breaking news
Minister umasri
-
నా చావుకు మంత్రే కారణం..
మాజీ మంత్రి జార్జ్, మంత్రి ఉమాశ్రీపై ఆరోపణలు బెంగళూరు: ‘నా కుటుంబానికి చెందిన ఆస్తి వివాదాన్ని పరిష్కరించి న్యాయం చేయాల్సిందిగా ఎంతగానో బతిమాలాను. అయినా పోలీసులు నన్ను పట్టించుకోలేదు. ఈ విషయాన్ని అప్పటి మంత్రి కె.జె.జార్జ్తో పాటు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉమాశ్రీ దృష్టికి తీసుకొచ్చినా వారు కూడా న్యాయం చేయలేదు. నా చావుకు వీరే కారణం’ అంటూ తన మరణానికి ముందు వీడియో రికార్డ్ చేశాడు రామనగర జిల్లా మాగడి తాలూకా గవినాగమంగళ గ్రామానికి చెందిన రైతు శివణ్ణ(65). వివరాలు.. శివణ్ణ కుటుంబానికి అదే గ్రామంలోని బంధువుల కుటుంబంతో ఆస్తి వివాదం ఉంది. ఈ గొడవల నేపథ్యంలోనే ఇటీవల శివణ్ణ కుటుంబ సభ్యులపై ప్రత్యర్థులు దాడి చేశారు. అంతేకాదు శివణ్ణ భార్యను నడిరోడ్డు పై వివస్త్రను చేసి అవమానించారు. ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. మంత్రుల దృష్టికి తన సమస్యను తీసుకెళ్లినా అక్కడ కూడా ఫలితం లేదు. ఈ నేపథ్యంలో ఇక తన సమస్యకు పరిష్కారం లభించదని భావించిన శివణ్ణ ఆదివారం సాయంత్రం తన ఇంట్లో విషం సేవించి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న క్రమంలోనే ఆదివారం తెల్లవారుఝామున శివణ్ణ మృతిచెందారు. మృతిచెందడానికి కాసేపటి ముందు శివణ్ణ ఇచ్చిన స్టేట్మెంట్ను ఆయన కుటుంబ సభ్యులు వీడియో రికార్డ్ చేశారు. ‘నా మరణానికి మాజీ మంత్రి జార్జ్, మంత్రి ఉమాశ్రీలు కారణం, అంతేకాదు డీవైఎస్పీ లక్ష్మీగణేష్, స్థానిక పోలీసులు కూడా నా చావుకు కారణం.’ అని వీడియోలో రికార్డ్ చేశారు. ఇదే సందర్భంలో డీజీపీ ఓం ప్రకాష్ కుమారుడు కార్తికేష్ పేరును కూడా శివణ్ణ పేర్కొనడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. -
మన సంస్కృతికి విరుద్ధం
కిస్ ఆఫ్ లవ్’పై రాష్ట్ర కన్నడ, సాంస్కృతిక శాఖ మంత్రి ఉమాశ్రీ బెంగళూరు : మోరల్ పోలీసింగ్కు వ్యతిరేకంగా నగరంలో కొందరు ప్రజాహక్కుల కార్యకర్తలు నిర్వహించ తలపెట్టిన ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమం భారతీయ సంస్కృతికి వ్యతిరేకమని రాష్ట్ర కన్నడ, సాంస్కృతిక శాఖ మంత్రి ఉమాశ్రీ వెల్లడించారు. గురువారమిక్కడి కేపీసీసీ కార్యాలయాన్ని సందర్శించి కార్యకర్తల సమస్యలను తెలుసుకున్న అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. మోరల్ పోలీసింగ్ను వ్యతిరేకించేందుకు ‘కిస్ ఆఫ్ లవ్’ తరహా కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రేమ, అభిమానం అనేవి సంస్కారం అనే పరిధిని దాటకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. సంస్కారమనే హద్దులు దాటే ఎలాంటి కార్యక్రమానికైనా భారతీయ సంస్కృతిలో స్థానం లేదని, అందువల్ల ఇలాంటి కార్యక్రమాలను తాను సమర్థించబోనని పేర్కొన్నారు. ఇక పరప్పన అగ్రహార జైలులోని మహిళా ఖైదీలపై అక్కడి వార్డర్లు లైంగిక హింసకు పాల్పడుతున్నారంటూ వచ్చిన ఆరోపణలపై ఆమె స్పందిస్తూ... ‘నేను ఈ విషయంపై పరప్పన అగ్రహార జైలులోని ఖైదీలను కలిసి మాట్లాడాను. వారు నాతో ఏ విషయాలైతే చెప్పారో అవే మీడియాకు సైతం వివరించాను. ఇందులో నేను సొంతంగా కల్పించినవి ఏమీ లేవు’ అని స్పష్టం చేశారు.