breaking news
Magnanimity
-
ఎంపీ గోరంట్ల మాధవ్ ఔదార్యం
సాక్షి, పామిడి: హిందూపురం పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్ తన ఔదార్యం చాటుకున్నారు. గాయపడ్డ క్షతగాత్రుడిని దగ్గరుండిమరీ తన వాహనంలోనే ఆస్పత్రికి తరలించడమే కాకుండా దగ్గరుండి వైద్య చికిత్స చేయించారు. ఆస్పత్రి ఖర్చుంతా తానే భరిస్తానని తెలిపారు. వివరాల్లోకెళితే... మండలంలోని పొగరూరు కెనాల్ గ్రామ క్రాస్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంపీ గోరంట్ల మాధవ్ వాహనాన్ని ద్విచక్ర వాహనం ఢీ కొంది. ఈ ఘటనలో మండలంలోని గజరాంపల్లి గ్రామానికి చెందిన బుచ్చమ్మ గారి వెంకటేశ్వర్రెడ్డి (36) గాయాలపాలైనట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అత్యవసర పనినిమిత్తం తన కారులో బయలుదేరారు. మరోవైపు పొగరూరు గ్రామ కెనాల్ క్రాస్ వద్ద ఉన్న తన పొలానికి నీరుగట్టేందుకు వెంకటేశ్వర్రెడ్డి వెళ్ళారు. పని ముగించుకొని తన ద్విచక్ర వాహనంలో వెంకటేశ్వర్రెడ్డి ఇంటిముఖం పట్టాడు. ఈ క్రమంలో రాంగ్ రూట్లో వెళ్తూ అటుగా వస్తున్న ఎంపీ వాహనాన్ని గమనించకుండా ఢీ కొన్నాడు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వరరెడ్డిని ఎంపీ గోరంట్ల మాధవ్ స్వయంగా పామిడి ప్రభుత్వాస్పత్రికి తన వాహనంలో తరలించి వైద్యం చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రుడిని అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వెంకటేశ్వరరెడ్డి వైద్యానికి అయ్యే ఖర్చుంతా తానే భరిస్తానని ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యానికి ఫోన్ చేసి చెప్పారు. పామిడి ఆస్పత్రిలో క్షతగాత్రునికి దగ్గరుండి వైద్యం చేయిస్తున్న ఎంపీ -
తప్పిపోయింది పెద్దోడా, చిన్నోడా?
తండ్రిని ధిక్కరించి, ఆస్తిలో తన వంతు భాగం తీసేసుకొని దూరదేశానికి వెళ్లి అదంతా దుబారా చేసి, జీవితంలో పూర్తిగా చితికిపోయిన చిన్న కుమారుడు పశ్చాత్తాపంతో ఇంటికి తిరిగొచ్చాడు. ఆ సంతోషంతో వాద్యాలు, నాట్యాలతో తండ్రి తన ఇంట్లో గొప్ప సంబరాలు, మహా విందు చేస్తున్నాడు. తండ్రి తనను క్షమించి కుమారుడిగా కాకున్నా కనీసం ఒక పనివాడిగా తనను ఇంట్లో చేర్చుకున్నా చాలనుకుని తిరిగొచ్చిన చిన్న కుమారుడికి ఇదంతా అనూహ్యం, అత్యానందకరం!!! అయితే ఆదినుండీ తండ్రి వెంబడే ఉంటూ, తండ్రి పనులు చేస్తూ, తండ్రితో పాటే జీవిస్తున్న పెద్దకుమారుడికి కూడా, తనకు చెడ్డపేరు తెచ్చిన చిన్న కొడుకు తిరిగి ఇంటికొస్తే తన తండ్రి ఇంతగా సంతోషించడం అనూహ్యంగానే ఉంది. భరించలేకుండా కూడా ఉంది. తర్వాత వెళ్లి, ‘‘ఇన్నాళ్లూ నిన్ను అంటిపెట్టుకొని సేవచేస్తున్న నాకోసం ఎన్నడూ నీవు ఇలాంటి సంబరాలు చేయలేదు, నా విషయంలో సంతోషించలేదు, విందు చేసుకొని సంతోషించడానికి ఎన్నడైనా నాకొక మేకపిల్లనిచ్చావా?’’ అంటూ తండ్రితో గొడవ పెట్టుకున్నాడు(లూకా 15:11–32). యేసుక్రీస్తు చెప్పిన ‘తప్పిపోయిన కుమారుని’ ఉపమానంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన బైబిల్ భాగం ఇది. అయితే నిజంగా తప్పిపోయింది చిన్నకొడుకా, పెద్ద కొడుకా అన్న సంశయం వస్తుంది. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించాలన్నది దేవుని ఆజ్ఞ, అభీష్టం కాగా, తండ్రితోనే ఉంటూ తండ్రి ప్రేమను, హృదయాన్ని అర్థం చేసుకోకుండా, తన సొంత తమ్ముణ్ణి క్షమించలేకపోయిన పెద్దకుమారుడే నిజంగా తప్పిపోయిన కుమారుడా? అన్న అభిప్రాయం కలగడం సహజమే, న్యాయమే. తండ్రిని వదిలి తప్పి పోయినవాడు చిన్న కొడుకైతే, తండ్రితోనే ఉంటూ తప్పిపోయినవాడు పెద్ద కొడుకు. ఈ పెద్దకొడుకు లాంటి తప్పిపోయిన కుమారులే సమాజంలో, చర్చిల్లో చాలా సమస్యలకు కారకులు. చిన్నవాడితో సమానంగా బోలెడు ఆస్తిని తండ్రి తనకు పంచి ఇచ్చినా, విందు చేసుకోవడానికి తనకొక మేక పిల్లనివ్వలేదంటూ తండ్రిని నిందించిన అల్పుడు ఆ పెద్దవాడు. చిన్నవాడు, పెద్దవాడితో సహా లోకంలో అంతా పాపం చేసి దేవునికి దూరమైన వారే అంటుంది బైబిల్ (రోమా 3:23). కాకపోతే చిన్నవాడు తిరిగొచ్చాడు, పెద్దవాడికి తాను తిరిగి తండ్రిని పరిపూర్ణంగా ఆశ్రయించాలన్న ఆలోచనే ఇంకా లేదు. కొత్తనిబంధన తాలూకు ఈనాటి కృపాయుగంలో ’యాజకత్వం’ అనే మధ్యవ్యవస్థను యేసుప్రభువు రద్దు చేసి, విశ్వాసులు తనను అంటే దేవుణ్ణి నేరుగా ఆశ్రయించే వీలుకల్పిస్తే, ఎందుకీ సంబరాలంటూ నేరుగా తండ్రినే అడిగే హోదా, చనువూ ఉన్నా, పనివాడిని పిలిచి తన సొంతింటి విషయాలు వాకబు చేసిన పెద్దకొడుకు లాగా, దేవుణ్ణి వదిలేసి ‘‘మా పాదిరి, మా పాస్టర్, మా అయ్యగా’’రంటూ బోధకులకు, పరిచారకులకు ప్రాధాన్యతనిచ్చే అవగాహన లేని ఈనాటి విశ్వాసులు ఇంకా తప్పిపోయే ఉన్న ఆ పెద్దకొడుకులే!! తండ్రితోనే ఉన్నా తండ్రి క్షమా హృదయం, ఔదార్యం, ప్రేమనూ అర్థం చేసుకోకుండా బయటి వాళ్లలాగే సద్వర్తన, మార్పు లేకుండా జీవించేవారు ఆ పెద్దకొడుకులే. తండ్రితోనే ఉన్నా తండ్రి ఆనందాన్ని ఆవగింజంత కూడా సొంతం చేసుకోలేక, ఎంతున్నా తమకు దేవుడు ఇంకా ఏదో ఇవ్వలేదన్న అసంతృప్తితో బతికే నిరంతర నిరాశావాదులు, నాకొక మేకపిల్లను కూడా ఇవ్వలేదంటూ తండ్రిని నిందించిన ఆ పెద్దకొడుకులాంటివారే!! మార్పునొందిన విశ్వాసి లోకానికే కాదు పరలోకంలో కూడా ఆనందకారకమవుతాడు. మార్పునొందిన ఒక్క పాపి వల్ల పరలోకంలో ఎంతో ఆనందం వెల్లివిరుస్తుందని ప్రభువే చెప్పాడు( లూకా 15:7). విశ్వాసిలో వచ్చే ‘మార్పు’ అతని వ్యక్తిగత జీవితంలో, పిదప అతని వల్ల సమాజంలోనే కాదు, పరలోకంలో కూడా ఆనందాన్ని వ్యాపింపజేస్తుంది. తన హృదయంలో లేని ఆనందాన్ని విశ్వాసిలోకంలో, పరలోకంలో కూడా నింపలేడు. మారిన జీవితమే ఆనందానికి నిలయమవుతుంది. జీవితం మారకుండా సమాజంలో, చర్చిల్లో ఎంత ప్రముఖంగా జీవిస్తున్నా వారిలో ఆనందం తప్ప అన్నీ ఉంటాయి. చిన్నకొడుకు తప్పిపోయి దొరికాడు, పెద్దవాడు ఇంకా తప్పిపోయే ఉన్నాడు, దేవునికింకా దొరకలేదు, అదీ ఈనాటి క్రైస్తవం సంక్షోభం!! శుచి కరువైన పాయసంలో రుచి కూడా కరువైనట్టే, మార్పులేని జీవితంలో ఆనందం కూడా కరువవుతుంది. అదే ఆ పెద్దకొడుకు జీవిత తాత్పర్యం!! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
‘కమల’ వికాసం!
అవయవ దానంతో ఐదుగురికి కొత్త జీవితం కుటుంబ సభ్యుల ఔదార్యం సాక్షి, విశాఖపట్నం: ఒక మహిళ తాను తనువు చాలించి మరో ఐదుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. వారి కుటుంబాల్లో వెలుగులు నింపింది. ఆమె కుటుంబ సభ్యుల ఔదార్యంతో ఇది సాధ్యమైంది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కుదుము గ్రామానికి చెందిన వలురౌతు రాజులమ్మ అలియాస్ కమల (50) కు పదేళ్ల క్రితం ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. అప్పట్నుంచి మందులు వాడుతూ ఆరోగ్యంగానే ఉన్న ఆమె ఇటీవల అస్వస్థతకు గురయింది. ఈ నెల 19న కుటుంబ సభ్యులు ఆమెను విశాఖలోని క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమె సెలెబ్రెల్ బ్లీడ్తో బాధపడుతున్నట్టు గుర్తించి శస్త్ర చికిత్స చేశారు. అయినప్పటికీ ఆమె బ్రెయిన్డెడ్ అయినట్టు వైద్యులు గుర్తించారు. ఇదే విషయాన్ని ఆమె భర్త, కుటుంబ సభ్యులకు వైద్యులు తెలియజేశారు. కమల బతికే అవకాశం లేదని, అవయవదానంతో ఐదుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించవచ్చని జీవన్దాన్ ప్రతినిధులు వారికి సూచించారు. ఇప్పటికే సామాజిక సేవలో ఉన్న కమల భర్త షణ్ముఖరావు, ఇంజినీరింగ్ పట్టభద్రులైన ముగ్గురు కుమార్తెలు తుషార, గీత, జ్యోత్స్నలు సహదయంతో కమల అవయవాల దానానికి అంగీకరించారు. దీంతో వైద్యులు ఆదివారం సాయంత్రం ఈ ప్రక్రియను పూర్తి చేశారు. కమల కాలేయాన్ని విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రికి, కిడ్నీలను విశాఖలోని సెవెన్హిల్స్, అపోలో ఆస్పత్రులకు, కళ్లను ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి దానం చేశారు. కమల కుటుంబ సభ్యుల ఔదార్యాన్ని ఎన్ఆర్ఐ ఆస్పత్రి చైర్పర్సన్ చలసాని విజయలక్ష్మితో పాటు పలువురు అభినందించారు. క్వీన్స్ ఎన్ఆర్ఐ నెఫ్రాలజిస్టు సాయినరేష్, యూరాలజిస్టు జయసాయిశేఖర్, నాగరాజ్, మణిపాల్ ఆస్పత్రి వైద్యులు ఈ అవయవదాన ప్రక్రియను పూర్తి చేశారు.