబేద్కర్ఆడిటోరియాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే నిర్వహించేలా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల విభజన మే 7 తర్వాతే? ఇక అన్నిటికన్నా ముఖ్యమైన ఏపీ భవన్ ఉద్యోగుల విభ జనను ఎలా చేయాలన్నది మే 7 తర్వాతే నిర్ణయించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ భవన్లో 31 మంది ఆంధ్రా ప్రాంతం వారు, 11 మంది తెలంగాణవారు, మరో 48 మంది ఇతర రాష్ట్రాల వారు ఉన్నారు. వీరిని స్థానికత ఆధారంగా పంచితే తెలంగాణకు కొరత ఏర్పడుతుంది. ఈ దృష్ట్యా సింగిల్ పోస్టులన్నీ తెలంగాణకు, డబుల్ పోస్టులున్న చోట్ల సీనియర్లు తెలంగాణకు, జూనియర్లను ఆంధ్రాకు కేటాయించేలా మొదట ఉన్నతాధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. దీనివల్ల కొందరు ఆంధ్రా ప్రాంత ఉద్యోగులు తెలంగాణకు వెళ్లాల్సి వస్తోంది. దీనిపై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయినట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం ఉద్యోగుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్న దృష్ట్యా సీమాంధ్రలో ఎన్నికలు ముగిసిన అనంతరమే ఉద్యోగుల విభ జన చేపడతారని తెలుస్తోంది. అప్పటివరకు కేవలం పోస్టుల విభజనను పూర్తి చేస్తారని తెలుస్తోంది.