breaking news
Nhava sheva
-
రూ. 2,000 కోట్ల హెరాయిన్ పట్టివేత
ముంబై: ఇరాన్ నుంచి సముద్రం ద్వారా ముంబైలోకి అక్రమంగా రవాణా చేస్తున్న 293.81 కిలోలు, అంతర్జాతీయ మార్కెట్లో రూ. 2,000 కోట్ల విలువ చేసే హెరాయిన్ను రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ సరుకును నవీ ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ ఓడరేవు నుంచి రహదారి ద్వారా పంజాబ్కు రవాణా చేయాల్సి ఉంది, ఈ క్రమంలో అక్కడ అధికారులు దీనిని అడ్డుకుని ఆరు గన్నీ సంచుల్లో ఉన్న హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. డీఆర్ఐ ప్రకారం.. జప్తు చేసిన హెరాయిన్ను టాల్కమ్ రాళ్లతో రెండు కంటైనర్లలో దాచినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పంజాబ్లోని తరన్ టార్న్ ప్రాంతానికి చెందిన ప్రభుజిత్ సింగ్ అనే సరఫరాదారుని మధ్యప్రదేశ్కు చెందిన మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. గత వారం జూన్ 28న ఢిల్లీ విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు ఇద్దరు దక్షిణాఫ్రికా పౌరుల నుంచి రూ.126 కోట్ల విలువైన హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు.అంతే కాకుండా గత ఆరు నెలల్లో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు రూ.600 కోట్ల విలువైన హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నట్లు అక్కడి అధికారులు సోమవారం వెల్లడించారు. గత ఏడాది ఆగస్టులో ముంబై కస్టమ్స్, డీఆర్ఐ అధికారులు జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్లోని కార్గో కంటైనర్ నుంచి రూ.1,000 కోట్ల విలువైన 191 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ సరుకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి దేశంలోకి అక్రమంగా రవాణా చేసినట్లు అధికారులు అనుమానం వ్యక్త చేసిన సంగతి తెలిసిందే. -
న్యూయార్క్ వెళ్లే కంటైనర్ లో నిద్రపోయి..
నవీ ముంబై: నగరంలో తయారుచేసిన మహిళల చెప్పులను అమెరికాలోని న్యూయార్క్ కు ఎగుమతి చేసేందుకు సిద్ధం చేసిన కంటైనర్ లో ఓ యువకుడిని ఉంచి మూసేశారు. శనివారం సాయంత్రం కంటైనర్ ను షిప్పింగ్ కోసం తరలిస్తున్న సమయంలో పెద్దగా కేకలు వేస్తూ కంటైనర్ గోడల మీద కొడుతున్నట్లు శబ్దం వస్తుండటంతో అనుమానించిన అధికారులు కంటైనర్ ను తెరచి చూసి యువకుడిని రక్షించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిరా రోడ్డులో ఉన్న ఓ ప్రముఖ షూ కంపెనీలో పనిచేసే ఓ వర్కర్ 555 షూ కార్టన్లను కంటైనర్ లో సర్ధి అక్కడే నిద్రపోయాడు. దీంతో కంటైనర్ ను నింపడం పూర్తయిందని భావించిన కంపెనీ అధికారులు కంటైనర్ డోర్లను మూసేసి శనివారం ఉదయం నవీ ముంబైలోని పోర్టుకు పంపారు. సాయంత్రం కంటైనర్ ను షిప్ లోనికి తరలించేముందు లోపలి నుంచి శబ్దాలు వస్తుండటంతో కస్టమ్స్ అధికారులు కంటైనర్ ను తెరచి యువకుడిని రక్షించారు. కార్గో షిప్ న్యూయార్క్ కు చేరుకోవడానికి దాదాపు 20 గంటలకు పైగా సమయం పడుతుందని అంతసేపు ఏ వ్యక్తి కూడా కంటైనర్ లో ప్రాణాలతో ఉండరని తెలిపారు. యువకుడికి మెడికల్ టెస్టులు చేయించినట్లు చెప్పారు. మద్యం సేవించడం వల్లే అతను కంటైనర్ లో నిద్రపోయాడని తేలినట్లు వివరించారు.