పర్యాటకం పేరుతో.. పొట్టకొట్దొదు
పిచ్చుకలంక భూములే మాకు ఆధారం
మాకు జీవనోపాధి కల్పించాలి
లంక రైతుల ఆందోళన
బొబ్బర్లంక(ఆత్రేయపురం) :
కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందాన తయారయ్యాయి ప్రభుత్వ నిర్ణయాలు. ఎన్నో ఏళ్లుగా భూమిని నమ్ముకుని జీవిస్తున్న రైతులకు మొండి చేయి చూపించి పర్యాటకం పేరుతో ప్రభుత్వం వారి జీవనోపాధిని కాలరాసేలా వ్యవహరిస్తోందని రైతులు వాపోతున్నారు.
ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక గ్రామాన్ని అనుకుని ఉన్న పిచ్చుకలంకలో ఎన్నో ఏళ్లుగా రైతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. బొబ్బర్లంక గ్రామంలో సుమారు 100 కుటుంబాల వరకు పిచ్చుకలంక భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్నాయి. గ్రామంలో ఎటువంటి జిరాయితీ భూములు లేకపోవడంతో కూలీ పనులు దొరక్క వారు అల్లాడిపోతున్నారు. ఇటీవల బొబ్బర్లంక బ్యారేజీని ఆనుకుని పిచ్చుకలంకను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ ఉన్న 111.10 ఎకరాల్లో 43 ఎకరాలు పర్యాటక అభివృద్ధికి వినియోగిస్తామని తెలిపి పనులు చేపట్టింది. గోదావరిలో రూ.16 కోట్లతో డ్రెడ్జింగ్ ద్వారా పూడిక నిర్వహించేందుకు పర్యాటకశాఖాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యాటక కేంద్రానికి ఆనుకుని ‘యు’ ఆకారంలో ఉన్న కొంత భూమిని కూలీలు సాగుచేస్తూ జీవనోపాధి సాగిస్తున్నారు. తాము ఎంతో కష్టపడి సాగుచేసుకున్న భూమిని పర్యాటకం పేరుతో లాక్కుంటారా? అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం గతంలో చెప్పినా.. వాటి సరిహద్దులు మాత్రం ఇటీవలే ప్రకటించింది. గోదావరి గట్టు సుందరీకరణ ద్వారా అభివృద్ధి జరుగుతుందని, తాము అభివృద్ధికి ఆటంకం కాదని, అయితే ఈ నిర్ణయం వల్ల అభివృద్ధి ఎంత ముఖ్యమో తమ జీవనోపాధి కూడా అంత ముఖ్యమేనన్న విషయం ప్రభుత్వం తెలుసుకోవాలన్నారు. ఉన్న భూములో కొంత భాగం తీసుకుని మిగిలిన భూమి ఎప్పటిలాగే తమ జీవనోపాధికి అందించేలా చర్యలు తీసుకోవాలని బొబ్బర్లంక రైతులు కోరుతున్నారు.
పర్యాటక కేంద్రం అభివృద్ధికి కృషి
పర్యాటక కేంద్రం అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. గోదావరి నుంచి డ్రెడ్జింగ్ ద్వారా పూడిక పనులు నిర్వహిస్తున్నాం. పర్యాటక కేంద్రం చుట్టా ఆనుకుని ఉన్న భూమిని ఏక్సాల్ లీజుకు బొబ్బర్లంకు చెందిన సొసైటీకి అందించాం. ప్రస్తుతం పిచ్చుకలంక అభివృద్ధికి ఆ భూములను స్వాధీనం చేసుకుంటాం. దీనికి సంబదించిన పనులు నిర్వహిస్తున్నాం.
– బి. రాంబాబు , ఇరిగేషన్ ఎస్ఈ