Pirangipuram
-
గుంటూరులో దారుణం.. రెండో భార్య చిత్ర హింసలకు బాలుడు మృతి
సాక్షి, గుంటూరు: గుంటూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మొదటి భార్య సంతానమైన కవల పిల్లలను రెండో భార్య తీవ్రంగా హింసించింది. అంతటితో ఆగకుండా పండుగ వేళ ఆరేళ్ల బాబును గోడకేసి కొట్టడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. మరో బాలుడు తీవ్రంగా గాయపడటంతో అతడిని ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. ఫిరంగిపురం మండలంలోని గొల్లపాలెంకు చెందిన సాగర్ అనే వ్యక్తికి గతంలో వివాహం జరిగింది. సాగర్కు ముగ్గురు సంతానం. ముగ్గురిలో కార్తీక్, ఆకాష్ కవల పిల్లలు. కొద్ది రోజుల క్రితం మొదటి భార్య చనిపోవడంతో ఫిరంగిపురానికి చెందిన లక్ష్మిని ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు. మొదటి భార్య పిల్లలను లక్ష్మి తరచూ చిత్రహింసలకు గురిచేస్తోంది. పిల్లలను అడ్డు తొలగించుకోవాలని వారిని ప్రతీరోజు కొడుతూనే ఉండేది. ఈ క్రమంలో ఆదివారం దారుణంగా హింసిస్తూ చిన్న కుమారుడు కార్తీక్ను గోడకేసి కొట్టింది. దీంతో ఆ బాలుడు తల పగిలి అక్కడికక్కడేచనిపోయాడు. పెద్ద కుమారుడు ఆకాశ్ శరీరంపై రక్తం వచ్చేలా వాతలు పెట్టింది. దీంతో, ఆకాశ్కు తీవ్ర గాయాలు కావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. తాజాగా బాలుడి మరణంతో లక్ష్మి అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు.. లక్ష్మిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
చచ్చినా.. చావే!
పేరేచర్ల(ఫిరంగిపురం): గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం గుండాలపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీలో కాలనీ వాసుల్లో ఎవరైనా చనిపోతే వారి మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లాలంటే కాలనీ వాసులకు చచ్చే పనవుతుంది. శ్మశానవాటికకు వెళ్లాలంటే మోకాళ్ల లోతు వాగులో దిగి వెళ్లాల్సిన పరిస్థితి. ఇక చనిపోయిన వారి వెంట వచ్చే బంధువులు, మహిళలు ఆ వాగులో దిగాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వం ఇక్కడ వంతెన నిర్మిస్తామని చెప్పి.. పట్టించుకోకపోవడంతో పరిస్ధితి దయనీయంగా మారింది. చిన్న వర్షాలకే మోకాలి లోతు నీటిలో నడవాల్సి వస్తోందని, ఇక వరదలు వస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోకాలి లోతు నీటితో పాటు బురదలో కూడా మృతదేహాన్ని తీసుకెళ్లలేని పరిస్ధితి ఉంది. ఇలాంటి పరిస్ధితి ఎవరికీ రాకూడదని, దయచేసి వంతెన నిర్మిస్తే ఎస్సీ కాలనీ వాసులకే కాకుండా పొలాలకు వెళ్లే వారికి కూడా అనువుగా ఉంటుందని వారు కోరుతున్నారు. -
ఆటోని ఢీకొన్న లారీ: ఇద్దరి మృతి
గుంటూరు: ఫిరంగిపురంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఎదురుగా వస్తున్న ఆటోను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆటో డ్రైవర్, ఒక మహిళ మృతి మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు. గాయపడినవారిలో ఒక బాలుడు కూడా ఉన్నాడు. వారిని ఆస్పత్రికి తరలించారు.