breaking news
M. Venkata Ramana
-
తిరుమలలో టీడీపీ ఎన్నికల ర్యాలీ
బాలాజీ నగర్ కమ్యూనిటీ హాలులో ఎన్నికల సభ జీఎన్సీ టోల్గేట్లో తనిఖీ లేకుండానే దూసుకొచ్చిన వాహనాలు సాక్షి, తిరుమల: తిరుపతి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి ఎం.వెంకటరమణ తిరుమలలో బుధవారం నిబంధనలు ఉల్లంఘిస్తూ నానా హంగామాచేశారు. వెంకటరమణ బుధవారం సాయంత్రం మందీ మార్బలం, ఎన్నికల ప్రచార సామగ్రితో తిరుమలకు వచ్చారు. ప్రస్తుతం ఆయన పాలకమండలి ఎక్స్ అఫిషియో సభ్యుడి కావడం వల్ల ఆయన వాహనానికి తనిఖీ లేకున్నా.. ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థిగా టీటీడీ నిబంధనల ప్రకారం అనుచరగణం ప్రయాణించిన వాహనాలను టోల్గేట్ల వద్ద తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి. అలాంటివి ఏమీ పట్టనట్టుగా వాహనాలు ఏమాత్రం తనిఖీ చే సుకోకుండానే అతివేగంగా వచ్చేశాయి. తన అనుచరులతో రెండు వాహనాల్లో స్థానికులు నివాసం ఉండే బాలాజీనగర్ చేరుకున్నారు. అక్కడి పార్టీ కార్యకర్తలు వెంకటరమణపై పూలవర్షం కురిపించారు. జై తెలుగుదేశం నినాదాలు చేశారు. ఓ సందులో ఉండే స్థానిక నివాసాల వద్దకు వెళ్లి కరపత్రాలు పంచుతూ ప్రచారం చేశారు. వెంకటరమణ కూర్చుని ఉన్న ఏపీ03 ఏఆర్1 నెంబరుగల వాహనానికి అటుఇటుగా టీడీపీ కార్యకర్తలు వేలాడుతూ చేతులు ఊపుతూ.. పార్టీ నినాదాలు చేశారు. మరికొందరు కార్యకర్తలు ద్విచక్రవాహనాలపై ర్యాలీలో పాల్గొంటూ జై వెంకటరమణ అంటూ నినాదాలు చేశారు. బాలాజీనగర్ కమ్యూనిటీ హాలు వద్దకు వాహనాల్లో ర్యాలీగా వచ్చిన వెంకటరమణ అక్కడే సమావేశం ఏర్పాటు చేశారు. సభలో వేచిఉన్న పార్టీ కార్యకర్తలు పూలవర్షం కురిపిస్తూ మరోసారి నినాదాలు చేశారు. అక్కడ సభ నిర్వహిస్తారని ముందే పసిగట్టిన టీటీడీ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈ విషయం తెలుసుకున్న వెంకటరమణ వారిపై బూతులు అందుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ విజిలెన్స్ అధికారులు వేధిస్తున్నారని కొందరు అనుచరులు ఆయనకు ఫిర్యాదు చేశారు. దీనిపై వెంకటరమణ ఓ విజిలెన్స్ ఉన్నతాధికారికి ఫోన్ చేసి ‘చూసిపోండి.. లేదంటే మా తడాఖా చూపిస్తాం’ అంటూ హెచ్చరించారు. ఆ తర్వాత రాత్రి వరకు పార్టీ కార్యకర్తలతో వెంకటరమణ, మరికొందరు పార్టీ నేతలు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పార్టీ కరపత్రాలు పంచుతూ విస్తృత ప్రచారం చేస్తూ అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించారు. ఎక్కడికక్కడ స్వీట్లు, ఫలహారాలు పంచుతూ ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తూ నానా హంగామా చేశారు. రాత్రి 7.30 గంటలకు తిరుగుప్రయాణం అయ్యారు. ఉల్లంఘనలు ఉంటే కేసు నమోదు చేస్తాం కమ్యూనిటీ హాలులో బుధవారం సభ నిర్వహించుకునేందుకు టీడీపీ అభ్యర్థి వెంకటరమణకు తిరుపతి అర్బన్ఎస్పీ అనుమతి ఇచ్చారు. అయితే తిరుమల ఎన్నికల ప్రచారం సందర్భంగా అభ్యర్థి ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం తప్పనిసరిగా కేసు నమోదు చేస్తాం. ఎవరు ఫిర్యాదు చేసినా.. చేయకపోయినా ఆధారాలుంటే చర్యలు తీసుకుంటాం. -నరసింహారెడ్డి, తిరుమల డీఎస్పీ -
రసకందాయంలో తిరుపతి టీడీపీ రాజకీయాలు
ఐవీఆర్ఎస్లో మొదట వెంకటరమణ పేరు అగ్గిమీద గుగ్గిలం అవుతున్న చదలవాడ వర్గీయులు రాజధానికి వెళ్లిన వెంకటరమణ, చదలవాడ సాక్షి, తిరుపతి: తిరుపతి తెలుగుదేశం పార్టీ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ఒక రోజు మాత్రమే గడువు ఉండటంతో టికెట్టు కోసం ఆశావహులు పోటీ పడుతున్నారు. ఒకరి వెంట ఒకరు రాజధానికి పరుగులు తీస్తున్నారు. పార్టీ అధిష్టానానికి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. మరోవైపు అభ్యర్థుల ఎంపికకోసం చంద్రబాబు అనుసరిస్తున్న ఐవీఆర్ఎస్ కూడా వీరి మధ్య చిచ్చు పెట్టింది. ఇటీవల కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ పేరు ఐవీఆర్ఎస్లో మొదట చేర్చడం చదలవాడ వర్గీయులకు ఆగ్రహం తెప్పించింది. తిరుపతి టీడీపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీ శ్రేణుల్లో అయోమయం సృష్టిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థుల తొలిజాబితాను బుధవారం ప్రకటించిన వెంటనే మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ రాజధానికి వెళ్లారు. అధిష్టానం ఆశీస్సులు పొంది టికెట్టు తెచ్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ విషయం తెలుసుకున్న నియోజకవర్గ ఇన్చార్జి చదలవాడ కృష్ణమూర్తి గురువారం ఉదయం హుటాహుటిన హైదరాబాద్కు పయనమయ్యారు. ఇద్దరు నేతలూ టికెట్టు తమకేనన్న ధీమాతో ఉన్నారు. ఐవీఆర్ఎస్లో వెంకటరమణ ఫస్ట్ అభ్యర్థుల ఎంపికకు చంద్రబాబు అనుసరిస్తున్న ఐవీఆర్ఎస్లో వరుసగా వెంకటరమణ, చదలవాడ, డాక్టర్ హరిప్రసాద్ పేర్లు ఉన్నాయి. ఈ ముగ్గురూ నచ్చకపోతే మీరే ఏదో ఒక పేరు సూచించాలని ఫోన్ కాల్ అందుకున్న వారిని కోరుతోంది. ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడుతున్న చదలవాడను కాదని వెంకటరమణ పేరు ముందు చేర్చడం ఆయన వర్గీయులు జీర్ణించుకోలేకున్నారు. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల అభ్యర్థులుగా పోటీ చేసిన వెంకటరమణ, చదలవాడ అప్పట్లో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నా రు. మారిన రాజకీయ పరిణామాల్లో వెంకటరమణ టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో అభ్యర్థిత్వం ఆయననే వరిస్తుందని ప్రచారం ఎక్కువ కావడం చదలవాడ వర్గీయులను మనస్తాపానికి గురిచేస్తోంది. పార్టీని నమ్ముకున్న వారిని కాకుండా అవకాశవాదంతో జెండా మార్చిన వారికి పెద్దపీట వేయడం దీనంతటికీ కారణమనే అభిప్రాయం వారిలో బలంగా ఉంది. ఈ పరిస్థితుల్లో నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుంది. దీంతో టికెట్టు ఆశిస్తున్న ఇరువురు నేతలు ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేశారు. చంద్రబాబు ఆశీస్సులు ఎవరికి ఉన్నా ఇంకో వర్గం నుంచి అభ్యర్థికి ప్రమాదం పొంచి ఉందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.