breaking news
MV Raghu
-
30 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘కళ్లు’
గొల్లపూడి మారుతి రావు రాసిన కళ్లు నాటకం ఆధారంగా ఎం.వి.రఘు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కళ్లు’. 1988లో తెరకెక్కిన ఈ సినిమాలో శివాజీ రాజా ప్రధాన పాత్రలో నటించగా ప్రముఖ దర్శకులు ఈవీవీ సత్యనారాయణ ఈ సినిమాకు కో డైరెక్టర్గా పనిచేశారు. అంతేకాదు ఈ సినిమాలో మరెన్నో విశేషాలు ఉన్నాయి. ఈ సినిమాలోని రంగుడు పాత్రకు మెగాస్టార్ చిరంజీవి గాత్రదానం చేశారు. ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రీ ఈ సినిమాలో ‘తెల్లరిందే’ పాట కోసం గాయకుడిగా మారారు. ఇలా ఎన్నో విశేషాలు ఉన్న కళ్లు సినిమా రిలీజ్ అయి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిత్రయూనిట్ మీడియాలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తేజ్ మాట్లాడుతూ.. ‘కళ్లు’ సినిమా 30 వసంతాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సినిమాలు కొంత మందికి అవార్డ్ లని ఇస్తాయి, కొంత మందికి గుర్తింపు ని ఇస్తాయి, మరికొంత మందికి పేరును తీసుకొస్తాయి కొన్ని చిత్రాలు మాత్రమే గుర్తిండి పోతాయి. ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు అయినా చాలా అద్భుతంగా తీశారు ఎం.వి.రఘు గారు. భిక్షు గారు ద్వారా ఈ సినిమా కి డైరెక్టర్ గారికి అసిస్టెంట్ కావాలంటే నన్ను వైజాగ్ తీసుకెళ్లారు. అలా నేను కళ్లు సినిమా ద్వారా ఫస్ట్ టైం సినిమా షూటింగ్ చూశాను. నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ.. ‘ఎప్పుడూ ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ లు గురించి మాట్లాడటమే, కానీ ఎప్పుడో 30 ఏళ్ల క్రితం నేను నటించిన ‘కళ్లు’ సినిమా గురించి మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. వంశీ దర్శకత్వంలో కనకమహాలక్ష్మీ రికార్డింగ్ ట్రూప్ సినిమా అవకాశం చేజారిన బాధలో ఉన్న నాకు కళ్లు అవకాశం వరంలా దక్కింది. రఘు గారు ఈ సినిమాను చాలా నేచురల్ గా తెరకెక్కించారు. ఈ సినిమా నాకు రావడానికి కారణమైన ఇవివి గారికి రుణపడి ఉంటాను’అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, ఏడిద శ్రీరామ్, అనితా చౌదరి, బెనర్జీ, భిక్షపతి, కళ్లు కిష్టారావు, సురేష్ కొండేటి పాల్గొన్నారు. -
'ఆ సినిమాతో ఆ ముగ్గురు అరంగేట్రం చేశారు'
ఎంవీ రఘు...అనగానే ఎవరీయన అనేస్తాం...‘కళ్లు’ రఘు అంటే గుర్తుపట్టేస్తాం. దక్షిణ భారతదేశంలో ఉత్తమ సినిమాటోగ్రాఫర్గా నిరూపించుకొని, దర్శకుడిగా ‘కళ్లు’ సినిమాతో ‘నంది’ సహా పలు అవార్డులను అందుకొన్న సృజనకారుడు. సినిమాకు మూలమైన 24 ఫ్రేమ్స్పై శిక్షణనిస్తున్నారు. క్రేజీగా మారిన లఘుచిత్రాలపైనా ప్రత్యేకంగా వర్క్షాపులు నిర్వహిస్తున్నారు. సృజనకు సాంకేతికతను జోడించడంపై అవగాహన కల్పిస్తున్నారు. వర్క్షాపు ఏర్పాటు నిమిత్తం సోమవారం తెనాలి వచ్చిన రఘు, ‘సాక్షి’తో కొద్దిసేపు ముచ్చటించారు. వివరాలు ఆయన మాటల్లోనే... తెనాలి : మాది విజయవాడ. సినీఫొటోగ్రాఫర్ కావాలనేది చిన్ననాటి కోరిక. బీఎస్సీ కాగానే ఫొటోగ్రఫీలో డిప్లొమా చేశా. వీఎస్ఆర్ స్వామి నన్ను చెన్నైలోని విజయ-వాహినిలో కెమెరా విభాగంలో చేర్చారు. ఏడాదిలో 270 వివిధ భాషా సినిమాలకు ఉద్దండులతో పనిచేశాను. ‘భక్తకన్నప్ప’తో వీఎస్ఆర్ స్వామి నన్ను సహాయకుడిగా చేర్చుకున్నారు. ‘సిరిసిరిమువ్వ’, ‘అమరదీపం’కు పనిచేశాను. తర్వాత ఎస్.గోపాలరెడ్డి దగ్గర తొలి అసిస్టెంటుగా చేరా. చిరంజీవి, సుహాసిని జంటగా వచ్చిన ‘మగమహారాజు’తో సినిమాటోగ్రాఫర్గా నాకు తొలి అవకాశం. వంశీతో ‘సితార’, ‘అన్వేషణ’, ‘ఆలాపన’ చేశా. పూర్ణోదయాలో కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తీసిన ‘స్వాతిముత్యం’, ‘సిరివెన్నెల’ మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. సిరివెన్నెలతో నంది అవార్డు వచ్చింది. ఆస్కార్కు ఎంట్రీగా వెళ్లిన ఏకైక తెలుగు సినిమా స్వాతిముత్యం క్రెడిట్నిచ్చింది. సొంతంగా సినిమా తీద్దామని స్నేహితులు ప్రోత్సహించారు. 1970లో విజయవాడలో ఆంధ్రనాటక కళాపరిషత్ ప్రదర్శించిన గొల్లపూడి మారుతీరావు నాటిక ‘కళ్లు’ గుర్తొచ్చింది. రైట్స్ తీసుకొని 50 నిముషాల నాటికను 2.13 గంటల సినిమాగా మలచాను. ఊరూరూ తిరిగి నటీనటులను ఎంపిక చేసుకొన్నా. శివాజీరాజా, గుండు హనుమంతరావు ఆ సినిమాతో పాపులర్ అయితే, కళ్లు చిదంబరం, కొండవలస, రఘునాధరెడ్డి అరంగేట్రం చేశారు. సినిమాకు 30పైగా అవార్డులు వస్తే, దర్శకుడిగా నాకు 11 వచ్చాయి. కళ్లు రఘుగా ఇండస్ట్రీ పిలవటం ఆరంభించింది. తర్వాత మళ్లీ కెమెరా, దర్శకత్వం కొనసాగించా. మొత్తం 70 పైగా హిందీ, తమిళ్, కన్నడ, తెలుగు సినిమాలు చేశా. 1998లో చెన్నై నుంచి హైదరాబాద్ షిప్టయ్యాను. సినిమాకు సంబంధించిన అన్ని ఫ్రేమ్స్ను దగ్గరుండి చూసుకోవటమే కాకుండా ఆ పరిజ్ఞానాన్ని అధ్యయనం చేసిన నాకు, హైదరాబాద్ రాగానే కొత్త లైను దొరికింది. లైటింగ్, ఇతర ఎక్విప్మెంటు ఎదుట నటులు ఎలా మెలగాలి? అనే అంశంపై తరగతులు చెప్పించారు. సెంట్రల్ యూనివర్శిటీ, తెలుగు యూనివర్శిటీల్లో ఎంఏలో పెర్ఫార్మెన్స్ ఆర్ట్స్ విద్యార్థులకు క్లాసులు చెప్పాను. బటన్ నొక్కేవాడు కెమెరామెన్ కాడు.. స్టార్ట్ అని చెప్పినవాడు దర్శకుడు కాడు.. షాట్, లెన్స్, లైటింగ్, కెమెరా మూమెంట్... అనేవి తెలుసుకొని, చెప్పాలనుకున్నది పద్ధతిగా చెబితేనే క్రియేటివిటీ అవుతుంది. సినిమా అనేది సైన్స్ ఇన్ ఆర్ట్ ఫారం. ఫిల్మ్ మేకింగ్కు అవసరమైన వివిధ ఫ్రేమ్స్పై అవగాహన కోసం వర్క్షాపులు నిర్వహిస్తున్నా. ఈరోజుల్లో లఘుచిత్రాలు తీయటం పెద్ద క్రేజ్గా యువత ప్రేమిస్తోంది. యూ ట్యూబ్ వేదికయింది. 2-10 నిముషాల్లో తీసే సినిమాకు చాలా విజ్ఞత కావాలి. ఏ కొన్నో మినహా అధికశాతం చెత్తే.