
విపక్షం నిరసనలతో హోరెత్తిన సభ
ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్కే రోజాను సభలోకి అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ సభ్యులు చేసిన నినాదాలతో శనివారం శాసనసభ హోరెత్తింది.
♦ నల్ల దుస్తులు ధరించి సభకు వచ్చిన వైఎస్సార్సీపీ సభ్యులు
♦ ఉయ్ వాంట్ జస్టిస్..ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి..అంటూ నినాదాలు
♦ రోజాను సభలోకి అనుమతించని అంశాన్ని ప్రస్తావించడానికి దక్కని అవకాశం
♦ రెండుసార్లు వాయిదా అనంతరం సభ సోమవారానికి వాయిదా
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్కే రోజాను సభలోకి అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ సభ్యులు చేసిన నినాదాలతో శనివారం శాసనసభ హోరెత్తింది. నల్ల దుస్తులు ధరించి వచ్చిన విపక్ష సభ్యుల నిరసనలు, నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ను ‘నామ్కే వాస్తే’ రీతిలో నిర్వహించారు. సభ సజావుగా సాగడానికి సహకరించాలని, రోజా అంశంపై సోమవారం చర్చిద్దామంటూ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పలుమార్లు చేసిన విజ్ఞప్తికి విపక్షం నుంచి సానుకూల స్పందన రాలేదు. తమకు న్యాయం చేయండంటూ నినాదాలు కొనసాగించారు. విపక్ష సభ్యుల నినాదాల హోరులో సభను స్పీకర్ రెండుసార్లు వాయిదా వేసినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో మూడోసారి సోమవారానికి సభను వాయిదా వేశారు.
తొలి నిమిషం నుంచే..
శనివారం ఉదయం 9 గంటలకు సభలోకి స్పీకర్ అడుగుపెట్టి తన స్థానంలో కూర్చుంటుండగానే.. ‘సార్ మాకు న్యాయం చేయండి’ అంటూ ప్రతిపక్ష సభ్యులు అడిగారు. వైఎస్సార్సీపీ సభ్యులంతా నల్లదుస్తుల్లో హాజరైనా స్పీకర్ మాటమాత్రమైనా అడగలేదు. విపక్ష సభ్యుల విజ్ఞప్తిని పట్టించుకోకుండా.. ప్రశ్నోత్తరాలను స్పీకర్ ప్రారంభించారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సుపై ఉన్న తొలి ప్రశ్నకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సమాధానం చెప్పడం ప్రారంభించారు. తమ గోడును స్పీకర్ పట్టించుకోకపోవడంతో వైఎస్సార్సీపీ సభ్యులంతా స్పీకర్ పోడియం వద్ద నిలబడి నిరసన తెలిపారు.
‘ఉయ్ వాంట్ జస్టిస్.. ప్రజాస్వామ్యాన్ని రక్షించండి’ అంటూ నినదించారు. దాదాపు 25 నిమిషాలు నినాదాల హోరులోనే అధికార పక్ష సభ్యులు బుచ్చయ్య చౌదరి, పార్థసారథి, అనిత, శ్రావణ్కుమార్.. తదితరులకు ప్రశ్నోత్తరాల సమయంలో ఒకరి తర్వాత ఒకరికి స్పీకర్ అవకాశం ఇచ్చారు. బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్రాజుకు మైక్ ఇవ్వడంతో.. విపక్ష సభ్యులు నినాదాలు చేయడం ద్వారా తన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వం పక్షాన సమాధానం చెబుతున్నట్లు సీఐఐ భాగస్వామ్య సదస్సు గురించి విష్ణుకుమార్రాజు మాట్లాడారు. విపక్ష సభ్యులు నినాదాలు కొనసాగిస్తుండగా.. సీనియర్ సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పీకర్ వద్దకు వెళ్లి విపక్ష నేతకు మాట్లాడే అవకాశమివ్వాలని కోరారు. స్పీకర్ సానుకూలంగా స్పందించడంతో.. తన సహచర సభ్యులను కూర్చోవాలని సూచించారు. అందరూ తమ స్థానాల్లో కూర్చున్నాక.. విపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్పీకర్ మైక్ ఇవ్వలేదు. విపక్ష సభ్యులు మళ్లీ స్పీకర్ పోడియం వద్దకెళ్లి నినాదాలు అందుకున్నారు. నిరసన హోరుమధ్య 9.30 గంటలకు సభను 10 నిమిషాలు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
రెండోసారీ అదేతీరు..
ఉదయం 10.12 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడూ ఇదే పరిస్థితి. ‘బీఏసీలో నిర్ణయించిన ఎజెండా ప్రకారమే సభ నడుస్తోంది. మీ ఇష్టప్రకారం సభ జరగదు. మీరు నిరసన తెలపాలన్నా.. సోమవారానికి పోస్ట్ చేసిన అంశం మీద మాట్లాడటం కుదరదు’ అని స్పీకర్ చెప్పారు. అయినా విపక్ష సభ్యులు శాంతించలేదు. ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలంటూ నినదించారు. సభ సజావుగా సాగే అవకాశం కనిపించకపోవడంతో 10.20 గంటలకు సభను 10 నిమిషాలు వాయిదా వేశారు.
ముచ్చటగా మూడే నిమిషాలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు ఆర్కే రోజాను సభలోకి రానివ్వనందుకు నిరసనగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ శనివారం మధ్యాహ్నం అసెంబ్లీలో ఆందోళన కొనసాగించింది. సభ తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైనా సరిగ్గా మూడే నిమిషాల్లో ముగిసింది. స్పీకర్ వస్తూనే సభా సమక్షంలో ఉంచే పత్రాలను ప్రవేశపెట్టాల్సిందిగా సంబంధిత మంత్రులను కోరారు. పర్యావరణం, అడవులు, శాస్త్ర సాంకేతికశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత తమ శాఖల నిధుల కోసం అభ్యర్థనలను సభ ముందుంచారు. విపక్ష సభ్యులు పోడియంను చుట్టుముట్టి చేస్తున్న నిరసనలు, నినాదాల మధ్యే మంత్రులు తమ పద్దులను ప్రవేశపెట్టారు. అనంతరం స్పీకర్ కోడెల సభను 12.03 గంటల సమయంలో సోమవారానికి వాయిదా వేశారు.