breaking news
Netball Tournament
-
National Games 2022: తెలంగాణ నెట్బాల్ జట్టుకు రజతం
అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో తెలంగాణ రాష్ట్రం ఖాతాలో నాలుగో పతకం చేరింది. టేబుల్ టెన్నిస్ (టీటీ)లో ఇప్పటికే మూడు పతకాలు లభించగా... తాజాగా నెట్బాల్ క్రీడాంశంలో తెలంగాణ జట్టుకు రజత పతకం దక్కింది. భావ్నగర్లో శుక్రవారం జరిగిన పురుషుల నెట్బాల్ ఫైనల్లో తెలంగాణ 73–75తో (16–9, 12–18, 16–20, 29–28) హరియాణా చేతిలో పోరాడి ఓడిపోయింది. రజత పతకం నెగ్గిన తెలంగాణ జట్టులో బి.విక్రమాదిత్య రెడ్డి, సయ్యద్ అమ్జాద్ అలీ, జన్ను హరీశ్, కంబాల శ్రీనివాసరావు, ముజీబుద్దీన్, మొహమ్మద్ ఇస్మాయిల్, పి.వంశీకృష్ణ, కె.సుమన్, కురకుల సంయుత్, బి.రంజీత్ కుమార్, సయ్యద్ మొహమ్మద్ అహ్మద్, ఎన్.లునావత్ అఖిల్ సభ్యులుగా ఉన్నారు. మహిళల టీమ్ టెన్నిస్లో తెలంగాణ జట్టు తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. తెలంగాణ 0–2తో గుజరాత్ చేతిలో ఓడిపోయింది. మరోవైపు మహిళల వెయిట్లిఫ్టింగ్లో టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత, కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ మీరాబాయి చాను 49 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. మణిపూర్కు ప్రాతినిధ్యం వహిస్తున్న మీరాబాయి మొత్తం 191 కేజీలు (స్నాచ్లో 84+క్లీన్ అండ్ జెర్క్లో 107) బరువెత్తి అగ్రస్థానంలో నిలిచింది. -
రాష్ట్రస్థాయి నెట్బాల్ టోర్నీ షురూ
యాకుత్పురా: రాష్ట్ర క్రీడల సమాఖ్య, ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సంయుక్తంగా నిర్వహిస్తోన్న తెలంగాణ రాష్ట్ర సీనియర్ నెట్బాల్ చాంపియన్షిప్ శుక్రవారం ప్రారంభమైంది. గౌలిపురాలోని ఆలె నరేంద్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరుగుతోన్న ఈ టోర్నీని నిజాం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎల్.బి. లక్ష్మీకాంత్ రాథోడ్ ప్రారంభించారు. మహిళల, పురుషుల విభాగాల్లో ఆదివారం వరకు పోటీలు జరుగుతాయి. ఇందులో రంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన జట్లు పాల్గొంటున్నాయి. శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రారంభోత్సవంలో బీజేపీ నగర ఉపాధ్యక్షులు చర్మాణి రూప్రాజ్, మాజీ కార్పొరేటర్ ఆలె జితేంద్ర, హైదరాబాద్ నెట్బాల్ సంఘం ఉపాధ్యక్షులు సి.శ్రీధర్ చారి, కార్యదర్శి ఎం.విఘ్నేశ్వర్, కోశాధికారి ఎల్.శ్రీధర్ రావు, సభ్యులు వై.అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.