breaking news
National Internet Exchange of India
-
ఈ-కామర్స్కు డొమైన్ బూస్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటర్నెట్ రంగంలో విప్లవాత్మక మార్పులకు భారత్ వేదిక కానుంది. డాట్(.) భారత్ ఎక్స్టెన్షన్ రాకతో ఇప్పుడు ఇంగ్లీషు రానివారు సైతం నెట్లో విహరించేందుకు మార్గం సుగమం అయింది. ఇంటర్నెట్ విషయంలో అత్యంత వేగంగా వద్ది చెందుతున్న భారత్లో ప్రధాన అడ్డంకి దాదాపు తొలగిపోయినట్టే. ఉత్పత్తులు, సేవలు, విద్య తదితర రంగ సంస్థలు ఇక నుంచి తమ వెబ్సైట్లను స్థానిక భాషల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. రంగమేదైనా సమాచారం స్థానిక భాషలో తెలుసుకునేందుకు సామాన్యుడికి వీలైంది. రానున్నరోజుల్లో ఈ-కామర్స్తోపాటు సమాచార, సాంకేతిక రంగంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకోనున్నాయని నిపుణులు అంటున్నారు. ఏమిటీ డాట్ భారత్.. డొమైన్ పేర్లు ఇప్పటి వరకు ఇంగ్లీషులోనే ఉండేవి. డాట్ భారత్ ఎక్స్టెన్షన్ రాకతో హిందీ, మరాఠి, కొంకణి, మైథాలి, నెపాలీ, బోరో, డోగ్రి, సింధి భాషల్లో వెబ్సైట్ పేర్లను నమోదు చేసుకునే అవకాశం లభించింది. కొద్ది రోజుల్లోనే తెలుగుతో సహా బెంగాళి, గుజరాతి, ఉర్దూ, తమిళ్, పంజాబి భాషలకు కూడా ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. అయితే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ మాత్రం ఇంగ్లీషులో ఉంటుంది. స్థానిక భాషలో ఇంటర్నెట్ వెబ్ చిరునామా (డొమైన్) టైప్ చేస్తే చాలు. ఉదాహరణకు ఠీఠీఠీ. ఎన్ఎండీసీ.భారత్ అన్నమాట. డాట్ భారత్ ఎక్స్టెన్షన్ను నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇం డియా(నిక్సి) అభివృద్ధి చేసింది. ఇప్పటికే ఉన్న ‘డాట్ ఇన్’ డొమైన్ ఎక్స్టెన్షన్కు రిజిస్ట్రీగా నిక్సి వ్యవహరిస్తోంది. కంటెంట్కేం కొదవ లేదు..: ఏ వెబ్సైట్లో ఏముందో తెలుసుకోవడం ఇంగ్లీషు రానివారికి కష్టమే. ఇదంతా గతం. ఇప్పుడు నిక్సి చొరవతో ప్రపంచంలో ఏ మూలనున్నా, ఏ విషయాన్నైనా తెలుసుకోవచ్చు. చాలా వెబ్సైట్లు ఇప్పటికే స్థానిక భాషల్లో కంటెంట్(విషయం) అందిస్తున్నాయి. కంటెంట్ డెవలపర్లూ భారత్లో కోకొల్లలు. డెవలపర్లకూ ఇప్పుడు నూతన వ్యాపార వేదికలు దొరికినట్టే. కొత్త కొత్త యాప్స్ మార్కెట్లోకి వస్తాయి. విప్లవం ఇప్పుడే మొదలైందని అంటున్నారు డొమైన్ ఇన్వెస్టర్ అరవింద్ రెడ్డి. తెలుగు కీ బోర్డులు, కంటెంట్ విస్తృతమైతే సామాన్యుడికి చేరువ అయినట్టేనని చెబుతున్నారు. తెలుగు భాషను ఆధారంగా చేసుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎంత కాదన్నా 1,500 మంది యాప్ డెవలపర్లు ఉంటారని సమాచారం. వినియోగమూ పెరుగుతుంది.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 కోట్ల మందికిపైగా ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారని గూగుల్ చెబుతోంది. 2018 నాటికి 50 కోట్ల మందికిపైగా నెట్కు కనెక్ట్ అవుతారని గూగుల్ ఇండియా ఎండీ రాజన్ ఆనందన్ అంటున్నారు. ప్రతి నెల 50 లక్షల మంది కొత్త వినియోగదారులు వచ్చి చేరుతున్నారు. మొబైల్ ద్వారా ఇంటర్నెట్ వాడేవారు 15.5 కోట్ల మంది ఉన్నారు. 2017 నాటికి వీరి సంఖ్య 48 కోట్లను తాకుతుందని సర్చ్ ఇంజన్ దిగ్గజం అంటోంది. డాట్ భారత్ ప్రవేశంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశమూ లేకపోలేదు. అటు నేషనల్ ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్(ఎన్వోఎఫ్ఎన్) ప్రాజెక్టులో భాగంగా 2017 ఏడాది నాటికి 2.50 లక్షల గ్రామ పంచాయితీలకు హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ కల్పించాలిని కేంద్రం లక్ష్యంగా చేసుకుంది. ఇందుకోసం రూ.35 వేల కోట్లు వ్యయం చేస్తోంది. ఆన్లైన్ అమ్మకాలకు బూస్ట్... వాటర్ బాటిళ్లు సైతం ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేస్తున్నారు. దీనికంతటికీ కారణం సౌకర్యం. గుండు పిన్ను మొదలు విమానం దాకా ఆన్లైన్లో దొరుకుతున్నాయి. ఈ-కామర్స్ కంపెనీలు స్థానిక భాషల్లోనూ వెబ్సైట్లను తీర్చిదిద్దితే ఈ రంగంలో ఎవరూ ఊహించని అభివృద్ధి సాధ్యమవుతుందని నిక్సి సీఈవో గోవింద్ తెలిపారు. భారత్లో ఏ మూలనున్నా ఇంటర్నెట్ సౌకర్యం ఉండాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. ప్రస్తుతం ఆన్లైన్ రిటైల్ వ్యాపారం భారత్లో రూ.13,800 కోట్లుగా ఉందని... 2020 నాటికి ఇది 1.92 లక్షల కోట్లకు చేరుకుంటుందని పరిశోధన సంస్థ టెక్నోప్యాక్ చెబుతోంది. ఎన్వోఎఫ్ఎన్ ప్రాజెక్టుతో గ్రామీణ ప్రాంతాల్లో ఇ-కామర్స్ విస్పోటనం సంభవిస్తుందని కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవల వ్యాఖ్యానించారు. -
తెలుగులోనూ వెబ్సైట్ పేర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలుగు భాషలోనూ వెబ్సైట్ పేర్లు కొద్ది రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. తొలుత దేవనాగరి లిపి అంటే హిందీ, బోడో, డోగ్రి, మరాఠీ, మైథిలి, నేపాలీ, సింధి భాషలను పరిచయం చేస్తారు. ఆ తర్వాత తెలుగు, తమిళం, ఉర్దూ, పంజాబీ, గుజరాతీ, బెంగాలీ భాషలను తీసుకు రానున్నారు. డాట్ ఇన్ రిజిస్ట్రీగా వ్యవహరిస్తున్న నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా(నిక్సి) ఆగస్టు 27న డాట్ భారత్ ఎక్స్టెన్షన్ను ఆవిష్కరించనుంది. తద్వారా భారతీయ భాషల్లో వెబ్సైట్లు అందుబాటులోకి వస్తాయని నిక్సి సీఈవో గోవింద్ ఆదివారమిక్కడ జరిగిన వరల్డ్ డొమెయిన్ డే కార్యక్రమంలో చెప్పారు. తెలుగుతోసహా 14 దేశీయ భాషలు ఏడాదిలోగా వినియోగంలోకి వస్తాయన్నారు. డాట్ ఇన్ వెబ్సైట్లు 16 లక్షలున్నాయని, 2015 నాటికి 25 లక్షలకు చేర్చాలన్నది నిక్సి లక్ష్యమని చెప్పారు. రూ.1,500 కోట్ల వ్యాపారం.. అంతర్జాతీయంగా డొమెయిన్ల(వెబ్ అడ్రస్) వ్యాపార పరిమాణం 15% వృద్ధి రేటుతో రూ.1,500 కోట్లుంది. 76 కోట్ల వెబ్సైట్లలో భారత్కు చెందినవి కేవలం 20 లక్షలేనని వరల్డ్ డొమెయిన్ డే ఫౌండర్, యాక్సియామ్ సీఈవో ప్రఖార్ బిందల్ చెప్పారు. తిరుపతి బాలాజీ.కామ్ వెబ్సైట్ విక్రయం ద్వారా రూ.30 లక్షల ఆదాయాన్ని యాక్సియామ్ ఆశిస్తోంది. ప్రైవేటు ఈక్విటీ ద్వారా రూ.60 కోట్లు సమీకరించనున్నట్లు మెడికల్ బజార్.కామ్ ఎండీ కృష్ణ దేరెడ్డి తెలిపారు.