breaking news
olympic bhavan
-
తెలంగాణ ఒలింపిక్ భవనాన్ని ప్రారంభించిన పీటీ ఉష
సాక్షి, హైదరాబాద్: భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ భవనాన్ని గురువారం ప్రారంభించారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ సోని బాలాదేవి, అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అధ్యక్షురాలు పి.టి. ఉష మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ఒలింపిక్ భవన్ ప్రారంభోత్సవం భారత క్రీడా చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ భవనం కేవలం ఒక కార్యాలయం మాత్రమే కాదు, భావితర క్రీడాకారుల కలలను సాకారం చేసే కేంద్రంగా, ఒలింపిక్ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసే వేదికగా నిలవనుంది.తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యత అభినందనీయం. రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమైనవి.ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ పదాధికారులకు.. అదే విధంగా ఈ భవన నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు.ఒలింపిక్ ఉద్యమం విజయవంతం కావాలంటే పారదర్శకత, జవాబుదారీతనం, న్యాయబద్ధత వంటి విలువలను ఎల్లప్పుడూ కాపాడుకోవాలి. క్రీడాకారుల ప్రయోజనాలే మనందరి ప్రధాన లక్ష్యంగా ఉండాలి. వారికి అత్యుత్తమ శిక్షణ, సదుపాయాలు, ప్రోత్సాహం అందేలా ప్రతి సంస్థ కృషి చేయాలి.మన దేశ క్రీడాకారుల విజయాల వెనుక నిలిచే కోచ్లు, సాంకేతిక నిపుణులు, అధికారులు, వాలంటీర్లు మరియు నిస్వార్థంగా సేవలందిస్తున్న ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు. యువ క్రీడాకారులకు నా సందేశం ఒక్కటే – మీపై మీరు నమ్మకం ఉంచండి. క్రమశిక్షణ, అంకితభావం, కఠోర శ్రమతో ముందుకు సాగండి. ప్రతి ఛాంపియన్ ప్రయాణం ఒక కలతో ప్రారంభమవుతుంది. ఆ కలను నిజం చేసుకునే వరకు ప్రయత్నాన్ని ఆపవద్దు.ఈ తెలంగాణ ఒలింపిక్ భవన్ భావితర క్రీడాకారులకు ప్రేరణనిచ్చే కేంద్రంగా, క్రీడా సంఘాల మధ్య సమన్వయాన్ని పెంపొందించే వేదికగా, దేశానికి మరెన్నో అంతర్జాతీయ పతక విజేతలను అందించే స్ఫూర్తి నిలయంగా మారాలి’’ అని ఆకాంక్షించారు.ఇక మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. ‘‘పరిగెత్తడంలో మిల్కా సింగ్ ఆ తర్వాత ఉష భారతదేశ చరిత్రలో రికార్డు సృష్టించారు. నాడు భారత దేశ ఔనత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటే విధంగా మెడల్స్ సాధించారు. అయితే, ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పిస్తున్న పతకాలు సాధించడంలో ఇపుడు యువత మాత్రం వెనుకబడిపోయారు.క్రీడల్లో మనం ఎందుకు ముందుకు పోవడం లేదు యువత ఆలోచన చేయాలి. గేమ్ లో ఇన్వాల్వ్మెంట్ తగ్గి సోషల్ మీడియాలో ప్రచారం కోసం యువత ఎక్కువ సమయం ఇస్తున్నారు. ఆటల కోసం బతకాలి. గేమ్ ను జీవితముగా ఎంచుకున్నప్పుడే సక్సెస్ అవుతారు. జనాభాలో పెద్ద దేశం అయినప్పటికీ ఆటలపై దృష్టి సాధించడం లేదు. చిన్న చిన్న దేశాలు మెడల్స్ సాధిస్తున్నాయి. దేశం కోసం ఆడండి..ప్రపంచస్థాయిలో గుర్తింపు తీసుకు రండి. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలి’’ అని యువతకు పిలుపునిచ్చారు. -
టీఎన్ఏ అధ్యక్షుడిగా కృపాకర్రెడ్డి
ఎల్బీ స్టేడియం న్యూస్లైన్: రాష్ట్ర విభజన నేపధ్యంలో రాష్ట్ర నెట్బాల్ సంఘం (ఏపీఎన్ఏ) కార్యవర్గం సమావేశం ఇక్కడి ఎల్బీ స్టేడియంలోని ఒలింపిక్ భవన్లో ఆదివారం జరిగింది. ఏపీఎన్ఏ అధ్యక్షుడు తీగల కృపాకర్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల కొత్త కార్యవర్గం ఎన్నికలు జరిపారు. ఈ ఎన్నికలకు రాష్ట్ర ఒలింపిక్ సంఘం కోశాధికారి బి.కె.హరనాథ్, ఎన్నికల అధికారిగా బి.కైలాష్ యాదవ్లు పాల్గొన్నారు. తెలంగాణ నెట్బాల్ సంఘం (టీఎన్ఏ)అధ్యక్షుడుగా తీగల కృపాకర్రెడ్డి(రంగారెడ్డి), ప్రధాన కార్యదర్శిగా ఎస్.సోమేశ్వర్రావు(రంగారెడ్డి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా టి.సురేశ్ కుమార్(మహబూబ్నగర్), పి.వి.రమణ (ఖమ్మం), ఎం.రఘువీర్ సింగ్ (నల్లగొండ), జి.వేణుగోపాల్ (కరీంనగర్), సంయుక్త కార్యదర్శులుగా ఎం.సమ్మయ్య (ఆదిలాబాద్), జి.వెంకటేశ్వర్రావు (నిజామాబాద్), కె.శ్రీనివాస్ (ఆదిలాబాద్), సి.హెచ్.సూర్యరావు (వరంగల్), కోశాధికారిగా వై.నందు కుమార్ (హైదరాబాద్)లు ఎన్నికయారు. కార్యవర్గ సభ్యులుగా కె.కృష్ణమూర్తి (ఖమ్మం) టి.సురేశ్ (వరంగల్), ఎం.విఘ్నేశ్వర్ (హైదరాబాద్), ఎ.రమేశ్ (నిజామాబాద్), సుహేల్ రెహ్మన్ (మహబూబ్నగర్), కె.సురేశ్ (నల్లగొండ) నియమితులయ్యారు. -
‘టి’ స్కేటింగ్ సంఘం అధ్యక్షుడిగా సైమన్
సుధాకర్రెడ్డికి ఏపీఆర్ఎస్ఏ బాధ్యతలు ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ రోలర్ స్కేటింగ్ సంఘం రెండుగా విడిపోయింది. వేర్వేరు సంఘాల కార్యవర్గం కోసం గురువారం ఇక్కడి ఒలింపిక్ భవన్లో ఎన్నికలు జరిగాయి. తెలంగాణ స్కేటింగ్ సంఘం అధ్యక్షుడిగా ఎఫ్.జె.సైమన్, ప్రధాన కార్యదర్శిగా శ్రీరాంప్రసాద్ శ్రీవాస్తవ ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా జె. సుధాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా భగీరథ్ కుమార్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. కోశాధికారులుగా తెలంగాణకు కేఆర్ మహేంద్ర, శశిధర్, ఏపీకి అచ్యుతరామ్ రెడ్డి, ఎస్ఎస్ రెడ్డి పని చేస్తారు. తెలంగాణ కార్యవర్గం సీనియర్ ఉపాధ్యక్షుడు: వీరేశ్ కుమార్ యామా, ఉపాధ్యక్షులు: ఎస్ఆర్ ప్రేమ్రాజ్, ఇక్బాల్ లసానియా, కె. సాంబయ్య. అదనపు కార్యదర్శి: నిర్మలా సింగ్, సంయుక్త కార్యదర్శులు: డాక్టర్ నవీన్ కుమార్, నూర్ మొహమ్మద్, నర్సింహ. ఆంధ్రప్రదేశ్ కార్యవర్గం సీనియర్ ఉపాధ్యక్షుడు: రఘుపతి రాజు, ఉపాధ్యక్షులు: ప్రసన్న కుమార్, శ్యామ్బాబు, రామకృష్ణ, అదనపు కార్యదర్శి: దుర్గాప్రసాద్, సంయుక్త కార్యదర్శులు: వెంకటేశ్వర్లు, ఆర్.వి.వి. నాయుడు, షేక్ మస్తాన్, కార్యవర్గ సభ్యులు: మోహన్రావు, సునీల్ కుమార్, పురుషోత్తం, ఈశ్వర్, పీటర్సన్ -
క్రీడా సంఘాల్లో విభజన షురూ
ముగిసిన ఏపీఓఏ కార్యవర్గ సమావేశం ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: ఆంధ్ర ప్రదేశ్ విభజన నేపథ్యంలో రాష్ట్ర ఒలింపిక్ సంఘం (ఏపీఓఏ) కార్యవర్గం చివరి సమావేశం శనివారం ఇక్కడి ఒలింపిక్ భవన్లో జరిగింది. ఏపీఓఏ అధ్యక్షుడు, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యవర్గ సమావేశంలో గత జూలై 7వ తేదీన చేసిన పలు తీర్మానాలు అమోదించారు. ఏపీఓఏ అనుబంధంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 51 క్రీడా సంఘాలు ఉండగా తెలంగాణ, ఆంధ్రపదేశ్లో కొత్తగా 46 క్రీడా సంఘాల ఏర్పాటుకు మార్గదర్శకాలు రూపొందించారు. ఈ క్రీడా సంఘాల జాబితాల్లో ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రలో ఐదు క్రీడా సంఘాలు ప్రత్యేకంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ఇందులో ఖోఖో, కబడ్డీ, బాల్బ్యాడ్మింటన్, క్యారమ్, బాడీబిల్డింగ్ సంఘాలున్నాయి. రెండు రాష్ట్రాల క్రీడా సంఘాల ఏర్పాటుకు, విధి విధానాల కోసం తొమ్మిది మంది సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. ఈ క్రీడా సంఘాల పునర్విభజన కమిటీ చైర్మన్గా లగడపాటి రాజగోపాల్, వైస్ చైర్మన్గా ఎపీ జితేందర్రెడ్డి, కన్వీనర్గా కె.జగదీశ్వర్ యాదవ్ వ్యవహరిస్తారు. ఈ కమిటీ సభ్యులుగా తెలంగాణ నుంచి ప్రొఫెసర్ కె.రంగారావు (ఏపీ అథ్లెటిక్ అసోసియేషన్), బి.కె.హరనాథ్ (హైదరాబాద్ క్యారమ్), ఆర్. నారాయణరెడ్డి (ఆదిలాబాద్), ఆంధ్ర ప్రాంతం నుంచి పద్మనాభం (తూర్పు గోదావరి), ఎం.నిరంజన్రెడ్డి (గుంటూరు), మచ్చ రామలింగారెడ్డి (అనంతపురం)లను నియమించారు. ఈ కమిటీ మే నెల 15వ తేదీలోగా రెండు రాష్ట్రాల్లో 46 క్రీడా సంఘాల కొత్త కార్యవర్గాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయనుంది. జూన్ 2నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కొత్త క్రీడా సంఘాలకు ఎన్నికలు నిర్వహించి కొత్త కమిటీలు తమ కార్యకలాపాలు సాగించే విధంగా చర్యలను ఈ కమిటీ తీసుకోనుంది. జాతీయ క్రీడా సమాఖ్య గుర్తింపు ఉన్న క్రీడా సంఘాలకే ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఏపీఓఏ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ కె.రంగారావు, ఎపీ.జితేందర్రెడ్డి, సంయుక్త కార్యదర్శులు ఎస్.ఆర్.ప్రేమ్రాజ్, కోశాధికారి బి.కె.హరనాథ్, సభ్యులు ఎస్.సోమేశ్వర్రావు, ఆర్.నిరంజన్రెడ్డి, బి.కైలాష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


