మున్సిపల్ సమరం
న్యూఢిల్లీ:ఎంసీడీ పరిధిలోని తూర్పు, దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ ఎన్నికలకు బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు సోమవారం నామినేషన్లు సమర్పించారు. ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎమ్సీ) మేయర్గా బీజేపీ నాయకుడు యోగేంద్ర చందోలియా, రవీంద్రగుప్తా డిప్యూటీ మేయర్గా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఈ నెలాఖరున మూడు కార్పొరేషన్లకూ ఎన్నికలు నిర్వహిస్తారు. తూర్పు మున్సిపల్ కార్పొరేషన్ (ఈడీఎమ్సీ) మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు బీజేపీ మీనాక్షి, జైగోపాల్ను రగంలోకి దింపింది. కాంగ్రెస్ నుంచి తులసి, ఆస్ మహ్మద్ నామినేషన్లు సమర్పించారని కార్పొరేషన్ ృధికారులు ప్రకటించారు. దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎమ్సీ) మేయర్ పదవికి అత్యధికంగా నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ నుంచి ధర్మవీర్ సింగ్, బీజేపీ నుంచి ఖుషీరామ్, ఎన్సీపీ నుంచి జీవన్లాల్ నామినేషన్లు వేశారు. అయితే ఎన్డీఎమ్సీ నుంచి ఇతరులెవరూ నామినేషన్లు వేయకపోవడంతో చందోలియా ఏకగ్రీవంగా మేయర్ పదవికి ఎంపిక కానున్నారు.
ఎన్డీఎమ్సీలో ఈ నెల 28న, ఈడీఎమ్సీలో 29న, ఎస్డీఎమ్సీలో 29న మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఎస్డీఎమ్సీలోడిప్యూటీ మేయర్ కోసం కాంగ్రెస్ నుంచి ప్రవీణ్ రాణా, బీఎస్పీ నుంచి బీర్సింగ్, ఎన్సీపీ నుంచి ఫూల్కాళీ పోటీలో ఉన్నారు. నిబంధనల ప్రకారం మేయర్ పదవీ కాలం ఐదేళ్లు. అయితే ఏటా ఒక్కొక్కరు (రొటేషన్ విధానం) వైదొలగుతుంటారు. తొలి ఏడాది మహిళకు, మలి ఏడాది సాధారణ విభాగానికి (ఓపెన్ కేటగిరి), మూడో ఏడాది రిజర్వుడు కేటగిరికి, నాలుగు, ఐదు సంవత్సరాల్లో మళ్లీ సాధారణ విభాగానికి మేయర్ పదవిని కేటాయిస్తామని ఉత్తరఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) ప్రజాసంబంధాల అధికారి యోగేంద్ర సింగ్ మాన్ అన్నారు. ఇది మూడో ఏడాది కాబట్టి ఎస్సీలకు మేయర్ పదవిని కేటాయించాల్సి ఉంటుంది.
ఓటింగ్ ఇలా..
సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, ఢిల్లీ ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలకు మేయర్ల ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం పని చేయడం లేదు కాబట్టి ఎంపీలకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. కొందరు ఎంపీలు రెండు కార్పొరేషన్లలోనూ ఓటు వేయవచ్చు. ఉదాహరణకు ఒక ఎంపీ నియోజకవర్గ ప్రాంతం ఎన్డీఎమ్సీ, ఎస్డీఎమ్సీలోనూ ఉంటే రెండు కార్పొరేషన్లలోనూ ఆయన ఓటు వేయవచ్చు. ఎన్డీఎమ్సీలో మొత్తం 104 మంది సభ్యులు ఉండగా, ఇద్దరు కార్పొరేటర్లు రాజీనామా చేసి ఎమ్మెల్యేలుగా పోటీకి దిగారు. ఈడీఎమ్సీలో 64 మంది సభ్యులు ఉండగా, ఇద్దరు రాజీనామా చేశారు. ఎస్డీఎమ్సీలోనూ 104 మంది సభ్యులు ఉండగా ముగ్గురు వైదొలిగారు. మేయర్లతోపాటే డిప్యూటీ మేయర్లు, స్థాయీసంఘం సభ్యుల పదవులకూ ఎన్నికలు నిర్వహిస్తారు. అయితే స్థాయీసంఘం సభ్యులను మాత్రం మేలో ఎన్నుకుంటారు. ప్రస్తుతం ఈడీఎమ్సీ మేయర్గా వ్యవహరిస్తున్న రామ్నారాయణ్ దూబే, కాంగ్రెస్ నాయకులు సవితా శర్మ స్థాయీసంఘం సభ్యుల పదవుల కోసం సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్డీఎమ్సీలో ఇవే పదవుల కోసం బీజేపీ నుంచి రేఖాగుప్తా, సంజీవ్ నయ్యర్, కాంగ్రెస్ నుంచి పృథ్వీ సింగ్ రాథోడ్ నామినేషన్లు సమర్పించారు. ఎస్డీఎమ్సీలో స్టాండింగ్ కమిటీ సభ్యుల పదవుల కోసం కుల్దీప్ సోలంకీ, రాధేశ్యాం బీజేపీ నుంచి, విపక్ష నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు ఫర్హాద్ సూరి, ఇదే పార్టీ నాయకుడు అభిషేక్ దత్ కూడా బరిలో నిలిచారు.
ఏడాది సరిపోదు..
మేయర్లు, డిప్యూటీ మేయర్ల పదవీకాలాన్ని ఏడాది కాకుండా కనీసం 25 నెలల వరకైనా పొడిగించాలని అన్ని పార్టీల నాయకులు కోరారు. భారీ మున్సిపల్ ప్రాంతంలోని పాలనను అర్థం చేసుకొని, అభివృద్ధికి చర్యలు తీసుకోవడం ఏడాదిలో సాధ్యపడబోదని అంటున్నారు. ‘ఉత్తరఢిల్లీలో నీరు, డ్రైనేజీలు, డెంగీ వంటి సమస్యలు ఎక్కువ. సంవత్సరానికి ఒక మేయర్ మారుతూ ఉంటే పాలనావ్యవస్థ మారుతూ ఉంటుంది. కొత్త మేయర్ ప్రక్రియను మళ్లీ ప్రారంభించాలి. దీనివల్ల పనులన్నీ ఆలస్యమవుతాయి’ అని తాజా మాజీ మేయర్ అజాద్ సింగ్ అభిప్రాయపడ్డారు. పదవీకాలం వివాదంపై ఎస్డీఎమ్సీ విపక్ష నాయకుడు ఫర్హాద్ సూరి మాట్లాడుతూ ‘రొటేషన్ పద్ధతిలో ఏడాదికి ఒకరిని మేయర్ పదవికి ఎన్నుకునే పద్ధతిని రద్దు చేయాలి. ఐదేళ్లకోసారి రిజర్వేషన్లు అమలు చేయాలి. ఒకసారి మహిళలకు, రెండోసారి (ఐదేళ్లపాటు) ఎస్సీ, మూడోసారి సాధారణ విభాగం.. ఇలా ఎన్నికలు నిర్వహించాలి. దీనివల్ల అన్ని కార్పొరేషన్లలోనూ సమర్థ పాలన సాధ్యపడుతుంది’ అని ఆయన సూచించారు.