breaking news
national rankings
-
బోధన.. వేదన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల కొరత విద్యాప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జాతీయ ర్యాంకింగ్లో యూనివర్సిటీలు వెనకబడుతున్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్–2023)లో దశాబ్దాల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ ఓవరాల్ ర్యాంకులో 64కు పడిపోయింది. గతేడాది ఓయూ 46వ ర్యాంకులో నిలిచింది. జేఎన్టీయూహెచ్ గతేడాది 76వ ర్యాంకుతో ఉంటే ఈ ఏడాది 98వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. అధ్యాపకుల కొరతే ఈ పరిస్థితికి కారణమని అన్ని వర్గాలూ భావిస్తున్నా ప్రభుత్వం మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు. గతేడాది తెలంగాణ యూనివర్సిటీల కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు బిల్లును అసెంబ్లీ ఆమోదించినా అది ఇంకా గవర్నర్ వద్దే పెండింగ్లో ఉంది. ఈ ఫైల్ను రాష్ట్రపతి పరిశీలనకు పంపామని గవర్నర్ పేర్కొన్నారు. 1,869 పోస్టులు ఖాళీ.. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లోనూ అధ్యాపకుల కొరత వేధిస్తోంది. అన్నిచోట్లా కాంట్రాక్టు అధ్యాపకులతోనే నెట్టుకొస్తున్నారు. విద్యాశాఖ గణాంకాల ప్రకారం 2021 జనవరి 31 నాటికి 11 యూనివర్సిటీల్లో 2,837 మంజూరైన పోస్టులు ఉండగా వాటిలో ఏకంగా 1,869 పోస్టులు ఖాళీగానే ఉండిపోయాయి. అంటే కేవలం 968 (34.12 శాతం) మందే రెగ్యులర్ ఆధ్యాపకులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం 157 మంది ప్రొఫెసర్లు ఉండగా మరో 238 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే 129 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండగా మరో 781 పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. 682 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తుండగా 850 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే 1,869 ఖాళీల్లో 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం మూడేళ్ల కిందటే ఆమోదం తెలిపినా ఇంతవరకు వాటిని భర్తీ చేయలేదు. ప్రొఫెసర్లేరి? ♦ రాష్ట్రంలో ఒక్క ప్రొఫెసర్ కూడా లేని యూనివర్సిటీలు ఆరు ఉన్నాయి. అవి శాతవాహన, మహత్మాగాంధీ, పాలమూరు, ఆర్జీయూకేటీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ. శాతవాహన, రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ), బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లే లేరు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ ఒకరే ఉన్నారు. మెుత్తంగా చూస్తే 11 యూనివర్సిటీల్లో 61.65 శాతం ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగానే ఉండిపోయాయి. మరోవైపు 85.82 శాతం అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండగా 55.48 శాతం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఉన్నత విద్యాశాఖ లెక్కలు వేసింది. ♦వందేళ్లకుపైగా చరిత్రగల ఉస్మానియా యూనివర్సిటీలో సగానికిపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీలో ఇప్పుడు కేవలం ఒక్కరే ప్రొఫెసర్ ఉండగా అసోసియేట్ ప్రొఫెసర్లు ఇద్దరే ఉన్నారు. శాతవాహన యూనివర్సిటీ, ఆర్జీయూకేటీ, బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఒక్కరంటే ఒక్కరూ లేరు. తెలుగు యూనివర్సిటీలో ఒక్క అసోసియేట్ ప్రొఫెసర్తోనే నెట్టుకొస్తున్నారు. జవహర్లాల్ నెహ్రూ ఆర్కిట్చెర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో (జేఎన్ఏఎఫ్ఏయూ) ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు బోధన సాగిస్తున్నారు. క్రమబద్ధీకరణ చేయరా? గత కొంతకాలంగా రెగ్యులర్ చేయాలని ఆందోళన చేస్తున్న యూనివర్సిటీల అసిస్టెంట్ ప్రొఫెసర్ల జేఏసీ ఆదివారం మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్రెడ్డి, నిరంజన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్రావులను కలిసింది. ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేసేందుకు కృషి చేయాలని వినతిపత్రం అందించింది. సోమవారం జరిగే కేబినేట్ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించాలని కోరింది. -
తెలంగాణ సిగపూవా.. బాగున్నావా?
మసకబారుతున్న వందేళ్ల కీర్తి ఏటేటా దిగజారుతున్న ఓయూ ప్రతిష్ట.. ఒకప్పుడు దేశంలోనే నంబర్ వన్.. నేడు 38వ ర్యాంకు - ఉస్మానియాలో పాఠాలు బోధించేవారే కరువు.. - తగ్గిపోయిన లెక్చరర్లు.. పడిపోతున్న ప్రమాణాలు - వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనన్ని ఖాళీలు - 12 విభాగాల్లో ఒక్క రెగ్యులర్ టీచరూ లేరు - 1,264 టీచింగ్ పోస్టులకు.. ఉన్నది 532 మందే - న్యాక్ గుర్తింపునకు కూడా నోచుకోని దుస్థితి సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ.. చదువులమ్మ ఒడి! ఉద్యమాల గుడి!! విద్యా పరిమళాలకైనా.. పోరాట కెరటాలకైనా అదే కేరాఫ్.. దేశవిదేశాల్లో సైతం కీర్తి పతాకను ఎగురవేసిన ఘన చరిత్ర.. పీవీ నరసింహారావు వంటి ఎందరో మహామహులను అందించిన కీర్తి.. ఐఐటీలో సీటు సాధించడం కంటే ఈ యూనివర్సిటీలో చదవడమే గొప్ప అనుకునే రోజులు.. ఇదంతా ఒకప్పటి ఓయూ వైభవం. ఇప్పుడు అది కనుమరుగైంది. రోజురోజుకు పడిపోతున్న ప్రమాణాలతో వర్సిటీ ప్రతిష్ట మసకబారిపోతోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుతున్నానంటే.. ‘అవునా ఇప్పుడెలా ఉంది..’అని జాలిగా పలకరించే రోజులొచ్చాయి. ఫ్యాకల్టీ ఉందా? బోధన కొనసాగుతోందా? అని ప్రశ్నించే దుస్థితి ఏర్పడింది. మరో 25 రోజుల్లో వందేళ్ల పండుగకు ముస్తాబవుతున్న ఓయూలో.. అధ్యాపకుల ఖాళీలు, భర్తీకి ముందుకు పడని అడుగులు పాలకుల వైఖరిని వెక్కిరిస్తున్నాయి. చివరకు యూనివర్సిటీ అభివృద్ధికి కేంద్రం ఇచ్చే నిధులను తెచ్చుకోవడంలో కీలకమైన నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపు కోసం ఆపసోపాలు పడాల్సిన స్థితిలో విశ్వవిద్యాలయం సతమతం అవుతోంది. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్లో భాగంగా సోమవారం కేంద్రం ప్రకటించిన ర్యాంకింగ్లోనూ వర్సిటీ వెనుకబడిపోయింది. ఒకప్పుడు దేశంలోనే నంబర్ వన్ యూనివర్సిటీగా ఉన్న ఓయూ ఇప్పుడు బోధన సిబ్బంది లేని కారణంగా నేషనల్ (ఓవరాల్) ర్యాంకింగ్లో 38వ స్థానంతో సరిపెట్టుకుంది. కేంద్రం ఇచ్చే ర్యాంకులకు ప్రధానంగా పరిగణనలోకి తీసుకునే ఐదు అంశాల్లో మొదటిది.. ప్రధానమైందీ టీచింగ్, లెర్నింగ్, రీసోర్సెస్. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం అదే కరువైంది. బోధించే వారు లేరు. 12 విభాగాల్లో ఒక్క రెగ్యులర్ అధ్యాకులు లేరు. 1,264 అధ్యాపక పోస్టుల్లో 58 శాతం పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. కేవలం 532 మందితో బోధన కొనసాగిస్తుండడంతో నేషనల్ ర్యాంకింగ్లో చతికిల పడింది. యూనివర్సిటీల కేటగిరీ ర్యాంకింగ్లో గతేడాది 33వ స్థానంలో ఉన్న ఓయూ ఈసారి 23వ ర్యాంకులో నిలవడం గుడ్డిలో మెల్ల. అదే రెగ్యులర్ సిబ్బంది, మౌలిక సదుపాయాలు సరిపడా ఉంటే వర్సిటీ పరిస్థితిలో కొంత మార్పు ఉండేదన్నది విద్యావేత్తల అభిప్రాయం. ఏ విభాగం చూసినా ఖాళీలే.. ఉస్మానియాలో పలు విభాగాల్లో బోధకులే కరువయ్యారు. ఫుడ్ అండ్ న్యూట్రిషన్, ఫ్రెంచ్, జర్మన్, రష్యన్, థియేటర్ ఆర్ట్స్ విభాగాల్లో ఒక్క రెగ్యులర్ టీచర్ కూడా లేరు. కీలకమైన ఎకనామిక్స్ విభాగంలో 40 మంది టీచర్లకు 11 మంది మాత్రమే ఉన్నారు. హిస్టరీలో 25 మందికిగాను ముగ్గురు, సైకాలజీలో ఇద్దరు, సోషియాలజీలో నలుగురు, బయోమెడికల్లో 19 మందికి ఆరుగురు మాత్రమే పనిచేస్తున్నారు. అత్యధిక అవకాశాలు ఉన్న గ్రంథాలయ విభాగంలో ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఇంజనీరింగ్ కేటగిరీలో ఈసీఈ విభాగానికి అధిపతే లేరు. జెనెటిక్స్, బయోటెక్నాలజీ విభాగాల్లో సగం పోస్టులే భర్తీ అయ్యాయి. జియోగ్రఫీలో 15 మందికి ఏడుగురు, జియాలజీలో 30 మందికిగాను నలుగురు మాత్రమే కొనసాగుతున్నారు. టెక్నాలజీలో 66 మందికిగాను 18 మంది మాత్రమే ఉన్నారు. కీలక విభాగాల్లో అరకొరగా టీచర్లుండడంతో బోధన ప్రమాణాలు ప్రశ్నార్థకంగా మారాయి. ప్రతి సంవత్సరం వర్సిటీ పరిధిలో గరిష్టంగా 30 నుంచి 40 మంది టీచర్లు పదవీ విరమణ పొందుతున్నారు. 2005 నుంచి వర్సిటీలో టీచర్ల నియామకాలు పూర్తిస్థాయిలో జరగడంలేదు. ప్రస్తుతం 53 విభాగాల్లో 732 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతేడాది న్యాక్ అక్రెడిటేషన్ కోల్పోయిన ఓయూ తాజాగా మరోమారు దరఖాస్తు చేసుకుంది. త్వరలో న్యాక్ బృందం ఓయూకు రానుంది. అప్పటిలోగా పూర్తిస్థాయి టీచర్ పోస్టులు భర్తీ చేస్తేనే గుర్తింపు దక్కే అవకాశముంది. కాంట్రాక్టు, పార్ట్టైమ్, గెస్ట్ టీచర్లతో బోధన విశ్వవిద్యాలయంలో బోధన ప్రక్రియ గాడి తప్పుతోంది. ఏళ్ల తరబడి బోధకుల నియామకాలు చేపట్టడం లేదు. వర్సిటీ పరిధిలో 58 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వర్సిటీతోపాటు అనుబంధ కాలేజీలైన సికింద్రాబాద్, నిజాం, ఉమెన్స్ కాలేజీల్లో కలుపుకొని 1,264 మంది అధ్యాపకులు ఉండాలి. కానీ 532 మంది మాత్రమే ఉన్నారు. కాంట్రాక్టు, పార్ట్ టైమ్, గెస్ట్ టీచర్లతో బోధనను నెట్టుకొస్తున్నారు. వర్సిటీలో పరిశోధన కార్యక్రమాలు సైతం వెనకబడుతున్నాయి. న్యాక్ గుర్తింపు సైతం లేకపోవడం గమనార్హం.