breaking news
Ninong Ering
-
ఎమ్మెల్యేపై జాత్యహంకార వ్యాఖ్యలు: యూట్యూబర్ అరెస్ట్
అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై జాత్యహంకార వ్యాఖ్యలు చేసినందుకు లూథియానాకు చెందిన యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ పరస్ సింగ్ అలియాస్ బంటీపై కేసు నమోదు అయ్యింది. తన యూట్యూబ్ ఛానెల్ ''పరాస్ అఫీషియల్''లో ఆదివారం కాంగ్రెస్ ఎమ్మెల్యే నినోంగ్ ఎరింగ్ను భారతీయుడు కాదని, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం చైనాలో ఒక భాగం అని వ్యాఖ్యానించాడు. తర్వాత పోస్ట్ చేసిన మరో వీడియోలో, అతను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాడు. పరాస్పై జాతి విద్వేషానికి సంబంధించి కేసు నమోదైందని, ఇటానగర్లోని సైబర్ క్రైమ్ బ్రాంచ్ ఈ విషయంపై దర్యాప్తు చేస్తోందని డిజిపి ఆర్పి ఉపాధ్యాయ తెలిపారు. మరోవైపు సింగ్ అరెస్ట్ ను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు నిర్ధారిస్తూ నిందితుడిని తక్షణమే అరుణాచల్ ప్రదేశ్ పోలీసులకు అప్పగించాలని తాను లుథియానా పోలీస్ కమిషనర్ తో మాట్లాడానని వెల్లడించారు. సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని అరుణాచల్ ప్రదేశ్ సీఎం హెచ్చరించారు. "అరుణాచల్ ప్రదేశ్ ప్రజల పట్ల దుష్ప్రచారం, ద్వేషాన్ని ప్రేరేపించడమే ఈ వీడియో లక్ష్యం" అని అన్నారు. ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్ యూట్యూబ్ పోస్ట్ చూడటానికి "చాలా భయపడ్డాను" అని నొక్కిచెప్పాడు. ఇది "అరుణాచల్ ప్రదేశ్ ఎమ్మెల్యే జాతీయతపై సందేహాన్ని కలిగించడమే గాక, భారతదేశంలో తమ రాష్ట్ర ఉనికిని కూడా ప్రశ్నిస్తుంది" అని అన్నాడు. అయితే, ఈ కేసు విషయంపై యూట్యూబర్ పరస్ సింగ్ తల్లి స్పదించింది. తన కొడుకు తరుపున తాను క్షమాపణ చెబుతున్నట్లు తెలిపింది. అలాగే, తన కొడుకుపై ఎలాంటి కేసు నమోదు చేయవద్దు అని అధికారులను కోరింది. ప్రధాని నరేంద్ర మోడీకి ఎరింగ్ రాసిన లేఖపై స్పందిస్తూ సింగ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. ఈ లేఖలో పబ్జీ మొబైల్ను బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియాగా తిరిగి లాంచ్ కాకుండా నిషేధించాలని కోరాడు. చదవండి: పబ్జీ గేమింగ్ ప్రియులకు మరో చేదువార్త -
సోనియా, రాహుల్ దిగ్బ్రాంతి
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కలిఖో పుల్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కలిఖో పుల్ అకాలమరణం బాధ కలిగించిందని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కలిఖో పుల్ అరుణాచల్ ప్రదేశ్ కు తీరని లోటు అని మాజీ సీఎం నబమ్ తుకీ అన్నారు. ఈ కష్టకాలంలో పుల్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసాయిచ్చారు. కలిఖో పుల్ మృతి తనను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసిందని కాంగ్రెస్ నాయకుడు నినొంగ్ ఎరింగ్ వ్యాఖ్యానించారు. ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో అర్థం కావడంలేదన్నారు. సీఎం నివాసంలోనే పుల్ ఉంటున్నారని, ఒంటరితనం కారణంగా ఆయన ఆత్మహత్యకు పాల్పడివుండొచ్చని పేర్కొన్నారు. చివరిసారి ఆయనతో మాట్లాడినప్పుడు రాష్ట్రం పట్ల సానుకూలంగా మాట్లాడారని, అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు మరోసారి తనను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారన్న ఆశాభావాన్ని పుల్ వ్యక్తం చేశారని చెప్పారు.