అంగరంగ వైభవంగా బోనాలు
ఎంత ఖర్చైనా వెనుకాడేది లేదు
మంత్రులు తలసాని, పద్మారావు
రాంగోపాల్పేట్: ఉజ్జయినీ మహంకాళి బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, జాతరకు ఎంత ఖర్చైనా ప్రభుత్వం వెనుకాడబోదని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు చెప్పారు. బోనాల పండుగ ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. బోనాల జాతర సందర్భంగా మహంకాళి దేవాలయంలో వివిధ శాఖల అధికారులతో కలిసి మంత్రులు బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతేడాది 10 లక్షల మంది భక్తులు పాల్గొన్నారని చెప్పారు. ఈ సారి భక్తుల సంఖ్య మరో రెండు లక్షలు పెరిగే అవకాశం ఉందన్నారు. రోడ్లు, డ్రైనేజీ, మంచినీళ్లు, విద్యుత్ దీపాలు తదితర సమస్యలన్నింటినీ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా అదనపు ట్రాన్స్ఫార్మర్లు, జనరేటర్లను సమకూర్చుకోవాలని అధికారులకు సూచించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసేందుకు అన్ని శాఖల అధికారులతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. అంకితభావంతో పనిచేసే వారికే వలంటీర్లుగా అవకాశమివ్వాలన్నారు. టాస్క్ఫోర్స్ పోలీసుల అత్యుత్సాహంతో ఫలహార బండ్ల ఊరేగింపులో గతంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయన్నారు. లక్షల మంది భక్తులు పాల్గొనే జాతరలో పోలీస్ శాఖే కీలకమని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
మహంకాళి దేవాలయం, పరిసర ప్రాంతాల్లోని ఆలయాలను సర్వాంగ సుందరంగా అలంకరించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్రెడ్డి మాట్లాడుతూ జాతరకు అందరూ సహకరించి విజయవంతం చేయాలన్నారు. మహిళా భక్తుల కోసం ప్రత్యేకంగా మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నామని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ హరిచందన చెప్పారు. జాతర కోసం 70 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం కొమరయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అత్తెల్లి అరుణగౌడ్, ఆకుల రూప, తరుణి, హేమలత, కొలను లక్ష్మి, శేషుకుమారి, దేవాదాయ శాఖ ఆర్జేసీ కృష్ణవేణి, ఈవో అన్నపూర్ణ, ట్రాఫిక్ డీసీపీ చౌహాన్, ఆర్డీవో రఘురాంశర్మ, తహసీల్దార్ విష్ణుసాగర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.