breaking news
National Infrastructure Fund
-
భోగాపురం ఎయిర్పోర్ట్లో రూ. 675 కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్లోని భోగాపురంలో అభివృద్ధి చేస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టులో నేషనల్ ఇన్వెస్ట్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్) రూ. 675 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయనుంది. విమానాశ్రయ నిర్మాణానికి ఏర్పాటైన జీఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (జీవీఐఏఎల్)లో ఈ మొత్తాన్ని పెట్టుబడి పెట్టేందుకు జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ (జీఏఎల్), ఎన్ఐఐఎఫ్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. సీసీడీల రూపంలో.. కంపల్సరీ కన్వర్టబుల్ డిబెంచర్స్ రూపంలో ఎన్ఐఐఎఫ్ ఇన్వెస్ట్ చేయనున్నట్లు జీఎంఆర్ గ్రూప్ తెలిపింది. జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ప్రాజెక్టులకు సంబంధించి ఇది తమ రెండో పెట్టుబడని ఎన్ఐఐఎఫ్ మాస్టర్ ఫండ్ మేనేజింగ్ పార్ట్నర్ వినోద్ గిరి తెలిపారు. హైదరాబాద్ తరహాలో భోగాపురం ఎయిర్పోర్ట్ మరో ప్రపంచ స్థాయి విమానాశ్రయంగా ఉండగలదని జీఎంఆర్ గ్రూప్ బిజినెస్ చైర్మన్ (ఎయిర్పోర్ట్స్) జీబీఎస్ రాజు తెలిపారు. డిజైన్, నిర్మాణం, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ ప్రాతిపదికన 40 ఏళ్ల వ్యవధికి భోగాపురం ఎయిర్పోర్టు ప్రాజెక్టును 2020లో జీవీఐఏఎల్ దక్కించుకుంది. ఏపీలోనే అతి పెద్ద విమానాశ్రయంగా ఆవిర్భవించనున్న ఈ ఎయిర్ పోర్టు వార్షిక ప్రయాణికుల సామర్థ్యం తొలి దశలో 60 లక్షలుగా ఉంటుంది. తర్వాత 4 కోట్లకు చేరనుంది. -
40వేల కోట్లతో జాతీయ ఇన్ఫ్రా నిధి
న్యూఢిల్లీ: మౌలిక రంగ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చే లక్ష్యంతో కేంద్రం రూ. 40,000 కోట్ల జాతీయ పెట్టుబడి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్)ను ఏర్పాటు చేసింది. దీనికి సీఈవో నియామక ప్రక్రియ జనవరి ఆఖరు నాటికి పూర్తి కాగలదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. రష్యా, సింగపూర్, బ్రిటన్, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ తదితర దేశాల సావరిన్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్.. ఎన్ఐఐఎఫ్లో పాలు పంచుకోవడంపై ఆసక్తి చూపిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్ఐఐఎఫ్ గవర్నింగ్ కౌన్సిల్ తొలి సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన ఈ విషయాలు తెలిపారు. ఫండ్ పనితీరును సమీక్షించేందుకు మార్చిలో కౌన్సిల్ మరోసారి సమావేశమవుతుందని చెప్పారు. ఈ నిధికి ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ (ఐఐఎఫ్సీఎల్) పెట్టుబడుల సలహాదారుగా ఆరు నెలల పాటు వ్యవహరిస్తుంది. అలాగే ఎన్ఐఐఎఫ్ ట్రస్టీ లిమిటెడ్ సంస్థకు ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్ సర్వీసెస్ ఏడాది పాటు సలహాదారుగా వ్యవహరిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎన్ఐఐఎఫ్కు బడ్జెట్ నుంచి ప్రభుత్వం రూ.20,000 కోట్ల మేర కేటాయింపులు జరపనుండగా, ప్రైవేట్ ఇన్వెస్టర్ల నుంచి మరో రూ. 20,000 కోట్లు వస్తాయని అంచనా. కొత్త వాటితో పాటు నిలిచిపోయిన ప్రాజెక్టులు, విస్తరణ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకు కేంద్రం దీన్ని ఏర్పాటు చేస్తోంది. దీని గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్గా ఆర్థిక మంత్రి వ్యవహరిస్తుండగా, ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య, కేంద్ర ఆర్థిక సర్వీసుల విభాగం కార్యదర్శి అంజలి చిబ్ దుగ్గల్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. ఇందులో ప్రభుత్వ వాటా 49శాతం లోపు ఉంటుంది.