breaking news
officers respond
-
వ్యాధులపై ఎట్టకేలకు కదలిక
వైద్యశాఖ కేంద్రంగా చింతూరు ఏరియా ఆసుపత్రి, ప్రత్యేక వైద్య నిపుణులు వ్యాధులపై నిరంతర నివేదిక తొలినుంచీ ‘సాక్షి’ పోరాటం బాధితుల వెతలపై వరుస కథనాలు 18004253077 టోల్ఫ్రీ నెంబరు ఏర్పాటు చింతూరు : ఏజెన్సీలోని విలీన మండలాల్లో విజృంభిస్తున్న వ్యాధులపై ఎట్టకేలకు అధికారుల్లో కదలిక వచ్చింది. జిల్లాలో పలు ప్రాంతాల్లో బుసకొడుతున్న జ్వరాలు, డెంగీ, పెరుగుతున్న మలేరియా కేసులపై ‘సాక్షి’ నెట్వర్క్ బాధితుల వెతలను ఎప్పటిప్పుడు వెలుగులోకి తేవడంతో ఇటు సర్కారు, అటు అధికారులు కదలక తప్పని పరిస్థితి ఏర్పడింది. వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పరిస్థితులపై ఆరా తీయడంతో అంతవరకూ పట్టించుకోని మంత్రుల్లో చలనం కలిగింది. ఇప్పటికీ జిల్లాకు చెందిన మంత్రులు యనమల రామకృష్ణుడు, చిన రాజప్పలు స్పందించిన దాఖలాలు లేవు. గిరిజన శాఖా మంత్రి రావెల కిశోర్బాబు వచ్చి తూతూమంత్రంగా పర్యటించి వెళ్లిపోయారు. తరువాత వైఎస్పార్ సీపీ ఎమ్మెల్సీ సుభాస్ చంద్రబోస్, రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబులు ఏజెన్సీ ప్రాంతంలోను పర్యటించి మృతుల కుటుంబాలను పరామర్శించారు. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న రోగులను పలుకరించారు. దీంతో తేరుకున్న అధికారులు విలీన మండలాల్లో వ్యాధుల నివారణకు తక్షణ చర్యలకు శ్రీకారం చుట్టారు. ఐటీడీఏ పీవో చక్రధరబాబు సోమవారం విలీన మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. వ్యాధుల నివారణకు తక్షణం చేపట్టాల్సిన చర్యలను ఈ పర్యటనలో చర్చించినట్లు తెలిసింది. గత ఇరవై రోజులుగా విలీన మండలాల్లో వ్యాధులు ప్రబలి కొంతమంది మృత్యువాత పడడం అనేకమంది ఆసుపత్రుల పాలవడం తెలిసిందే. కాళ్లవాపు వ్యాధి కారణంగా వీఆర్పురం మండలంలో నలుగురు మృత్యువాత పడగా 32 మంది వరకు కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వ్యాధి చింతూరు మండలానికి కూడా పాకింది. దీంతోపాటు డెంగీ, మలేరియా వ్యాధులతో కూడా గిరిజనులు మృత్యువాత పడుతుండడంతో భయోందోళనలు వ్యక్తమవుతున్నాయి. వ్యాధులను నియంత్రించడంలో అధికారుల వైఫల్యంపై ప్రతిపక్ష నాయకులు, ప్రజా సంఘాలు మండిపడ్డాయి. చింతూరులో ఏరియా ఆసుపత్రి... విలీన మండలాల్లో వైద్యసేవలు మెరుగు పరిచేందుకు చింతూరులో రూ నాలుగున్నర కోట్లతో ఏరియా ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నామని దీనికోసం టెండర్లు కూడా పిలిచామని పీవో చక్రధరబాబు తెలిపారు. సోమవారం ఆయన చింతూరు ఐటీడీఏ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ చింతూరులో పౌష్టికాహారం కేంద్రం, ఆపరేషన్ ధియేటర్ నిర్మిస్తామని, ప్రత్యేక వైద్య నిపుణులను నియమిస్తున్నామని తెలిపారు. చింతూరులో విధులు నిర్వహిస్తున్న ఎస్పీహెచ్వోకు డిప్యూటీ సివిల్ సర్జన్ బాధ్యతలను అప్పగిస్తున్నామని, కూనవరం ఆసుపత్రి భవనానికి కూడా మరమ్మతులు చేయిస్తామని పీవో తెలిపారు. సోమవారం నుంచి మూడ్రోజులపాటు వైద్యసిబ్బంది గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి వ్యాధులపై ఆరా తీస్తారని, ఎవరికైనా వ్యాధి తీవ్రత అ«ధికంగా ఉంటే వెంటనే కాకినాడ తరలిస్తామని తెలిపారు. వ్యాధుల నియంత్రణకు ప్రతి మండలానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించామని, ఆర్డీటీ, ఏసీటీ కిట్లతోపాటు క్లోరోక్విన్, ప్రైమాక్విన్, పారాసెట్మాల్ మాత్రలను ఏఎన్ఎంలు, ఆశావర్కర్ల వద్ద ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైద్యశిబిరాలు, గ్రామాల్లోకి వెళ్లేందుకు పీహెచ్సీ వైద్యులకు వాహన సదుపాయం కల్పిస్తామని, త్వరలోనే స్ప్రేయింగ్ కార్యక్రమం చేపడతామని పీవో పేర్కొన్నారు. 18004253077 అనే టోల్ఫ్రీ నెంబరును ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇకపై నిరంతరం ఐటీడీఏ... ఇప్పటివరకు కేవలం బుధవారం సంతరోజు మాత్రమే నిర్వహిస్తున్న ఐటీడీఏ కార్యక్రమాలు ఇకపై నిరంతరంగా నిర్వహించాలని పీవో చక్రధరబాబు ఏపీవో వెంకటేశ్వరరావును ఆదేశించారు. తక్షణమే ఔట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగులను భర్తీచేసి పాలన నిర్వహించాలని, విలీన మండలాల్లోని వ్యాధులు, వైద్యంపై ప్రతిరోజు తనకు నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు. -
అగ్రహారం సొసైటీ అక్రమాలపై విచారణ మొదలు
ఖాజీపేట: ఖాజీపేట మండలం అగ్రహారం సొసైటీ అక్రమాలపై అధికారులు విచారణ మొదలు పెట్టారు. ‘అగ్రహారం సొసైటీ అక్రమాలపై విచారణ ఎప్పడు’ అనే శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు విచారణకు ఆదేశించారు. అందులో భాగంగా గురువారం ఖాజీపేటలోని అగ్రహారం సొసైటీకి హబీబుల్లా, రమేష్, సుగుణమ్మ అనే ముగ్గురు ఆడిటర్లు వచ్చారు. సొసైటీలోని ప్రాథమిక సమాచారాన్ని సీఈఓ సుధాకర్ను అడిగి తీసుకున్నారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ సొసైటీ అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు 1195 మంది రైతులకు రూ.10కోట్ల 60లక్షల రుణాలను అందించారన్నారు. రుణాలకు సంబంధించిన రికార్డులను తమకు అప్పగిస్తే పరిశీలిస్తామని తెలిపారు. పంపులపై ఫిర్యాదు చేస్తే చర్యలు.. సొసైటీ వారు తైవాన్ పంపులను రైతులకు బలవంతంగా ఇచ్చారన్న దానిపై వారు స్పందిస్తూ రైతులు ఎవరైనా తైవాన్ పంపులపై గానీ, ఎంత రుణం ఇచ్చారు.. రైతులకు ఎంత ముట్టింది అన్న దానిపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారించి చర్యలు తీసుకుంటామన్నారు. విచారణకు వారం గడువు ఇవ్వండి సొసైటీలో రికార్డులన్నీ సక్రమంగా ఉంచేందుకు తమకు వారం రోజులు గడువు కావాలని ఆడిటర్లను సొసైటీ సిబ్బంది అడిగారు. అందుకు వారు నిరాకరించారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకుంటాం, అవకాశం ఇవ్వండి అని అడగడంతో కొద్ది సేపు తర్వాత ఆడిటర్లు వెళ్లిపోయారు. ఎందుకు వచ్చినట్లు.. ఎందుకు వెళ్లినట్లు.. విచారణ కోసం వచ్చిన అధికారులు నామమాత్రంగా విచారించి Ðð ళ్లడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విచారణకు వచ్చిన వారు రికార్డులను స్వాధీనం చేసుకుని విచారించాలి కాని ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. రుణాలు పొందిన రైతులందరిని విచారిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని పలువురు పేర్కొంటున్నారు.