
చెంచుల అభివృద్ధికి కృషి
చెంచుల అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి పరిటాల సునీత హామీనిచ్చారు.
పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత
బైర్లూటి (ఆత్మకూరురూరల్): చెంచుల అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి పరిటాల సునీత హామీనిచ్చారు. శుక్రవారం బైర్లూటిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెంచులకు 974 అంత్యోదయ అన్నయోజన(ఏఏవై) రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిరుపేదలు ఆకలితో ఉండకూడదన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా చెంచులకు 35 కేజిల బియ్యం సరఫరా అయ్యే అంత్యోదయ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు.ప్రకాశం, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ ఈ పంపిణీ కొనసాగిస్తామన్నారు. త్వరలో ఒక రోజు ఏదైనా చెంచు గూడెంలో రాత్రి బస చేస్తానన్నారు. అటవీ శాఖ కల్పిస్తున్న ఆటంకాలను తొలగించేందుకు ఆ శాఖతో చర్చిస్తామన్నారు.
చెంచులను అభివృద్ధిలోకి నడిపించడం కన్నా పుణ్యకార్యం మరేరీ ఉండబోదని ఎమ్మెల్యే బుడ్డారాజశేఖరరెడ్డి అన్నారు. దేశ జనాభా పెరుగుతూ ఉంటే తగ్గి పోతున్న జనాభా చెంచులదేనని ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతమందికి ఒకేసారి అంత్యోదయ అన్న యోజన కార్డులు అందజే సిన ఈ రోజు సుదినమని జిల్లా కలెక్టర్ విజయమోహన్ అన్నారు. బైర్లూటిలో అభివృద్ధి పనులు కొనసాగుతాయన్నారు.
గతంలో ఇచ్చిన పోషక విలువలు కలిగిన ఫుడ్ బాస్కెట్లను మళ్లీ ప్రవేశ పెడతామన్నారు. జేసీ హరికిరణ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆత్మకూరు నగర పంచాయతీ చైర్మన్ నూర్ మహమ్మద్, పాణ్యం, ఆత్మకూరు జెడ్పీటీసీ సభ్యులు నారాయణమ్మ, వెంకటరాముడు, ఎంపీపీ సౌజన్య, సర్పంచ్ రమణమ్మ, ఎంపీటీసీ సభ్యుడు నాగుల్ నాయక్, తహశీల్దార్ రాజశేఖరబాబు తదదితరులు పాల్గొన్నారు.