breaking news
Madi storm
-
కబళించినకడలి
పిఠాపురం, న్యూస్లైన్ : ఊరు సద్దు మణిగిన వేళ కడలి ఉగ్రరూపం దాల్చింది. ఆదమరిచి నిదురిస్తున్న సమయంలో ఆపదై విరుచుకుపడింది. కెరటాల కోరలతో తీరాన్ని కాటేసింది. ఇళ్లను కబళించి నిలువనీడ లేకుండా చేసింది. దారులను ధ్వంసం చేసి రాకపోకలను అడ్డుకుంది. చెట్లను, విద్యుత్ స్తంభాలను పెకలించి తన ప్రతాపాన్ని చాటింది. ‘మాదీ’ తుపాను ప్రభావం అంతగా ఉండదని అధికారిక వర్గాలు చెప్పినా మంగళవారం సాయంత్రం నుంచే యు.కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు కోనపాపపేట, ఉప్పాడల వద్ద అలల తాకిడి అంతకంతకూ పెరిగింది. మంగళవారం రాత్రి పదిగంటలు దాటాక సముద్రం ఒక్కసారిగా విలయతాండవమాడింది. మూడు మీటర్ల ఎత్తున ఎగసిపడిన కెరటాలు కోనపాపపేటలో కిలోమీటర్ మేర తీరం పైకి 20 మీటర్ల వరకూ చొచ్చుకు రావడంతో తీవ్రంగా కోతకు గురై 34 మత్స్యకార గృహాలు కడలి కడుపులో కలిసిపోయాయి. సుమారు 65 కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. గ్రామంలో వేసిన సిమెంటురోడ్డు సైతం సముద్రంలో కలిసిపోయింది. అనేక కొబ్బరి చెట్లు, విద్యుత్ స్తంభాలను అలలు పెకలించి వేశాయి. ఒక్కసారిగా కెరటాల ఉధృతి పెరిగి తమ గృహాల పైకి విరుచుకుపడడంతో ప్రాణాలు అరచేత పట్టుకుని, విలువైన సామాన్లు తీసుకుని పరుగులు తీశామని బాధితులు తెలిపారు. తుపాను ప్రభావం లేనప్పుడు హడావుడి చేసే అధికారులు.. కెరటాల రూపంలో తమ ఊరిపై విపత్తు విరుచుకుపడి, తీవ్రంగా నష్టపోతే తొంగి చూడలేదని మాజీ సర్పంచ్ కొర్ని వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్వో తప్ప ఒక్క ఉన్నతాధికారి గ్రామానికి రాలేదని చెప్పారు. ఈదురు గాలుల తాకిడికి మిగిలిన గృహాలు కూడా దెబ్బ తింటున్నాయన్నారు. మరోపక్క బుధవారం సాయంత్రానికి అలల తాకిడి మరింత పెరగడంతో తీరానికి సమీపంలో ఉన్న సుబ్బంపేట, పల్లెపేట, కొత్తపేట, రంగంపేట తదితర ప్రాంతాలకు ముప్పు వాటి ల్లే అవకాశం కనిపిస్తోంది. కాలినడక కూడా కష్టమే కాగా కెరటాల ఉధృతికి కాకినాడ- ఉప్పాడ బీచ్ రోడ్డు ఉప్పాడ వద్ద గతంలో ఎన్నడూ లేనట్టు మూడు కిలోమీటర్ల మేర కాలినడకన కూడా వెళ్లలేనంతగా విధ్వంసమైంది. ఉప్పాడ వద్ద తీరం వెంబడి వేసిన జియోట్యూబ్ రక్షణగోడ కొంత వరకు ఆ గ్రామానికి రక్షణగా నిలవగా బీచ్రోడ్డు వెంబడి వేసిన రాళ్లగోడ మాత్రం కెరటాల తాకిడికి చెల్లా చెదురైంది. కెరటాలతోపాటు రాళ్లు ఎగిరిపడుతుండడంతోపాటు బీచ్రోడ్డు అనేక చోట్ల నామరూపాలు లేకుండా కొట్టుకుపోయింది. దీంతో బుధవారం ఉద యం నుంచి కాకినాడ-ఉప్పాడల మధ్య రాకపోకలను నిలిపివేశారు. సాయంత్రానికి అలల ఉధృతి పెరగడంతో బీచ్రోడ్డు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. 1996 తుపాను సమయంలో కూడా బీచ్ రోడ్డు ఇంత దారుణంగా కోతకు గురి కాలేదని స్థానికులు అంటున్నారు. బీచ్ రోడ్డును ధ్వంసం చేసిన కెరటాలు ఉప్పాడ వద్ద తీరం వెంబడి ఉన్న వరి సాగు చేసే భూములపై విరుచుకుపడ్డాయి. చేలన్నీ ఉప్పు నీటితో నిండిపోవడంతో రబీ సాగుకు పనికి రావని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
తల్లడిల్లుతున్న తీరప్రాంతం
రేపల్లె, న్యూస్లైన్: వరుస తుపానులతో తీరం తల్లడిల్లిపోతోంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ మాదీ తుపాను బలపడి తీవ్రంగా మారుతుందనే హెచ్చరికలు తీరప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నిజాంపట్నం హార్బర్లో రెండవ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీచేశారు. వేటకు వెళ్లిన మత్య్సకారులు ఒడ్డుకుచేరాలని ఫోన్ మెసెజ్లను అందించారు. దీంతో సముద్రంలోకి వేటకు వెళ్లిన బోట్లు ఒక్కొక్కటిగా హార్బర్కు చేరుకుంటున్నాయి. వరుసగా గత రెండు మాసాలలో పైలీన్, హెలెన్, అధిక వర్షపాతాలు, లెహర్లతో ఇబ్బందులకు గురైన తీరప్రాంత ప్రజలు ‘మాదీ’ తుపాను హెచ్చరికలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఆక్టోబర్ మాసంలో పైలీన్, నవంబర్ మొదటివారంలో హెలెన్, చివరి వారంలో లెహర్ తుపానులు సంభవించడంతో సముద్రపు వేట పూర్తిగా నిలిచిపోయింది. ఒక్క తుపాను ప్రభావం నుంచి పూర్తిగా తేరుకోకముందే మరొక తుపాను ముంచుకొస్తుండడంతో తీరప్రాంతంలోని మత్య్సపరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడింది. నిజాంపట్నం హార్బర్లో 150 మెక్నైజ్డ్ బోట్లు, నిజాంపట్నం, రేపల్లె మండలాల పరిధిలో 700 వరకు మోటరైజ్డ్ బోట్లలో మత్య్సకారులు నిరంతరం సముద్ర వేట నిర్వహిస్తుంటారు. వరుస తుపానులతో పనులు లేక మత్స్యకార కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనాల్సిన దుస్థితి ఏర్పడింది. విపత్కర పరిస్థితుల్లో పనులు కోల్పోతున్న మత్య్సకారులను ఆదుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినవస్తున్నాయి.