ఉగ్రవాదులనుకొని చితక్కొట్టారు
ముంబయి: ఉగ్రవాదులనుకొని ముంబయి పోలీసులు ఇద్దరు ముస్లిం యువకులను చితక్కొట్టారు. అనంతరం ఎలాంటి ఫిర్యాదు నమోదుచేయకుండా విడిచేందుకు డబ్బులు డిమాండ్ చేశారు.గత శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసిఫ్ షేక్, డానిష్ షేక్ అనే 19 ఏళ్ల కుర్రాళ్లు గత శుక్రవారం రాత్రి ఓ తాగిన మైకంలో ఉన్న వ్యక్తికి సాయం చేస్తూ అతడిని రోడ్డు దాటిస్తుండగా పోలీసులు వారి దగ్గరకు వచ్చారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులనుకొని లేదా ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనుకొని భావించి వారిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఆ రాత్రంతా చితక్కొట్టారు.
తమకు ఉగ్రవాదులకు ఎలాంటి సంబంధం లేదని వాపోవడంతో అయితే కేసు నమోదు చేయకుండా ఉండేందుకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కనీసం తల్లిదండ్రులకు సమాచారం అందించే అవకాశం కూడా ఇవ్వలేదు. చివరికీ ఈ విషయం వారి తల్లి దండ్రులకు తెలిసి భగ్గుమన్నారు. తప్పు చేసిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే, దీనిపై అధికారికంగా స్పందించని పోలీసులు మాత్రం ఘటనపై విచారణ జరిపిన అనంతరం చర్యలు తీసుకుంటామని చెప్పారు.