pedagottipadu
-
పెదగొట్టిపాడులో మళ్లీ ఉద్రిక్తత
ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడులో మళ్లీ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. బుధవారం ‘ఛలో గొట్టిపాడు’కు పిలుపునిచ్చిన సీపీఐ, సీపీఎం, దళిత, ప్రజా సంఘాల నేతలు ఉదయానికే ప్రత్తిపాడు చేరుకున్నారు. అప్పటికే బలగాలతో సిద్ధంగా ఉన్న పోలీసులు వీరిని అడుగడుగునా అడ్డుకున్నారు. అక్కడే బైఠాయించి నిరసన తెలుపుతున్న నాయకులను పోలీసులు బలవంతంగా వ్యానులోకి ఈడ్చేశారు. విషయం తెలుసుకున్న పెదగొట్టిపాడులో దళిత మహిళలు స్థానిక అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం విగ్రహాన్ని నీటితో శుద్ధి పరిచారు. తొలుత గ్రామం చుట్టూ పోలీసులు తొమ్మిది చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. తనిఖీ చేశాకే వాహనాలను గ్రామంలోకి అనుమతించారు. గుంటూరు, ప్రత్తిపాడు: పెదగొట్టిపాడులో మళ్లీ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ నెల ఒకటిన గ్రామంలోని ఇరువర్గాలకు మధ్య ఘర్షణ జరగడం, పోలీసులు, రెవెన్యూ అధికారులు ఇరువర్గాలతో చర్చలు జరిపి శాంతి కమిటీలు ఏర్పాటు చేయడంతో ఇరవై రోజులుగా గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో బుధవారం ఛలో గొట్టిపాడుతో గ్రామంలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తమను పరామర్శించేందుకు వస్తున్న సీపీఐ, సీపీఎం, దళిత, ప్రజా సంఘాల నేతలను పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ పెదగొట్టిపాడు దళితవాడలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట మహిళలు బైఠాయించారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ అంబేడ్కర్ విగ్రహాన్ని నీటితో కడిగి శుద్ధి చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని, అవతలి వర్గం నుంచి తమకు రక్షణ కల్పించాలి, ఘర్షణలో అసలైన నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. స్పందించిన డీఎస్పీ మూర్తి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎలాంటి అపోహలకు తావులేదని హామీ ఇవ్వడంతో వారు నిరసన విరమించారు. డీఎస్పీలు రమేష్కుమార్, ఆర్వీఎస్ఎన్ మూర్తిల ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు. అడుగడుగునా విస్తృత తనిఖీలు.. చలో గొట్టిపాడు నేపథ్యంలో పోలీసులు ప్రత్తిపాడు, గొట్టిపాడులకు వచ్చే అన్ని మార్గాలనూ జల్లెడ పట్టారు. మొత్తం తొమ్మిది చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన వచ్చే, పోయే ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు. ఆధార్ కార్డు, గుర్తింపు కార్డుల ఆధారంగా వారిని గ్రామాల్లోకి అనుమతించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ద్విచక్రవాహనాలపై వెళ్లే వారిని సైతం వదల్లేదు. గొట్టిపాడు వెళ్లేందుకు అవకాశం ఉన్న పొలాల గట్లపైనా పోలీసులు గస్తీ నిర్వహించారు. జిల్లా అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయారావు ప్రత్తిపాడు, గొట్టిపాడు, ఉన్నవ, బోయపాలెం, జాతీయ రహదారిపై బందోబస్తును పర్యవేక్షించారు. అడిషనల్ ఎస్పీలు వైటీ నాయుడు, సుబ్బరాయుడులు పరిస్థితిని సమీక్షించారు. ఎక్కడికక్కడే ముందస్తు అరెస్టులు.. చలో గొట్టిపాడును నిర్వీర్యం చేసేందుకు అడుగడుగునా ముందస్తు అరెస్టులు చేశారు. ప్రత్తిపాడులో సీపీఐ మండల అధ్యక్షుడు రామిశెట్టి ఆదేశ్వరరావు, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి ఆదినారాయణ, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవలి సుబ్బారావు, సీపీఎం మాజీ ప్రత్తిపాడు కార్యదర్శి రాజుపాలెం కోటేశ్వరరావును ప్రత్తిపాడులో, వ్యవసాయకార్మిక సంఘం డివిజన్ కార్యదర్శి కారుచోల రోశయ్యను తూర్పుపాలెంలో, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర చైర్మన్ కొరివి వినయ్కుమార్, సీనియర్ న్యాయవాదులు వైకె, శాంతకుమార్లను తిక్కిరెడ్డిపాలెంలో.. ఎక్కడికక్కడ ముందస్తుగా అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. తిక్కిరెడ్డిపాలెం బ స్టాండు వద్ద, స్పందన సూ ్టడియో ఎదుట, పాతమల్లాయపాలెం కూడలిల్లో ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీ ల నాయకులు రోడ్లపై బైఠాయించి తమ నిరసనలను తెలిపేందుకు ప్రయత్నించా రు. వీరి కార్యక్రమాలను పోలీసులు భగ్నం చేశారు. నేతల అరెస్టులు పట్నంబజారుః చలో గొట్టిపాడుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో వామపక్షాల నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్లు చేశారు. సీపీఎం, సీపీఐ, దళిత, ప్రజా సంఘాల నేతలను అరెస్టులు చేసి గుంటూరు నగరంతో పాటు రూరల్ పోలీసుస్టేషన్లకు తరలించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను ప్రత్తిపాడులో అరెస్టు చేసి ముందుగా పట్టాభిపురం పోలీసుస్టేషన్కు తరలించారు. అక్కడ నుంచి తిరిగి నగరంపాలెం పోలీసుస్టేషన్ పంపారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, జిల్లా కార్యదర్శి పాశం రామారావులతో పాటు మరికొంత మంది నేతలను నల్లపాడు పోలీసుస్టేషన్కు తరలించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్కుమార్, బలహీనవర్గాల జే ఏసీ నేత వైవీ సురేష్తో పాటు విజయవాడ నుంచి వచ్చిన దళిత సంఘాల నేతలను పాతగుంటూరు పోలీసుస్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని నగరంపాలెం, పట్టాభిపురం, అరండల్పేట, పాతగుంటూరు, లాలాపేట పోలీసుస్టేషన్లో పాటు వామపక్షాల అనుబంధ విభాగాల నేతలు పలువురిని సీసీఎస్కు తరలించారు. ఆయా ప్రాంతాల్లో అరెస్ట్ చేసిన వామపక్షాలు, దళిత, ప్రజా సంఘాల నేతలను సాయంత్రం వరకు స్టేషన్లలోనే ఉంచారు. 100 మంది వరకు ఆయా స్టేషన్లోనే ఉంచి, సొంతత పూచీకత్తులపై విడిచి పెట్టారు. అగ్రకులాల కొమ్ము కాస్తున్న ప్రభుత్వం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కొరిటెపాడు(గుంటూరు):రాష్ట్ర ప్రభుత్వం అగ్రకులాలకు కొమ్ముకాస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఆరోపించారు. నగరంపాలెం పోలీసుస్టేషన్లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ గొట్టిపాడులో దళితులపై దాడి చేసినా ఏ మాత్రం స్పందించకుండా మౌనంగా ఉండటం దారుణమన్నారు. కేసులను నిర్వీర్యం చేసే కుట్ర పన్నుతోందని ద్వజమెత్తారు. ఒకవైపు దళితులపై దాడులు చేయిస్తూనే మరో వైపు ఈ నెల 26 నుంచి దళిత తేజం పేరిట కార్యక్రమాలు నిర్వహించేం దుకు ఏర్పాట్లు చేయడం బాధాకరమన్నారు. గొట్టిపాడులో దళితులను పరామర్శించడానికి వెళుతున్న తమను ఎందుకు పోలీసులు అడ్డుకున్నారో తెలియడం లేదన్నారు. దళితులను పరిరక్షించాల్సిన ప్రభుత్వం అగ్రవర్ణాలకు కొమ్ముకాస్తూ దళితులకు అన్యాయం చేస్తుందన్నారు. -
వ్యథలో ఊరటగా.. ఆపదలో బాసటగా...
⇒మట్టిపెళ్లలు విరిగిపడి మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించిన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ⇒పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని భరోసా ⇒అవసరమైతే కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తామని వెల్లడి ⇒గన్నవరం నుంచి పెదగొట్టిపాడు వరకు ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా.... ఏ ఆపద వచ్చినా.. ఆత్మీయుడిలా, ఆత్మబంధువులా ‘నేనున్నా’నంటూ వచ్చి, బాధితులకు భరోసానిచ్చి, ఆ కుటుంబీకుల్లో మనోధైర్యం నింపే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోమారు శుక్రవారం జిల్లాలో పర్యటించారు. గుంటూరు లక్ష్మీపురంలో ఈ నెల 14న మట్టిపెళ్లలు విరిగిపడి మృతి చెందిన వారి కుటుంబాలను పెదగొట్టిపాడులో పరామర్శించి ఓదార్చారు. తానున్నానంటూ ధైర్యాన్నిచ్చారు. మీ వెంటే ఉండి పోరాడతానని భరోసానిచ్చారు. పది రోజుల్లో పూర్తి స్థాయిలో న్యాయం జరగకపోతే కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తామని, తాను కూడా పాల్గొంటానని మాటిచ్చారు. గుంటూరు : గుంటూరు లక్ష్మీపురంలోని భవన నిర్మాణ పనుల్లో ఇటీవల ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడుకు చెందిన ఏడుగురు మృతి చెందారు. మృతుల కుటుంబాలను ఓదార్చి వారిలో మనోధైర్యం నింపేందుకు శుక్రవారం జిల్లాకు వచ్చిన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి అడుగడుగునా జనం నీరాజనం పలికారు. కృష్ణా జిల్లా గన్నవరం నుంచి గుంటూరు జిల్లా పెదగొట్టిపాడు వరకు జననేత కోసం జనసంద్రంలా తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. గన్నవరంలో ఘనస్వాగతం ఉదయం 9.15 గంటలకు విమానంలో గన్నవరం చేరుకున్న జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం లభించింది. పార్టీ కృష్ణా, గుంటూరు జిల్లాల అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు స్వాగతం పలికారు. శ్రేణులకు అభివాదం చేస్తూ అందరితో మాట్లాడుతూ అక్కడి నుంచి జగన్ బయలుదేరారు. గన్నవరం ఎయిర్పోర్టు సమీపంలో పశువైద్య కళాశాల విద్యార్థుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు. వైద్య విద్యార్థులు తమ సమస్యలను ఏకరువు పెట్టి తమ పక్షాన పోరాడి న్యాయం చేయాలని విన్నవించారు. దీంతో జగన్వారికి భరోసానిచ్చి అక్కడి నుంచి గుంటూరు పయనమయ్యారు. తాడేపల్లి వద్ద నిర్వాసితులు జగన్ను కలిసి తమ గోడు విన్నవించారు. ముస్లిం సంప్రదాయ రీతిలో సత్కారం... ప్రత్తిపాడు పెట్రోలు బంకు సెంటర్కు చేరుకున్న జగన్కు ప్రత్తిపాడు మండల నాయకులు, గ్రామ నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వాగతం పలికారు. అక్కడ దివంగత జగ్జీవన్రామ్, బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి పాతమల్లాయపాలెం సెంటర్లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పెద్ద సంఖ్యలో వచ్చిన గ్రామస్తులను ఆత్మీయంగా పలకరించి ముందుకు సాగారు. అంకమ్మతల్లి దేవస్థానంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి పెదగొట్టిపాడుకు పయనమయ్యారు. మధ్యంలో వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ నేతలు షేక్ జిలానీ, గులాం రసూల్ పలువురు పెద్ద సంఖ్యలో మైనార్టీలతో తరలి వచ్చి జగన్ను ముస్లిం సంప్రదాయ రీతిలో సత్కరించారు. అక్కడి నుంచి పెదగొట్టిపాడు చేరుకున్న జగన్ గ్రామ సర్పంచ్ గుంటుపల్లి బాబురావు నివాసంలో అల్పాహారం స్వీకరించారు. ముఖ్యనేతల హాజరు పార్టీ ముఖ్య నేతలు బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మోపిదేవి వెంకటరమణ, కృష్ణా, గుంటూరు జిల్లాల అధ్యక్షులు కొలుసు పార్థసారథి, మర్రి రాజశేఖర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్, పార్టీ ఎమ్మెల్యేలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే), కోన రఘుపతి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, షేక్ మొహమ్మద్ ముస్తఫా, కొక్కిలిగడ్డ రక్షణనిధి, విజయవాడ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, కృష్ణా జిల్లా సమన్వయకర్తలు మొండితోక జగన్మోహన్రావు, డాక్టర్ దుట్టా రామచంద్రరావు, జోగి రమేష్, దూలం నాగేశ్వరరావు, సింహాద్రి రమేష్బాబు, గుంటూరు జిల్లా సమన్వయకర్తలు మేకతోటి సుచరిత, రావి వెంకటరమణ, అన్నాబత్తుని శివకుమార్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కావటి మనోహరనాయుడు, పార్టీ నేతలు రాతంశెట్టి రామాంజనేయులు, కిలారి రోశయ్య, ఆతుకూరి ఆంజనేయులు, నసీర్ అహ్మద్, గులాం రసూల్, నూనె ఉమామహేశ్వరరెడ్డి, శానంపూడి రఘురామిరెడ్డి, పోలూరి వెంకటరెడ్డి, మేరా జ్యోత్ హనుమంతునాయక్, బండారు సాయిబాబు, కొలకలూరి కోటేశ్వరరావు, కొత్తా చిన్నపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇళ్లు కోల్పోతున్నాం.... రోడ్డు విస్తరణ, పుష్కర ఘాట్ల నిర్మాణ పనుల వల్ల తాము ఇళ్లు కోల్పోతున్నామని, న్యాయం చేయాలని, తమ పక్షాన అండగా నిలిచి పోరాటం చేయాల్సిందిగా కనకదుర్గ వారధి వద్ద నిర్వాసితులు పెద్ద సంఖ్యలో జగన్ను కలిసి విన్నవించుకున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) నేతృత్వంలో స్థానిక నాయకుడు బుర్రముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి, నిర్వాసితులు పెద్ద సంఖ్యలో జగన్కు వినతి పత్రం అందజేశారు. దీనికి స్పందించిన జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, ఏ ఒక్కరికి నష్టం జరిగినా ఉపేక్షించబోమని భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి గుంటూరు నగరం మీదుగా పెదగొట్టిపాడుకు పయనమయ్యారు. మార్గం మధ్యలో ఏటుకూరు సెంటర్లో గుంటూరు రూరల్ మండల నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. పుల్లడిగుంటలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి ఐదో మైలు సెంటర్కు చేరుకున్న జగన్కు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. మృతుల కుటుంబాలకు ఓదార్పు ... లక్ష్మీపురంలో మట్టి పెళ్లలు విరిగి పడడంతో ఏడుగురు కార్మికులు మృతి చెందగా, మరొకరు చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో జగన్ పెదగొట్టిపాడులోని ఏడుగురు ఇళ్లకు వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మృతులంతా ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో అక్కడ ఉద్వేగ వాతావరణం నెలకొంది. వరుసగా జొన్నలగడ్డ ప్రశాంత్, బత్తుల సునిల్, బూసి సలోమాన్, బత్తుల రాజేష్, తురకా శేషుబాబు, తురకా రాకేష్కుమార్, జొన్నలగడ్డ సుధాకర్ ఇళ్లకు వెళ్ళి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిలో మనోధైర్యం నింపారు. పది రోజుల్లో పూర్తి స్థాయిలో న్యాయం జరగకపోతే కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తామని, ధర్నాలో తాను కూడా పాల్గొంటానని, అందరికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని జగన్ భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి గన్నవరం వెళ్లారు. -
అధికారులు బెదిరిస్తున్నారని వైఎస్ జగన్ కు ఫిర్యాదు
తాడేపల్లి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని శుక్రవారం తాడేపల్లి కేఎల్ రావు నగర్ వాసులు కలిశారు. గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన కొద్దిసేపు తాడేపల్లిలో ఆగారు. ఈ సందర్భంగా కేఎల్ రావు నగర్ వాసులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఎక్స్ప్రెస్ హైవే పేరుతో తమ ఇళ్లను తొలగిస్తామంటూ అధికారులు బెదిరిస్తున్నారంటూ వైఎస్ జగన్కు ఫిర్యాదు చేశారు. కాగా ఇటీవల మట్టిపెళ్లలు విరిగిపడి మృతి చెందిన కుటుంబాలను పెదగొట్టిపాడులో వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. అనంతరం జీజీహెచ్లో చికిత్స పొందుతున్న మరో కూలీని ఆయన పరామర్శిస్తారు. -
గన్నవరంలో వైఎస్ జగన్కు ఘన స్వాగతం
విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో పార్టీనేతలు, శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గుంటూరు జిల్లా పర్యటన సందర్భంగా ఆయన ఈ రోజు హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన ఏటుకూరు బైపాస్ ప్రతిపాడు బయల్దేరారు. అక్కడ నుంచి పెదగొట్టిపాడు వెళతారు. ఈ నెల 14న గుంటూరు లక్ష్మీపురంలో భవన నిర్మాణ పనుల్లో పునాది తీస్తుండగా మట్టిపెళ్లలు విరిగిపడి పెదగొట్టిపాడుకు చెందిన ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. వారి కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.