breaking news
p. Usakumari
-
మెట్రో సాధ్యమే
ఉడా నివేదిక విజయవాడ-గుంటూరు-తెనాలి మధ్య మెట్రో రైలు మార్గం నిర్మాణానికి అంతా అనుకూలం ప్రతి కిలోమీటరుకు రూ.200 కోట్ల వ్యయం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు నివేదిక అందజేత ఇప్పటివరకు ప్రకటనకే పరిమితమైన మెట్రో రైలు ప్రాజెక్టు వ్యవహారం ఒక అడుగు ముందుకు పడింది. వీజీటీఎం ఉడా పరిధిలో రైలు మార్గం నిర్మాణానికి అంతా అనుకూలంగా ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు ఉడా అధికారులు నివేదిక అందించారు. ఇది ప్రాథమిక నివేదికే అయినా ప్రాజెక్టు మంజూరైతే పనులు ప్రారంభించిన నాలుగేళ్ల వ్యవధిలో పూర్తిచేసే అవకాశముందని తెలుస్తోంది. సాక్షి, విజయవాడ : కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి డాక్టర్ సుధీర్కృష్ణ నేతృత్వంలోని కేంద్ర కమిటీ బుధవారం విజయవాడ నగరం, గుంటూరు జిల్లాలోని గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, తెనాలి ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించింది. విశాఖపట్నం, విజయవాడలో మెట్రో రైలు నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించింది. విజయవాడ-గుంటూరు-తెనాలి మధ్య మెట్రో రైలు నిర్మాణానికి అంతా అనుకూలంగా ఉందని కమిటీ బుధవారమే సమీక్ష అనంతరం ప్రకటించింది. దీని కంటే ముందే ఈ మూడు ప్రాంతాల్లో విస్తరించి ఉన్న వీజీటీఎం ఉడా కూడా మెట్రో ఇక్కడ అనుకూలమే అని అధికారులకు నివేదిక అందజేసింది. కేంద్ర కమిటీ పర్యటనకు ముందే నివేదికను సిద్ధం చేయాలని ఉడా అధికారులను ఆదేశాలు రావడంతో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని రూపొందించిన నివేదికను ఉడా వైస్ చైర్మన్ పి.ఉషాకుమారి బుధవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సుధీర్కృష్ణకు అందజేశారు. నిర్మాణ వ్యయం రూ.19,400 కోట్లు... విజయవాడ నుంచి గుంటూరుకు 30 కిలోమీటర్లు, గుంటూరు నుంచి తెనాలికి 23 కిలోమీటర్లు, తెనాలి నుంచి విజయవాడకు 44 కిలోమీటర్లు దూరం ఉంది. మెట్రో రైలు నిర్మాణానికి ప్రతి కిలోమీటరుకు సగటున రూ.200 కోట్ల వ్యయం అవుతుంది. ఈ క్రమంలో మూడు ప్రాంతాల మధ్య 97 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గం నిర్మించాల్సి ఉంటుంది. అంటే నిర్మాణానికి రూ.19,400 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా. ఇది కేవలం నిర్మాణ వ్యయం మాత్రమే. ఇది కాకుండా అవసరమైన చోట్ల భూసేకరణ, ఇతర కార్యక్రమాల నిర్వహణకు మరింత బడ్జెట్ అవసరమవుతుంది. కేంద్రానికి ఉడా సమర్పించిన నివేదికలో విజయవాడ, గుంటూరు నగరాల పరిస్థితితో పాటు తెనాలి ప్రాంత ప్రజల జీవన పరిస్థితి, అక్కడ ఉన్న స్థలాల లభ్యత మూడు ప్రాంతాల్లో ప్రస్తుతం జరిగిన అభివృద్ధి పనులు ఉడా పరంగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉడా విస్తీర్ణం, పరిధి, ఇలా అన్ని అంశాలను పేర్కొన్నారు. విజయవాడ, గుంటూరు రైల్వే జంక్షన్లుగా ఉన్నాయి. విజయవాడ మీదుగా వందల సంఖ్యలో ఎక్స్ప్రెస్ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇక రెండు రైల్వే డివిజన్లు కూడా ఆర్థికంగా పరిపుష్టంగానే ఉన్నాయి. 10 లక్షల జనాభా దాటిన ప్రతి నగరంలో మెట్రో రైలు నిర్మించే అవకాశం ఉంది. ప్రాథమిక నివేదికే... వీజీటీఎం ఉడా పరిధిలోని మూడు ప్రాంతాలను అనుసంధానం చేస్తూ మెట్రో రైలు నిర్మాణం సాధ్యమా కాదా అనే అంశంపైనే అధికారులు ఈ నివేదిక సిద్ధం చేశారు. నివేదికలో మెట్రో నిర్మాణానికి ఇక్కడ అంతా అనువుగా ఉందని వివరించారు. అందుకు తగిన కారణాలను కూడా పేర్కొన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు అందిన ప్రతిపాదనల ఆధారంగా ఆ శాఖ నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పిస్తుంది. దాని ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముంది. ప్రాజెక్టు మంజూరైతే పనులు ప్రారంభించిన నాలుగేళ్ల వ్యవధిలో పూర్తి చేసే అవకాశం ఉంది. తాము ప్రాథమిక నివేదిక మాత్రమే సమర్పించామని ఉడా వైస్ చైర్మన్ పి.ఉషాకుమారి తెలిపారు. -
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు తొలి, మలి దశలు ఖరారు
గుడ్లవల్లేరు, న్యూస్లైన్ : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తొలి, మలి దశల పోలింగ్ ఖరారైంది. జిల్లాలో నాలుగు డివిజన్లు ఉండగా మచిలీపట్నం, విజయవాడల్లో ఏప్రిల్ ఆరో తేదీన తొలి దశ పోలింగ్ జరగనుంది. నూజివీడు, గుడివాడ డివిజన్లలో 11న మలి దశ పోలింగ్ నిర్వహించనున్నారు. స్థానిక ఎన్నికల జిల్లా పర్యవేక్షణాధికారిణి, ఉడా వైస్ చైర్పర్సన్ పి.ఉషాకుమారి శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. గుడ్లవల్లేరు మండల పరిషత్ కార్యాలయానికి శుక్రవారం సాయంత్రం వచ్చిన ఆమె స్థానిక అధికారులతో సమావేశమయ్యారు. గుడ్లవల్లేరు మండలంలోని సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలపై ఎంపీడీవో పి.రమాదేవిని ఆమె ఆరా తీశారు. ఓటరు జాబితాల్లో సమస్యలు ఏమైనా ఉంటే చెప్పాలని అడిగారు. ఎన్నికల అధికారులకు మెటీరియల్ అందజేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎన్నికల బడ్జెట్ విడుదలపై ఆరా తీశారు. ఎన్నికల మెటీరియల్ చేరకపోతే తెలియజేయాలన్నారు. ఎన్నికల కేంద్రాల్లో స్టాంప్ ప్యాడ్లు, రూలర్లు పూర్తిస్థాయిలో పనిచేసేలా చూసుకోవాలని చెప్పారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో మంచినీరు, ర్యాంప్ల వసతుల్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎన్నికల విధులకు హాజరయ్యే అధికారులందరికీ సమాచారం ఇవ్వాలని, వారికి శిక్షణ నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల్లో ఇచ్చే కోడింగ్ను జాగ్రత్తగా చేయాలన్నారు. బ్యాలెట్ బాక్సుల వల్ల ఇబ్బందులు తలెత్తకుండా అపమ్రత్తంగా ఉండాలని తెలిపారు. జోనల్, రూట్ ఆఫీసర్లతో పాటు వాహనాల్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. పోలీసు బందోబస్తు తీసుకోవాలని ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ గుడివాడలోనే... గుడ్లవల్లేరు మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాక బ్యాలెట్ బాక్సుల్ని ఎక్కడ భద్రపరచనున్నారని గుడివాడ ఆర్గీవో వెంకట సుబ్బయ్యను ఉషాకుమారి అడిగారు. దీనికి ఆయన స్పందిస్తూ గుడివాడ ఏఎన్నార్ కాలేజీలోనే స్ట్రాంగ్ రూమ్ను ఏర్పాటు చేశామన్నారు. పామర్రు మండల బాక్సులు కూడా గుడివాడలోనే భద్రపరిచేందుకు ప్రయత్నించాలని ఈ సందర్భంగా ఉషాకుమారి సూచించారు.