breaking news
Orphan corpse
-
నిద్రిస్తున్నట్లుగానే పడిపోయారు..దాదాపు 12 గంటలు తర్వాత...
‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడూ’ అంటూ రాసిన అందెశ్రీ ఇది చూసి ఉంటే ‘అసలెక్కడున్నడమ్మా మనిషన్నవాడూ’ అంటూ అక్షరాలా ఆవేదన చెందకమానరు.. సాక్షి, బంజారాహిల్స్: సాటి మనిషి శవమై నడిరోడ్డుపై పడుంటే పక్కనుంచే ఏమీ పట్టనట్టు పోతున్న మనుషుల్ని చూస్తే అసలు వీరు..బతికున్నారా? అనిపించకమానదు. ఉసురు పోయినా పట్టక ఉరుకులూ పరుగులు తీస్తున్న మనిషీ ఊపిరి ఉన్నంత వరకే ఈ ‘సిరి’ అని మరిచావా అని అరవాలనిపించకమానదు. ఒక కాకి చనిపోతే వంద కాకులు గుమికూడి విలపించినట్టు హైరానా పడతాయి. కానీ మన నగరవాసి మంత్రం రెండు కిలో మీటర్ల దూరంలో ఇద్దరు వ్యక్తులు రోడ్ల పైన చచ్చిపడి ఉన్నా పట్టించుకోలేదు. ఎందుకిలా జరిగి ఉంటుందని ఆగి చూసే ఓపిక లేకుండా పోయింది. రోడ్డు పైన పడి ఉన్న శవాల పక్క నుంచే వందలాది మంది వెళ్తున్నారు తప్ప పోలీసులకో, ప్రభుత్వ యంత్రాంగానికో సమాచారం ఇద్దామనే ఆలోచన, ఓపిక కూడా లేదు. సంపన్నులు నివసించే బంజారాహిల్స్లోని బసవతారకం ఆస్పత్రివద్ద, జూబ్లీహిల్స్లోని భారతీయ విద్యాభవన్ స్కూల్ వద్ద బుధవారం రెండు గుర్తు తెలియని వ్యక్తుల శవాలు పడి ఉన్నాయి. వీరు ఎలా చనిపోయారో..ఎప్పుడు చనిపోయారో తెలియలేదు. రోడ్డుపైన, ఫుట్పాత్పైన నిద్రిస్తున్నట్లుగానే పడిపోయారు. దాదాపు 12 గంటలు గడిచాక..ఎవరో ఓ వ్యక్తి ఎట్టకేలకు వారు నిద్రించడం లేదు...చనిపోయారని గుర్తించి డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఈలోపే మరొకరెవరో ఆ శవంపై నుంచి వాహనాలు వెళ్లకుండా ఓ రాయిని, ఓ కర్రను అడ్డంగా పెట్టి వెళ్లిపోయాడు. ఇక వాహనదారులు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు. కనీసం ఇక్కడ విధులు నిర్వర్తించే జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఈవిషయాన్ని గుర్తించ లేదు. చివరకు మధ్యాహ్నం వేళ పోలీసులు వచ్చి..అనాథ శవాలుగా కేసు నమోదు చేసి...మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. (చదవండి: ఫాంహౌజ్ కేసు: బెయిల్పై విడుదల, ఆ వెంటనే మళ్లీ అదుపులోకి..) -
అనాథ శవానికి అంత్యక్రియలు..41 రోజుల తర్వాత ప్రత్యక్షం!
గిద్దలూరు రూరల్(ప్రకాశం): చనిపోయాడనుకున్న ఆ వ్యక్తి అంత్యక్రియలు చేసిన అనంతరం 41 రోజుల తర్వాత వారి కళ్ల ముందుకు వచ్చి కనిపించటంతో కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన గిద్దలూరు మండలంలోని ముండ్లపాడులో జరిగింది. అసలు ఏం జరిగిందంటే.. గ్రామానికి చెందిన పఠాన్ సైదుమియా మద్యానికి బానిసై ఆర్మీ ఉద్యోగం వదిలేసి లారీ క్లీనర్గా వెళుతున్నాడు. అతనికి భార్య రహమత్బీ, కుమార్తె ఉన్నారు. భార్యాభర్తలు తరచూ గొడవలు పడి విడిపోయారు. అప్పటినుంచి రహమత్బీ తన కుమార్తెతో కలిసి అనుమలవీడులోని తన తల్లి ఇంట్లో ఉంటోంది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటోన్న సైదుమియా లారీ క్లీనర్గా పనికి వెళ్తే ఒక్కోసారి 2, 3 నెలల వరకు గ్రామంలోని ఇంటికి వచ్చేవాడు కాదు. ఈ క్రమంలో 41 రోజుల క్రితం మార్కాపురం రైల్వేస్టేషన్లో ఓ వ్యక్తి మృతి చెందాడని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న బంధువులు.. మృతి చెందింది సైదుమియానే అని భావించి మృతదేహాన్ని ముండ్లపాడుకు తీసుకువచ్చారు. భార్య రహమత్బీని పిలిపించి వారి పద్ధతుల్లో అంత్యక్రియలు పూర్తిచేశారు. 3 నెలలుగా లారీ క్లీనర్గా పని చేసుకుంటూ ఉన్నానని, గ్రామంలో జరిగే పీర్ల చావిడిలో పాల్గొనేందుకు ఇప్పుడు వచ్చానని సైదుమియా తెలిపాడు. -
అడ్రస్ లేని శవం!
రాష్ట్రంలో ప్రతిరోజూ 10–12 గుర్తు తెలియని మృతదేహాలు ♦ 11 ఏళ్లు.. 32 వేల మృతదేహాలు ♦ ఎవరో తెలియదు.. వారి సంబంధీకుల జాడ తెలియదు ♦ చనిపోతున్నవారిలో యుక్త వయసు వారే ఎక్కువ ♦ నెలరోజులు భద్రపరచి మున్సిపాలిటీకి అప్పగిస్తున్న పోలీసులు ♦ అనాథ శవంగా పరిగణించి అంత్యక్రియలు సాక్షి, హైదరాబాద్: ఓ పదహారేళ్ల అమ్మాయి. అర్ధరాత్రి సమయంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. కారణమేంటో తెలియదు. మౌలాలి రైల్వేట్రాక్పై శవం ఉందని రైల్వే పోలీసులకు సమాచారం అందింది. తల, మొండెం వేర్వేరుగా పడి ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పంచనామా పూర్తి చేశారు. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? ఎక్కడ్నుంచి వచ్చింది? ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? ఈ అనుమానాలన్నీ ఓవైపు.. ఇప్పుడు ఆ మృతదేహం ఎవరికి అప్పగించాలి? సంబంధీకులను ఎలా గుర్తించాలన్న సమస్య మరోవైపు! పోలీసులు పత్రికా వాళ్లను, టీవీ చానళ్ల వారందరినీ పిలిచారు. మృతదేహం ఆనవాళ్లు చెప్పారు. అమ్మాయి శవాన్ని సంబంధీకులకు అప్పగించేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ అమ్మాయి తమ సంబంధీకురాలే అంటూ ఎవరూ రాలేదు. ఏం చేయాలో తెలియక పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.. నెలరోజుల పాటు మార్చురీలోనే ఉన్న మృతదేహం.. మున్సిపాలిటీ విభాగానికి చేరింది. తర్వాత అనాథ శవంగా పరిగణించి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇలా ఆ ఒక్క అమ్మాయి మృతదేహమే కాదు రాష్ట్రంలో ప్రతిరోజూ 10 నుంచి 12 గుర్తు తెలియని శవాలను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. గత 11 ఏళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 32 వేల గుర్తు తెలియని మృతదేహాలకు అంత్యక్రియలు జరిగాయి. అసలు ఇలా ఎంత మంది చనిపోతున్నారు? మృతదేహాల గుర్తింపునకు ఎన్ని రోజుల సమయం ఉంటుంది? ఇప్పటిదాకా ఏ వయసువారీ శవాలు ఎక్కువగా లభ్యమయ్యాయన్న అంశాలపైదే.. ఈ కథనం. ఏటా 3 వేల మృతదేహాలు ఆత్మహత్యలు, హత్యలు, రోడ్డు ప్రమాదాలు, ప్రమాదవశాత్తు మృతి చెందడం.. ఇలా అనేక ఘటనల్లో 2006 నుంచి 2017 మార్చి వరకు 32 వేల గుర్తు తెలియని మృతదేహాలు లభ్యమైనట్టు పోలీస్ శాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇలా ప్రతి ఏటా రాష్ట్రంలో 3 వేలకు పైగా గుర్తు తెలియని మృతదేహాలు లభ్యమవుతుండగా.. రోజుకు 10 నుంచి 12 గుర్తు తెలియని శవాలను స్వాధీనం చేసుకుంటున్నట్టు పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే మృతదేహాల గుర్తింపులో పోలీసుల వైఫల్యం కూడా కొంత ఉంటోందని, దర్యాప్తు అధికారులు సరైన రీతిలో స్పందించకపోవడం, సిబ్బంది కొరత, పని ఒత్తిడి వల్ల శవాల గుర్తింపు కష్ట సాధ్యమవుతోందని సీనియర్ ఐపీఎస్లు కొందరు అభిప్రాయపడ్డారు. సగం యువతవే.. 2006 నుంచి ఇప్పటివరకు లభ్యమైన గుర్తుతెలియని మృతదేహాల్లో సగం వరకు యుక్తవయసు వారివేనని రికార్డుల ద్వారా తెలుస్తోంది. ప్రేమ వ్యవహారం, ఆర్థిక ఇబ్బందులు, చదువు, మానసిక ఒత్తిడి, కుటుంబ కారణాలు.. ఇలా అనేక సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో గతంలో పేర్కొంది. భద్రపరిచేది నెల రోజులే.. పంచనామా తర్వాత పోలీసులు శవాన్ని దగ్గర్లోని మార్చురీలో భద్రపరుస్తారు. వాల్పోస్టర్లు, టీవీ ప్రకటనలు, బస్టాండ్లలో పోస్టర్లు.. ఇలా అనేక రకాలుగా మృతదేహాన్ని గుర్తుపట్టేందుకు ప్రయత్నిస్తారు. చట్టం ప్రకారం నెలరోజుల పాటు గుర్తు తెలియని మృతదేహాలను మార్చురీలో భద్రపరచవచ్చు. ఆ తర్వాత కూడా సంబంధీకులు రాకుంటే మున్సిపల్ విభాగానికి అప్పగిస్తారు. మున్సిపల్ విభాగం ఆ మృతదేహాలను ఖననం చేస్తుంది. ఢిల్లీ, పంజాబ్లో అయితే కేవలం 72 గంటల పాటే గుర్తు తెలియని మృతదేహాలను మార్చురీలో పెడతారని, తర్వాత ఎవరూ రాకుంటే ఖననం చేస్తారని పోలీస్ అధికారులు తెలిపారు. గత 11 ఏళ్లలో గుర్తు తెలియని మృతదేహాల వివరాలు.. ఆదిలాబాద్ 2,201 కరీంనగర్ 3,930 నల్లగొండ 1,056 వరంగల్ కమిషనరేట్ 690 సైబరాబాద్ 1,772 ఖమ్మం 3,104 నిజామాబాద్ 1,972 రైల్వే పోలీస్ 6,741 మహబూబ్నగర్ 4,902 రంగారెడ్డి 663 హైదరాబాద్ 1,729 మెదక్ 2,283 వరంగల్ రూరల్ 822 మొత్తం 31,865 ఇప్పటివరకు దొరికిన శవాలు.. పురుషులు 24,012 మహిళలు 7,658 ట్రాన్స్జెండర్స్ 2 వయసుల వారీగా... 12 128 14 206 16 286 18 398 20 684 22 680 24 386 26 1,385 28 835 30 1,662.