ఒకే ఒక్కడు..!
ఢిల్లీ.. దేశ రాజధాని! మెరిసిపోయే మెట్రోలు, రాజప్రసాదాల్లాంటి భవనాలు.. కానీ వాటి వెనుకే వికృతమైన మురికి కూపాలు. రోడ్ల పక్కన పేరుకుపోయిన చెత్త కుప్పలు, బస్టాండ్ల దగ్గర దుర్గంధాలు అలవాటైపోయాయి. చూసీచూడనట్టు ముక్కు ముడుచుకుని వెళ్లిపోవడం నగరజీవి దైనందిన చర్య అయిపోయింది. కానీ, ఆ మురికిని చూసి ఒక సామాన్యుడి రక్తం మరిగింది. అతనే మహమ్మద్ ఆసిఫ్ అలియాస్ ‘ఆసిఫ్ హిందుస్తానీ’. తన చేతిలోని కెమెరాను ఆయుధంగా, చీపురును ధ్వజంగా మార్చుకుని, ఏళ్ల తరబడి పేరుకుపోయిన పాలకుల నిర్లక్ష్యంపై ఆసిఫ్ ఒంటరి పోరాటం మొదలుపెట్టాడు. నలుగురికి 62 పార్కుల బాధ్యత ఆసిఫ్ చేసేది కేవలం వీధులు ఊడ్చడం కాదు.. ప్రభుత్వ అసమర్థతను నిలదీయడం.. ఢిల్లీలోని రోహిణిలో ఒక మురికి బస్టాండ్ను స్వయంగా శుభ్రపరచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారుల వెన్నులో వణుకు మొదలైంది. ఆయన నిగ్గు తేలి్చన వాస్తవాలు వింటే ఎవరికైనా మతిపోవాల్సిందే. పశి్చమ ఢిల్లీలో కేవలం నలుగురు పారిశుధ్య కార్మికులు కలిసి 62 పార్కులను నిర్వహించాలట! ఇది మనుషులకు సాధ్యమయ్యే పనేనా? పారిశుధ్య కారి్మకులకు పని చేయాలనే ఉన్నా, వారి దగ్గర సరైన పరికరాలు లేవు. కాలం చెల్లిపోయి, కనీసం చెత్తను లోడ్ చేయడానికి కూడా పనికిరాని తుప్పు పట్టిన వాహనాలు అధికారుల దౌర్భాగ్యానికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. నిర్లక్ష్యపు గోడలు బద్దలు కొడుతూ.. ‘పరిశుభ్రత.. అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, అది వ్యక్తిగత జవాబుదారీతనం’.. అని ఆసిఫ్ గట్టిగా నమ్ముతున్నాడు. చిప్స్ ప్యాకెట్ లేదా ప్లాస్టిక్ స్ట్రా రోడ్డుపై పారేసే ముందు ‘ఒక్క క్షణం ఆగి ఆలోచించండి’అని ఆయన పిలుపునిస్తున్నాడు. ఆ ఒక్క క్షణం చేసే ఆలోచనే నగరాన్ని మారుస్తుందన్నది ఆయన వాదన. మౌలిక వసతుల కన్నా మనుషుల మైండ్సెట్ మారడమే నిజమైన పరిష్కారమని నిరూపిస్తున్నాడు. వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూనే, పౌర బాధ్యతను గుర్తు చేస్తున్న ఆసిఫ్ పోరాటం ఇప్పుడు ఒక ప్రభంజనంలా మారుతోంది. రేపటి కల.. సంయుక్త పోరాటం ఆసిఫ్ లక్ష్యం కేవలం ఒక్క రోజు నిరసన కాదు. ఇది ఒక సుదీర్ఘ ప్రయాణం. యువతలో చైతన్యం తీసుకురావడం ద్వారా పరిశుభ్రతను ఒక అలవాటుగా మార్చాలని ఆయన ఆకాంక్షిస్తున్నాడు. ‘ప్రభుత్వం, పౌరులు కలిసి పనిచేసే ఒక పటిష్టమైన నమూనా రావాలి’.. అని ఆయన గొంతెత్తుతున్నాడు. అధికారుల ఏసీ గదుల వెనుక దాగున్న ఉదాసీనతను కడిగేయాలంటే, సామాన్యుడు ఇలా వీధిలోకి రాక తప్పదని ఆసిఫ్ తన ప్రతి అడుగుతోనూ చాటి చెబుతున్నాడు. – సాక్షి, నేషనల్ డెస్క్