breaking news
Pamulaparti
-
పాములపర్తి..వరాలు మస్తు..
- ఇచ్చిన మాట కోసం వచ్చిన సీఎం - గంటసేపు గ్రామస్థులతో భేటీ - రూ.10 కోట్ల మేర నిధులు మంజూరు - తబ్బిబ్బయిన గ్రామస్తులు - పదిరోజుల్లో మళ్లీ వస్తానన్న కేసీఆర్ వర్గల్: సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. శనివారం ఆ గ్రామం మీదుగా వెళ్తూ ఆగకపోవడంతో స్థానికులు నిరాశ చెందారు. కారులో నుంచే మళ్లీ వస్తానంటూ సైగ చేశారు. అన్నట్టుగానే ఆదివారం ఫాంహౌస్ నుంచి హైదరాబాద్ వెళ్తూ మార్గమధ్యంలో వర్గల్ మండలం పాములపర్తి గ్రామంలో ఆగారు. స్థానికులతో మాట్లాడారు. వరాలు కురిపించి వారిని ఆనందంలో ముంచెత్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు నేరుగా గ్రామ చావిడి వద్దకు చేరుకున్న సీఎం ప్రజా ప్రతినిధులు,మహిళలతో సమావేశమయ్యారు. గ్రామసభ మాదిరిగా దాదాపు గంటపాటు వారి సమస్యలు విన్నారు. దాదాపు రూ.10 కోట్ల విలువ చేసే పథకాలు మంజూరు చేశారు. పేదలకు 150 ఇళ్లు, సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, బస్సు, బస్టాండ్, బోర్లు, మోటార్లు తదితర అనేక సమస్యలను పరిష్కరించేందుకు నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. మొదట సర్పంచ్ చంద్రకళ, ఎంపీటీసీ సభ్యురాలు స్వప్నలు అందజేసిన వినతి పత్రాలు స్వీకరించారు. స్థానికులతో మాటలు కలుపుతూ వారి సమస్యలను ఆరా తీసి పలు పథకాలను మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. 10 రోజుల తరువాత మళ్లీ వస్తా, కాలనీకి కొబ్బరికాయ కొట్టి ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఇళ్లతో ఆదర్శవంతమైన కాలనీగా తీర్చిదిద్దుతామని పేర్కొంటూనే పేదోళ్లకు చెందాల్సిన ఇళ్లు అనర్హుల పాలుకాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదే సభలో పాతూరు సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నట్టు సీఎం తెలిపారు. కార్యక్రమంలో గడా అధికారి హన్మంతరావు, ఆర్డీఓ ముత్యంరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు పోచయ్య, ఎంపీపీ కళావతి, టీఆర్ఎస్ నాయకులు హన్మంతరాావు, పార్టీ మండల అధ్యక్షుడు పిట్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
‘బెల్టు’ తీస్తాం!
- మద్యం దుకాణాలు నిర్వహిస్తే సహించం - దుకాణాదారులకు మహిళల హెచ్చరిక - మహాత్ముడి సాక్షిగా సీసాలు ధ్వంసం - పాములపర్తిలో పిడికిలి బిగించిన నారీ లోకం - నిర్వహిస్తే సహించం - పాములపర్తిలో ఘటన వర్గల్ : అడ్డూ అదుపు లేకుండా కొనసాగుతున్న బెల్టు షాపులు నిర్వహిస్తే ఇకపై సహించబోమంటూ మండలంలోని పాములపర్తిలో మహిళలు మంగళవారం ఆందోళనకు దిగారు. మంగళవారం ఉదయం పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకున్న మహిళలు సంఘటితంగా బెల్టు షాపులు లక్ష ్యంగా మూకుమ్మడి దాడులు ప్రారంభించారు. హోటళ్లు, ఇళ్ల మాటున కొనసాగుతున్న అక్రమ మద్యం దుకాణాలపై దాడులు చేసి మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. కుటుంబాలను కూల్చుతున్నాయని ఆరోపిస్తూ ‘బెల్టు’ నిర్వాహకులపై తిట్ల దండకం కొనసాగించారు. బెల్టు షాపులు నిర్వహిస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. బెల్టు దుకాణాల నుంచి స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలను, ఖాళీ బాటిళ్లను గ్రామ కూడలిలోని గాంధీ విగ్రహం ముందు వేసి ధ్వంసం చేసారు. గ్రామంలో 20 దాకా మద్యం బెల్టు దుకాణాలు నడుస్తున్నప్పటికి పోలీసులు, ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. రాత్రి పగలు తేడా లేకుండా మద్యం సేవిస్తూ యువత మత్తులో మునిగి తేలుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో గొడవలు పెచ్చరిల్లుతున్నాయని, తాగుబోతుల ఆగడాలతో కుటుంబాలు తీవ్ర అశాంతికి, అలజడికి లోనవుతున్నాయని ఈ సందర్భంగా మహిళలు తమ బాధ వెల్లగక్కుకున్నారు. ఇలాంటి పరిస్థితిలోనే తాము ‘బెల్టు’ షాపులపై విరుచుకుపడ్డామని వివరించారు. గ్రామంలో బెల్టు దుకాణాలు కొనసాగనివ్వబోమని స్పష్టం చేశారు.