breaking news
NIO scientists Research
-
సాగర గర్భంలో లోయలు..!
సాక్షి, అమరావతి బ్యూరో: సాగర గర్భం అనేక అద్భుతాలకు నిలయం. ఎన్నో వింతలు, విశేషాలకు ఆలవాలం. అలాంటి సముద్రంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. అదీ ఎక్కడో కాదు.. ఆంధ్రప్రదేశ్లో! కార్యనిర్వాహక రాజధాని కాబోతున్న విశాఖపట్నం సమీపంలో!! ప్రపంచంలోనే అత్యంత అరుదుగా సాగర గర్భంలో ఏర్పడే లోయలు (కానియాన్స్) మన బంగాళాఖాతంలోనూ ఉన్నట్టు జాతీయ సముద్ర అధ్యయన సంస్థ (ఎన్ఐవో) శాస్త్రవేత్తల పరిశోధనలో కొన్నాళ్ల క్రితం గుర్తించారు. ఇవి దేశ రక్షణలో కీలక భూమిక పోషిస్తున్న తూర్పు నావికాదళానికి ఉపయోగపడేలా అడుగులు పడుతున్నాయి. అంతేకాదు.. ఆ ప్రాంతంలో చమురు, సహజవాయువుల నిక్షేపాలకు ఆస్కారం ఉంటుందని భావిస్తున్నారు. ఆసక్తి రేపే ఆ లోయల విశేషాలివీ! సింధు సాధనతో అన్వేషణ.. భూమ్మీద మాదిరిగానే సముద్ర గర్భంలోనూ లోయలు, గుహలు ఏర్పడతాయి. వీటిని సబ్మెరైన్ కానియాన్స్ (సాగర గర్భంలో ఉండే లోయలు)గా పిలుస్తారు. ఇలాంటివి ప్రపంచం మొత్తమ్మీద 600 వరకు ఉన్నట్టు ఇప్పటివరకు గుర్తించారు. ఎన్ఐవో శాస్త్రవేత్తలు మనదేశంలోని సముద్ర జలాల్లోనూ కొంతకాలం క్రితం అత్యాధునిక పరిశోధన నౌక ‘సింధు సాధన’తో ఇలాంటి అన్వేషణలు చేపట్టారు. వీరి అన్వేషణలో బంగాళాఖాతంలో విశాఖపట్నం– భీమిలి మధ్య తీరానికి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో సాగర గర్భంలో ఉన్న లోయలను కనుగొన్నారు. ఇవి సముద్ర నీటికి 300 మీటర్ల దిగువన 18 కి.మీ. మేర విస్తరించి ఉన్నాయని గుర్తించారు. ఇలాంటివి 15 వరకు ఉన్నాయని, ఒక్కొక్కటి 0.5 కి.మీ. నుంచి కి.మీ. వెడల్పు, 2 కి.మీ. పొడవు కలిగి ఉన్నట్టు నిర్ధారణకు వచ్చారు. ఈ లోయలు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఏర్పడి ఉంటాయని భావిస్తున్నారు. దేశంలోనే తొలిసారి వెలుగులోకి.. ప్రపంచంలో ఇతర దేశాల సాగర గర్భాల్లో ఇప్పటికే కొన్నిచోట్ల సబ్మెరైన్ కానియాన్స్ను కనుగొన్నారు. మన దేశ సముద్ర గర్భంలో లోయలను గుర్తించడం ఇదే ప్రథమం. ఇలాంటివి మన దేశానికి ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్, శ్రీలంక సముద్రాల దిగువన ఉన్నాయి. ఎలా ఏర్పడతాయి? వేలు, లక్షల సంవత్సరాల క్రితం నదులు వేగంగా ప్రవహిస్తూ సముద్రంలో కలవడం వల్ల కోతకు గురై ఇలాంటి లోతైన కానియాన్స్ ఏర్పడతాయని సముద్ర అధ్యయన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్నాళ్లకు అవి శిలల మాదిరిగా గట్టిదనాన్ని సంతరించుకుంటాయి. ప్రవాహ వేగానికి కొట్టుకొచ్చిన మొక్కలు, చెట్లు వంటివి సాగరం అడుగున ఉండిపోవడం వల్ల అక్కడ చమురు, సహజ వాయువుల నిక్షేపాలకు నిలయంగానూ మారుతుంది. కాలక్రమంలో సముద్ర మట్టాలు పెరిగి ముందుకు రావడంతో ఈ లోయలు కంటికి కనిపించకుండా సాగర గర్భాల్లో ఉంటున్నాయి. ఈ లోయల ప్రాంతంలో చమురు, సహజ వాయువులుండేందుకు ఆస్కారం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ సాగర లోయల్లో అరుదైన, విభిన్న జాతుల మత్స్య సంపద ఉండవచ్చని కూడా వీరు అంచనా వేస్తున్నారు. నావికాదళం ఆసక్తి.. ఎన్ఐవో శాస్త్రవేత్తలు కనుగొన్న సముద్ర లోయలపై భారత నావికాదళం ఆసక్తి కనబరుస్తోంది. ఇప్పటికే విశాఖలో తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రం ఉంది. దీనికి సమీపంలోనే ఈ లోయలున్నాయి. దీంతో జలాంతర్గాముల (సబ్మెరైన్ల)ను భద్రత రీత్యా ఈ లోయల్లో ఉంచేందుకు అనువుగా ఉంటుందా? అనే అంశంపై నేవల్ రీసెర్చి బోర్డు (ఎన్ఆర్బీ) ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏడాదిలో ప్రాజెక్టు చేపట్టే అవకాశం విశాఖ తీరానికి సమీపంలో సాగర గర్భంలో కనుగొన్న లోయలు అత్యంత అరుదైనవి. ఇలాంటివి బయల్పడటం దేశంలో ఇదే ప్రథమం. నేవీకి చెందిన అమూల్యమైన పరికరాలను భద్రత పరిచే అవకాశాలపై ఈ లోయల పటిష్టత, స్థితిగతులపై అధ్యయనం చేయాల్సి ఉంది. అలాగే ఆ లోయల్లో ఎలాంటి మత్స్య సంపద ఉంది? చమురు, సహజ వాయువు నిక్షేపాల ఉనికిపైనా దృష్టి సారిస్తాం. అన్నీ అనుకూలిస్తే ఏడాదిలోనే ఈ ప్రాజెక్టును చేపట్టే అవకాశం ఉంది. – వీవీఎస్ఎస్ శర్మ, సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఎన్ఐవో -
ఔరా.. హుద్హుద్!
* సముద్ర ఉష్ణోగ్రతల్లో అరుదైన మార్పులు * బలహీనపడడానికి బదులు శక్తిమంతం * ఎన్ఐవో శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి సాక్షి, విశాఖపట్నం: విశాఖతో పాటు ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన హుద్హుద్ తుపాను ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో అనూహ్య పరిణామాలను సంతరించుకున్నట్లు వెల్లడవుతోంది. సాధారణ పరిస్థితులకు భిన్నంగా ప్రతాపం చూపి శాస్త్రవేత్తలకు సరికొత్త సవాల్ విసిరి, వారిని ఆలోచనల్లో పడేసింది. అక్టోబర్ 12న హుద్హుద్ తుపాను విశాఖ సమీపంలో తీరాన్ని దాటింది. తుపాన్లు తీరం దాటే సమయంలో సముద్ర ఉష్ణోగ్రతలతో పాటు అది పయనించే మార్గం (సైక్లోన్ ట్రాక్)లో ఉష్ణోగ్రతల్లోనూ మార్పులు చోటుచేసుకుంటాయి. సాధారణంగా తీవ్ర వాయుగుండంగా మారినప్పుడు సైక్లోన్ ట్రాక్లో సముద్ర జలాలు చల్లబడతాయి. ఉష్ణోగ్రతలు పెరిగితే తుపాను తీవ్రత కూడా పెరుగుతుంది. తగ్గితే బలహీనపడుతుంది. అయితే ఈ హుద్హుద్ తీరం దాటడానికి ముందు ఉష్ణోగ్రతల్లో వైవిధ్యం ఉన్నట్టు వాతావరణ నిపుణులు గుర్తించారు. వాస్తవానికి మామూలు రోజుల్లో సముద్ర జలాల ఉష్ణోగ్రత 26-27 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తుపాను తీరం దాటడానికి మూడు రోజుల ముందు అంటే అక్టోబర్ 9న విశాఖలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ విభాగం అధికారుల పరిశీలనలో సముద్ర ఉష్ణోగ్రత 29-30 డిగ్రీలకు పెరిగినట్టు నిర్ధారించారు. ఐదుగురు శాస్త్రవేత్తలు, మరో ఐదుగురు విద్యార్థుల బృందం తుపాను తీరం దాటిన ఐదు రోజుల తర్వాత (అక్టోబర్ 17న) విశాఖపట్నం (కోస్టల్ బ్యాటరీ), తుపాను తీరం దాటిన ప్రాంతంగా భావిస్తున్న పూడిమడక సమీపంలోని అచ్యుతాపురంల నుంచి సముద్రంలోకి 30 కిలోమీటర్ల దూరం బోటులో వెళ్లారు. ఆ సమయంలో ఉష్ణోగ్రతలు, లవణ సాంద్రత, ఆక్సిజన్ వంటివి పరిశీలించారు. అప్పట్లో సముద్ర ఉష్ణోగ్రత దాదాపు 30 డిగ్రీలు ఉన్నట్టు అంచనాకొచ్చారు. అక్టోబర్ 9-12 తేదీల మధ్య సైక్లోన్ ట్రాక్ వెంబడి సముద్ర జలాల ఉష్ణోగ్రత సాధారణం కంటే రెండు డిగ్రీల తక్కువగా ఉన్నట్టు తెలుసుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా అంటే మధ్య బంగాళాఖాతం నుంచి విశాఖ తీరం వరకూ (ట్రాక్ మార్గం) సముద్రజలాలు చల్లగా ఉన్నట్టు గుర్తించారు. పెరిగిన సముద్ర ఉష్ణోగ్రతలను బట్టి హుద్హుద్ తుపాను తీవ్ర రూపం దాల్చినా, సైక్లోన్ ట్రాక్ వెంబడి ఉష్ణోగ్రతల తగ్గుదల వల్ల బలహీనపడాలని పేర్కొంటున్నారు. కానీ అందుకు విరుద్ధంగా సైక్లోన్ ఎందుకు బీభత్సం సృష్టిం చిందనే దానిపై అధ్యయనం చేస్తున్నారు. నివేదికను గోవాలోని తమ హెడ్క్వార్టర్కు పంపుతామని విశాఖ ఎన్ఐవో సైంటిస్ట్ ఇన్చార్జి డాక్టర్ వి.ఎస్.ఎన్.మూర్తి ‘సాక్షి’కి తెలిపారు. అక్కడ సమగ్ర పరిశోధన జరిగాక స్పష్టత వస్తుందన్నారు. మరోవైపు గత ఏడాది సంభవించిన పైలీన్ తుపాను తీరం దాటే సమయంలో ఉష్ణోగ్రతలు, సైక్లోన్ ట్రాక్లో పరిస్థితిపై పరిశోధిస్తున్నారు. దీంతో పెద్ద, చిన్న తుపాన్లు వచ్చినప్పుడు సముద్ర ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయో, ఎలాంటి మార్పులు జరిగాయో తెలుసుకోగలుగుతారు.