breaking news
Naa godava
-
'కాళోజీ నాగొడవ... ప్రజల గొడవే'
సాక్షి,సిటీబ్యూరో: ప్రజల గోడవను తన గోడవగా ప్రజా సమస్యలు, సమాజంలోని సమస్యలపై, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను వ్యతిరేకించి రచనలు, ఉపన్యాసాల ద్వారా వారి దృష్టికి తీసుకువచ్చిన మహా వ్యక్తి కాళోజీ అని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కితాబు నిచ్చారు. గురువారం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజాకవి పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి ఉత్సవం, పురస్కారం -2015 ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళోజీ ఎవరికీ బయపడని ధీరత్వం ఉన్న వ్యక్తి అని చె ప్పారు. ప్రాంతాల వారిగా మాండలికాలు ఉన్నాయని, తెలంగాణ మాండలికం కూడా భాషే అని తన కవిత్వం ద్వారా స్పష్టం చేశారని తెలిపారు.కాళోజీపై సీఎం కేసీఆర్ గౌరవంతో తెలంగాణ రాగానే కాళోజీ కళాక్షేత్రం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. కాళోజీ కళాక్షేత్రానికి భూమి, నిధులు కేటాయించామన్నారు. అందులో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించి, భావితరాలు కాళోజీని నిరంతరం గుర్తుంచుకొనేలా చేస్తామని తెలిపారు. ఆయనలా ప్రశ్నించే తత్వం, ధైర్యం అలవరచుకొంటే సమాజాన్ని ప్రక్షాళన చేయటం సుసాధ్యమేనన్నారు. తెలంగాణ మాండలికం కాదు..భాష అని చెప్పిన మహనీయుడు కాళోజీ అని కొనియాడారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ప్రత్యేక పరిస్థితులు(ఎమర్జెన్సీ) ఉన్న రోజుల్లో ధైర్యంగా ప్రజల్లోకి తిరిగి తన రచనలు చదివి వినిపిస్తూ ప్రసంగాలు చేసేవారన్నారు. తాను విద్యార్థిగా ఉన్న రోజుల్లో కాళోజీతో కలిసి పని చేశానని తెలిపారు. రాజ్యహింసకు వ్యతిరేకంగా 'మూమెంట్ ఫర్ అప్రషన్' స్థాపించారన్నారు. అన్ని వర్గాల ప్రజల ప్రక్షాన నిలిచిన వారికి ఎప్పటికైనా సమున్నత గౌరవం లభిస్తుందనడానికి.. ఈ ఉత్సవమే తార్కాణమని చెప్పారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ కాళోజీ పేరిట భాషాదినోత్సవం నిర్వహించుకోవటం గర్వకారణమన్నారు. కాళోజీ కవిత్వం, ఉపన్యాసాలు ప్రజల్ని చైతన్య పరిచాయన్నారు. ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేసిన మహనీయుడు కాళోజీఅని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి మాట్లాడుతూ 'అగిపోయిన ముందుకు సాగలేవు నీవు' అనే కాళోజీ కవితను స్ఫూర్తిగా తీసుకొని నేటి తరం ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ విముక్తి పోరాటం కోసం అందరికీ అర్థమయ్యే కవిత్వం రాసిన మహామనిషి కాళోజీ అని కొనియాడారు. -
‘మనసుల్నె ఉన్నడు.. మర్చిపోతమా’!
‘మనకాళోజీ’లో రుక్మిణి కాళోజీ అంతరంగ ఆవిష్కరణ కాళోజీ. కాళన్న. మన కాళోజీ. ఇదీ మూడు ముక్కల్లో కాళోజీ నారాయణరావు జీవితం. ఆర్యసమాజీకుడు, గాంధేయవాది, నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుడు, నైతిక వామపక్ష వాది అయిన కాళోజీ నారాయణరావు (1914- 2002) ప్రజాస్వామ్యంలో అత్యుత్తమ హోదా పౌరుడేనని అభివర్ణించేవారు. తన రక్తనాళ స్పందనను పౌరుడి ‘నాగొడవ’గా విన్పించారు. ‘ప్రమాదం దగ్గరకు కోరి పోలేదు, ప్రమాదం ఎదురైతే పారిపోలేదు’ అనగలిగిన ధీరుడు. కాళోజీ సామాజిక జీవితం అందరికీ సుపరిచితమే. కుటుంబజీవితం? స్ఫటికంలా స్పష్టంగా మాట్లాడడంలో కాళోజీకి సరిజోడు దివంగత రుక్మిణీ కాళోజీ. మంగళవారం సాయంత్రం సాలార్జంగ్ మ్యూజియంలో విడుదలకానున్న ‘మన కాళోజీ’ డీవీడీ నుంచి ముచ్చటగొలిపే రుక్మిణమ్మ పలుకులు... ‘అన్న తర్వాత ఇరవయ్యేళ్లకు పుట్టిన. చిన్నదాన్ని. మా మేనమామ దగ్గర చదువుకునేందుకు కాళోజీ ఇంటికొచ్చేవాడు. నాయన సంస్కృత పండితుడు. తెలియనివి అడిగేది. తెల్సుకునెటోడు. నాకు చదువు చెప్తనని చెవులు పిండెటోడు. నాకు ఎక్కాలు రాకుంటుండె. ఒకరోజు, మా మేనమామ కాళోజీని గురుదక్షిణ ఇయ్యమన్నడంట. ఏందంటె మేనకోడలిని చేసుకో అన్నడు. సరె పిల్లను చూస్తనన్నడు. రోజూ చూస్తున్నవ్ కదా అంటే, అది వేరన్నడంట. ఒక రోజొచ్చిండు. చూసిండు. పోయిండు. ఏమి చెప్పలే. నాలుగు రోజుల తర్వాత సరేనన్నడంట. పెండ్లి చేసుకుంటె పోషించటం ఎట్ల అనె కాళోజీ చింతను అన్న తీర్చిండు. నిన్ను చూసుకున్నట్లె కుటుంబాన్నీ చూసుకుంటనన్నడు వాళ్లన్న రామేశ్వరరావు. తీస్కపోయినోడు పెట్టడా? మా ఇంట్ల కాళోజీ మాములుగనే ఉండేది. పెండ్లయింది (కాళోజీ 26 రుక్మిణి 13). వాళ్లింట్ల అందరు పెద్దోళ్లేనాయ. బావ రామేశ్వరరావు, తోటి కోడలు, అత్త, అందరు పెద్దోళ్లేనాయ. ఈయన ఎవ్వరితోని మాట్లాడేది కాదు. అన్నతో మాట్లాడేది. దోస్తులతో. నాతోకూడా మాట్లాడేది కాదు. ఇంట్ల అంటి ముట్టనట్టుండేది. టిఫిన్ రెడి అయితెనే మొకం కడిగేది. నీళ్లు సిద్ధంగుంచాలె. రజాకార్లప్పుడు జైలుకు పోయిండు. జైలుకు టిఫిన్లు పంపుతుండేది. ఒక రోజు టిఫిన్ వాపసొచ్చింది. ఏందంటే, ఆయన్ను వరంగల్ నుంచి గుల్బర్గ జైలుకు పంపిన్రంట. తెలంగాణ ఉద్యమప్పుడు (1969) ఎస్.పి ఇంటికొచ్చిండు. అరెస్టు చేస్తానన్నడు. ‘నువ్వేంది అరెస్ట్ చేసేది నేనె వస్తున్న, పా’ అన్నడు. ఒంటి మీన బట్టల్తోనే బయటకు దారితీసిండు. ఏమన్న తీస్కపో, తినటానికి అంటె ‘తీస్కపోయినోడు పెట్టడా’ అన్నడు. ఘంటసాల క్యాంపు.. ఆయనకు మనసు బాగలేకపోతె ఎవ్వరిమీదైనా బాగ కోపమొస్తె కృష్ణాజిల్లాలోని ఘంటసాలకు పోయెటోడు. గొర్రెపాటి వెంకటసుబ్బయ్య ఇంట్ల నెలలు నెలలు ఉండెటోడు. కార్డన్న రాయాల్నా? రాయడు! వెంకటసుబ్బయ్యే రాసేది. తమ్ముడు కాళోజీ నా దగ్గరున్నడు దిగులు పడకండి అని. ఇక్కడికొచ్చేది. రోజూ కార్డెమ్మటి కార్డు రాసేది. కాశీ, రామేశ్వరం, ఢిల్లీ, తిరపతి తీసుకెల్లిండు. యాడకు పోయినా ఆయన తీరు మారదు. తిరపతికొచ్చి కొండెక్కలే. నేనె దర్శనం చేసుకున్న. పద్మవిభూషణ్ ఇచ్చేముందు ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ఈయనను ముందే అడిగిండు. ‘మొండోడు కదా. వాడిస్తనంటె ఎందుకు వద్దనాలె, నేనడిగిన్నా’ అన్నడు. అవార్డు తీసుకునేందుకు ఢిల్లీ ఒక్కణ్ణె పోతానన్నడు. నేనూ వస్తనని పట్టుపట్టి పోయినా. షష్టిపూర్తి నుంచి గడ్డం పెంచుకోవడం మొదలు పెట్టిండు. అంతకు ముందు లేదు. గడ్డం పెంచుకోకముందే బాగుండేవాడు. ఆ సంగతి చెప్పలే. చెప్తే ఇంటడా? ఆయనంటె నాకు ప్రేమలేదా? ఉందని ఆయన నాకు చెప్పలేదు. నేను ఆయనకు చెప్పలేదు. చెప్పాల్నా? ఆయన పండుకున్న మంచంలోనే పండ్తున్న. మనిషి ఎప్పుడు గుర్తే వస్తడు. మనసుల్నె ఉన్నడు గదా. మర్చిపోతనా! - పున్నా కృష్ణమూర్తి (సాక్షి, కల్చరల్ కరస్పాండెంట్)