breaking news
Linemen contract jobs
-
అగమ్యగోచరంగా ‘భగీరథ’ లైన్మెన్లు.. ఉద్యోగ భద్రత లేక ఆందోళన
కుల్కచర్ల: మిషన్ భగీరథ పథకం అమల్లో ముఖ్య భూమిక వాటర్ లైన్మెన్లదే.. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రజలకు తాగునీటి సరఫరాలో నిమగ్నమవుతారు. సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడినా తక్షణం స్పందిస్తారు. అయితే ఇలాంటి వారికి ఉద్యోగ భద్రత లేకపోవడం ఆందోళన కలిగించే అంశమే.. కనీస వేతనం అమలు కాక కుటుంబ పోషణ కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా గుర్తింపు లేదు కుల్కచర్ల, చౌడాపూర్ మండలాల్లో మిషన్ భగీరథ పథకం కింద 25మంది వాటర్ లైన్మెన్లు విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 260మంది పనిచేస్తున్నారు. వీరు లేబర్ కాంట్రాక్టర్లకు అనుబంధంగా తాత్కాలిక పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు. సంవత్సరాల తరబడి పని చేస్తున్నా సరైన గుర్తింపు లేదని ఆవేదనకు గురవుతున్నారు. ఉద్యోగ భద్రత లేక తమ పరిస్థితి గాలిలో దీపంలా మారిందని వాపోతున్నారు. విధి నిర్వహణలో తమకు ఒక సమయం అంటూ లేదని, ఎప్పుడు పిలిస్తే అప్పుడు.. ఎక్కడికి వెళ్లమంటే అక్కడికి పోవాల్సి వస్తోందని తెలిపారు. నామమాత్రపు జీతాలు మిషన్ భగీరథ లైన్మెన్లను లేబర్ కంపెనీల ఆధ్వర్యంలో నియమించారు. దీంతో వారికి ఎలాంటి అలవెన్స్ అందడం లేదు. విధి నిర్వహణకు ఒక సమయమంటూ లేకుండా పోయింది. సంబంధిత కాంట్రాక్టర్కు నచ్చితే ఉద్యోగం.. లేకుంటే మరో పని వెతుక్కోవాల్సిందేనని ఆవేదన చెందుతున్నారు. ఒక్కో లైన్మెన్కు నెలకు రూ. 9వేలు జీతం చెల్లిస్తున్నారు. ఈ డబ్బు తమ ఖర్చులు, ఇంటి అవసరాలకు మాత్రమే సరిపోతోందని, పిల్లల చదువులు, భవిష్యత్ అవసరాలకు ఒక్క రూపాయి కూడా మిగలడం లేదని తెలిపారు. ఇక అనారోగ్య సమస్యలు ఎదురైతే అప్పులు చేయాల్సిందేనని చెప్పారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు తమ ఇబ్బందులను గుర్తించి ఉద్యోగ భద్రత తోపాటు కనీసవేతం, విధుల సమయం కేటాయించాలని వారు కోరుతున్నారు. -
విద్యుత్ ఉద్యోగుల ధర్నా ఉద్రిక్తం
విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేత రఘు సహా పలువురు అరెస్ట్ సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంట్రాక్టు లైన్మెన్ల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేసి, తెలంగాణ కార్మికులను విధుల నుంచి తొలగించడంపై తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంట్రాక్ట్ జూనియర్ లైన్మెన్ల తొలగింపునకు నిరసనగా బుధవారం తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు విద్యుత్సౌధ ముందు మహా ధర్నా నిర్వహించారు. దీంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్కు అంతరాయం కలగడంతో ఆందోళన కారులతో పాటు, మద్దతుగా వచ్చిన జేఏసీ కన్వీనర్ రఘు, కాంట్రాక్టు ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు నాగరాజు, కృష్ణయ్య సహా కార్మికులను అరెస్ట్ చేసిన పోలీసులు గోషామహల్ పోలీస్స్టేషన్కు తరలించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ.. 2006 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా పది వేల మంది జూనియర్ లైన్మెన్లను కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేసుకుంటే 2009లో సీమాంధ్ర ఉద్యోగులందర్నీ రెగ్యులరైజ్ చేసి, తెలంగాణ ఉద్యోగులపై వివక్ష చూపారని ఆరోపించారు. తెలంగాణ కార్మికులకు జరిగిన అన్యాయంపై త్వరలోనే గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.