breaking news
Mortuary van
-
మహిళ మృతదేహాన్ని అడవి వదిలేసిన మార్చురీ వ్యాన్ డ్రైవర్..
సాక్షి, నాగర్కర్నూల్/ మన్ననూర్: అనారోగ్యంతో ఆస్పత్రిలో మృతిచెందిన చెంచు మహిళ మృతదేహాన్ని మార్చురీ వ్యాన్ డ్రైవర్ దారి మధ్యలోనే అడవిలో వదిలిపెట్టిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని ఈర్లపెంటకు చెందిన చెంచు మహిళ మండ్లి గురువమ్మ (30) పది రోజుల కిందట అనారోగ్యంతో మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించింది. మహిళ మృతదేహాన్ని నల్లమల అటవీ ప్రాంతంలోని ఈర్లపెంటకు తరలించేందుకు అధికారులు మార్చురీ వ్యాన్ను ఏర్పాటు చేశారు. గురువారం అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ – శ్రీశైలం రహదారి పక్కన ఫర్హాబాద్ ఫారెస్ట్ గేటు వద్దకు రాగానే అడవి లోపలికి వెళ్లేందుకు దారి సరిగా లేదంటూ డ్రైవర్ మృతదేహాన్ని వ్యాన్ నుంచి దించి కిందపెట్టేశాడు. దీంతో కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం వరకు గురువమ్మ మృతదేహంతో పాటు ఫారెస్ట్ గేటు వద్దనే పడిగాపులు కాశారు. విషయం తెలుసుకున్న ఐటీడీఏ అధికారులు ఆటో ఏర్పాటు చేసి మృతదేహాన్ని ఈర్లపెంటకు తరలించారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్చురీ వ్యాన్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను కోరినట్టు మన్ననూర్ ఐటీడీఏ ఇన్చార్జి పీఓ రోహిత్రెడ్డి తెలిపారు. -
అమానవీయ ఘటన: బైక్పై తల్లి మృతదేహంతో 80 కిలోమీటర్లు!
షాదోల్: ఆస్పత్రిలో శవ వాహనం లేకపోవడంతో ప్రైవేట్ వాహనదారులకు రూ.5 వేలు చెల్లించుకోలేక తల్లి మృతదేహాన్ని ఓ పేద యువకుడు ఏకంగా 80 కిలోమీటర్లు బైక్ మీదనే తీసుకెళ్లాడు! బెడ్షీట్లో చుట్టిన తల్లి శవాన్ని 100 రూపాయలతో కొన్న చెక్కపై పెట్టి బైక్కు కట్టి, మరొకరిని వెనక కూచోబెట్టి నడుపుకుంటూ వెళ్లాడు. మధ్యప్రదేశ్లో జరిగిన ఈ సంఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అనుప్పుర్ జిల్లాకు చెందిన 60 ఏళ్ల జైమంత్రి యాదవ్ ఛాతీ నొప్పికి చికిత్స పొందుతూ షాదోల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో శనివారం అర్ధరాత్రి మరణించింది. శవ వాహనం లేదని ఆస్పత్రి వర్గాలు చెప్పడంతో మరో మార్గం లేక బైక్మీదే తీసుకెళ్లాల్సి వచ్చిందని కుమారుడు వాపోయాడు. కానీ అతను శవ వాహనం అడగనే లేదని మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ చెప్పారు. తమ వద్ద వాహనం లేని మాట నిజమే అయినా ఇలాంటప్పుడు జిల్లా ఆస్పత్రి నుంచో, స్థానిక సంస్థల నుంచో వాటిని సమకూరుస్తామన్నారు. -
వ్యాను దిగి వ్యాను ఎక్కాడు
దొంగిలిస్తే దొంగిలించాడు. మార్చురీ వ్యాన్ని దొంగిలించాడు! కొంత దూరం పోయాక వెనక్కు తిరిగి వ్యాన్లోకి చూస్తే.. లోపల శవం ఉంది. ‘ఓరి దేవుడో!’ అనుకుంటూ ఆ వ్యాన్ని తీసుకెళ్లి, దొంగిలించిన చోటే వదిలేశాడు. వదిలేస్తే వదిలేశాడు. అక్కడే ఇంకో వ్యాన్ని నొక్కేసి, డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. వెంటనే వాళ్లు ఇతడిని జైలు వ్యాను ఎక్కించారు. పోలీసులు అతడి మీద దొంగతనం కేసు పెట్టారు కానీ, శవాన్ని దొంగిలించే ప్రయత్నం చేశాడన్న కేసు మాత్రం పెట్టలేదు. శవం కోసం అతడు అంత పని ఎందుకు చేస్తాడులే అనుకుని చిన్న కేసుతో సర్దుకుపోయారు. కాలిఫోర్నియాలో ఇప్పుడిదే పెద్ద వార్త!