breaking news
Pensions Survey
-
ప్ర'గతులు'
- ప్రభుత్వ పథకాలకు ఆదిలోనే అవరోధాలు - వేలాదిగా పింఛన్దారుల తొలగింపుపై విమర్శలు - కొండపిలో ‘జన్మభూమి -మా ఊరు’ లాంఛన ప్రారంభం నేడు శంకర్రావు వయస్సు 70 ఏళ్లు. రేషన్ కార్డులో తక్కువ వయస్సు నమోదైందని అతను ప్రభుత్వ పింఛన్ తీసుకోవడానికి అనర్హుడట. వయస్సు ధ్రువీకరణకు వైద్యుల దగ్గరకెళితే..మేమెలా నిర్ధారిస్తామని చెప్పి పంపారు. గత నాలుగేళ్లుగా ఠంచనుగా పింఛన్ పొందినా ప్రస్తుత సర్కారు వేసిన అనర్హత వేటుతో అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. శ్రీనివాసరావు ‘సదరమ్’ శిబిరంలో వికలాంగుడిగా అన్ని పరీక్షలు చేయించుకుని నాలుగేళ్లుగా ధ్రువీకరణ పత్రం కోసం ఎదురుచూస్తున్నాడు. సర్వే అధికారులు వచ్చినప్పుడు వికలాంగ ధ్రువీకరణ పత్రం లేదంటూ అతన్ని ప్రభుత్వ పింఛన్పొందేందుకు అనర్హుడిగా ప్రకటించారు. సర్టిఫికెట్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే ఓపిక లేక అతను ఆశలొదిలేసుకున్నాడు. సావిత్రమ్మ భర్త చనిపోయి ఏళ్లు గడిచాయి. అప్పట్లో తహశీల్దార్, గ్రామసర్పంచి పంచనామా జరిపి మరణ ధ్రువీకరణ పత్ర మిచ్చారు. ఇప్పుడేమో అది పనికిరాదంటూ ... వితంతు పింఛన్ తీసుకోవడానికి అనర్హురాలిగా సావిత్రమ్మ పేరును జాబితాలో నుంచి తొలగించారు. కొత్తగా ఆర్డీవో కార్యాలయం ద్వారా ధ్రువీకరణ తెచ్చుకోవాలట. ఇప్పటికప్పుడు సర్టిఫికెట్ తెచ్చుకోవాలంటే, ఖర్చు రూ.వేలల్లో భరించాల్సి రావడంతో ఆర్థికస్థోమత లేని ఆమె మౌనంగా ఉంది. సాక్షి, ఒంగోలు: గాంధీ జయంతి రోజునే ప్రారంభిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఆదిలోనే అవరోధాలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన పింఛన్ల సర్వే పూర్తయింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం రూ.500 తీసుకునే పింఛన్దారులు ఇకనుంచి నెలనెలా రూ.1000 నుంచి రూ.1500 వరకు అర్హతను బట్టి లబ్ధిపొందనున్నారు. ఇందుకోసం గత కొద్దిరోజులుగా జిల్లాలో అధికారులు, ప్రత్యేకంగా నియమించిన సర్వే కమిటీలు క్షేత్రస్థాయిలో పర్యటించి అనర్హుల పేర్లను తొలగించి.. అర్హుల జాబితాను తయారు చేశాయి. జిల్లాలో వృద్ధాప్య, వితంతు, వికలాంగ, చేనేత తదితర పింఛన్లు పొందుతున్న వారు ఇప్పటివరకు 3.12 లక్షల మంది ఉన్నారు. వీరిలో 34 వేల మందికిపైగా పేర్లను అనర్హుల జాబితాలోకి చేర్చారు. మరో రెండు వేల మంది ధ్రువపత్రాలకు సంబంధించి పరిశీలన ప్ర‘గతులు' కొనసాగుతోంది. కమిటీల్లో అధికారపార్టీ నేతలుండటంతో ఇష్టానుసారంగా అర్హులను తొలగించి.. తమ కార్యకర్తలు, అనుచరులకు లబ్ధిచేకూర్చడానికే పనిచేశారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొలగించిన జాబితాలో సుమారు 20 వేల మందికిపైగా పింఛన్దారులకు ఆధార్కార్డుల్లేవని తొలగించగా, మరికొందరికి వయస్సు తక్కువని, కొందరు వితంతువులు, వికలాంగులు కాదని, చేనేత కార్మికులే కాదంటూ తమకు నచ్చని పేర్లను తొలగించారు. టీడీపీ ఎమ్మెల్యే పరిధిలోని అత్యధిక గ్రామాల్లో కొందరిపై పనిగట్టుకుని కక్షపూరితంగా తొలగించారంటూ.. నిరుపేద (బీపీఎల్) కేటగిరీ కాదని, మరికొందరు గ్రామంలో ఉండకుండా వెళ్లిపోయారంటూ .. ఇలా రకరకాల కారణాలతో పింఛన్దారులను అర్హులజాబితాలో నుంచి తొలగించారు. సుజలం ఎలా..? ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’ పథకానికి ఆరంభంలోనే అవరోధాలు ఏర్పడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కనీసం, ఐదువేల గ్రామాల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రజలకు రూ.2కే 20 లీటర్ల శుద్ధిచేసిన నీటిని అందించాలని భావించారు. ఇప్పటికే పథకం అమలుకు మార్గదర్శకాలు విడుదలయ్యాయి. జనాభా ప్రాతిపదికన ఒక్కొక్క ప్లాంటుకు రూ.2 లక్షల (వెయ్యిలోపు జనాభా) నుంచి రూ.4 లక్షలు (మూడువేల లోపు జనాభా) వరకు ఖర్చవుతోందని అంచనా వేశారు. జిల్లాలో వెయ్యికి పైగా గ్రామాలుండగా, వీటి పరిధిలో 2290 ఆవాస ప్రాంతాలు (హేబిటేషన్స్) ఉన్నాయి. ఇందుకుగాను 818 ఆర్వోప్లాంట్లు పెట్టాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపారు. దాతలెవరూ ముందుకురాకపోవడం, కొన్ని రాజకీయ సమస్యల నేపథ్యంలో తొలిదశ లో మండలానికొకటి చొప్పున 56 ఆర్వోప్లాంట్లు అమల్లోకి తెస్తున్నట్లు జిల్లామంత్రి సిద్ధా రాఘవరావు వెల్లడించారు. ఈ పథకానికి ఎలాంటి నిధులు విదల్చని ప్రభుత్వం ..దాతలను సమీకరించి ప్లాంట్లను ఏర్పాటుచేయాలని రెండ్నెల్లకిందట స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అప్పట్నుంచి విడతలవారీగా జిల్లాలోని కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ఇతర దాతలతో జిల్లామంత్రి సిద్ధా రాఘవరావు, కలెక్టర్ జేఎస్ఆర్కేఆర్ విజయ్కుమార్లు సమావేశాలు నిర్వహించారు. ఎన్నిసార్లు సమీక్షించినా.. సమావేశాలు పెట్టినా.. వారినుంచి అనుకున్నంత స్పందన రాలేదు. అక్టోబర్ రెండు నాటికి జిల్లాలో 56 ప్లాంట్లు అమల్లోకి తేవాలని అనుకున్నా... అధికారుల అంచనాలు తలకిందులయ్యాయి. ఒక్క కొండెపి నియోజకవర్గంలో 9 ప్లాంట్ల ఏర్పాటుకు మార్గం సుగమం కాగా .. ఆ నియోజకవర్గంలోని అనకర్లపూడి గ్రామంలోని ప్లాంటును మంత్రి సిద్ధా రాఘరావు గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. నిధులివ్వని ‘జన్మభూమి - మా ఊరు’ రోజుకో గ్రామంలో ‘జన్మభూమి - మా ఊరు’ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాలో గురువారం నుంచి ఈ నెల 21 వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రత్యేకంగా పర్యవేక్షణకు ప్రభుత్వం సీనియర్ ఐఎఎస్ ఎ. కరికాలవలన్ను నియమించింది. మండలంలో 14 గ్రామాలుంటే ఒక బృందం, 25 గ్రామాలుంటే రెండు, అంతకు మించితే మూడు బృందాలుగా అధికారులను ఇప్పటికే విభజించారు. ఒంగోలు నగరంలో రోజుకు నాలుగుచోట్ల, చీరాల, మార్కాపురం, కందుకూరుల్లో రోజుకు మూడుచోట్ల సభలకు ఏర్పాటు చేసుకోవాలి. వీటికి ఎంపీడీవో, తహశీల్దార్, కమిషనర్, ఇతర అధికారులు నేతృత్వం వహిస్తారు. బ్యానర్లు, ప్రదర్శనలు, అవగాహన సదస్సులతో ప్రచారం కల్పించాలి. పింఛన్ల పంపిణీతో పాటు ప్రజల సమస్యలకు తక్షణపరిష్కారాలు చూపేందుకు అధికారులు పనిచేయాలి. అయితే, జిల్లాకు ప్రత్యేక నిధులు విడుదల కాకుండా అభివృద్ధిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది అధికారుల అంతర్మథనం. జిల్లాకోరోజు పర్యటిస్తానని ఇప్పటికే ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు .. ‘ప్రకాశం’ పర్యటనలో రెండు నియోజకవర్గాలు వచ్చేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. -
పారదర్శకతకు పాతర.. పింఛన్ల జాతర
పలాస: కమిటీల నిండా అధికార పార్టీ నేతలు.. వారి ఇళ్లలోనే జాబితాల పరిశీలనలు.. సవాలక్ష కొర్రీలు.. ఇవన్నీ చూస్తున్న పింఛనుదారులకు బెంగ పట్టుకుంది. అర్హులకు పింఛన్లు అందుతాయో లేదో.. తుది జాబితాలో తమ పేర్లు ఉంటాయో లేదోనన్న ఆందోళన వృద్ధులు, వితంతువులు, వికలాంగుల్లో నెలకొంది. వీరందరికీ ప్రస్తుతం ఇస్తున్న పింఛన్ మొత్తాలను పెంచుతామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. దానికి ముందు ప్రస్తుత లబ్ధిదారుల్లో చాలామంది అనర్హులు ఉన్నారంటూ ప్రత్యేక కమిటీలు వేసి గ్రామస్థాయిలో సర్వే నిర్వహిస్తోంది. రాజకీయ ప్రాబల్యంతో ఏర్పాటైన ఈ కమిటీల సర్వేపై మొదటి నుంచీ అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ‘సాక్షి’ మంగళవారం జిల్లావ్యాప్తంగా సర్వే జరుగుతున్న తీరును పరిశీలించినప్పుడు లబ్ధిదారుల ఆందోళన నిజమేనని తేలింది. ఎన్నికల్లో ఓడిన వారికి కమిటీల్లో చోటు కీలకమైన సర్వే నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన కమిటీల్లో తెలుగుదేశం కార్యకర్తలను సభ్యులుగా నియమించారు. అందులోనూ పంచాయతీ, మండల, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి, ప్రజల తిరస్కరణకు గురైన వ్యక్తులను నియమించారు. వైఎస్ఆర్ కాంగ్రె స్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్న చోట అడ్డగోలుగా జరిపిన ఈ నియామకాల వల్ల తమకు ఓట్లు వేయని లబ్ధిదారుల పేర్లను ఏదో ఒక సాకుతో తొలగించేందుకు అవకాశమిచ్చినట్లేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండల కమిటీల్లో ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీడీవో, ఇద్దరు ఎంపీటీసీలు, ఇద్దరు సర్పంచులు ఉండాలి. గ్రామ పంచాయితీ కమిటీలో సర్పంచి, ఎంపీటీసీ, సెక్రటరీతో పాటు ఒక ఎస్సీ లేక ఎస్టీ, ఇద్దరు సామాజిక కార్యకర్తలను నియమించాలి. మెజారిటీ కమిటీల్లో ఈ పద్ధతి పాటించనేలేదు. ప్రహసనంగా పరిశీలన కమిటీల పరిశీలన కూడా ప్రహసనంగా సాగింది. ఈ నెల 18 నుంచి 23(మంగళవారం) వరకు ప్రస్తుత పింఛనుదారుల అర్హతల పరిశీలనతోపాటు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారి అర్హతలను పరిశీలించాల్సి ఉంది. అయితే ఇదంతా తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలా సాగిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో అన్ని రకాలు కలుపుకొని 2,61, 871 మంది పింఛనుదారులు ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరెడ్డి హయాం నుంచీ వీరిలో చాలామంది ఫించన్లు అందుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కొత్తవారికి పింఛన్లు మంజూరు చేయాల్సింది పోయి బోల్డన్ని షరతులు పెట్టి పాతవారిని తొలగిం చేందుకు ప్రయత్నిస్తోందని లబ్ధిదారులు విమర్శస్తున్నారు. పరిశీలన పేరిట వృద్ధులు, వికలాంగులను టీడీపీ నాయకులు తమ ఇళ్ల చుట్టూ తిప్పుకుంటున్నారు. కొన్ని చోట్ల గ్రామ సభలు నిర్వహిస్తున్నా.. పరిశీలన పేరిట గంటల తరబడి వృద్ధులను ఎండలో నిలబెట్టేస్తున్నారు. మరికొన్ని చోట్ల స్థానిక ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్దే సభలు జరుగుతున్నాయి. పలాస- కాశీబుగ్గ మున్సిపాలిటీలోని ఏడో వార్డులో ఆ వార్డు కౌన్సిలర్ ఇంటి వద్దే మంగళవారం దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన కార్యక్రమం జరిగింది. కమిటీలో కీలకమైన మున్సిపల్ కమిషనర్ లేకుండానే ఈ కార్యక్రమం జరగడం విశేషం. ఎక్కడ కూడా లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పరిశీలన చేయడం లేదు. కొంతమందికి పరిశీలన జరుగుతున్న విషయమే తెలియడం లేదు. ఈ పరిస్థితుల్లో ఉన్న పింఛన్లు కొనసాగుతాయో లేదో.. కొత్తవి వస్తాయో రాదో తెలియక పేదలు ఆందోళన చెందుతున్నారు. అర్హులందరికీ పింఛన్లు అర్హులందరికీ పింఛన్లు అందుతాయి. వారిని గుర్తించేందుకే క్షేత్ర స్థాయిలో కమిటీలు వేశాం. గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. అంతా పారదర్శకంగా జరుగుతుంది. నిబంధనల మేరకే ఎంపిక కమిటీలను వేశాం. ఇందులో ఎటువంటి లోపాలు లేవు. -తనూజారాణి, ప్రాజెక్ట్ డెరైక్టర్, డీఆర్డీఏ తప్పులు జరిగితే అధికారులదే బాధ్యత ఫించన్ల సర్వేలో కమిటీల పాత్ర నామమాత్రమే. అవకతవకలు జరగడానికి ఆస్కారం లేదు. తప్పులు జరిగితే అధికారులే బాధ్యత వహిస్తారు. ఈ విషయాన్ని టెలీకాన్ఫరెన్సులోనే సీఎం స్పష్టం చేశారు. అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగితే వారికే నష్టం. -జి.ఎస్.ఎస్. శివాజీ, పలాస ఎమ్మెల్యే -
పింఛన్ల సర్వేలో టీడీపీ జులుం సరికాదు
రిమ్స్క్యాంపస్:ప్రభుత్వం చేపడుతున్న పింఛన్ల సర్వేలో టీడీపీ నాయకులు, కార్యకర్తల జులం సరికాదని వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో ఆమె మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పింఛన్ల సర్వేను వారి ఇళ్లలో జరిపిస్తున్నారన్నారు. దీన్ని బట్టి కేవలం ఆ పార్టీ మద్దతుదారులకు మాత్రమే పెన్షన్ వచ్చేలా కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయూలకు అతీతంగా పింఛన్లు మంజూరు చేయగా.. టీడీపీ ప్రభుత్వం మాత్రం కేవలం తమ పార్టీ వారికే పెన్షన్లు వచ్చేలా చర్యలకు పాల్పడటం అన్యాయమన్నారు. వచ్చే నెల ఆరో తేదీన వైఎస్ఆర్సీపీ జిల్లా సర్వ సభ్యసమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. పార్టీ బీసీసెల్ రాష్ర్ర్ట అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలన ఏకపక్షంగా జరుగుతోందన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా అభివృద్ధిపై దృష్టిసారించకుండా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో పార్టీ నాయకులు దువ్వాడ శ్రీనివాస్, గొర్లె కిరణ్కుమార్, అందవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, రొక్కం సూర్యప్రకాష్, కోరాడ రమేష్ పాల్గొన్నారు.