breaking news
Pellicupulu
-
తమిళులకూ పెళ్లి చూపులు
ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ చూపులు మన తెలుగు సినిమా ‘పెళ్లి చూపులు’పై పడ్డాయి. కొత్త దర్శకుడు తరుణ్భాస్కర్ రాసిన కథ, తీసిన విధానం ఆయనకు బాగా నచ్చడంతో తమిళ ప్రేక్షకులకూ ‘పెళ్లి చూపులు’ చూపించాలని డిసైడ్ అయ్యారు. తమిళంలో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారాయన. ‘‘గౌతమ్ మీనన్ మా సినిమా చూసి ప్రశంసించడంతో పాటు తమిళంలో రీమేక్ చేస్తానని రైట్స్ తీసుకోవడం హ్యాపీగా ఉంది. తమిళ రీమేక్కు ఆయన దర్శకత్వం వహించడం లేదు. దర్శకత్వ బాధ్యతలు మరొకరికి అప్పగించి, నిర్మాతగా వ్యవహరించనున్నారు’’ అని ‘పెళ్లి చూపులు’ నిర్మాతల్లో ఒకరైన రాజ్ కందుకూరి ‘సాక్షి’తో చెప్పారు. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా నటించిన ఈ చిత్రం తెలుగులో చిన్న సినిమాగా విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
మన సినిమాలకు కొత్త చూపు
చిత్రం: ‘పెళ్ళిచూపులు’, నిర్మాతలు: రాజ్ కందుకూరి, యశ్ రంగినేని, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: తరుణ్ భాస్కర్ జీవితం సినిమాలా ఉండదు. కానీ, సినిమా గనక జీవితంలా ఉండగలిగితే? కచ్చితంగా రొటీన్ కమర్షియల్ ఫిల్మ్స్ నుంచి రిలీఫ్గా ఉంటుంది. ‘పెళ్ళి చూపులు’ అలాంటిదే! ఇంజనీరింగ్ పూర్తి చేయలేని ప్రశాంత్ (విజయ్ దేవరకొండ) వంటల్లో దిట్ట కావాలనుకుంటాడు. పెళ్ళయితే జీవితం కుదుటపడుతుందన్న జోస్యుడి మాటలతో, హీరోని పెళ్ళిచూపులకు తీసుకువెళతాడు తండ్రి (కేదార్ శంకర్). అక్కడ పెళ్ళిచూపుల్లో విచిత్ర పరిస్థితుల్లో చిత్ర (రీతూ వర్మ)ను కలుస్తాడు. ఎం.బి.ఏ చదివిన చిత్ర ఆస్ట్రేలియా వెళ్ళి, పై చదువులు చదవాలనుకుంటుంది. అందుకు డబ్బు సంపాదించడానికి వీలుగా సంచార ఆహారశాలగా ‘ఫుడ్ ట్రక్’ను పెట్టడానికి సిద్ధపడుతుంది. ఆమె తండ్రి (గురురాజ్ మానేపల్లి) మాత్రం పెళ్ళి చేయాలనుకుంటూ ఉంటాడు. వచ్చిన సంబంధాల్ని హీరోయిన్ తిప్పికొడుతుంటుంది. ఆ టైమ్లో పొరపాటు అడ్రస్కు హీరో వెళ్ళడంతో, హీరో హీరోయిన్ల పెళ్ళిచూపుల వుతాయి. ‘ఫుడ్ ట్రక్’ ఐడియాకూ, ‘షెఫ్’ కావాలన్న హీరో కలకూ ముడి కుదురుతుందని హీరోయిన్, హీరోని అడుగుతుంది. మరి, ఫుడ్ ట్రక్ ఐడియా, హీరోయిన్ ఆస్ట్రేలియా కల ఏమయ్యాయన్నది మిగతా ఫిల్మ్. ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్లో ఫస్టాఫ్ అంతా ఈ కాలపు కాలేజీ కుర్రాళ్ళ ప్రవర్తన, పిల్లల్ని స్థిరపడేలా చేయడంపై తల్లితండ్రుల ఆందోళనతో వినోదాత్మకంగా నడుస్తుంది. స్ట్రెయిట్ నేరేషన్లో సెకండాఫ్ అంతా సినిమాలో అసలు కథ, పాత్రల మధ్య సిసలైన అంతః సంఘర్షణ, కెరీర్ తొలి దశలో కుర్రకారుకుండే శంకలు, స్వతహాగా మంచివాళ్ళయినా స్నేహితుల మధ్య వచ్చే సగటు ఇగో సమస్యలు, ప్రేమను వ్యక్తీకరించడానికి అహం అడ్డొచ్చే సందర్భాలు - ఇలా మరింత బలమైన భావోద్వేగాలతో నడుస్తుంది. పాత్రల ప్రవర్తనలో, స్క్రిప్టులో ఎన్నో పొరలున్నట్లు, తెలివిగా అల్లుకున్నట్లు అర్థమవుతుంది. వీడియో కుకింగ్ పాఠాలు, వైరల్ వీడియో, వెర్రివేషాల ప్రాంక్ వీడియోల లాంటి నేటి ట్రెండ్స్ చాలా ఫిల్మ్లో ఉన్నాయి. గతంలో ‘అనుకోకుండా’, ‘సైన్మా’ లాంటి లఘు చిత్రాలకు దర్శకత్వం వహించిన యువకుడు తరుణ్ భాస్కర్కు ఇది తొలి సినిమా. దాదాపు పూర్తిగా స్థానిక హైదరాబాద్ టాలెంట్ నటించిన చిత్రమిది. ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్ విజయ్ దేవరకొండ, రీతూ వర్మ, హీరో ఫ్రెండ్స్గా తెలంగాణ మాండలికంలో మాట్లాడే ప్రియదర్శి, అభయ్ - ఇలా ప్రతి ఒక్కరూ చాలా సహజమైన పాత్రలుగా అనిపిస్తారే తప్ప, నటించారన్న ఫీలింగ్ రాదు. యువ సంగీత దర్శకుడు వివేక్ సాగర్కీ ఇదే తొలి చిత్రం. పరిమిత బడ్జెట్లో తీసినప్పటికీ తెరపై సినిమా రిచ్గా కనిపించడం (కెమేరా నాగేశ్), అనుభూతి పెంచే నేపథ్య సంగీతం, గానం ఈ సినిమాకున్న పెద్ద బలం. మనసుకు పట్టే సీన్లూ చాలా ఉన్నాయి. సినిమాలో చాలా పాత్రలు నిత్యం మనకు తారసపడేవే! అందుకే, తెరపై మనల్ని మనం చూసుకుంటాం. సహజమైన డైలాగులు, జోక్లు నవ్విస్తాయి. ఒక్కముక్కలో నాగేశ్ కుకునూర్ ‘హైదరాబాద్ బ్లూస్’, శేఖర్ కమ్ముల ‘ఆనంద్’ ట్రెండ్కి కొనసాగింపు... తెలుగు సిన్మా ఆలస్యంగానైనా అసలంటూ మారుతోందనడానికి నిదర్శనం... సకుటుంబ సత్కాలక్షేపం - ఈ ‘పెళ్ళిచూపులు’. - రెంటాల జయదేవ -
మా బ్యానర్లో తరుణ్ ఓ చిత్రం చేయాలి!
‘‘ట్రైలర్ చూస్తుంటే సినిమా ఎంత బావుంటుందో తెలుస్తోంది. యంగ్ టీం అంతా కష్టపడి మంచి సినిమా తీశారు. తప్పకుండా ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. పాటలు వింటుంటే వివేక్ సాగర్ ఈ చిత్రం కోసం ఎంత ఎఫర్ట్ పెట్టాడో తెలుస్తోంది. నాగేష్ సినిమాటోగ్రఫీ బాగుంది. డెరైక్టర్ తరుణ్ భాస్కర్ మా బ్యానర్లో ఓ చిత్రం చేయాలని కోరుకుంటున్నా’’ అని నిర్మాత డి.సురేశ్బాబు అన్నారు. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రాజ్ కందుకూరి, యస్. రాగినేని నిర్మించిన చిత్రం ‘పెళ్లిచూపులు’. వివేక్ సాగర్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని సురేశ్బాబు విడుదల చేసి దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు అందించారు. ట్రైలర్ను హీరో సందీప్ కిషన్, దర్శకుడు క్రాంతిమాధవ్ విడుదల చేశారు. చిత్రదర్శకుడు మాట్లాడుతూ- ‘‘రియల్ లైఫ్ స్టోరీతో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టై నర్గా తెరకెక్కిన చిత్రమిది. నా తల్లితండ్రుల్లా ఈ చిత్ర నిర్మాతలు సపోర్ట్ చేశా రు. మాకు బాగా సహకరించిన సురేశ్బాబుగారికి కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘నేనీ చిత్రం చేయడానికి కారణం సురేశ్బాబుగారు. తరుణ్ భాస్కర్ను ఆయన నా వద్దకు పంపి స్టోరీ వినమన్నారు. భవిష్యత్లో నేను నిర్మించే చిత్రాల్లో ‘పెళ్లి చూపులు’ గర్వపడే చిత్రమవుతుందనే నమ్మకం ఉంది’’ అని నిర్మాతల్లో ఒకరైన రాజ్ కందుకూరి చెప్పారు. నిర్మాతలు యస్. రాగినేని, అశోక్కుమార్, కేఎల్ దామోదర ప్రసాద్, దర్శకులు అల్లాణి శ్రీధర్, దశరథ్, హీరోయిన్ లావణ్యాత్రిపాఠి, సంగీత దర్శకులు వివేక్ సాగర్, రఘు కుంచె తదితరులు పాల్గొన్నారు.