‘మిస్ సుప్రా నేషనల్’
అంతర్జాతీయ అందాల పోటీల వేదికపై తొలిసారిగా భారతదేశానికి ‘మిస్ సుప్రా నేషనల్’ కిరీటాన్ని తెచ్చిపెట్టిన ముద్దుగుమ్మ ఆశాభట్ శనివారం బెంగళూరుకు చేరుకున్నారు. ఇటీవల పోలాండ్లో జరిగిన అంతర్జాతీయ స్థాయి అందాల పోటీల్లో 70దేశాలకు చెందిన ముద్దుగుమ్మలను వెనక్కినెట్టి ఆశాభట్ మిస్ సుప్రానేషనల్ కిరీటాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. శనివారం ఉదయం కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకున్న ఆమెకు కుటుంబసభ్యులు, స్నేహితులు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆశాభట్ మాట్లాడుతూ... తొలిసారిగా భారత్కు మిస్ సుప్రానేషనల్ అవార్డు తన ద్వారా లభించినందుకు ఎంతో గర్వ పడుతున్నానని అన్నారు. ఈ విజయాన్ని అందుకునేందుకు తనకు మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యులతో పాటు దేశ వాసులకూ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఆశాభట్ స్వగ్రామమైన భద్రావతిలో నేడు ఆమెను సన్మానించనున్నారు.
- సాక్షి, బెంగళూరు