Minister Paritala Sunita
-
మంత్రి సునీత ఇలాకలో డ్వాక్రా మహిళల ఇబ్బందులు!
సాక్షి, అనంతపురం : మంత్రి పరిటాల సునీత ఇలాకలో డ్వాక్రా మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రుణం మంజూరు అయినా వాటిని డ్రా చేయటానికి అనుమంతిచటం లేదు కొందరు అధికారులు. వివరాల్లోకి వెళితే.. అనంతపురానికి చెందిన 16 డ్వాక్రా సంఘాలకు దాదాపు కోటి రూపాయల రుణం మంజూరు అయ్యింది. అయితే డబ్బు డ్రా చేయటంలో వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాప్తాడు ఏపీఎం గోపాల్, సీసీ అన్నపూర్ణలు డబ్బు డ్రా చేయటానికి అనుమతించటం లేదు. దీంతో చిన్మయ్ నగర్కు చెందిన కొందరు డ్వాక్రా మహిళలు డీఆర్డీఏ కార్యాలయానికి చేరుకుని ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు వైఎస్సార్ సీపీ, సీపీఎం, బీజేపీ నేతలు తమ మద్దతు తెలిపారు. తొమ్మిది నెలలుగా సమస్య ఉన్నా మంత్రి పరిటాల సునీత పట్టించుకోవటంలేదని డ్వాక్రా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అనంతపురం జిల్లా టీడీపీలో వర్గపోరు
-
ధర్మవరంలో ఉద్రిక్తత
⇒ మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే సూరి వర్గాల బాహాబాహీ ⇒ ఇరు వర్గాల మధ్య రాళ్ల వర్షం.. పోలీసు జీపు అద్దాలు ధ్వంసం ధర్మవరం: అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు కారణంగా ధర్మవరం పట్టణంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ధర్మవరం పట్టణంలోని తారకరామాపురం సబ్స్టేషన్ వద్ద పరిటాల వర్గీయులు పవన విద్యుత్ కేబుల్ పనులు చేస్తున్నారు. కనగానపల్లి మండలం తల్లిమడుగుల గ్రామం వద్దనున్న గాలిమరల నుంచి ఉత్పన్నమయ్యే పవన విద్యుత్ (విండ్ పవర్)ను ధర్మవరం 220/122/33 సబ్స్టేషన్కు పంపేందుకు సరయు కంపెనీ టెండర్ సబ్కాంట్రాక్టు తీసుకుని ఈ పనులు చేస్తున్నారు.అనుమతులు లేకుండా పనులు చేస్తున్నారని, వాటిని ఆపివేయాలని ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి వర్గీయులు పరిటాల వర్గీయులకు సూచించారు. ఆ మాటలను ఖాతరు చేయకుండా శుక్రవారం చిగిచెర్ల రోడ్డు వద్ద పనులు కొనసాగించారు. ఈ క్రమంలో చిగిచెర్ల రోడ్డు విస్తరణ పనులను ఎమ్మెల్యే సూరికి చెందిన నితిన్సాయి కన్స్ట్రక్ష న్స్ చేస్తోంది. ఈ పనులను పరిశీలించడానికి వచ్చిన ఎమ్మెల్యే కేబుల్ పనులు చేస్తున్న వారిని పిలిచి మందలించి వెళ్లిపోయారు. అయినా వారు పనులు ఆపకపోవడంతో ఆర్అండ్బి, ట్రాన్స్కో, పోలీసులకు ఆయన ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో పట్టణ సీఐ హరినాథ్ అక్కడికి వెళ్లి పనులు చేస్తున్న పరిటాల వర్గీయులను అడ్డుకున్నారు. తోపులాట.. రాళ్ల దాడి..: మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరాం.. రామగిరి, చెన్నేకొత్తపల్లి నుంచి సుమారు 200 మంది అనుచరులను «ధర్మవరానికి పంపారు. అప్పటికే సూరి వర్గీయులు అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట, రాళ్లు రువ్వుకోవడం జరిగింది. అనంతపురం నుంచి వచ్చిన స్పెషల్ పార్టీ పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ క్రమంలో పోలీసు వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎమ్మెల్యే సూరి అనుచరులు దాదాపు 15 మంది గాయపడ్డారు. జరిగిన ఘటనపై ఎమ్మెల్యే వరదాపురం సూరి ఎస్పీ రాజశేఖరబాబుకు ఫిర్యాదు చేశారు. -
పుష్కర భక్తులకు మిల్లర్ల ఉచిత భోజనం
సాక్షి, అమరావతి : పుష్కరాల్లో భక్తులకు భోజనాలు ఏర్పాటుకు మిల్లర్లు ముందుకు వచ్చారని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత చెప్పారు. గుంటూరులో శనివారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. అమరావతిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు రోజుకు 12 వేలమందికి ఐదు కూరలు, రెండు స్వీట్లతో భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నీరు, విద్యుత్తు, షెడ్డు, వంటగ్యాస్ వంటి సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. ఇప్పటికే 1.36 లక్షల మందికి భోజనాలు, మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు సరఫరాకు దాతలు ముందుకు వచ్చారని తెలిపారు. -
చెంచుల అభివృద్ధికి కృషి
పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత బైర్లూటి (ఆత్మకూరురూరల్): చెంచుల అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి పరిటాల సునీత హామీనిచ్చారు. శుక్రవారం బైర్లూటిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెంచులకు 974 అంత్యోదయ అన్నయోజన(ఏఏవై) రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిరుపేదలు ఆకలితో ఉండకూడదన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా చెంచులకు 35 కేజిల బియ్యం సరఫరా అయ్యే అంత్యోదయ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు.ప్రకాశం, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ ఈ పంపిణీ కొనసాగిస్తామన్నారు. త్వరలో ఒక రోజు ఏదైనా చెంచు గూడెంలో రాత్రి బస చేస్తానన్నారు. అటవీ శాఖ కల్పిస్తున్న ఆటంకాలను తొలగించేందుకు ఆ శాఖతో చర్చిస్తామన్నారు. చెంచులను అభివృద్ధిలోకి నడిపించడం కన్నా పుణ్యకార్యం మరేరీ ఉండబోదని ఎమ్మెల్యే బుడ్డారాజశేఖరరెడ్డి అన్నారు. దేశ జనాభా పెరుగుతూ ఉంటే తగ్గి పోతున్న జనాభా చెంచులదేనని ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతమందికి ఒకేసారి అంత్యోదయ అన్న యోజన కార్డులు అందజే సిన ఈ రోజు సుదినమని జిల్లా కలెక్టర్ విజయమోహన్ అన్నారు. బైర్లూటిలో అభివృద్ధి పనులు కొనసాగుతాయన్నారు. గతంలో ఇచ్చిన పోషక విలువలు కలిగిన ఫుడ్ బాస్కెట్లను మళ్లీ ప్రవేశ పెడతామన్నారు. జేసీ హరికిరణ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆత్మకూరు నగర పంచాయతీ చైర్మన్ నూర్ మహమ్మద్, పాణ్యం, ఆత్మకూరు జెడ్పీటీసీ సభ్యులు నారాయణమ్మ, వెంకటరాముడు, ఎంపీపీ సౌజన్య, సర్పంచ్ రమణమ్మ, ఎంపీటీసీ సభ్యుడు నాగుల్ నాయక్, తహశీల్దార్ రాజశేఖరబాబు తదదితరులు పాల్గొన్నారు. -
రౌడీ రాజ్యం
► రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ నేతల అరాచకం ► వైఎస్సార్సీపీలో చేరికలను జీర్ణించుకోలేక భౌతికదాడులు ► కనగానపల్లి మండలం కుర్లపల్లి వైఎస్సార్సీపీ ► నేతలపై దాడి సర్వజనాస్పత్రిలో బీభత్సం ► తన హత్యకు కుట్ర పన్నారన్న ప్రకాష్రెడ్డి ► జిల్లాలో అదుపుతప్పిన శాంతిభద్రతలు సాక్షిప్రతినిధి, అనంతపురం : మంత్రి పరిటాల సునీత ప్రాతినిథ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో రౌడీరాజ్యం నడుస్తోంది. తమ మాటే వేదమన్న రీతిలో టీడీపీ నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఇటీవల రాప్తాడు నియోజకవర్గ టీడీపీ నేతలు వైఎస్సార్కాంగ్రెస్పార్టీలోకి వలసబాట పట్టారు. పదేళ్లు జెండా మోసినా ప్రతిఫలం దక్కకపోవడం, టీడీపీ మోసపూరిత పాలనతో నష్టపోవడం, పార్టీలోని ముఖ్యనేతలు మరింత చులకనగా చూడటం లాంటి పరిణామాలతో ఆ పార్టీలోని ప్రముఖులు ఒకరి తర్వాత మరొకరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. ఈ చేరికలను జీర్ణించుకోలేని మంత్రి మద్దతుదారులు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. జిల్లాలోనే రాప్తాడు నియోజకవర్గంలో ప్రత్యేక రాజకీయపరిస్థితులు ఉన్నాయి. పరిటాల వర్గీయులను కాదని, వారికి వ్యతిరేకంగా రాజకీయ కార్య కలాపాలు నిర్వహించే వారికి ఇబ్బందులు తప్పవు. వీరిని తమ దారిలోకి లాక్కొనేందుకు సామ, దాన, భేద దండోపాయాలు ఉపయోగిస్తుంటారు. అప్పటికీ దారికి రాకపోతే తమదైన శైలిలో రాజకీయ క్రీడకు తెరలేపుతారు. మంత్రి పరిటాల సునీత సొంత మండలం రామగిరి 2004 ఎన్నికల వరకు పెనుకొండ నియోజకవర్గంలో ఉండేది. ఆపై పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పడిన రాప్తాడు నియోజకవర్గంలో భాగమైంది. అడుగడుగునా కుట్రలే... 2009 ఎన్నికల్లో రాప్తాడు నుంచి తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి బరిలోకి దిగారు. ఎన్నికల ప్రచారసమయంలో ఆయనపై అక్రమకేసులు మోపి జైలుకు పంపి ఇబ్బంది పెట్టారు. ఆ ఎన్నికల్లో సునీత కేవలం 1,800 ఓట్ల తేడాతో గట్టెక్కారు. 2014 ఎన్నికల్లోనూ సునీత ఇక్కడి నుంచి విజయం సాధించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, ఇద్దరు ఎంపీలు, 12మంది ఎమ్మెల్యేలనూ గెలిపించినా జిల్లా అభివృద్ధిని చంద్రబాబు విస్మరించారు. జిల్లా అభివృద్ధిపై శ్రద్ధలేని చంద్రబాబు... పార్టీ కోసం కదిరి ఎమ్మెల్యే చాంద్బాషాను సైకిలెక్కించారు. టీడీపీ మోసపూరితపాలన, అనైతిక చర్యలతో ఆ పార్టీలోని ప్రముఖులు వేసారిపోతున్నారు. అయితే అధికారం ఉన్నపుడు తొందరపాటు తగదని చాలామంది అనివార్యంగా టీడీపీలో కొనసాగుతున్నారు. అకృత్యాలను తాళలేక ఇంకొందరు వైఎస్సార్సీపీ బాటపడుతున్నారు. వైఎస్సార్సీపీ నేతలపై భౌతిక దాడులు: మంత్రిగా ఉంటూ రాప్తాడు నియోజకవర్గానికి సునీత లాభం చేయకపోగా ఎలా నష్టం చేస్తున్నారో నియోజకవర్గ ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో తోపుదుర్తి ప్రకాష్రెడ్డి సఫలీకృతులయ్యారు. పేరూరుడ్యాం, హంద్రీ-నీవా ఆయకట్టు అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు హాజరయ్యారనే కారణంతో రామగిరిలో జయచంద్రారెడ్డి అనే వైఎస్సార్సీపీ కార్యకర్త పొలంలోని స్ప్రింక్లర్లు, పైపులను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. ఈ చర్యతో టీడీపీ నేతల నియంతృత్వపాలన ఏమిటో నియోజకవర్గ ప్రజలకు స్పష్టమైంది. ఈ నెల 26న రామగిరి మాజీ సర్పంచ్ మీనుగ నాగరాజు... వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈయనతో పాటు వాల్మీకి నేత, రాప్తాడు మాజీ మండలాధ్యక్షుడు బలరాముడు కూడా జగన్ను కలిశారు. దీంతో టీడీపీ నేతల్లో కాస్త కదలిక వచ్చింది. ఈ నెల 29న రాప్తాడు పండ మేటి వేంకటరమణస్వామి ఆలయకమిటీ సభ్యులు కురుబ ఎరగుంటప్ప, తలారి తిప్పన్న, శ్రీరాములు, మాజీ డీలర్ దుర్గాప్రసాద్లు ప్రకాష్రెడ్డిసమక్షంలో వైఎస్ఆర్ సీపీలో చేరారు. చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి మండలాలనుంచి మరికొంతమంది పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ పరిణామాలను నియంత్రంచలేక వైఎస్ఆర్ సీపీ నేతలపై భౌతిక దాడులకు దిగారు. సోమవారం కనగాపల్లి మండలం కుర్లపల్లి, కొండ్రెడ్డిబావిలో వైఎస్సార్సీపీ నేతలు సుబ్బారెడ్డి, సూర్యనారాయణరెడ్డి, మల్లికార్జునరెడ్డి, భాస్కర్రెడ్డి, విజయ్నాయక్, ఈశ్వరరెడ్డి, నరసింహారెడ్డి, జగన్నాథరెడ్డి, హనుమంతరెడ్డి, వెంకట్రామిరెడ్డిలపై టీడీపీ నేతల రాజన్న, ఆయన కుటుంబసభ్యులు దాడి చేశారు. అంతటితో ఆగలేదు. ‘అనంత’ సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరిపై మళ్లీ దాడికి యత్నించారు. వీరిని పరామర్శించేందుకు వచ్చిన ప్రకాష్రెడ్డిపై కూడా దాడికి ప్రయత్నించారు. హత్యకు కుట్ర? ఆస్పత్రిలోని పరిస్థితులు చూస్తే ప్రకాష్రెడ్డి ఆరోపించినట్లు ఆయన హత్యకు కుట్ర పన్నినట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆస్పత్రిలో జైబాలాజీ సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వహిస్తోంది. మంత్రి సునీత సోదరుడు బాలాజీనే సెక్యూరిటీ గార్డులను నియమించారు. ఆస్పత్రిలో టీడీపీ నేతలు బీభత్సం సృష్టించిన 20 నిమిషాల పాటు సెక్యూరిటీ గార్డులు పత్తా లేరు. పోలీసులు వచ్చిన తర్వాత వారు కనిపించసాగారు. ఆస్పత్రికి వచ్చిన టీడీపీ కార్యకర్తల చేతుల్లో రాడ్లు, కత్తులు ఉన్నాయి. చికిత్స కోసం వచ్చే వారు కత్తులు, రాడ్లు ఎందుకు తెచ్చారనేది తెలియాలి. అలాగే ఔట్పోస్టు ఆస్పత్రి ప్రాంగణంలోనే ఉంది. ఘటన జరిగిన 20 నిమిషాల వరకూ ఔట్పోస్టు పోలీసులు సైతం ఎందుకు అక్కడికి చేరుకోలేదన్నది తెలియాలి. ఈ సమయంలో డీజీపీ రాముడు పోలీసు కళ్యాణమంటపం ప్రారంభోత్సవంలో సిటీలోనే ఉన్నారు. ఇంత పెద్ద గొడవ జరుగుతుందని తెలిసినా, ప్రకాష్రెడ్డిని గదిలో నిర్బంధించి గది తలుపులు, కిటికీలు పగలగొట్టేందుకు యత్నిస్తున్నారని తెలిసినా అరగంటపాటు పోలీసులు అక్కడికి రాలేదు. తర్వాత కూడా సీఐలు మాత్రమే వచ్చారు. డీఎస్పీ, ఎస్పీ ఆవైపు చూడలేదు. తన సోదరుడు చందు ఆస్పత్రికి వచ్చేదాకా ప్రకాష్రెడ్డి ఆస్పత్రిలోనే నిర్బంధంలో ఉండిపోయారు. తనను హత్య చేసేందుకు పక్కా ప్రణాళిక ప్రకారం సునీత, శ్రీరాం కుట్ర పన్నారని, అందులో భాగంగానే ఆస్పత్రిలో గొడవ జరిగిందని ఈ సందర్భంగా ప్రకాష్రెడ్డి ఆరోపించారు. ఆస్పత్రిలో పరిణామాలు కూడా ఇందుకు బలం చేకూరుస్తుండడం గమనార్హం. ప్రకాష్రెడ్డి, చందుపై కేసు ఆస్పత్రిలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, చందును మూడవ పట్టణ పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. దాడులకు వారిని బాధ్యులుగా చేస్తూ కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది. మా వాళ్లు రాకుంటే బతికుండేవాణ్ణి కాదు తోటలోకి వెళ్తుంటే ఉన్నట్టుండి దాడి చేశారు. కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. ఎందుకొడ్తున్నార్రా.. అని అడిగితే ‘ఏం రా ఆ పార్టీలో తిరుగుతారా.. ఒక్కొక్కరిని చంపితే ఏం చేస్తారు’.. అంటూ ఇష్టమొచ్చినట్టు దాడి చేశారు. మా వాళ్లు రాకపోయింటే బతికుండేవాణ్ణికాదు. - సూర్యనారాయణరెడ్డి, బాధితుడు, కుర్లపల్లి 30 మంది వరకు వచ్చారు వాళ్లు పక్కా ప్లాన్తోనే వచ్చారు. నేను అక్కడికి పోయేటప్పటికే రాళ్లు తీసుకుని ఉన్నారు. కనపడగానే కొట్టారు. కట్టెలు తీసుకుని కాళ్లు విరగ్గొట్టారు. 30 మంది వరకు ఉంటారు. వాళ్లలో రాజప్ప, ఆదెప్ప, వెంకట్రాముడు, ఇంకొందరు ఉన్నారు. - జగన్నాథరెడ్డి, కుర్లపల్లి. -
వైఎస్సార్సీపీలోకి చేరిన టీడీపీ నాయకులు
టీడీపీ పతనం ప్రారంభమైంది తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి అనంతపురం : అభివృద్ధిని పక్కన పెట్టేసి అందినకాటికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్న టీడీపీ ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. రాప్తాడు మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తోపుదుర్తి ప్రకాష్రెడ్డి సమక్షంలో రాప్తాడు మండల కన్వీనర్ బోయ రామాంజనేయులు ఆధ్వర్యంలో పండమేటి వెంకటరమణ స్వామి ఆలయ కమిటీ సభ్యులు కురుబ అడ్ర ఎరగుంటప్ప, తలారి తిప్పన్న, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల రిటైర్డ్ అధ్యాపకులు హరిజన శ్రీరాములు, మాజీ డీలర్ హరిజన దుర్గాప్రసాద్ పార్టీ కండువా వేసుకున్నారు. ఆదివారం ప్రకాష్రెడ్డి నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ పెదబాబు, చినబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందినకాటికి దోచుకోవడమే ఎజెండాగా పెట్టుకున్నారన్నారు. రాప్తాడు నియోజకవర్గ అభివృద్ధిని మంత్రి పరిటాల సునీత ఏమాత్రం పట్టించుకోవడంలేదన్నారు. వారి బంధువులు, అనుచరులు ప్రతి పనిలోనూ పర్సెంటేజీలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పాలనపై విసిగి వేసారే టీడీపీ నుంచి తమ పార్టీలో చేరుతున్నారన్నారు. రానున్న రోజుల్లో వలసలు మరింత పెరుగుతాయన్నారు. కార్యక్రమంలో ఎన్జీఓ సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు గోపాల్రెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి సాకే నారాయణ, సేవాదల్ రాప్తాడు మండల కన్వీనర్ కుమ్మర రాము, నాయకుడు కొండూరు బీరన్న, అనంతపురం రూరల్ మండల కన్వీనర్ తాటిచెర్ల నాగేశ్వరరెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి నరేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల మెప్పు కోసం రైతుతో అబద్ధాలు
► జిల్లాపై కపట ప్రేమ చూపుతున్న సీఎం ► వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ► శంకరనారాయణ, తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ధ్వజం అనంతపురం : జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి సభలో చెన్నేకొత్తపల్లి మండలం ప్యాదిండి రైతు రామకృష్ణారెడ్డితో అబద్ధాలు చెప్పించారు. ఆయన పొలాన్ని తాము పరిశీలించాం.. ఏడాదికి పై నుంచే బీడు పెట్టాడని వెఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ధ్వజమెత్తారు.శుక్రవారం ప్రకాష్రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించారని వారు విమర్శించారు. కష్ట కాలంలో ఉన్న రైతులను పట్టించుకోకుండా ప్రజాధనం లూటీకి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పోటీ పడుతున్నారని ఆరోపించారు. మంత్రి పరిటాల సునీత కుటుంబం రెణ్నెళ్లుగా తమ వ్యక్తిగత కార్యక్రమాలు, ఆర్భాటాల కోసమే ప్రచారం చేసుకున్నారన్నారు తప్ప, ప్రజల గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. తీవ్ర కరువుతో ఉపాధి లేక బెంగళూరు, హైదరాబాద్, మద్రాసు నగరాలకు లక్షలాది మంది వలసలు వెళ్తున్నారన్నారు. తాగునీటికి ప్రజలు అల్లాడుతుంటే పట్టించుకోని ప్రభుత్వం, కోట్లాది రూపాయలు వెచ్చించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వాటాకు సంబంధించిన హంద్రీ-నీవా నీటిని కుప్పం బ్రాంచ్ కాలువ సృష్టించి తీసుకెళ్తుంటే జిల్లాలోని ప్రజాప్రతినిధులు నోరు మెదకపోవడం అన్యాయమన్నారు. దీనిపై వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎం, ఇతర రైతు, ప్రజా సంఘాలు నెల రోజులుగా ఆందోళన చేస్తున్నా కనీసం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. జిల్లాలోని ఆరు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లిస్తామని జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి చెప్పకపోవడం దగాకోరుతనానికి నిదర్శనమన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి హంద్రీ-నీవా జలాలను జీడిపల్లి వరకు తీసుకొచ్చారన్నారు. హంద్రీ-నీవా ఆయకట్టు సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ మూడేళ్లూ ఇలాగే కొనసాగితే టీడీపీ భూస్థాపితం కాక తప్పదన్నారు. సమావేశంలో కనగానపల్లి జెడ్పీటీసీ బిల్లే ఈశ్వరయ్య, మరూరు సింగిల్ విండో ఉపాధ్యక్షుడు దండు రామాంజనేయులు, డెరైక్టర్ తలారి శేఖర్, పార్టీ రాప్తాడు మండల కన్వీనర్ బోయ రామాంజనేయులు, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి నరేంద్రరెడ్డి పాల్గొన్నారు. -
వనిత చదువు అవనికే వెలుగు
మంత్రి పరిటాల సునీత రాయదుర్గం : వనిత చదువు ఇంటికే కాక అవనికే వెలుగు నిస్తుందని మంత్రి పరిటాల సునీత అన్నారు. బాలికా విద్య - కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సోమవారం రాయదుర్గంలోని ప్రభుత్వ బాలుర ఉన్నతపాఠశాల క్రీడాప్రాంగణంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అధ్యక్షతన చదువుల ఒడి కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రి పరిటాల సునీత, అనంతపురం మేయర్ స్వరూప, కలెక్టర్ కోన శశిధర్ హాజరయ్యారు. పూలే జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలికవసతులను పూర్తిస్థాయిలో కల్పిస్తామన్నారు. బాలికలు విద్యను కొనసాగించేలా తల్లిదండ్రులు చొరవచూపాలన్నారు. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ నియోజకవర్గంలో తీవ్ర కరువు వల్ల పిల్లలను కూడా చదివించుకోలేని దుస్థితి ఏర్పడిందన్నారు. బాలికలనైతే మధ్యలోనే చదువు మాన్పిస్తున్నారని, 2122 మంది బాలికలు బడిబయట ఉన్నారని తెలిసి బాధేసిందన్నారు. వారిని తిరిగి పాఠశాలలో చేర్పించే కార్యక్రమమే చదువుల ఒడి (చిన్నారి తల్లికి బంగారు బాట) అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ బాలిక విద్యకోసం ‘చదువుల ఒడి’ చేపట్టడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ చంద్రహాస్, గుమ్మఘట్ట జెడ్పీటీసీ పూల నాగరాజు, డి.హీరేహాళ్ ఎంపీపీ పుష్పావతి, ఆర్డీఓ రామారావు, తహసీల్దార్ ఖాతిజున్ కుఫ్రా, మునిసిపల్ చైర్మన్ రాజశేఖర్, రాయదుర్గం, హీరేహాళ్ జెడ్పీటీసీ సభ్యులు విజయకుమార్, శారద, ఎంపీపీలు భారతి, ఫాతిమాబీ, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. -
సెలైంట్గా నొక్కేస్తున్నారు!
►గాడితప్పిన ప్రజాపంపిణీ వ్యవస్థ ► రేషన్ దుకాణాల్లో యథేచ్ఛగా అక్రమాలు ► పక్కదారి పడుతున్న కిరోసిన్ ► అధికారుల తనిఖీలు శూన్యం ► జిల్లాలో రేషన్ దుకాణాలు 2,983 ► రేషన్కార్డులు 12,38,255 ► లబ్ధిదారులు 46,73,119 ధర్మవరం : రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత సొంత జిల్లాలోనే ప్రజాపంపిణీ వ్యవస్థ గాడి తప్పింది. ఈ-పాస్ యంత్రాలకు తంత్రాలు వేస్తూ డీలర్లు యథేచ్ఛగా సరుకులు దోచేస్తున్నారు. కిరోసిన్ పంపిణీ మానేశారు. ఒక్కో కార్డుపై అర కిలో వరకూ బియ్యం లాగేసుకుంటున్నారు. చక్కెర కిలోకు వంద గ్రాములు కోతేస్తున్నారు. అయినా డీలర్లపై చర్యలు లేవు. జిల్లాలో మొత్తం 2,983 చౌకదుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో 12,38,255 కార్డులు ఉన్నాయి. ఈ-పాస్లో వేలి ముద్రలు పడని వారికి ఐరిష్ ద్వారా సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలోని అన్ని చౌక డిపోలకు ఐరిష్ యంత్రాలు అందజేశారు. గత నెలలో పదివేల మందికి పైగా కార్డుదారులకు వేలిముద్రలు పడలేదని గుర్తించారు. అయినా ఐరిష్ యంత్రాలను పదుల సంఖ్యలో కూడా వాడలేదు. అంత్యోదయకు అరకొరే.. అంత్యోదయ అన్నయోజన కార్డులు డబ్ల్యూఏపీ (వైట్ ఆంధ్రప్రదేశ్) కార్డులుగా మారిపోయాయి. జిల్లాలో 1.10 లక్షల అంత్యోదయ కార్డులు ఉండగా.. 20 శాతానికి పైగా ఇదే పరిస్థితి. కుటుంబ సభ్యులతో సంబంధం లేకుండా కార్డుకు 35 కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే.. రెండు,మూడు నెలలుగా సభ్యుల సంఖ్యను బట్టి ఐదు కిలోల చొప్పున ఇస్తున్నారు. ఈ కార్డులు ఎందుకు మారాయో పౌరసరఫరాల శాఖ అధికారులకే తెలియదట. కిరోసిన్ దోపిడీ : జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్డులలో 11,47,435 కార్డులకు సంబంధించి గ్యాస్ కనెక్షన్లు లేవు. ఒక్క ధర్మవరం మునిసిపాలిటీ పరిధిలో 6,595 కార్డులకు గ్యాస్ కనెక్షన్లు లేవు. వీరికి కార్డుకు నాలుగు లీటర్ల చొప్పున కిరోసిన్ వేయాల్సి ఉండగా.. ఒక లీటర్ మాత్రమే వేస్తున్నారు. గ్యాస్ కనెక్షన్ ఉండటం వల్ల ఒక లీటర్ మాత్రమే వచ్చిందని అంటున్నారు. మరికొందరు అసలు వేయకుండానే కిరోసిన్ను పక్కదారి పట్టిస్తున్నా రు. జిల్లాలో ప్రతినెలా రెండు లక్షల లీటర్ల మేర కిరోసిన్ను డీలర్లు బయట అధిక ధరలకు అమ్ముకున్నట్లు అధికారులు చెప్తున్నారు. రసీదు ఇస్తే ఒట్టు చౌక దుకాణానికి వెళ్లిన కార్డుదారుడు ఈ-పాస్ యంత్రంపై వేలిముద్ర వేయగానే రేషన్ సరుకుల వివరాలు తెలుస్తాయి. అయితే..ఈ వివరాలు కార్డుదారునికి వినిపించకుండా డీలర్లు వ్యాల్యూమ్ (శబ్దం) తగ్గించేస్తున్నారు. యంత్రం నుంచి వచ్చే రసీదును కూడా కార్డుదారుడికి ఇవ్వడంలేదు. ఒకవేళ ఇస్తే అందులో అన్ని వివరాలు తెలుస్తాయి. జిల్లా వ్యాప్తంగా 90 శాతం మంది డీలర్లు ఇలాగే మోసం చేస్తున్నారు. ఇంతా జరుగుతున్నా ఏ ఒక్క రెవెన్యూ అధికారీ తనిఖీ చేసిన దాఖలాలు లేవు. జిల్లా వ్యాప్తంగా చౌక దుకాణాలన్నీ అధికార పార్టీ మద్దతుదారులే నిర్వహిస్తున్నారు. దీంతో తనిఖీలు చేయడానికి అధికారులు వెనుకంజ వేస్తున్నారు. తమ జోలికి ఎవరూ రారులే అని ధైర్యంతో డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. 20 కిలోలు మాత్రమే ఇస్తున్నారు : అంత్యోదయ కార్డుకు బియ్యం అరకొరగానే ఇస్తున్నారు. గతంలో ప్రతినెలా 35 కిలోల బియ్యం ఇచ్చేవారు. ప్రస్తుతం ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున నలుగురికి 20 కిలోలు ఇస్తున్నారు. ఇదేమిటని అడిగితే సమాధానం చెప్పడంలేదు. - చిన్ననాగమ్మ, ముదిగుబ్బ చర్యలు తీసుకుంటాం ప్రజా పంపిణీలో సమస్యలు మా దృష్టికి రాలేదు. ఏవైనా సమస్యలుంటే, అవకతవకలు జరిగి ఉంటే లబ్ధిదారులు నేరుగ తెలియజేయొచ్చు. డీలర్లు అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనాఉపేక్షించేది లేదు. కఠిన చర్యలు తీసుకుంటాం. త్వరలోనే రేషన్షాపులను తనిఖీ చేస్తాం. - బాలానాయక్, ఆర్డీవో, ధర్మవరం -
విపక్షం నిరసనలతో హోరెత్తిన సభ
♦ నల్ల దుస్తులు ధరించి సభకు వచ్చిన వైఎస్సార్సీపీ సభ్యులు ♦ ఉయ్ వాంట్ జస్టిస్..ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి..అంటూ నినాదాలు ♦ రోజాను సభలోకి అనుమతించని అంశాన్ని ప్రస్తావించడానికి దక్కని అవకాశం ♦ రెండుసార్లు వాయిదా అనంతరం సభ సోమవారానికి వాయిదా సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్కే రోజాను సభలోకి అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ సభ్యులు చేసిన నినాదాలతో శనివారం శాసనసభ హోరెత్తింది. నల్ల దుస్తులు ధరించి వచ్చిన విపక్ష సభ్యుల నిరసనలు, నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ను ‘నామ్కే వాస్తే’ రీతిలో నిర్వహించారు. సభ సజావుగా సాగడానికి సహకరించాలని, రోజా అంశంపై సోమవారం చర్చిద్దామంటూ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పలుమార్లు చేసిన విజ్ఞప్తికి విపక్షం నుంచి సానుకూల స్పందన రాలేదు. తమకు న్యాయం చేయండంటూ నినాదాలు కొనసాగించారు. విపక్ష సభ్యుల నినాదాల హోరులో సభను స్పీకర్ రెండుసార్లు వాయిదా వేసినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో మూడోసారి సోమవారానికి సభను వాయిదా వేశారు. తొలి నిమిషం నుంచే.. శనివారం ఉదయం 9 గంటలకు సభలోకి స్పీకర్ అడుగుపెట్టి తన స్థానంలో కూర్చుంటుండగానే.. ‘సార్ మాకు న్యాయం చేయండి’ అంటూ ప్రతిపక్ష సభ్యులు అడిగారు. వైఎస్సార్సీపీ సభ్యులంతా నల్లదుస్తుల్లో హాజరైనా స్పీకర్ మాటమాత్రమైనా అడగలేదు. విపక్ష సభ్యుల విజ్ఞప్తిని పట్టించుకోకుండా.. ప్రశ్నోత్తరాలను స్పీకర్ ప్రారంభించారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సుపై ఉన్న తొలి ప్రశ్నకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సమాధానం చెప్పడం ప్రారంభించారు. తమ గోడును స్పీకర్ పట్టించుకోకపోవడంతో వైఎస్సార్సీపీ సభ్యులంతా స్పీకర్ పోడియం వద్ద నిలబడి నిరసన తెలిపారు. ‘ఉయ్ వాంట్ జస్టిస్.. ప్రజాస్వామ్యాన్ని రక్షించండి’ అంటూ నినదించారు. దాదాపు 25 నిమిషాలు నినాదాల హోరులోనే అధికార పక్ష సభ్యులు బుచ్చయ్య చౌదరి, పార్థసారథి, అనిత, శ్రావణ్కుమార్.. తదితరులకు ప్రశ్నోత్తరాల సమయంలో ఒకరి తర్వాత ఒకరికి స్పీకర్ అవకాశం ఇచ్చారు. బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్రాజుకు మైక్ ఇవ్వడంతో.. విపక్ష సభ్యులు నినాదాలు చేయడం ద్వారా తన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వం పక్షాన సమాధానం చెబుతున్నట్లు సీఐఐ భాగస్వామ్య సదస్సు గురించి విష్ణుకుమార్రాజు మాట్లాడారు. విపక్ష సభ్యులు నినాదాలు కొనసాగిస్తుండగా.. సీనియర్ సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పీకర్ వద్దకు వెళ్లి విపక్ష నేతకు మాట్లాడే అవకాశమివ్వాలని కోరారు. స్పీకర్ సానుకూలంగా స్పందించడంతో.. తన సహచర సభ్యులను కూర్చోవాలని సూచించారు. అందరూ తమ స్థానాల్లో కూర్చున్నాక.. విపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్పీకర్ మైక్ ఇవ్వలేదు. విపక్ష సభ్యులు మళ్లీ స్పీకర్ పోడియం వద్దకెళ్లి నినాదాలు అందుకున్నారు. నిరసన హోరుమధ్య 9.30 గంటలకు సభను 10 నిమిషాలు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. రెండోసారీ అదేతీరు.. ఉదయం 10.12 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడూ ఇదే పరిస్థితి. ‘బీఏసీలో నిర్ణయించిన ఎజెండా ప్రకారమే సభ నడుస్తోంది. మీ ఇష్టప్రకారం సభ జరగదు. మీరు నిరసన తెలపాలన్నా.. సోమవారానికి పోస్ట్ చేసిన అంశం మీద మాట్లాడటం కుదరదు’ అని స్పీకర్ చెప్పారు. అయినా విపక్ష సభ్యులు శాంతించలేదు. ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలంటూ నినదించారు. సభ సజావుగా సాగే అవకాశం కనిపించకపోవడంతో 10.20 గంటలకు సభను 10 నిమిషాలు వాయిదా వేశారు. ముచ్చటగా మూడే నిమిషాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు ఆర్కే రోజాను సభలోకి రానివ్వనందుకు నిరసనగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ శనివారం మధ్యాహ్నం అసెంబ్లీలో ఆందోళన కొనసాగించింది. సభ తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైనా సరిగ్గా మూడే నిమిషాల్లో ముగిసింది. స్పీకర్ వస్తూనే సభా సమక్షంలో ఉంచే పత్రాలను ప్రవేశపెట్టాల్సిందిగా సంబంధిత మంత్రులను కోరారు. పర్యావరణం, అడవులు, శాస్త్ర సాంకేతికశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత తమ శాఖల నిధుల కోసం అభ్యర్థనలను సభ ముందుంచారు. విపక్ష సభ్యులు పోడియంను చుట్టుముట్టి చేస్తున్న నిరసనలు, నినాదాల మధ్యే మంత్రులు తమ పద్దులను ప్రవేశపెట్టారు. అనంతరం స్పీకర్ కోడెల సభను 12.03 గంటల సమయంలో సోమవారానికి వాయిదా వేశారు. -
ఖాకీపై ఖద్దర్ స్వారీ
అనంతపురం టూటౌన్ ఎస్ఐ హమీద్వీఆర్కు బదిలీ మంత్రి పరిటాల సునీత ఒత్తిడితోఉన్నతాధికారుల నిర్ణయం? నిక్కచ్చిగా ఉన్నందుకు మొన్న గోరంట్ల మాధవ్.. నేడు హమీద్ బలి బదిలీలపై పోలీసు అధికారుల సంఘంలో చర్చ (సాక్షిప్రతినిధి, అనంతపురం) మంత్రి పరిటాల సునీత ఒత్తిడితో మరో ఎస్ఐ బలయ్యారా? విధినిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించిన ఎస్ఐని కాపాడటం కనీస బాధ్యత అనే విషయాన్ని విస్మరించి, అధికార పార్టీ ఆదేశాలనే ఉన్నతాధికారులు శిరసావహించారా? మొన్న గోరంట్ల మాధవ్..నేడు హమీద్ బదిలీల వెనుక మర్మమిదేనా? అధికార పార్టీ నేతలను ఎదిరిస్తే ఎవరికైనా ‘లూప్లైన్’ తప్పదనే సంకేతాన్ని పంపారా?.. తాజా పరిస్థితులు చూస్తే ఈ ప్రశ్నలకు ఔననే సమాధానం వస్తోంది. మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరాంను కేబుల్ వ్యవహారంలో గట్టిగా మందలించడం...స్థలం విషయంలో చమన్కు మీడియా ద్వారా హెచ్చరికలు పంపడాన్ని సీరియస్గా తీసుకుని గతంలో సీఐ గోరంట్ల మాధవ్ బదిలీకి కారణమైన అధికారపార్టీ నేతలు ఇప్పుడు మరో యువ ఎస్ఐపై కన్నెర్ర చేశారు. తమ అనుచరులను అదుపులోకి తీసుకున్నారనే కారణంతో టౌటౌన్ ఎస్ఐ హమీద్ను లూప్లైన్కు బదిలీ చేయించారు. ఈ బదిలీపై ప్రస్తుతం పోలీసుశాఖలో తీవ్ర చర్చ సాగుతోంది.హమీద్ చేసిన నేరం ఇదేనా?హమీద్ బదిలీకి సంబంధించి పోలీసువర్గాలు చెప్పిన వివరాలిలా ఉన్నాయి. ‘అనంత’లోని నందమూరినగర్కు చెందిన టీడీపీ నేత మనోహర్నాయుడు పరిటాల వర్గానికి ప్రధాన అనుచరుడు. ఇటీవల ఆంథోనిరెడ్డి అనే రియల్టర్ను కిడ్నాప్ చేసి రూ.50 లక్షలు డిమాండ్ చేశాడు. రూ.20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఆంథోనిరెడ్డి కుటుంబసభ్యులు టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ హమీద్.. మనోహర్నాయుడి కోసం గాలించారు. విషయం తెలిసి అతను పరారయ్యాడు. దీంతో అతని కుమారుడు కార్తీక్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో మనోహర్ అనుచరుడు జయకృష్ణ స్టేషన్కు వెళ్లి హమీద్తో దురుసుగా మాట్లాడాడు.దీంతో చిర్రెత్తిన హమీద్ అతనికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ విషయం సునీత దృష్టికి వెళ్లింది. హమీద్ సంగతి తేల్చాలని మనోహర్తో పాటు జయకృష్ణ తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతోనే సునీత పోలీసుశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి హమీద్ను వీఆర్కు పంపించినట్లు తెలుస్తోంది. అధికార పార్టీకివ్యతిరేకంగా పనిచేయకూడదా? యువ ఎస్ఐలలో హమీద్కు మంచి పేరుంది. పార్టీలకతీతంగా బాధితులకు న్యాయం చేసేలా వ్యవహరిస్తుంటారు. ఇదే క్రమంలో మనోహర్నాయుడు సునీత అనుచరుడని తెలిసినా, తాను ఉద్యోగధర్మం నిర్వర్తిస్తున్నాననే ధోరణిలోనే ముందడుగు వేశారు. గతంలో కూడా టూటౌన్ పరిధిలో ఇంటిస్థలం విషయమై ఓ యువతితో మనోహర్ నాయుడు అసభ్యంగా ప్రవర్తించారని పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. దీంతో పాటు మనోహర్పై పలు ఫిర్యాదులు వచ్చినా సీఐ శుభకుమార్ పూర్తిగా పక్కనపెట్టారని తెలిసింది. సీఐ చర్యలను భరిస్తూ వచ్చిన హమీద్.. ఆంథోనిరెడ్డి కిడ్నాప్ అంశాన్ని సీరియస్గా తీసుకున్నారు. గతంలో సీఐ గోరంట్ల మాధవ్ కూడా రాజకీయనేతలను కాదని బాధితుల పక్షాన నిలవడంతోనే సీఐడీకి బదిలీ అయ్యారని ఆ శాఖ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ రెండు బదిలీలపై పోలీసుశాఖలో తీవ్ర చర్చ సాగుతోంది. రాజకీయనేతలు సిఫారసు చేస్తే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారని పోలీసు సంఘంలోని కొందరు ప్రశ్నిస్తున్నారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించే పోలీసులపై అధికారపార్టీనేతల నుంచి ఇబ్బందులు రావడం సహజమని, అయితే ఉన్నతాధికారులు అండగా నిలవాలని అంటున్నారు. ‘అనంత’పోలీసు శాఖలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని అంటున్నారు. దీన్ని ఇలాగే వదిలేస్తే మరింత మంది అధికారులు బలవుతారని, కావున దీనిపై గట్టిగా పోరాడాలని పోలీసుసంఘం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు ఎస్ఐలు వీఆర్కు.. అనంతపురం క్రైం : నగరంలో పనిచేస్తున్న ఇద్దరు ఎస్ఐలను వీఆర్కు పంపుతూ ఎస్పీ రాజశేఖర్బాబు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. త్రీటౌన్ ఎస్ఐ తమీమ్ అహ్మద్, టూటౌన్ ఎస్ఐ హమీద్ఖాన్లను వీఆర్కు పంపారు. ఇటీవల చోటు చేసుకున్న కొన్ని ఘటనల నేపథ్యంలో వీరిని వీఆర్కు పంపినట్లు తెలిసింది. -
దందా చేసే వారికి సీఐ వత్తాసు
వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి దందాలు, భూకబ్జాలు, మహిళల మానప్రాణాలతో చెలగాటమాడే అసాంఘిక శక్తులకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు. ఆంథోనిరెడ్డి కిడ్నాప్ ఉదంతమే ఇందుకు నిదర్శనం. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆంథోనిరెడ్డిని మంత్రి పరిటాల సునీత అనుచరులుగా చెప్పుకుంటున్న మనోహర్నాయుడు, మరికొంతమంది కిడ్నాప్ చేసి రామగిరి మండలం ఎగువపల్లికి తీసుకెళ్లారు. అక్కడ మారుణాయుధాలతో బెదిరించి డబ్బు డిమాండ్ చేశారు. మంత్రి సునీత, పరిటాల శ్రీరామ్ అండదండలు ఉన్నాయంటూ బెదిరించారు. డబ్బు ఇవ్వకపోతే హతమారుస్తామని, ముఖ్యనేతలను చంపుతామని హెచ్చరించారు. స్వయంగా మంత్రి పేరు చెప్పుకొని ఇంతటి అరాచకాలకు దిగుతుంటే పోలీసులు మాత్రం నిందితులకే అండగా నిలుస్తున్నారు. ముఖ్యంగా అనంతపురం టూటౌన్ సీఐ శుభకుమార్.. ఆంథోనిరెడ్డి కిడ్నాప్ వ్యవహారాన్ని ఆర్థికలావాదేవీ కేసుగా ఎస్పీని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆంథోనిరెడ్డి కిడ్నాప్ కేసులో నిజాయితీగా వ్యవహరిస్తున్న ఎస్ఐ హమీద్ఖాన్ను అధికార పార్టీ ఒత్తిళ్లతోనే వీఆర్కు పంపారు. ఇప్పటికైనా ఎస్పీ స్పందించి ఆంథోనిరెడ్డి కిడ్నాప్ కేసులో నిజానిజాలను నిగ్గుతేల్చాలి. దందాకు పాల్పడుతున్న మనోహర్నాయుడుపై చర్యలు తీసుకోవాలి. ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్న సీఐపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. -
ఎన్నికల హామీలు నెరవేరుస్తాం
మంత్రి గంటా శ్రీనివాసరావు పెనుకొండ : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. సోమందేపల్లి గ్రామంలో లక్షలాది రూపాయలతో నిర్మించిన కస్తూర్భా గాంధీ బాలికల ఉన్నత పాఠశాల, స్త్రీ శక్తి భవన్, ఉర్దూ పాఠశాల, వాణిజ్య సముదాయాలను ఆయన మంత్రి పరిటాల సునీతతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన సభలో మంత్రి గంటా మాట్లాడుతూ రైతులు, డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సోమందేపల్లి, పెనుకొండ ప్రాంతాలలో పాలిటెక్నిక్ కళాశాలతో పాటు సోమందేపల్లిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మించి విద్యార్థులకు బాసటగా నిలుస్తామన్నారు. ఎమ్మెల్యే పార్థసారథి, మంత్రి పరిటాల సునీత, ప్రభుత్వ చీఫ్విప్ కాలువ శ్రీనివాసులు ప్రసంగించారు. -
మంత్రి పరిటాల సునీత అనుచరుల హల్చల్
అనంతపురం రూరల్: మంత్రి పరిటాల సునీత అనుచరులు మరోసారి తమ దుందుడుకును ప్రదర్శించారు. ఏకంగా తహశీల్దార్(మండల మెజిస్ట్రేట్) షేక్మహబూబ్ బాషాను కొట్టేందుకు టీడీపీ మాజీ ఎంపీటీసీ కాట్నేకాలువ శ్రీనివాసులు యత్నిచండం పెద్ద దుమారం రేపింది. వీరి వెంట టీడీపీ మండల కన్వీనర్ పామురాయి వెంకటేశ్, ఎంపీపీ భర్త రవీంద్ర, పలువురు నేతలున్నారు. స్వయంగా తహశీల్దార్ చాంబర్లోనే ఆయనపై చేయి చేసుకునేందుకు వెళ్లడంతో ఉద్యోగులు ఒక్కసారిగా హడలెత్తారు. తహశీల్దార్పై దాడికి యత్నించేందుకు వెళ్లిన టీడీపీ మాజీ ఎంపీటీసీను డిప్యూటీ తహశీల్దార్ కుమారస్వామి, ఆర్ఐ సంజీవరెడ్డి, వీఆర్ఓలు, అడ్డుకున్నారు. వారు లేకుండా ఆయనపై చేయి చేసుకునే పరిస్థితి ఏర్పడేది. అనంతపురం తహశీల్దార్ కార్యాలయంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జరిగిన సంఘటనపై అక్కడ పనిచేసే కింది స్థాయి అధికారులు, వీఆర్ఓలు, మైనార్టీ సంఘాలు పెద్ద ఎత్తున ధ్వజమెత్తాయి. దీర్ఘకాలిక సెలవులో వెళ్లిపోతామంటూ నినాదాలు చేశారు. నిజాయితీగా వ్యవహరించినందుకేనా.. బుధవారం ఉదయం టీడీపీ నేతుల పామురాయి వెంకటేశ్, కాట్నేకాలువ శ్రీనివాసులు, ఎంపీపీ భర్త రవీంద్ర తహశీల్దార్తో కలిసేందుకు వచ్చారు. తమకు చెందిన వారి పట్టాను ఎందుకు రద్దు చేశారంటూ వాదనకు దిగారు. అందుకు సదరు అధికారి నిబంధనలకనుగుణంగా చేయాల్సి వచ్చిందని వివరించారు. నడిమవంక జన్మభూమి రోడ్డు వద్ద 9 సెంట్లలో ఆరు కుటుంబాలు రోడ్డును ఆక్రమించుకుని ఇళ్లు కట్టుకున్నాయన్నారు. దీనిపై అక్కడ హౌస్సైట్ లబ్దిదారులు రాస్తాకు ఇబ్బంది అవుతుందని ఫిర్యాదు చేశారన్నారు. అక్కడ నివాసమంటున్న వారు కేసీ రామక్క, కేసీ నరసింహులు, ఎం పద్మావతి, సువర్ణమ్మ, తదితరులకు పలు చోట్ల వారి పేర్లపై పట్టాలున్నాయని తేలిందన్నారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వివరాలను జతచేశారన్నారు. నెల క్రితం దీనిపై మునిసిపల్ కమిషనర్ ను కలసి విచారణ చేపట్టి, రోడ్డును వెడల్పు చేయడంతో భాగంగా పట్టాలు రద్దు చేశామన్నారు. వాస్తవంగా వీరికి ముందుగానే పట్టాలున్నాయని అందుకే చేయాల్సి వచ్చిందన్నారు. అందరూ బంధుమిత్రులేనని ఇలాంటప్పుడు తామేమి చేయగలమన్నారు. పేక్షక పాత్ర పోషించిన టీడీపీ నేతలు మాజీ ఎంపీటీసీ కాట్నేకాలువ శ్రీనివాసులు ఏం మా ప్రభుత్వంలో మాకు న్యాయం చేయకపోతే ఎలా..? ఎవరు చెబితే రద్దు చేశారు.. మొదట వాటికి పట్టాలు తిరిగి మంజూరు చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో తహశీల్దార్ అధికారులతో మాట్లాడుకోవడం నేర్చుకోవాలాన్నారు. నీవెంత, మేం చెబితే చేయాల్సిందే.. ఏం ఏమనుకున్నావ్. జాగ్రత్త.. నీ కథ చెబుతా అంటూ తహశీల్దార్పై దాడికి దిగాడు. అక్కడ ఉన్న టీడీపీ నేతలు ప్రేక్షక పాత్ర వహించారు. కార్యాలయం సిబ్బంది లేకుంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. ఆవేదన వ్యక్తం చేసిన తహశీల్దార్ దాడిపై తహశీల్దార్ ఆవేదన వ్యక్తం చేశారు. దీర్ఘకాలిక సెలవులో వెళ్లిపోతానన్నారు. తను ఏ తప్పు చేయకున్నా దుర్భాషలాడడం ఎంత వరకు సమంజసమన్నారు. దీనికి తోడు కొట్టేందుకు రావడం సరికాదన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. తీటౌన్లో ఫిర్యాదు తహశీల్దార్, కార్యాలయంలో సిబ్బంది జరిగిన సంఘటనపై టీడీపీ మాజీ ఎంపీటీసీ సభ్యుడు కాట్నేకాలువ శ్రీనివాసులపై త్రీటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దుర్భాషలాడడంతో పాటు, కొట్టేందుకు వచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐఎంఎం ధర్నా దాడి ఘటనపై ఐఎంఎం రాష్ట్ర అధ్యక్షుడు మహబూబ్ బాషా నేతృత్వంలో కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. నిందితులను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మైనార్టీల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారన్నారు. నిజాయితీగా పనిచేసే అధికారులపై దాడి చేయడం తగదన్నారు. -
‘దీపం’పై శ్రద్ధ లేదా?
ఒంగోలు టౌన్: ‘ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండు నెలల క్రితం రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల దీపం కనెక్షన్లు మంజూరు చేశారు. ప్రకాశం జిల్లాకు 19217 కేటాయించారు. దీపం మంజూరు గడువు దగ్గర పడుతున్నా ఇంతవరకు ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేదు. మహిళలంతా నన్ను అడుగుతున్నారు. మీకు దీపంపై శ్రద్ధ లేదా. మేం చేయమని చెప్పండి.. ప్రత్యామ్నాయం చూస్తానని’ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో పౌరసరఫరాలశాఖ అధికారులు, పౌరసరఫరాల సంస్థ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డీటీలతో ఆదివారం ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దీపం కనెక్షన్లు మంజూరు చేసిన విషయాన్ని కనీసం ప్రజలకు కూడా తెలియకుండా చేశారంటే మీ పనితీరు ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయనపై మండిపడ్డారు. ఎంపీడీవోలు జాబితాలు తయారు చేయాల్సి ఉంటుంది, వారినుంచి వివరాలు వచ్చాయా అని అడిగితే డీఎస్ఓ నుంచి సమాధానం రాకపోవడంతో మంత్రి తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్లాల్ వెంటనే జోక్యం చేసుకుంటూ ఇటీవల తహ శీల్దార్లు, ఎంపీడీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించినప్పుడు ఎందుకు దీపం కనెక్షన్ల విషయాన్ని ప్రస్తావించలేదని డీఎస్వోను నిలదీశారు. ఈనెల 28వ తేదీ నాటికి జిల్లాకు మంజూరైన దీపం కనెక్షన్లన్నీ గ్రౌండింగ్ అయ్యేలా చూస్తానని జాయింట్ కలెక్టర్ మంత్రికి హామీ ఇవ్వగా, నమ్మమంటారా అంటూ తిరిగి ఆయనను మంత్రి ప్రశ్నించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి వారి బ్యాంకు ఖాతాల్లో 48 గంటల్లోపు నగదు జమ కావాలని ఆదేశించారు. పెట్రోలు బంకుల పేర్లు లేకుండా బుక్ ఎలా చేశారు: ‘జిల్లాలో 190 పెట్రోలు బంకులున్నాయి. ఏ రోజు ఎన్ని తనిఖీ చేస్తున్నారో వివరాలు లేవు. ఆర్డీవోలు, ఇతర అధికారులైనా తనిఖీలు చేస్తున్నారా’ అని మంత్రి సునీత ప్రశ్నించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఇప్పటి వరకు 23 కేసులు నమోదు చేసి 3 లక్షల 65 వేల రూపాయల ఫైన్ కట్టించినట్లు తూనికలు కొలతల శాఖ అధికారి సమాధానం చెప్పారు. కేసులు బుక్చేసి సాయంత్రానికి రిలీజ్ చేస్తున్నారా, ఇప్పటి వరకు ఎక్కడ కేసులు బుక్ చేశారో చెప్పాలని ఆమె నిలదీశారు. ఆ అధికారి నీళ్లు నమలడంపై మంత్రి అసహనం వ్యక్తం చేస్తూ పెట్రోల్ బంకుల పేర్లు లేకుండా కేసులు ఎలా బుక్ చేశారని నిలదీశారు. జిల్లాలో ఉన్న పెట్రోల్ బంకులన్నీ తెలుసా అని ఆమె ప్రశ్నించారు. జిల్లాలో కిరోసిన్ కార్డుదారులకు అందకుండా పక్కదారి పడుతున్నట్లు ఫిర్యాదులు అందాయన్నారు. జిల్లాలో 19 మంది కిరోసిన్ డీలర్లు ఉన్నారని, నెలకు 1430 లీటర్లు సరఫరా చేస్తున్నారని, వారంతా సక్రమంగా అందించేలా చర్యలు తీసుకోరా అని మంత్రి అధికారులను నిలదీశారు. జాయింట్ కలెక్టర్ జోక్యం చేసుకుంటూ కిరోసిన్ రవాణాకు సంబంధించి సోషల్ ఆడిట్కు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కొంతమంది చౌకధరల దుకాణ దారులు సరుకులు సక్రమంగా పంపిణీ చేయడం లేదని తన దృష్టికి వచ్చిందని, ఇకముందు అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సునీత ఆదేశించారు. అదేవిధంగా కొంతమంది తహశీల్దార్లు చౌకధరల దుకాణ దారులను ఇబ్బంది పెడుతున్నట్లు తనకు ఫిర్యాదులు వచ్చాయని, తహశీల్దార్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి సమీక్షించాలని జాయింట్ కలెక్టర్కు ఆమె సూచించారు. జిల్లాలో 2012 చౌకధరల దుకాణాలున్నాయని, అందులో 226 ఖాళీగా ఉన్నాయని, వాటిని త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. రేషన్ డీలర్లే ప్రచారం చేస్తున్నారు: తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తరువాత రేషన్కార్డులను తొలగిస్తుందని చౌకధరల దుకాణ దారులే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోమారు ఈ జిల్లాకు వస్తానని, ఇలాంటి ఆరోపణలు పునరావృతం కాకూడదన్నారు. జిల్లాను ఆదర్శంగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. సమావేశంలో ఒంగోలు ఆర్డీఓ కమ్మ శ్రీనివాసరావు, డీఆర్డీఏ పీడీ మురళి, వ్యవసాయశాఖ జేడీ మురళీకృష్ణ, ఒంగోలు తహశీల్దార్ మూడమంచు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.