సర్కారీ భూ దందా!
► ఖరీదైన భూముల విలువ కుదింపు
► కోట్లలో నష్టపోతున్న కత్తిపూడి ప్రజలు
► అభ్యంతరాల్ని పరిష్కరించకుండానే పరిహారం అవార్డులు
► అవసరానికి మించి భూసేకరణ
► రెండు జాతీయ రహదారుల మధ్య భూమిపై పెద్దల కన్ను
► అధికార పార్టీ నేతల కోసం అలైన్మెంట్ మార్చని వైనం
► 216 జాతీయ రహదారి రింగ్రోడ్డుపై ముదురుతున్న వివాదం
సాక్షి ప్రతినిధి, కాకినాడ : భవిష్యత్తు అవసరాల ముసుగులో అవసరానికి మించి భూసేకరణ చేయడంలో టీడీపీ సర్కారు తనదైన ముద్ర వేసుకొంటోంది. ఇప్పటికే రాజధాని అమరావతి కోసం వేలాది ఎకరాలను రైతుల పొట్టగొట్టి పోగేసినట్లే.. జిల్లాలోనూ అలాంటి వ్యవహారానికి తెరతీసింది! జిల్లా మీదుగా వెళుతున్న 16వ నంబరు జాతీయ రహదారిని జిల్లాలో కొత్తగా విస్తరించనున్న 216 నంబరు జాతీయ రహదారిని కత్తిపూడి వద్ద అనుసంధానం చేయనున్నారు. దీనివల్ల జరిగే అభివృద్ధిని అక్కడి గ్రామప్రజలు స్వాగతిస్తున్నా.. అర్థంపర్థంలేని భూసేకరణ విధానాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నష్టపరిహారం గణనలో ప్రభుత్వం, అధికారుల వైఖరిని తప్పుపడుతున్నారు.
తమ అభ్యంతరాల ను పరిష్కరించకుండానే పరిహారానికి సంబంధించిన అవార్డులను ప్రకటించేసి ‘వెన్నుపోటు’ పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలైన్మెంట్ మార్చితే అధికార పార్టీ నాయకుడొకరి భూములు పోతాయనే ఉద్దేశంతో నివాసాలపై నుంచే రింగ్రోడ్డు నిర్మించడానికి సిద్ధమవడాన్నీ తప్పుపడుతున్నారు. భవిష్యత్తు అవసరాల పేరుతో ఇళ్లు, స్థలాలను చౌకగా లాగేసుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు వివాదాస్పదమైంది. జిల్లాలో ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలోని కత్తిపూడి గ్రామం ఇప్పుడు కీలకమైంది. కోల్కతా-చెన్నై 16వ నంబరు జాతీయ రహదారిపై ఉండటమే కాక సమీపంలోనే అన్నవరం పుణ్యక్షేత్రం, కాకినాడ సెజ్, పోలవరం కాలువ ఉన్నాయి. ఇదే సమయంలో కొత్తగా విస్తరణ చేపట్టిన 216వ నంబరు జాతీయ రహదారి కత్తిపూడి వద్దే 16వ నంబరు జాతీయ రహదారితో అనుసంధానమవుతుంది.
భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింత కీలకమవుతుందనే ముందుచూపుతోనే అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులు కత్తిపూడి పరిసరాల్లో భారీగా భూములు కొనుగోలు చేశారు. ఆ నేతలే 216 జాతీయ రహదారి విస్తరణ వల్ల తమకేమాత్రం నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే వారి ప్రయోజనం కోసం తమ ఆస్తులకు నష్టం తలపెట్టటంపై కత్తిపూడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అక్కడ మారిన అలైన్మెంట్..
వాస్తవానికి 216 జాతీయ రహదారి జిల్లాలోనే కత్తిపూడి నుంచి గుడిమెల్లంక వరకూ 127 కిలోమీటర్ల పొడవున ఉంది. దీన్ని నాలుగు లైన్ల రహదారిగా విస్తరించడమే కాక కొన్నిచోట్ల బైపాస్రోడ్లు నిర్మించనున్నారు. ఈ పనులకు గత ఏడాది డిసెంబరులో కేంద్ర ఉపరితల, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ విజయవాడలో శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ రహదారి పనులపై సమీక్షిస్తున్నారు. కానీ నష్టపరిహారం విషయంలో అధికారుల లెక్కల్లో తేడాలొస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారని బాధితులు వాపోతున్నారు. ఇదే రహదారి విస్తరణ వల్ల తాటిపాకలో దాదాపు 200 ఇళ్లు, ఇతర నిర్మాణాలకు నష్టం జరుగుతుందని అక్కడి ప్రజలు చెబితే అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు చొరవ తీసుకొని అలైన్మెంట్ మార్పించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఏకంగా అక్కడ బైపాస్ రోడ్డును ప్రతిపాదిత ఏడు కిలోమీటర్ల కన్నా అలైన్మెంట్ మార్పుచేసి 14 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. కత్తిపూడిలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది.
కత్తిపూడిలో 16వ నంబరు జాతీయరహదారికి, కత్తిపూడి-కాకినాడకు ఆనుకొని పోలవరం కాలువకు ఇరువైపులా రాజమహేంద్రవరానికి చెందిన అధికార పార్టీ నేతకు సుమారు 50 ఎకరాల భూములు ఉన్నాయి. అలాగే మరికొందరు అధికార పార్టీ నాయకులు, వారి అనుచరులకు స్థలాలున్నాయి. పట్టణాలు, గ్రామాల్లో ప్రజల ఆస్తులు దెబ్బతినకుండా బైపాస్ రోడ్లు వేస్తున్నారు. కత్తిపూడిలో మాత్రం గ్రామ ప్రధాన రహదారి వెంబడే ఇప్పటికే ఉన్న 16వ నంబరు జాతీయ రహదారి ఫ్లైవోవరు పై నుంచే రింగ్రోడ్డు నిర్మించనున్నారు. గ్రామంపై నుంచి కాక నేరుగా 16వ నంబరు జాతీయ రహదారిని కలుపుతూ రోడ్డు నిర్మించే అవకాశం ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని, రింగ్రోడ్డుకే మొగ్గుచూపుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అవసరం లేని భూసేకరణ
రింగ్రోడ్డు నిర్మాణంతో 16వ నంబరు, 216వ నంబరు జాతీయ రహదారులు అనుసంధానమయ్యే చోట మధ్యలో 8 ఎకరాల భూమి ఉంది. వాస్తవానికి ఇది రోడ్డుకు అవసరం లేదు. కానీ ఆ భూమినీ భూసేకరణలో చేర్చేశారు. భవిష్యత్తులో ఎంతో కీలకమయ్యే భూమిపై అధికార పార్టీకి చెందిన నాయకులు కన్నేశారని స్థానికులు వాపోతున్నారు. తమ ఇళ్లు, షాపులు ఉన్న ఆ భూమిని సేకరణ నుంచి మినహాయించాలని డిమాండు చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ప్రభుత్వం నిర్ణయించిన రిజిస్ట్రేషన్ విలువే చదరపు గజానికి రూ.4,500 ఉంది.
కానీ అధికారులు మాత్రం రూ.1,231 చొప్పున లెక్క తేల్చారు. దీనికి 25 శాతం మాత్రమే అదనంగా చేర్చి నష్టపరిహారం చెల్లించడానికి అవార్డు జారీ చేశారు. మరో విశేషమేమిటంటే ఈ ఆస్తులపై అధికారులు కట్టిన లెక్కలే భిన్నంగా ఉన్నాయి. కత్తిపూడిలో ప్రజల ఆస్తుల విలువను గణించే పనిని జాతీయ రహదారికి ఒకవైపు కాకినాడ ఆర్ అండ్ బీ అధికారులకు, మరోవైపు తుని ఆర్అండ్ బీ అధికారులకు ప్రభుత్వం అప్పగించింది. రెండు సెంట్ల విస్తీర్ణంలో ఉన్న పెంకుటిల్లు విలువ రూ.29 లక్షలని కాకినాడ అధికారులు లెక్క తేల్చితే.. పక్కనే 3 సెంట్ల విస్తీర్ణంలోని పక్కా భవనానికి తుని అధికారులు రూ.20 లక్షలని లెక్కగట్టారు. ఇలా ఆస్తుల విలువ గణనలో తేడాలపై అభ్యంతరాలేమిటో తెలుసుకోకుండానే అధికారులు అవార్డు ప్రకటించడంపై బాధితులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వమే అన్యాయం చేస్తోంది..
మా కుటుంబానికి ఉన్న ఎలక్ట్రికల్ షాపు రింగ్రోడ్డు వల్ల పోతోంది. నష్టపరిహారం కూడా రిజిస్ట్రేషన్ విలువ కన్నా తక్కువే ఇస్తున్నారు. భూసేకరణ చట్టం ప్రకారం నాలుగు రెట్లు ఇవ్వాల్సి ఉన్నా కేవలం ఉన్న విలువలో నాలుగు రెట్లు తగ్గించి ఇవ్వడం దారుణం. 2008లోనే ఇంజనీర్ల లెక్క ప్రకారం మా షాపు విలువ రూ.8 లక్షలు. ఇప్పుడు రూ.30 లక్షల వరకూ ఉంది. కానీ అవార్డు ప్రకారం రూ.11 లక్షలే వస్తుంది. జీవనాధారం కోల్పోయే మాకు ప్రభుత్వం అన్యాయం చేస్తే ఎలా?
- గౌతు సతీష్, కత్తిపూడి
అవసరం లేకున్నా ఖాళీ చేయిస్తున్నారు..
భూమి విలువ గణనలో తేడాలు ఉండటంపై, మా అభ్యంతరాలు వినకుండా అవార్డు పాస్ చేయడంపై అదనపు జాయింట్ కలెక్టర్కు నాలుగుసార్లు వినతిపత్రాలు ఇచ్చాం. అధికార పార్టీ నేతల దృష్టికి తీసుకెళ్లాం. న్యాయం చేస్తామంటూనే అన్యాయం చేస్తున్నారు. నాకు ఒకే సర్వే నంబరులో ఉన్న ఇంటికేమో చదరపు గజాల చొప్పున నష్టపరిహారం లెక్కగట్టి, ఖాళీ స్థలం పాస్బుక్లో ఉందని సెంట్ల లెక్కన ఇస్తే తీవ్రంగా నష్టపోతాం. ఎకరం రూ.కోటి అయితే ఇక్కడ మాత్రం రూ.7 లక్షలు ఇస్తారట. రెండు జాతీయ రహదారుల మధ్యనున్న 8 ఎకరాల్లో 92 మందికి చెందిన ఇళ్లు, షాపులు ఉన్నాయి. రింగ్రోడ్డుకు అవసరం లేకున్నా అవన్నీ ఎందుకు ఖాళీ చేయిస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
- కేలంగి సోమరాజు, కత్తిపూడి