breaking news
Power employee
-
ఓ ఉద్యోగి ఆతృతకు.. నిండు ప్రాణం బలి
శ్రీకాకుళం, కాశీబుగ్గ: తిత్లీ తుఫాన్ విజృంభణ నేపథ్యంలో జిల్లాలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు ఇతర జిల్లా నుంచి సంబంధిత సిబ్బందితో వచ్చిన ఓ సహాయకుడు విద్యుత్ఘాతానికి గురై మృత్యువాతపడ్డాడు. తన ఇంటికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని ఓ ఉద్యోగి ఆతృతకు ఇలా నిండు ప్రాణం బలి కావడంతో పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఆదివారం సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళ్తే.. మున్సిపాలిటీ పరిధి 16వ వార్డు గాంధీనగర్లో పన్నెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక్కడ నివాసముంటున్న స్టేట్ బ్యాంకు ఉద్యోగి శివరాం తన ఇంటికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు ఎల్సీ(విద్యుత్ను అనుమతితో నిలిపివేసే పక్రియ) తీసుకోకుండానే అక్రమంగా పనులు చేయించాడు. ఈయన ఓ విద్యుత్ కూలీని తీసుకొచ్చి స్థానికంగా స్తంభం ఎక్కించాడు. ఈ క్రమంలో వైరు కలుపుతుండగా షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న వార్డు కౌన్సెలర్ బోర బుజ్జి, ఉప చైర్మన్ గురిటి సూర్యనారాయణ, కౌన్సెలర్ రాంబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి విద్యుత్ సిబ్బంది తమ సహాయకులుగా (రోజు కూలీలు) పది వేల మంది వరకు తీసుకొచ్చారు. వీరిలో తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట నుంచి వచ్చిన ఈ వ్యక్తి పది రోజులుగా పనులు చేస్తూ ఇలా మృత్యవాత పడ్డాడు. ఇటువంటి కార్మికులకు స్థానికంగా పలువురు నగదు ఆశ చూపి ఈ విధంగా వినియోగిస్తుండటం గమనార్హం. ఈ విషయమై ఇంకా కేసు నమోదు కాలేదు. -
విద్యుత్ ఉద్యోగుల మెరుపు సమ్మె
విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్లైన్ : విద్యుత్ ఉద్యోగులు ఆదివారం ఉద యం 6 గంటల నుంచి మెరుపు సమ్మె చేయనున్నారు. అపరిష్కృతంగా మిగిలిపోతున్న తమ ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మె బాట పడుతున్నారు. ఐదు డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వీరు కోరుతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు పీఆర్సీని పెంచాలని డిమాండ్ చేస్తూ విధులను బహిష్కరించనున్నారు. ఇంజినీరింగ్ ఉద్యోగుల నుంచి క్షేత్ర స్థాయిలో కీలక పాత్ర పోషించే కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వరకూ అందరూ సమ్మెలో పాల్గోనున్న ట్టు ఏపీ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ జాయింట్ కమిటీ జిల్లా చైర్మన్ ప్రసాద్ ‘న్యూస్లైన్’కు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సుమారు వెయ్యి మందికిపైగా రెగ్యులర్, కాంట్రాక్టు సిబ్బంది విధులకు గైర్హాజరుకానున్నట్టు చెప్పారు. గతంలో ఉన్నతాధికారులు ఇచ్చిన హామీలను భేషరతుగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ర్టవ్యాప్తంగా చేపడుతున్న సమ్మెలో భాగంగా జిల్లాలోని విద్యుత్ ఉద్యోగులంతా విధులను బహిష్కరించి తమ నిరసనను వ్యక్తం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నిలిచిపోనున్న విద్యుత్ సేవలు విద్యుత్ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో జిల్లాలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఇప్పటికే ఓ వైపు విద్యుత్ సంక్షోభం, మరోవైపు రెండు రోజులుగా ఉద్ధృతంగా వీస్తున్న ఈదురు గాలులతో విద్యుత్ అంతరాయం ఏర్పడి తీవ్ర అవస్థలు పడుతున్న జిల్లా వాసులకు విద్యుత్ ఉద్యోగులు సమ్మెబాట పట్టడం గోరుచుట్టుపై రోకలిపోటు చందంగా మారనుంది. రెండు రోజులుగా జిల్లాలో వీస్తున్న గాలులతో చాలా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోగా, విద్యుత్ శాఖ అధికారులు శనివారం సాయంత్రం వరకు మరమ్మతు పనులు నిర్వహించారు. శనివారం రాత్రి కూడా ఈదురు గాలులు వీయడంతో పరిస్థితి పునరావృతమైంది. ఈ సమయంలో మరమ్మతులు చేయాల్సిన విద్యుత్ ఉద్యోగులు సమ్మెబాట పడుతుండడంతో జిల్లా వాసులకు విద్యుత్ కష్టాలు తప్పేలాలేవు. తమ డిమాండ్లపై ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించకుంటే పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని విద్యుత్ ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు.