పోస్టల్ సిబ్బంది తప్పిదం.. నవోదయలో సీటు కోల్పోయిన విద్యార్థిని
ధరూరు : ఆ గ్రామానికి ఒక్కటే పోస్టుకార్డు వచ్చింది కదా.. అంటూ పోస్టల్ సిబ్బంది చే సిన తప్పిదానికి ఓ విద్యార్థిని వట్టెంలో వచ్చిన గురుకుల సీటును కోల్పోవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో 2014-15 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివి 9.2 జీపీఏ సాధించి ప్రథమ స్థానంలో నిలిచిన కొత్తపాలెం గ్రామానికి చెందిన సునీత జవహర్ నవోదయ వట్టెం కళాశాల ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకుంది. మండల టాపర్గా నిలిచిన ఆ విద్యార్థి ప్రతిభను గుర్తించి జిల్లా అధికారులు వట్టెం కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదివేందుకు సీటును కేటాయిస్తూ ప్రవేశం కల్పించి ధృవీకరణపత్రాలను పోస్టల్ ద్వారా పంపించారు. ఈనెల 2న గద్వాల హెడ్ పోస్టాఫీసుకు చేరిన ఆ ధ్రువీకరణపత్రాలు కొత్తపాలెం గ్రామంలో బట్వాడా చేయాలి.
ఆ గ్రామ పోస్టుమన్గా పనిచేస్తున్న వేములకు చెందిన భీమేష్ ఒక్క పోస్టే కదా.. అని 2న గద్వాల నుంచి స్వగ్రామమైన వల్లూరుకు వెళ్లిపోయాడు. వాస్తవానికి 3వ తేదీనే వట్టెం కళాశాలలో ప్రవేశం పొందాలి. వచ్చిన పోస్టును 8న అందించడంతో ఆ విద్యార్థిని మనోవేదనకు గురైంది. అదేరోజు వట్టెం కళాశాలకు చేరుకొని సీటు విషయమై అడుగగా రెండు, మూడురోజులపాటు మీ సీటు రిజర్వులోనే ఉంచామని, ఎంతకూ రాకపోవడంతో ఆ సీటు ఇతరులకు కేటాయించామని చెప్పడంతో ఆ విద్యార్థినితోపాటు తల్లిదండ్రులు బీపీఎం తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పోస్టల్ ఉద్యోగి కారణంగా తాము నష్టపోయిన సీటును తిరిగి తేగలిగితే బావుంటుం దని విద్యార్థిని తండ్రి తులసీరాం కోరుతున్నాడు. తామున్న పరిస్థితిలో ప్రైవేటు కళాశాలలో చదివించే స్థోమత లేదని, ఎలాగైనా తమకు సీటు కేటాయించాలని వారు కోరుతున్నారు.