బుల్లితెర అధికారంపై కన్ను
బుల్లితెర అధికారంపై నటి నళిని కన్నేశారు. ఈ సంఘం అధ్యక్ష పదవి కోసం ఎన్నికల బరిలోకి దిగారు. బుల్లితెర నటీనటుల సంఘం ఎన్నికలు మూడేళ్లకొకసారి జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ సంఘం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి నటి నళిని, నటుడు రాజేంద్రన్, శివ శ్రీనివాసన్ పోటీ పడుతున్నారు.
నటి నళిని ప్యానల్లో కార్యదర్శి పదవికి పూవిళరసు, మోహన్, కోశాధికారిగా విటి, త్యాగరాజన్, ఉపాధ్యక్ష పదవికి మనోబాల, రాజాకాంత్ పోటీచేస్తున్నారు. ఉప కార్యదర్శి పదవికి బాబూస్ భరత్, కన్యభారతి, సాధన బరిలో ఉన్నారు. రాజేంద్రన్ జట్టులో కార్యదర్శి పదవికి రవివర్మ, కోశాధికారి పదవికి కెఎస్సీ వెంకటేశ్, ఉపాధ్యక్ష పదవికి విన్సెంట్రాయ్, రాజశేఖర్, ఉప కార్యదర్శి పదవికి సతీష్, దేవానంద్, మీనాకుమారి పోటీ చేస్తున్నారు.
ఇక శివన్ శ్రీనివాసన్ జట్టులో కార్యదర్శి పదవికి ఎం.టి.మోహన్, కోశాధికారి పదవికి భరత్ కల్యాణ్, ఉపాధ్యక్ష పదవికి భువనేశ్వరి, గజేష్, ఉప కార్యదర్శి పదవికి రిషి, రమ్య, శంకర్, శివకుమార్ పోటీ చేస్తున్నారు. దర్శకుడు లియాఖత్ అలీఖాన్ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఈ ఎన్నికలు ఆదివారం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరగనున్నాయి.