breaking news
Padesave
-
ప్రేమకథతో... పడేసావే
కొత్త సినిమా గురూ! చిత్రం: ‘పడేసావే’, తారాగణం: కార్తీక్ రాజు, నిత్యాశెట్టి, జహీదా శామ్, విశ్వ, నరేశ్ మాటలు: కిరణ్, పాటలు: అనంత్ శ్రీరామ్ సంగీతం: అనూప్ రూబెన్స్ కళ: పురుషోత్తమ్ స్టంట్స్: వెంకట్ కెమేరా: కన్నా కూనపరెడ్డి ఎడిటింగ్: ధర్మేంద్ర కె నిర్మాణం: అయన్ క్రియేషన్స్ ప్రొడక్షన్ కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: చునియా రిలీజ్: 26 ఫిబ్రవరి ఏకకాలంలో తెలుగు, తమిళ, హిందీ వెర్షన్లలో ‘చండీరాణి’ని రూపొందించడం ద్వారా అరుదైన దక్షిణాది మహిళా డెరైక్టర్గా పేరుతెచ్చుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి - మన భానుమతి. కానీ, అప్పటి నుంచి గడచిన 60 ఏళ్ళ పైచిలుకు కాలంలో తెలుగులో వచ్చిన మహిళా దర్శకులు మాత్రం పట్టుమని పదిమంది కూడా లేరు. చాలాకాలం తరువాత ఇప్పుడు చునియా ఆ జాబితాకెక్కారు. తొలి చిత్రం ‘పడేసావే’తో మన ముందుకు వచ్చారు. కె. రాఘవేంద్రరావు లాంటి ప్రముఖ దర్శకుల దగ్గర సహాయకురాలిగా పనిచేసి, టీవీ సీరియల్స్ దర్శకురాలిగా అనుభవం సంపాదించి, అన్నపూర్ణా స్టూడియోలో నాగార్జునకు కుడిభుజంగా నిలిచిన చరిత్ర చునియాది. అందుకే, నాగ్ సహాయ సహకారాలు పుష్కలంగా అందుకొని, ‘యాన్ అక్కినేని నాగార్జున ఎంకరేజ్మెంట్’ అంటూ ఇప్పుడీ ‘పడేసావే’ను తెర మీదకు తెచ్చారు. టైటిల్ సూచిస్తున్నట్లే - ఇదో ప్రేమకథ. కాకపోతే, స్నేహానికీ, ప్రేమకూ మధ్య సాగే కన్ఫ్యూజన్లను ఆధారంగా చేసుకొని అల్లుకున్న ఒక ముక్కోణపు ప్రేమ కథ. కార్తీక్ (కార్తీక్రాజు) పనికిరాని వస్తువులతో కళాత్మకంగా బొమ్మలు సృష్టించే జంక్ ఆర్టిస్ట్. తల్లితండ్రులు (నరేశ్, అనితా చౌదరి)లకు ఇష్టం లేకపోయినా, ఆ పని చేస్తుంటాడు. స్నేహితురాలైన ఎదురింటి అమ్మాయి నీహారిక (నిత్యాశెట్టి) హీరోను ప్రేమిస్తుంది. అయితే, హీరో మాత్రం నీహారికకు ఆప్తమిత్రురాలైన స్వాతి (జహీదా శామ్)ని ప్రేమిస్తాడు. సినీ నటి తార (రాశి)కి కూతురైన స్వాతికి వ్యాపారవేత్త అయిన మరో అబ్బాయితో పెళ్ళి కుదురుతుంది. మొదటి గంటలో ఈ వ్యవహారమంతా ఎస్టాబ్లిష్ చేశాక, అక్కడ నుంచి సినిమాలో అసలు కథ మొదలవుతుంది. అప్పటికే పెళ్ళి కుదిరిన స్వాతికి సినీ నటి అయిన తన తల్లి అంటే కోపం. ఆ కోపాన్ని పోగొట్టి, వారిద్దరినీ దగ్గర చేస్తాడు హీరో. ఆ తరువాత ఆమె పెళ్ళి చేసుకోబోతున్న అబ్బాయి మంచివాడు కాదన్నదీ బయటకొస్తుంది. అలా కొన్ని సీన్లతో స్వాతికి హీరో దగ్గరవుతాడు. మనసులో ఆమెకూ హీరో మీద ప్రేమ పుడుతుంది. కానీ, అప్పటికే కుదిరిన పెళ్ళి, ఆప్తమిత్రురాలి స్నేహం, హీరోను తన మిత్రురాలే ప్రేమిస్తుండడం లాంటివన్నీ బంధనాలవుతాయి. మరోపక్క హీరోకూ తనను ప్రేమించే నీహారిక, తాను ప్రేమించే అమ్మాయిల మధ్య ఊగిసలాట. ఈ ముక్కోణపు ప్రేమకథ చివరకు ఎన్ని మలుపులు తిరిగింది? ప్రేమ, స్నేహం మధ్య బంధాలు ఎలా అతలాకుతలమయ్యాయి? హీరో ఇంతకీ ఎవరిని పెళ్ళి చేసుకుంటాడు? లాంటివన్నీ ఓపికగా చూడాల్సిన మిగతా సినిమా. సీరియల్ తరహా స్క్రీన్ప్లేతో ఎప్పటికప్పుడు ఏదో ఒక ట్విస్ట్తో నడిచే ఈ సినిమాలో చాలా సీన్లున్నాయి. ఒకదాని తరువాత మరొకటిగా అవన్నీ వస్తున్నప్పుడు నిడివితో సంబంధం లేకుండా చాలా పెద్ద కథే చెప్పారని అనిపిస్తుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ రాజు కుమారుడైన కార్తీక్ రాజు, ఒకప్పుడు ‘దేవుళ్ళు’లో బాలనటిగా పేరు తెచ్చుకొని, ఇప్పుడు తొలిసారిగా కథానాయిక పాత్ర పోషించిన హైదరాబాద్ అమ్మాయి నిత్యాశెట్టి, అలాగే జహీదా శామ్ - ఈ ముగ్గురూ తమ శక్తి మేరకు నటించారు. వారెవరూ ప్రేక్ష కులకు పెద్దగా పరిచితులు కాకపోవడం సినిమాకు ప్లస్, మైనస్సూ! బాగా చేయడానికి వాళ్ళూ, చేయించడానికీ దర్శకురాలూ బానే శ్రమపడ్డారు. కాక పోతే, దర్శకురాలికీ ఇదే తొలి ప్రయత్నం. ‘దేవుళ్ళు’ మొదలు దాదాపు 20 దాకా సినిమాల్లో బాల నటిగా చేసి, 2 నంది అవార్డులు కూడా అందుకున్న నిత్యాశెట్టి రూపురేఖల్లో కొన్నిసార్లు తొలినాళ్ళ ‘కలర్స్’ స్వాతినిగుర్తు చేస్తారు. యువ కమెడియన్ విశ్వ నుంచి సీనియర్ నరేశ్, ఒకటి రెండు సీన్లలోనే వచ్చే కృష్ణుడు, రెండు సీన్లు - ఒక పాటకు పరిమితమయ్యే అలీ - ఇలా చాలామంది హాస్య నటులను సినిమాలో వినోదం కోసం పెట్టారు. వాళ్ళు కూడా అడపాదడపా నవ్వించారు. కాకపోతే, ఉమన్ డెరైక్టర్ పగ్గాలు పట్టిన ఈ సినిమాలోనూ అలీ గ్యాంగ్తో హోటల్ రూమ్లో జరిగే ఘట్టం లాంటివి ఉండడం ఆశ్చర్యకరం అనిపిస్తుంది. ఈ సినిమాకు మరో అండ - పేరున్న అనూప్ లాంటి సంగీత దర్శకుడు. కాకపోతే, ఇలా రోజూ వస్తున్న కమర్షియల్ లవ్స్టోరీలలో హాలులో నుంచి బయటకొచ్చాక పాటలు గుర్తుండాలని అనుకోకూడదు. సెంటిమెంటల్ గీతం ‘చిట్టితల్లీ చిన్నితల్లీ నువ్వెప్పుడూ నాతోనే ఉండాలి...’, తల్లీ కూతుళ్ళ మధ్య దూరం లాంటి ఎపిసోడ్లు మహిళల్ని ఆకట్టుకొంటాయని ఆశించాలి. ‘ప్రేమ చెప్పి రాదు... చెప్పినా పోదు’ తరహా పంచ్ డైలాగులు, విశ్లేషణల్ని కూడా ఈ సినిమాలో వీలున్నచోటల్లా పెట్టారు. ఇక, ఇతర సాంకేతిక విభాగాల పనితనం కూడా ఈ పరిమిత బడ్జెట్ ప్రేమకథకు సరిపడేవే. ఇది తొలి సినిమానే కాబట్టి, దర్శకురాలు చునియా నుంచి మరీ అతిగా ఆశించడం పొరపాటు. మొన్నటి వరకు సీరియల్స్కు అలవాటుపడిన ఆమె భవిష్యత్తులో రచనా విభాగంపై ఇంకా దృష్టి పెట్టి, మరింత పకడ్బందీ కథ, వేగవంతమైన కథనంతో ముందుకొస్తారని ఆశించవచ్చు. కొత్తవాళ్ళను ప్రోత్సహించాలన్న హీరో నాగార్జున తదితరులలానే ప్రేక్షకులు కూడా సహృదయంతో చూసి, రావాల్సిన సినిమా ‘పడేసావే’. - రెంటాల జయదేవ -
'పడేసావే' ప్లాటినం డిస్క్ ఫంక్షన్!
-
వాళ్ల బాటలోనే... అలీ కూడా
ఈ జనరేషన్ నటులు కేవలం నటులగానే మిగిలిపోవాలనుకోవటం లేదు. అందుకే ఇతర రంగాల మీద కూడా దృష్టి పెడుతున్నారు. ముఖ్యం మన హీరోలు హీరోయిన్లు అప్పుడప్పుడు సింగర్ అవతారం ఎత్తుతూ గాయకులకు పోటీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో కామెడీ స్టార్లు కూడా వెనక్కి తగ్గటం లేదు. ఇటీవల 'లచ్చిందేవి ఓ లెక్కుంది' సినిమా కోసం జయప్రకాష్ రెడ్డి పాట పాడగా ఇప్పుడు ఈ లిస్ట్లో అలీ కూడా చేరిపోయాడు. మరో అడుగు ముందుకేసిన అలీ పాడ పాడటమే కాదు, తన పాడే పాటను తానే రాశాడు కూడా. ఎందుకంటే ఆ పాట తను మాత్రమే రాయగలడు. ఎంద చాట అంటూ విచిత్రమైన పదాలతో అలరించే అలీ అదే భాషలో పాట పాడాడు. అక్కినేని ఫిలిం స్కూల్ స్టూడెంట్ చునియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పడేసావే సినిమా కోసం అలీ పాట రాసి, పాడాడు. అనూప్ రుబెన్స్ సంగీత దర్శకత్వంలో రూపొందించిన ఈ పాటను ఇప్పటికే రికార్డ్ చేశారు. -
నాకు నాగార్జున అంటే చాలా ఇష్టం
‘‘బాల నటిగా చేసినప్పుడు షూటింగ్ లొకేషన్లో అందరూ గారాబం చేసేవాళ్లు. బోల్డన్ని చాక్లెట్లు ఇచ్చేవాళ్లు. అప్పుడెంతో ఇష్టంగా చాక్లెట్లు తిన్న నేను ఇప్పుడు మాత్రం వాటికి దూరంగా ఉంటున్నా. హీరోయిన్ అంటే స్లిమ్గా ఉండాలి కదా’’ అని నవ్వుతూ అన్నారు నిత్యాశెట్టి. కార్తీక్ రాజు, నిత్యాశెట్టి, సమీర ప్రధాన పాత్రల్లో అయాన్ క్రియేషన్స్ పతాకంపై చునియా దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘పడేసావే’. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిత్యాశెట్టి చెప్పిన ముచ్చట్లు... ఇదొక ట్రయాంగిల్ లవ్స్టోరీ. ఇందులో నీహారిక పాత్రలో నటించాను. ఇందులో మాది చిన్న లవ్స్టోరీనే అయినా చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ప్రేమ అంటే జిగ్సా పజిల్ లాంటిది. నా మొదటి సినిమాకే అనూప్ రూబెన్స్ గారు సంగీతం అందించడంతో చాలా ఆనందంగా ఉంది. చునియా డెరైక్టర్ మాత్రమే కాదు నాకు మంచి ఫ్రెండ్. ఆమెతో పనిచేయడం కంఫర్టబుల్గా ఫీలయ్యా. కార్తీక్ సెట్స్లో ఎంతో ఫన్ చేసేవాడు. ఈ చిత్రంలో ఇంకో కథానాయికగా నటించిన సమీర నాకు మంచి ఫ్రెండ్ అయింది. కాశ్మీర్ అమ్మాయి అయినా తెలుగు రాకపోయినా చక్కగా డైలాగ్స్ చెప్పింది. మా ఇద్దరి పాత్రలకీ సమాన ప్రాధాన్యం ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి నాగార్జునగారంటే చాలా ఇష్టం. ఆయన ఈ చిత్రంలో పాలుపంచుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. ఈ చిత్రం నాకు మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ సరసన ‘శోభన్బాబు’ సినిమాలో హీరోయిన్గా ఎంపికయ్యా. అలాగే తమిళంలో కూడా ఓ సినిమా చేస్తున్నా. -
ఇలాంటి చిత్రం... గ్యారంటీ హిట్టు!
- నాగార్జున ‘‘పునాది బలంగా ఉంటేనే బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది. నాన్నగారు స్థాపించిన స్కూలులో, అన్నపూర్ణా స్టూడియోస్ సంస్థలో అనేక చిత్రాలకు చునియా పని చేసింది. ఆమె దర్శకత్వం వహించిన సినిమా కావడంతో నేను ప్రమోట్ చేయాలనుకున్నా’’ అని హీరో అక్కినేని నాగార్జున అన్నారు. కార్తీక్ రాజు, నిత్యాశెట్టి, శ్యామ్ ప్రధాన పాత్రలో నాగార్జున ప్రోత్సాహంతో అయాన్ క్రియేషన్స్ పతాకంపై చునియా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పడేశావే’ చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్ను శుక్రవారం హైదరాబాద్లో విడుదల చేశారు. ‘‘యూత్ లవ్లోని ఇష్టాలను ఈ చిత్రంలో చక్కగా చూపించారు. అనూప్ మంచి సంగీతం అందించాడు. ఇలాంటి సినిమా తీస్తే గ్యారంటీ హిట్టవుతుంది. సినిమా చూసి చిరునవ్వుతో బయటికొస్తారు’’ అని నాగా ర్జున అన్నారు. ‘‘నేను సీరియల్ డెరైక్ట్ చేస్తున్నప్పుడు చునియా నా వద్ద జాయిన్ అయింది. తర్వాత రాజమౌళి, ఆ తర్వాత నాగార్జున వద్ద వర్క్ చేసింది. డెరైక్టర్గా మంచి పేరు సంపాదించాలి’’ అని దర్శకులు రాఘవేంద్రరావు పేర్కొన్నారు. ‘‘నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం రాఘవేంద్రరావుగారు, నాగార్జున గారే. ‘మనం’ చిత్ర సమయంలో నాగార్జున గారికి ఈ కథ వినిపించా. ఆయనకు నచ్చడంతో షూటింగ్ స్టార్ట్ చేసి, పూర్తి చేశాను. ఈ నెల 26న పాటలను విడుదల చేస్తాం’’ అని దర్శకురాలు చునియా తెలి పారు. సంగీత దర్శకుడు అనూప్, హీరో కార్తీక్ రాజు, హీరోయిన్ నిత్యాశెట్టి చిత్రబృందం పాల్గొన్నారు.