breaking news
naga mohan das
-
ప్రత్యేక మతం.. సీఎం సతమతం
సాక్షి, బెంగళూరు : లింగాయత్ ప్రత్యేక మతం అంశం రోజురోజుకు ప్రభుత్వానికి కొరకరాని కొయ్మగా మారుతోంది. లింగాయత్ను ప్రత్యేక మతంగా గుర్తించాలని వద్దని కొంతమంది మంత్రులు, స్వామీజీలు రెండు వర్గాలుగా విడిపోవడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డోలాయమానంలో పడిపోయారు. లింగాయత్లకు ప్రత్యేక మతానికి సంబంధించి నాగమోహన్దాస్ నివేదికను అమలుచేయాలని చూస్తే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగుతామని బాగల్కోటెలోని విరక్తి మఠాధీశుడు చంద్రశేఖర శివాచార్య స్వామీజీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రత్యేక లింగాయత్ మతం రాజుకుంటోంది. ఇక లింగాయత్ వర్గానికి చెందిన స్వామీజీలే రెండు వర్గాలు విడిపోవడం ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. నాగమోహన్దాస్ రెండు నెలల్లోనే నివేదికలు అందిచడం చూస్తుంటే వాటిలో ఏముందో స్పష్టమవుతోందంటూ జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి సర్కారును విమర్శించారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా లింగాయత్ ప్రత్యేక అంశానికి అనుకూలంగా మంత్రులు ఎం.బీ.పాటిల్,శరణప్రకాశ్ పాటిల్,వినయ్ కులకర్ణి, బసవరాజరాయరెడ్డిలు, వ్యతిరేకంగా మల్లికార్జున, ఈశ్వరఖండ్రెలు తీవ్రంగా గొంతెత్తినట్లు సమాచారం. రాష్ట్రంలోని ప్రముఖ వీరశైవ, లింగాయత్ మఠాధిపతులదీ ఇదే తీరు. అందరూ కయ్యానికి సిద్ధమనడంతో ముఖ్యమంత్రి ఆచితూచి అడుగులేస్తున్నారు. అందులో భాగంగా లింగాయత్ ప్రత్యేక అంశంపై ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా,ప్రకటనలు కూడా చేయకుండా సీఎం సిద్దరామయ్య జాగ్రత్తలు వహిస్తున్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇదే అంశంపై రెండు వర్గాలుగా విడిపోయిన మంత్రులు రాజీనామాలు చేస్తామంటూ హెచ్చరికలు చేయడంతో అందరితో కలసి చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామంటూ పరిస్థితి నుంచి బయటపడ్డట్లు సమాచారం. మంత్రుల ఆగ్రహం నేపథ్యంలోనే బుధవారం జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని సీఎం సిద్ధరామయ్య వచ్చే సోమవారానికి వాయిదా వేసినట్లు సమాచారం. -
చిన్నప్పరెడ్డి ఓ గొప్ప న్యాయమూర్తి
సాక్షి, బళ్లారి : జస్టిస్ ఒంటెద్దుపల్లి చిన్నప్పరెడ్డి ఓ గొప్ప న్యాయమూర్తి అని, ఆయన న్యాయమూర్తులకు, న్యాయవాదులకు స్ఫూర్తిగా నిలిచారని కర్ణాటక రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి నాగమోహన్దాస్ అన్నారు. ఆయన ఆదివారం నగరంలోని అల్లం సుమంగళమ్మ కళాశాలలో ‘జస్టిస్ చిన్నప్పరెడ్డి ఎ లెజెండ్’ అనే పుస్తకాన్ని విడుదల చేసిన అనంతరం మాట్లాడారు .జస్టిస్ చిన్నప్పరెడ్డి ఇచ్చిన తీర్పులు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. భారత న్యాయ వ్యవస్థలో చిన్నప్పరెడ్డి ఇచ్చిన తీర్పులను అన్ని వర్గాల ప్రజలు హర్షించారన్నారు. దేశ, విదేశాల్లో కూడా జస్టిస్ చిన్నప్పరెడ్డి తీర్పులను గౌరవించారని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, దేశంలో పలు రాష్ట్రాల హైకోర్టుల్లో న్యాయమూర్తిగా కూడా పని చేశారని, ఆయన తీర్పులు విభిన్నంగా ఉండేవని గుర్తు చేశారు. జస్టిస్ చిన్నప్పరెడ్డి అడుగు జాడల్లో న్యాయమూర్తులు నడవాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయమూర్తిగా ఉంటూ సమాజసేవ కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి అని, భూమి, ఆకాశం ఉన్నంత వరకు చిన్నప్పరెడ్డి పేరు న్యాయవ్యవస్థలో మరిచిపోలేమన్నారు. చిన్నప్పరెడ్డి పేరు మీద పుస్తకం విడుదల చేశారంటే ఆయన చేసిన గొప్ప పనులేమిటో ఇట్టే అర్థం అవుతుందన్నారు. లెజెండ్ అని పేరు రావడం కష్టమని, అయితే అది చిన్నప్పరెడ్డి లాంటి వారికే సాధ్యమవుతుందన్నారు. ముఖ్యంగా పుస్తకాలను నిరంతరం చదవడం నేర్చుకుంటే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్నారు. ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయంటే అది విద్యతోనే సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరూ మంచి మంచి పుస్తకాలు నిత్యం చదువుకోవడం అలవాటు చేసుకోవాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులు చదువుతోపాటు ప్రపంచ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలను, మేధావుల జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాలను చదవడం అలవాటు చేసుకుంటే అది వారి జీవితంలో మార్పు రావడానికి దోహదం చేస్తుందన్నారు. పుస్తకాలు చదవడంతో మన సంస్కృతి, వారసత్వాలను కూడా కాపాడుకోవడానికి వీలవుతుందన్నారు. భారతదేశంలో ప్రజాప్రభుత్వ వ్యవస్థ బలంగా ఉండటానికి ఇక్కడ ఉన్న న్యాయ వ్యవస్థ బలంగా ఉండటమే ప్రధాన కారణమన్నారు. దేశంలో పేదరిక నిర్మూలనకు ప్రతి ఒక్కరూ శ్రమించాలన్నారు. తరిమెల నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్టు అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ జస్టిస్ ఒంటెద్దుపల్లి చిన్నప్పరెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తి గాను, ఆంధ్రప్రదేశ్తోపాటు పలు రాష్ట్రాల్లో న్యాయమూర్తిగా పని చేశారని కొనియాడారు. తరిమెల మెమోరియల్ ట్రస్టు సమాజ సేవ కోసం పాటుపడుతోందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలోన్యాయమూర్తులు విశ్వేశ్వరభట్, అఖిల భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర కార్యదర్శి టీ.నారాయణస్వామి, బళ్లారి జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పాటిల్ సిద్ధారెడ్డి, సీఏ సంస్థల అధ్యక్షుడు రాజశేఖర్, వీవీ సంఘం అధ్యక్షుడు అల్లం గురు బసవరాజు తదితరులు పాల్గొన్నారు.