
వైఎస్సార్సీపీలోకి చేరిన టీడీపీ నాయకులు
అభివృద్ధిని పక్కన పెట్టేసి అందినకాటికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్న టీడీపీ ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని.....
టీడీపీ పతనం ప్రారంభమైంది తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి
అనంతపురం : అభివృద్ధిని పక్కన పెట్టేసి అందినకాటికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్న టీడీపీ ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. రాప్తాడు మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తోపుదుర్తి ప్రకాష్రెడ్డి సమక్షంలో రాప్తాడు మండల కన్వీనర్ బోయ రామాంజనేయులు ఆధ్వర్యంలో పండమేటి వెంకటరమణ స్వామి ఆలయ కమిటీ సభ్యులు కురుబ అడ్ర ఎరగుంటప్ప, తలారి తిప్పన్న, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల రిటైర్డ్ అధ్యాపకులు హరిజన శ్రీరాములు, మాజీ డీలర్ హరిజన దుర్గాప్రసాద్ పార్టీ కండువా వేసుకున్నారు. ఆదివారం ప్రకాష్రెడ్డి నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ పెదబాబు, చినబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందినకాటికి దోచుకోవడమే ఎజెండాగా పెట్టుకున్నారన్నారు.
రాప్తాడు నియోజకవర్గ అభివృద్ధిని మంత్రి పరిటాల సునీత ఏమాత్రం పట్టించుకోవడంలేదన్నారు. వారి బంధువులు, అనుచరులు ప్రతి పనిలోనూ పర్సెంటేజీలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పాలనపై విసిగి వేసారే టీడీపీ నుంచి తమ పార్టీలో చేరుతున్నారన్నారు. రానున్న రోజుల్లో వలసలు మరింత పెరుగుతాయన్నారు. కార్యక్రమంలో ఎన్జీఓ సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు గోపాల్రెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి సాకే నారాయణ, సేవాదల్ రాప్తాడు మండల కన్వీనర్ కుమ్మర రాము, నాయకుడు కొండూరు బీరన్న, అనంతపురం రూరల్ మండల కన్వీనర్ తాటిచెర్ల నాగేశ్వరరెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి నరేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.