breaking news
Mahant Nritya Gopal Das
-
మహంత్ నృత్య గోపాల్ దాస్కు తీవ్ర అస్వస్థత
అయోధ్య: శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ అనారోగ్యంతో లక్నోలోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. 86 ఏళ్ల వయసున్న మహంత్ నృత్య గోపాల్ దాస్ ఈ ఏడాది ఆస్పత్రిలో చేరడం ఇది రెండోసారి. గత జనవరిలో ఆయన అనారోగ్యానికి గురై ‘మేదాంత’లోనే చికిత్స పొందారు. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ఆయనను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహంత్ కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.2022 ఏప్రిల్ 24న కూడా ఆయన యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, కిడ్నీ ఇన్ఫెక్షన్, క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ వంటి సమస్యలతో మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందారు. అంతేకాకుండా గతంలో ఆయన కోవిడ్-19 బారిన పడి, వైద్యుల పర్యవేక్షణలో కోలుకుని అయోధ్యకు తిరిగి వచ్చారు. వయోభారం కారణంగా ఆయన నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉంటున్నారు.మహంత్ నృత్య గోపాల్ దాస్ 1938 జూన్ 11న మథురలో జన్మించారు. అయోధ్యలోని అతిపెద్ద ఆలయమైన ‘మణి రామ్ దాస్ కీ చావని’కి ఆయన పీఠాధిపతిగా ఉన్నారు. 1993లో విశ్వహిందూ పరిషత్ ఏర్పాటు చేసిన రామ్ జన్మభూమి న్యాస్ ట్రస్ట్కు ఆయన అధ్యక్షుడిగా వ్యవహరించారు. దశాబ్దాలుగా సాగిన రామ్ జన్మభూమి ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. 2001లో ఆయనపై, ఆయన శిష్యులపై బాంబు దాడి జరగ్గా, స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. ఆ తర్వాత 2003లో ఆయన రామ జన్మభూమి న్యాస్ చీఫ్గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు. -
రేపే రామమందిరానికి పునాది
అయోధ్య: అయోధ్యలోని రామమందిరం నిర్మాణానికి ముహూర్తం ఖరారయ్యింది. రామమందిరానికి జూన్10వ తేదీన పునాదులు వేస్తున్నట్టు గుడి ట్రస్ట్ అధికార ప్రతినిధి ప్రకటించారు. గత నవంబర్లో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు నేపథ్యంలో అయోధ్యలోని రామజన్మభూమిలో కోర్టు కేటాయించిన స్థలంలోని కుబేర్ మందిరంలో శివుడి ప్రార్థనలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్టు ప్రకటించారు. లంకపై దాడికి వెళ్ళేముందు రాముడు అనుసరించిన శివుడి ప్రార్థనల ‘రుద్రాభిషేకం’’తోనే రామమందిర నిర్మాణం కూడా ప్రారంభిస్తున్నట్టు శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధిపతి మహంత్ నృత్య గోపాల్ దాస్ వెల్లడించారు. జూన్ 10న, బుధవారం ఉదయం 8 గంటలకు ట్రస్ట్ అధికార ప్రతినిధి మహంత్ కమల్ నయన్ దాస్, ఇతర పౌరోహితుల ప్రత్యేక ప్రార్థనల అనంతరం రామాలయానికి పునాదులు వేయడం ప్రారంభం అవుతుంది. -
సంక్రాంతి తర్వాతే రామ మందిర ట్రస్ట్
అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు సంక్రాంతి తర్వాతే రామాలయ ట్రస్ట్ను ఏర్పాటు చేస్తామని రామ జన్మభూమి న్యాస్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్దాస్ స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా అయోధ్యలో రామ మందిరాన్ని చూసి తరించాలని తాము కూడా ఉవ్విళ్లూరుతున్నామన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. జనవరి 16 తర్వాత ఏ రోజైనా ట్రస్ట్ను ఏర్పాటు చేసే అవకాశముందని పేర్కొన్నారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే రామాలయ నిర్మాణ పనులు జరుగుతాయని వెల్లడించారు. ట్రస్ట్ పర్యవేక్షణ లేకుండా ఇంచు పని కూడా జరగదని వ్యాఖ్యానించారు. కాగా అయోధ్యలో రామనవమి నాడే రాముని ఆలయాన్ని నిర్మించాలనుకున్నారు. కానీ అయోధ్యలోని 2.77 ఎకరాల భూమిపై హిందూ, ముస్లిం పక్షాల మధ్య దశాబ్దాలుగా వివాదం నెలకొంది. దీనిపై సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నందున ఆలయ నిర్మాణపనులను వాయిదా వేశారు. అనంతరం నవంబర్ 9న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం అయోధ్యపై సంచలన తీర్పును ప్రకటించింది. వివాదాస్పద 2.77 ఎకరాల స్థలంలో రామాలయ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రామ మందిర నిర్మాణం కోసం ట్రస్ట్ను ఏర్పాటు చేయాలని ధర్మాసనం వివరించింది. అటు ముస్లింలకు మసీదును నిర్మించునేందుకు వీలుగా సున్నీ వక్ఫ్ బోర్డుకు అయోధ్యలోని ప్రముఖ ప్రాంతంలో 5 ఎకరాలను ఇవ్వాలంటూ తీర్పు వెల్లడించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో పలు రివ్యూ పిటిషన్ దాఖలు కాగా న్యాయస్థానం వాటిని తిరస్కరించిన సంగతి తెలిసిందే. చదవండి: ‘అయోధ్య’ రామయ్యదే..! ఆకాశాన్నంటే రామ మందిరం -
‘ఆలయాన్ని కట్టి తీరుతాం’
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య విచారణ వాయిదా పడిన నేపథ్యంలో.. రామజన్మభూమి న్యాస్ మహంత్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రతికూలంగా వచ్చినా.. ఆలయ నిర్మాణం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగదని రామజన్మభూమి న్యాస్ చీఫ్ మహంత్ నృత్య గోపాల్ దాస్ ప్రకటించారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహకారంతో.. పార్లమెంట్ ద్వారా ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని నృత్య గోపాల్ దాస్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉండగానే అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతుందని ఆయన చెప్పారు. దేశంలోని మెజారిటీ ప్రజలు అయోధ్యలో రామాలయాన్ని కోరుకుంటున్నారని.. కోర్టుకూడా మెజారిటీ ప్రజల మనోభావాలను గౌరిస్తుందనే నమ్మకం ఉందని నృత్య గోపాల్ దాస్ అన్నారు. అయోధ్య స్థలమంతా రాముడికి సంబంధించనదని ఆయన పేర్కొన్నారు. -
అయోధ్యకు ఇటుకలు తరలిస్తున్న వీహెచ్పీ
లక్నో: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) ఓ అడుగు ముందుకేసింది. రెండు ట్రక్కుల ఇటుకలు ఆదివారం అయోధ్యలోని రామ్ సేవక్ పురం చేరుకున్నాయి. ఇటుకలకు రాం జన్మభూమి న్యాస్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ పూజలు నిర్వహించారు. మోదీ ప్రభుత్వం నుంచి మందిర నిర్మాణానికి సంకేతాలు వచ్చినందునే పనులు మొదలుపెట్టామని.. వీహెచ్పీ ప్రతినిధి శరత్ శర్మ తెలిపారు. ఇకపై విడతల వారిగా ఇటుకలు అయోధ్యకు వస్తాయన్నారు. మందిర నిర్మాణ పరిణామాలను గమనిస్తున్నామని, మత సామరస్యానికి భంగం వాటిల్లుతుందనిపిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారి ఒకరు చెప్పారు. మందిర వివాదాలను కోర్టు బయట పరిష్కరించేందుకు సమాజ్వాద్ పార్టీ నేత ములాయం సింగ్ చొరవతీసుకోవాలని కేంద్ర మంత్రి ఉమాభారతి కోరారు. శాంతియుత పరిష్కారం కోసం 2010 నుంచి తనవంతు ప్రయత్నం చేస్తున్న అలహాబాద్ హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి పాలోక్ బసు.. ఈ మధ్య ఇరువర్గాల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు.


