breaking news
Minister Balakrishna Reddy
-
చిన్నమ్మతో ములాఖత్
♦ ఓ మంత్రి, ఎమ్మెల్యేల భేటీ ♦ సన్నబడ్డ శశికళ ♦ అమ్మ శిబిరంలో ఎవరికి వారే సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ దర్శనంతో ఓ మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు ఆనందంలో ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. పరప్పన అగ్రహార చెరలో శనివారం చిన్నమ్మను కలిసి, ఇక్కడి రాజకీయ పరిస్థితులను వివరించారు. మనోధైర్యంతో చిన్నమ్మ ఉన్నట్టు, ఆహారం సరిగ్గా లేని దృష్ట్యా, సన్నబడినట్టుగా ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. అక్రమాస్తుల కేసులో చిన్నమ్మ శశికళ బెంగళూరు పరప్పన అగ్రహార చెరలో శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఆమె దర్శనం కోసం పలువురు ఎమ్మెల్యేలు ఇది వరకు ప్రయత్నాలు చేసినా, అందులో కొందరికే అనుమతి దక్కిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి బాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు కరుణాస్, తంగ తమిళ్ సెల్వన్, వెట్రివేల్, మాజీ మంత్రి బీవీ రమణ పరప్పన అగ్రహార చెరలో చిన్నమ్మతో భేటీ కావడం గమనార్హం. చిన్నమ్మ వద్ద ఇక్కడి రాజకీయ పరిస్థితుల గురించి, అన్నాడీఎంకేలో సాగుతున్న పరిణామాల గురించి వివరించినట్టు సమాచారం. చిన్నమ్మ త్వరలో కేడర్కు జైలు నుంచి ఓ లేఖ రాసే అవకాశాలు ఉన్నట్టు ఈ భేటీ ద్వారా వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. ఇక, చిన్నమ్మ ఆరోగ్యంగా, మనోధైర్యంతో ఉన్నారని, ఆహారం సరిగ్గా లేని దృష్ట్యా, సన్నబడినట్టుగా ఓ ఎమ్మెల్యే పేర్కొనడం గమనార్హం. చిన్నమ్మ దర్శనం ఐదుగురికి దక్కడంతో తమకు సైతం దక్కుతుందన్న ఎదురు చూపులతో పరప్పన అగ్రహార చెర బాట పట్టేందుకు మరి కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. ఇక, తమతో చర్చలంటూ, మరో వైపు చిన్నమ్మ వద్దకు క్యూ కట్టడం బట్టి చూస్తే, పళని సర్కారు ఏ మేరకు నాటకాలను ప్రదర్శిస్తున్నదో స్పష్టం అవుతోందని మాజీ సీఎం పన్నీరు శిబిరానికి చెందిన ఎంపీ మైత్రేయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మీడియాతో మైత్రేయన్ మాట్లాడుతూ అన్నాడీఎంకే నుంచి శశికళ, దినకరన్ కుటుంబాన్ని బహిష్కరించినట్టుగా మంత్రి జయకుమార్ వ్యాఖ్యలు చేస్తున్నారని గుర్తు చేశారు. అయితే, ఇప్పుడు మంత్రి, ఎమ్మెల్యేలు తీహార్, పరప్పన అగ్రహార చెరకు వెళ్లి శశికళ, దినకరన్లతో భేటీ కావడంపై ఎలాంటి సమాధానం ఇస్తారని ప్రశ్నించారు. పళని సర్కారు నాటకం ఆడుతున్నదని, ఈ నాటకానికి తెర పడే సమయం ఆసన్నమైనట్టు పేర్కొన్నారు. త్వరలో పన్నీరుసెల్వం నేతృత్వంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కానుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు పళనిæ సర్కారుకు బెదిరించే రీతిలో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరికొందరు చిన్నమ్మను పరామర్శించి రావడం గమనార్హం. ఈ సమయంలో అన్నాడీఎంకే అమ్మ (పళని శిబిరం) అధికార ప్రతినిధి వైగై సెల్వన్ సీఎంకు వ్యతిరేకంగా 12 మంది ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా చెన్నైలోని ఓ హోటల్లో సమావేశం కావడం చర్చనీయాంశమైంది. ఇక, టీటీవీ దినకరన్పై ఢిల్లీ పోలీసులు రోజుకో ఆరోపణలు సంధిస్తూ కొత్త కేసుల నమోదుకు కసరత్తులు చేస్తుండడంపై అమ్మ శిబిరంలో మరి కొంతమంది ఎమ్మెల్యేలు సమాలోచనలో మునిగారు. అమ్మ శిబిరంలో ఎవరికి వారే అన్నట్టు పరిస్థితి సాగుతుండడంతో పళని సర్కారు మనుగడపై ఉత్కంఠ బయలుదేరింది. -
తెలుగుకు వెలుగునివ్వండి
తమిళనాడులోని తెలుగువారి పిల్లలు తమ మాతృభాషను అభ్యసించేలా మరికొంత కాలం వెసులుబాటు కల్పించాలని తదితర డిమాండ్లపై చెన్నైలోని వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులు రాష్ట్ర పశుసంవర్ధక శాఖా మంత్రి బాలకృష్ణారెడ్డిని మంగళవారం కలిశాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై:డీఎంకే ప్రభుత్వం 2006లో తీసుకొచ్చిన నిర్బంధ తమిళ చట్టం రాష్ట్రంలోని మైనార్టీ భాషల విద్యార్థుల పాలిట గుదిబండగా మారింది. పదోతరగతి పరీక్షల్లో విధిగా తమిళ పరీక్ష రాయాలన్న నిబంధనతో కూడిన ఈ చట్టాన్ని వెనక్కు తీసుకోవాలని, కొన్నేళ్లపాటు వెసులుబాటు కల్పించాలని కోరుతూ చెన్నైలోని తెలుగు సంఘాలు గత కొంతకాలంగా ప్రభుత్వంతో పోరాడుతున్నాయి. చివరకు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించాయి. 2015-16 విద్యాసంవత్సర పదో తరగతి విద్యార్థులు తొలిసారిగా నిర్బంధ తమిళం చట్టంకు గురి అయ్యే ప్రమాదం నుండి మద్రాసు హైకోర్టు కాపాడింది. అయితే మళ్లీ ఈ విద్యాసంవత్సరంలో మైనార్టీ భాషల విద్యార్థులు నిర్బంధ తమిళం చట్టం చట్రంలో చిక్కుకోకుండా తెలుగు సంఘాలు అప్రమత్తమైనాయి. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగువారి కోటాలో హోసూరు నుండి అన్నాడీఎంకే ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బాలకృష్ణారెడ్డిని చెన్నైలోని ప్రభుత్వ అతిధి గృహంలో తెలుగు సంఘాల ప్రతినిధులు మంగళవారం కలుసుకున్నారు. ఈ సందర్బంగా వివిధ కోర్కెల వినతిపత్రాన్ని ద్రవిడ దేశం అధ్యక్షులు వి కృష్ణారావు, అఖిలభారత తెలుగు సమాఖ్య, లింఫాట్ అధ్యక్షులు డాక్టర్ సీఎంకే రెడ్డి మంత్రికి అందజేశారు. నిర్బంధ తమిళం చట్టాన్ని రద్దు చేయాలని లేదా మరో నాలుగేళ్లపాటు మాతృభాషల్లోనే పది పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు, తమిళ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, మైనార్టీ మాతృభాషల సిలబస్లో చేర్చి 1-9 తరగతుల వరకు నామమాత్ర మార్కులతో ఉత్తీర్ణులయ్యే విధానాన్ని ప్రవేశపెట్టాలని, ఆంధ్రప్రదేశ్లోలా మూడు భాషల విధానాన్ని అమలు చేయాలని వారు మంత్రిని కోరారు. ఈ సందర్భంగా మంత్రి బాలకృష్ణారెడ్డి తమ విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించారని సీఎంకే రెడ్డి, కృష్ణారావు మీడియాకు తెలిపారు. 2006లో ప్రవేశపెట్టిన నిర్బంధ తమిళం చట్టం అమలులో విఫలమైందని మంత్రి కూడా అంగీకరించారని తెలిపారు. దక్షిణాదిలోని తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం..ఈ నాలుగు భాషలను తమ ప్రభుత్వం ద్రవిడ భాషలుగా పరిగణిస్తూ సమభావంతో చూస్తున్నదని మంత్రి అన్నారని తెలిపారు. మైనార్టీ సంఘాల కోర్కెలను ముఖ్యమంత్రి జయలలిత దృష్టికి తీసుకెళుతానని మంత్రి హామీ ఇచ్చారని వారు వివరించారు. జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య, ప్రముఖ గాయకులు ఘంటసాల రత్నకుమార్, మద్రాసు యూనివర్సిటీ తెలుగు విభాగాధిపతి మాడభూషి సంపత్కుమార్, ఉర్దూ కాలేజీ ప్రిన్సిపాల్ ఎం యతిరాజులు, ఎస్ గజేంద్రబాబు, టీ బాబు, పీఆర్ కేశవులు, గంగన్న మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.