
వనిత చదువు అవనికే వెలుగు
వనిత చదువు ఇంటికే కాక అవనికే వెలుగు నిస్తుందని మంత్రి పరిటాల సునీత అన్నారు.
మంత్రి పరిటాల సునీత
రాయదుర్గం : వనిత చదువు ఇంటికే కాక అవనికే వెలుగు నిస్తుందని మంత్రి పరిటాల సునీత అన్నారు. బాలికా విద్య - కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సోమవారం రాయదుర్గంలోని ప్రభుత్వ బాలుర ఉన్నతపాఠశాల క్రీడాప్రాంగణంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అధ్యక్షతన చదువుల ఒడి కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రి పరిటాల సునీత, అనంతపురం మేయర్ స్వరూప, కలెక్టర్ కోన శశిధర్ హాజరయ్యారు. పూలే జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలికవసతులను పూర్తిస్థాయిలో కల్పిస్తామన్నారు. బాలికలు విద్యను కొనసాగించేలా తల్లిదండ్రులు చొరవచూపాలన్నారు.
ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ నియోజకవర్గంలో తీవ్ర కరువు వల్ల పిల్లలను కూడా చదివించుకోలేని దుస్థితి ఏర్పడిందన్నారు. బాలికలనైతే మధ్యలోనే చదువు మాన్పిస్తున్నారని, 2122 మంది బాలికలు బడిబయట ఉన్నారని తెలిసి బాధేసిందన్నారు. వారిని తిరిగి పాఠశాలలో చేర్పించే కార్యక్రమమే చదువుల ఒడి (చిన్నారి తల్లికి బంగారు బాట) అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ బాలిక విద్యకోసం ‘చదువుల ఒడి’ చేపట్టడం హర్షణీయమన్నారు.
కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ చంద్రహాస్, గుమ్మఘట్ట జెడ్పీటీసీ పూల నాగరాజు, డి.హీరేహాళ్ ఎంపీపీ పుష్పావతి, ఆర్డీఓ రామారావు, తహసీల్దార్ ఖాతిజున్ కుఫ్రా, మునిసిపల్ చైర్మన్ రాజశేఖర్, రాయదుర్గం, హీరేహాళ్ జెడ్పీటీసీ సభ్యులు విజయకుమార్, శారద, ఎంపీపీలు భారతి, ఫాతిమాబీ, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.