breaking news
Med Plus
-
కంపెనీ నుంచి కస్టమర్కు ‘బ్యాచ్ట్యాగ్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్కు చెందిన ఫార్మా రిటైల్ చెయిన్ మెడ్ప్లస్ ఫౌండర్ మధుకర్ గంగాడి.. బ్యాచ్ట్యాగ్ పేరిట మరో కంపెనీని ఆరంభించారు. ‘‘కంపెనీల్లో తయారైన ఉత్పత్తులు కస్టమర్ల కంటే ముందు డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్లకు చేరుతాయి. వాళ్ల మార్జిన్లు కూడా కలపడంతో అంతిమంగా కస్టమర్ను చేరేసరికి వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. దీనికి పరిష్కారం చూపించేదే బ్యాచ్ట్యాగ్’’ అని మంగళవారం విలేకరులతో చెప్పారు. కస్టమర్ తనకు కావాల్సిన వస్తువులను నేరుగా తయారీ సంస్థల నుంచే కొనుగోలు చేసే వీలుంటుందన్నారు. దీనివల్ల ధరలు మార్కెట్ కన్నా 40–80 శాతం వరకు తక్కువగా ఉంటాయన్నారు. ప్రస్తుతం ఫర్నిచర్, డెకరేషన్, హోమ్ అప్లియెన్సెస్, నిర్మాణ సామగ్రి వంటి నాలుగైదు విభాగాల్లో ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులతో (ఓఈఎం) ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. గుజరాత్, కాన్పూర్, కోల్కతా వంటి నగరాల్లోని 25కి పైగా ఓఈఎంలు, ఒక్కో కేటగిరీ నుంచి 3–4 ఓఈఎంలతో ఒప్పందం ఉంటుందని తెలిపారు. త్వరలోనే ఏసీ, టీవీ, ఫ్రిజ్ వంటి హోమ్ ఎలక్ట్రానిక్స్ ఓఈఎంలతో ఒప్పందం చేసుకోనున్నామని తెలిపారు. -
ఆన్లైన్లో మెడ్ప్లస్ క్లినికల్ ల్యాబ్ సేవలు
మార్కెట్ రేట్ల కంటే 50% తక్కువకే మెడ్ప్లస్ ఫౌండర్ మధుకర్ గంగాడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మసీ రిటైల్ చైన్ మెడ్ప్లస్ హెల్త్ సర్వీసెస్ తాజాగా క్లినికల్ ల్యాబొరేటరీ సేవలను ఆన్లైన్లోకి తీసుకొచ్చింది. ఇందుకోసం మెడ్ప్లస్ల్యాబ్.కామ్ పోర్టల్ను గురువారం ప్రారంభించింది. రోగ నిర్ణయ పరీక్షల కోసం రోగులు ల్యాబ్కు వెళ్లే అవసరం లేదు. ఆన్లైన్లో పేరు నమోదు చేసుకుంటే చాలు. కస్టమర్ కోరిన సమయంలోనే ల్యాబ్ సహాయకులు ఇంటికి వచ్చి శాంపిల్స్ను (నమూనా) సేకరిస్తారు. రిపోర్టులను ఇంటికి పంపుతారు. హైదరాబాద్ కూకట్పల్లిలో అత్యాధునిక ల్యాబొరేటరీతోపాటు 15 శాంపిల్ సేకరణ కేంద్రాలను కంపెనీ ఏర్పాటు చేసింది. మార్కెట్ రేట్ల కంటే 50 శాతం తక్కువకే సేవలు పొందవచ్చని కంపెనీ వెల్లడించింది. పరీక్షల వివరాలు తెలియనివారు ప్రిస్క్రిప్షన్ను అప్లోడ్ చేయవచ్చు. అలాగే రోగులు తమ ఆరోగ్య సంబంధ సమాచారాన్ని (రికార్డులు) వెబ్సైట్లో పొందుపర్చుకోవచ్చు. ఇతర నగరాలకూ.. కొద్ది రోజుల్లో టాప్-10 నగరాల కు మెడ్ప్లస్ల్యాబ్.కామ్ సేవలను విస్తరిస్తామని మెడ్ప్లస్ ఫౌండర్ మధుకర్ గంగాడి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ల్యాబ్తోపాటు కలెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం రూ.10 కోట్లు కేటాయించామని, విస్తరణకు తగ్గట్టుగా ఈ మొత్తాన్ని పెంచుతామన్నారు. ‘భారత్లో రోగ నిర్ణయ పరీక్షల (డయాగ్నోస్టిక్) వ్యాపార పరిమాణం 18 శాతం వార్షిక వృద్ధితో రూ.14,500 కోట్లుంది. ఇందులో పాథాలజీ వాటా 70 శాతం, రేడియాలజీ, ఇమేజింగ్ 30 శాతం కైవసం చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా 1 లక్షలకుపైగా ల్యాబ్లు ఉన్నాయి. వీటిలో 85 శాతం అవ్యవస్థీకృత రంగంలో ఉన్నాయి’ అని వెల్లడించారు. ప్రస్తుతం బ్లడ్, బాడీ ఫ్లూయిడ్ పరీక్షలు మాత్రమే చేస్తారు. రానున్న రోజుల్లో రేడి యాలజీ, స్కానింగ్ సేవలను జోడిస్తామని కంపెనీ సీవోవో సురేంద్ర మంతెన తెలిపారు. పెరగనున్న ఆన్లైన్ వాటా.. మెడ్ప్లస్కు దేశవ్యాప్తంగా 1,300 ఫార్మసీలు ఉన్నాయి. మార్చికల్లా మరో 60 ఏర్పాటు చేయనున్నారు. టర్నోవర్ 2014-15లో రూ.1,350 కోట్లు నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,800 కోట్లు ఆశిస్తోంది. టర్నోవర్లో 10 శాతం ఉన్న ఆన్లైన్ వాటా మార్చి నాటికి 15-20 శాతానికి చేరొచ్చని మధుకర్ తెలిపారు. ప్రతి నెల ఆన్లైన్ అమ్మకాలు 30 శాతం వృద్ధి చెందుతున్నాయని చెప్పారు. సుమారు రూ.330 కోట్ల నిధుల సమీకరణను కొద్ది రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. కాగా, మెడ్ప్లస్లో మధుకర్కు 20 శాతం వాటా ఉంది. పీఈ కంపెనీలైన మౌంట్ కెల్లెట్ క్యాపిటల్ మేనేజ్మెంట్, టీవీఎస్ క్యాపిటల్, ఇండియా వెంచర్ అడ్వైజర్స్కు 69 శాతం, మిగిలినది ప్రమోటర్ బంధువులు, స్నేహితులు, ఉద్యోగులకు ఉంది. పీఈ కంపెనీల వాటాతోపాటు ఇతర వాటాదారుల నుంచి 6 శాతం వాటాను రెండు పీఈ సంస్థలు ఒకట్రెండు నెలల్లో చేజిక్కించుకోనున్నాయి. -
నేడు మందుల దుకాణాలు బంద్
అపోలో, మెడ్ప్లస్, ఆసుపత్రుల దుకాణాలు మినహా.. సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్లో మందుల (మెడిసిన్స్) కొనుగోలు, అమ్మకాలు జరిపే విధానాన్ని నిరసిస్తూ బుధవారం దేశవ్యాప్తంగా 8 లక్షల మందుల దుకాణాలు బంద్ పాటించనున్నాయి. ఈ మేరకు తెలంగాణ కెమిస్ట్, డ్ర గ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటపతి, గౌరవ కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి మధుసూదన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో మందుల కొనుగోలు అమ్మకాల వల్ల అనేక నష్టాలున్నాయని పేర్కొన్నారు. డాక్టర్ను సంప్రదించకుండానే ప్రజలు అపరిమితంగా మందులను వాడే ప్రమాదం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న బంద్కు సహకరించాలని కోరారు. కాగా, మందుల దుకాణాల బంద్ నేపథ్యంలో ప్రభుత్వ డ్రగ్ కంట్రోల్ విభాగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. సాధారణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అత్యవసర మందులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు డ్రగ్ కంట్రోల్ విభాగం ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని దుకాణాలు, జెనరిక్ మందుల దుకాణాలు, సింగరేణికి చెందిన దుకాణాలు, అపోలో, మెడ్ప్లస్ దుకాణాలు, ఆసుపత్రులకు అనుబంధంగా ఉండే మందుల దుకాణాలు తెరిచే ఉంటాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్లో అన్ని ప్రభుత్వ, కార్పొరేట్ ఆసుపత్రులకు అనుబంధంగా ఉండే మందుల దుకాణాలన్నీ తెరిచే ఉంటాయని వెల్లడించారు.